
ఖనిజాలకు బదులుగా దేశ భద్రత కోసం కిన్షాసా అమెరికా వైపు మొగ్గు చూపడం, ఆ దేశ తూర్పు ప్రాంతంలో జరుగుతున్న హింసకు అమెరికానే కారణం అని చెప్పే యాక్టివిస్టులను ఆందోళనకు గురిచేసింది.
ఉత్తర కివులోని రుబయా సమీపంలోని లువోవో కోల్టన్ గని. 2014లో ఈ ఫోటో తీసిన సమయంలో లువోవో గని సంఘర్షణ రహితంగా ఉందని నమ్ముతారు.
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఖనిజాలతో కూడిన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో(డీఆర్సీ), ప్రపంచ భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకు కేంద్రంగా కొనసాగుతోంది. డీఆర్సీ తూర్పు ప్రావిన్సులలో ఎం23 తిరుగుబాటుదారులు పట్టు సాధిస్తుండటంతో, అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోవడం ఇంకా చట్టబద్ధతపై పెరుగుతున్న ప్రశ్నలను ఎదుర్కొంటూ, అమెరికాతో వివాదాస్పద ఒప్పందానికి దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. వ్యూహాత్మక ఖనిజాలకు బదులుగా భద్రతా సహాయం ఒప్పందానికి సంబంధించిన వివరాలు, కీలక అంశాలు ఇంకా ప్రకటించబడలేదు. కానీ, చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ పరిపాలన అధికారులు పత్రికలకు తెలిపారు.
ఈ చర్చల కేంద్ర బిందువుగా అపఖ్యాతి పాలైన ప్రైవేట్ మిలిటరీ కంపెనీ బ్లాక్వాటర్ వ్యవస్థాపకుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడు ఎరిక్ ప్రిన్స్ ఉన్నారు. ఏప్రిల్ 17న రాయిటర్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఖనిజ సంపన్న దేశంలో ఖనిజ వెలికితీత భద్రత ఇంకా పన్ను విధించడాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రిన్స్ వహిస్తున్నారు.
ఇరాక్ యుద్ధంలో బ్లాక్ వాటర్ హింస తర్వాత రీబ్రాండింగ్తో వచ్చిన ప్రిన్స్ ప్రమేయం ఒక ఇబ్బందికరమైన మలుపును సూచిస్తుంది. డీఆర్సీ సార్వభౌమ మార్గంలో పయనించడానికి బదులుగా షిసెకెడి యూఎస్, దాని ప్రైవేట్ కంపెనీలకు దేశంలో పనిచేయడానికి ఇంకా డీఆర్సీ సార్వభౌమ సంపదను పొందేందుకు తలుపులు తెరుస్తున్నట్లు కనిపిస్తోంది.
చర్చకు రాని ఒప్పందం
వాషింగ్టన్, కిన్షాసా మధ్య జరిగే ఒప్పంద సారాంశం మాత్రమే కాదు, ప్రక్రియ కూడా ఆందోళనకరమైన విషయం. ఒప్పందానికి సంబంధించిన ప్రకటన పార్లమెంట్ లేదా జాతీయ అసెంబ్లీ నుంచి రాలేదు, ఇది పత్రికల వల్ల తెలిసింది. కాంగో విశ్లేషకుడు కంబాలే ముసావులి పీపుల్స్ డిస్పాచ్కు ఎత్తి చూపినట్లుగా , “ఒక దేశం మొత్తం ఖనిజ ఒప్పందంపై నిర్ణయం గురించి ఆ దేశ పార్లమెంటు ఎప్పుడూ చర్చించలేదంటే మీరు ఊహించగలరా?”
కాంగో రాజ్యాంగం దేశంలోని భూమి, రాష్ట్రంలోని వనరుల యాజమాన్యాన్ని పార్లమెంటుకే అప్పగిస్తుంది, కానీ దానికి ప్రజాదరణ లేదా పార్లమెంటరీ పర్యవేక్షణ లేకపోవడం లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. “కాంగో రాజ్యాంగంలోని వైరుధ్యాలు బహిర్గతమవుతున్నాయి” అని ముసావులి అన్నారు. “అధ్యక్షుడికి ఏకపక్షంగా ఇటువంటి భారీ ఒప్పందాలు చేసుకునే అధికారం ఉందా అని ఇప్పుడు న్యాయ నిపుణులు చర్చించుకుంటున్నారు.”
సార్వభౌమాధికార సంక్షోభం
ఈ ఒప్పందానికి పెద్ద నేపథ్యం ఏమిటంటే, పొరుగున ఉన్న రువాండా, ఉగాండా (ఈ రెండు దేశాలు సంవత్సరాలుగా యూఎస్ సైనిక, రాజకీయ మద్దతును పొందాయి.) దేశాల మద్దతుతో పనిచేస్తున్నట్లు చాలా కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుగుబాటు సంస్థ ఎం23 తిరిగి పుంజుకోవడం.
ముసావులి దృష్టిలో, ఇది ఏదైనా ఉద్దేశించిన అమెరికా సైనిక సహాయం ఒక అశుభ పరిణామం: “రువాండా, ఉగాండా సైన్యాలకు ఆయుధాలు మరియు శిక్షణ ఇస్తున్న అమెరికా వద్దకు తమ భద్రత కోసం కాంగో ఎందుకు వెళ్ళాలి?”
ముఖ్యంగా ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న కటంగా ప్రావిన్స్ పౌర సమాజం కాంగో ప్రజలను దాటవేసే ఏదైనా ఖనిజ- భద్రతా ఏర్పాట్లను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేశారు. అయినప్పటికీ వారి స్వరాలు అంతర్జాతీయ సమాజంలో ముఖ్యాంశాలుగా లేవు. ఇది ఆ దేశ సార్వబౌమత్వం రాజకీయ సంకల్పం పై ప్రజలకు ఉన్న హక్కును తిరస్కరిస్తుంది
పౌర సమాజ ఉద్యమమైన ఎల్యూసీహెచ్ఏ సభ్యుడు స్టీవర్ట్ ముహిండో మాటలు ఈ భావనను ప్రతిధ్వనించేలా చేస్తున్నాయి. “ఈ ఒప్పందం పట్ల కాంగో ప్రజలు ఉత్సాహంగా లేరు. మేము నిరాశ చెందుతున్నాం. విదేశీ జోక్యాలు సంవత్సరాలుగా ఏమీ చేయలేదు. మా సమస్యలకు పరిష్కారాలు ఇతర దేశాల నుంచి వస్తాయని మేము అనుకోము. మా దేశాన్ని మేమే నిర్మించుకోవాలి.”
సార్వభౌమాధికారం బలహీనపడింది
కీలకమైన ఖనిజాలపై నియంత్రణ కోసం పోటీ పడుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రయోజనాలు డీఆర్సీ అంతర్గత వైరుధ్యాలను మరింత తీవ్రతరం చేస్తాయి. ముసావులి వివరించినట్లుగా, సంక్షోభం బాహ్యమైనది మాత్రమే కాదు: “మనకు స్థానిక దళారీ తరగతి కూడా ఉంది, వారు పశ్చిమ దేశాలతో కలిసిపోయారు. ఈ నాయకులు కాంగో ప్రజల ప్రయోజనాలకు సేవ చేయరు. వారి అనుమతి లేకుండా భవిష్యత్తు అమ్ముడవుతోంది.”
ఈ ద్వంద్వ సంక్షోభం, బాహ్య జోక్యం, అంతర్గత సహకారవాదం, కాంగో స్వాతంత్య్రానంతర కాలాన్ని వెంటాడిన సందిగ్ధతలకు అద్దం పడుతున్నాయి. 1961లో పాశ్చాత్య మద్దతుగల కుట్రదారుల చేతుల్లో పాట్రిస్ లుముంబా హత్య జాతీయ సార్వభౌమత్వాన్ని ఫణంగా పెట్టి దశాబ్దాలుగా వనరుల వెలికితీతకు నాంది పలికింది. ప్రస్తుతం 2025లో లుముంబా కల ప్రతిధ్వనులైన “కార్పొరేషన్లు, బహుళజాతి సంస్థలు లేదా విదేశీ సైన్యాలకు కాదు, దాని ప్రజలకే భూమి చెందుతుందని” ఇప్పటికీ కాంగోను వెంటాడుతున్నాయి.
సార్వభౌమాధికారం కోసం సహెల్ పోరాటాన్ని చూస్తే
సాహెల్ ప్రాంతం ప్రజాదరణ పొందిన సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయాల పునరుజ్జీవనాన్ని చూస్తోంది. మాలి, బుర్కినా ఫాసో, నైజర్ వంటి దేశాలు ఫ్రెంచ్ మరియు పాశ్చాత్య సైనిక భాగస్వామ్యాలను తిరస్కరించాయి. బదులుగా వనరుల నియంత్రణను జాతీయం చేయడానికి ఇంకా ప్రాంతీయ స్వయంప్రతిపత్తిని నొక్కి చెప్పడానికి ఎంచుకున్నాయి. “వారు న్క్రుమా ఆలోచనలను అనుసరిస్తున్నారు” అని ముసావులి అన్నారు. “వనరులు ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని వారు చెబుతున్నారు.”
అయినప్పటికీ కిన్షాసాలో, దిశ తారుమారైనట్లు కనిపిస్తోంది. పెరుగుతున్న అభద్రత, క్షీణిస్తున్న చట్టబద్ధత మధ్య, అధికారంలో ఉండాలనే నాయకత్వం నిరాశ, దేశాన్ని చాలా కాలంగా అస్థిరపరిచిన శక్తుల వైపు వారిని నెట్టివేసింది. వాషింగ్టన్తో నివేదించబడిన ఒప్పందం కుదిరితే, అది కాంగో సాధికారతను సూచించదు, కానీ దాని ఖనిజాలకు కాంగో సమర్పణను సూచిస్తుంది.
పీపుల్స్ డిస్పాచ్ సౌజన్యంతో..
అనువాదం : ఆంజనేయ రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.