
భారత పౌరులు అయినప్పటికీ అక్రమ బంగ్లాదేశీయులు అనే అనుమానంతో పశ్చిమ బెంగాల్కు చెందిన నలుగురిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని బీఎస్ఎఫ్కు అప్పగించారు. వారు వారిని బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతానికి చేరవేశారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే నలుగురిని బంగ్లాదేశ్కు పంపారని బెంగాల్ పోలీసులు తెలియజేశారు.
న్యూఢిల్లీ: భారత పౌరులు అయినప్పటికీ పశ్చిమ బెంగాల్కు చెందిన నలుగురిని భారత అధికారులు బంగ్లాదేశ్కు పంపారు. వారిని పశ్చిమ బెంగాల్ పోలీసులు సోమవారం(జూన్ 16)స్వదేశానికి తిరిగి తీసుకువచ్చారు. వీరిలో ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు శాశ్వత నివాసితులు, మరొకరు బర్ధమాన్ నివాసి ఉన్నారు.
అక్రమ బంగ్లాదేశీయులు అనే అనుమానంతో ఈ వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వారిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)కు అప్పగించారు. వారిని సరిహద్దు దాటించి బంగ్లాదేశ్కు పంపారు.
సోమవారం ఈ విషయం మీద స్పందిస్తూ ముర్షిదాబాద్ పోలీసులు మాట్లాడారు. నలుగురు వ్యక్తుల భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించడానికి స్థానికంగా దర్యాప్తు నిర్వహించామని పోలీసులు తెలియజేశారు. ధృవీకరణ తర్వాత, సంబంధిత పత్రాలు, పౌరసత్వ రుజువును బీఎస్ఎఫ్కు అప్పగించామని చెప్పుకొచ్చారు.
“బీజీబీ(బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్)తో బీఎస్ఎఫ్ వెంటనే ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించింది. చివరకు బంగ్లాదేశ్ నుంచి నలుగురిని అధికారులు భారతదేశానికి తీసుకువచ్చారు. కొన్ని గంటల క్రితం భారత సరిహద్దులోని కూచ్బిహార్ పోలీసులకు అప్పగించారు. వారిని తిరిగి తీసుకురావడానికి ముర్షిదాబాద్ జిల్లా పోలీసుల బృందాన్ని పంపారు. రేపటి నాటికి నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారు” అని ముర్షిదాబాద్ పోలీసులు పేర్కొన్నారు.
తిరిగి తీసుకువచ్చిన నలుగురిని మెహబూబ్ షేక్, నజీముద్దీన్ మండల్, మినారుల్ షేక్, ముస్తఫా కమల్ షేక్గా గుర్తించారు.
దీనికంటే ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం, నలుగురిలో ఒకరైన 36 ఏళ్ల మెహబూబ్ షేక్ పౌరసత్వ రుజువును వలస సంక్షేమ బోర్డు ఇంకా పశ్చిమ బెంగాల్ పోలీసులు సమర్పించారు. అయినప్పటికీ, మహారాష్ట్ర పోలీసులు అతన్ని అప్పగించిన తర్వాత బీఎస్ఎఫ్ అతన్ని బంగ్లాదేశ్కు పంపించింది.
షేక్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముర్షిదాబాద్ జిల్లాలోని భాగబంగోలాలోని మహిసస్థలి గ్రామ పంచాయతీ ప్రాంతంలోని హుస్సేన్ నగర్ గ్రామంలో నివసిస్తున్నారు.
‘వారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తెలియజేయడానికి కూడా ఇష్టపడలేదు’
పశ్చిమ బెంగాల్ వలస సంక్షేమ బోర్డు చైర్మన్ సమీరుల్ ఇస్లాం మాట్లాడుతూ, “షేక్ కుటుంబం మమ్మల్ని సంప్రదించింది. ఆ తర్వాత మేము మహారాష్ట్ర పోలీసులను సంప్రదించాము. అవసరమైన అన్ని పత్రాలను వారికి పంపాము. వారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తెలియజేయడానికి కూడా ఇష్టపడలేదు. షేక్ను బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్కు పంపించారు” అని అన్నారు.
షేక్ సోదరుడు ముజిబుర్ వార్తాపత్రికతో మాట్లాడుతూ, అతను గత రెండు సంవత్సరాలుగా మహారాష్ట్రలో పనిచేస్తున్నాడని చెప్పాడు. ముజిబుర్ మాట్లాడుతూ, తను టీ తాగుతుండగా, పోలీసులు బంగ్లాదేశీయుడనే అనుమానంతో తనను పట్టుకుని కనకియా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని అన్నాడు.
షేక్ ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తరతరాలుగా పంచాయతీ ధృవీకరించిన అతని కుటుంబ వంశావళితో సహా అన్ని పత్రాలను మహారాష్ట్ర పోలీసులకు పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శనివారం(జూన్ 14) షేక్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. తెల్లవారుజామున 3.30 గంటలకు బీఎస్ఎఫ్ తనను బంగ్లాదేశ్కు పంపిందని తెలియజేశాడు.
“శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తనను బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్కు పంపించిందని అతను చెప్పాడు. అతను ఫోన్ చేసిన గ్రామంలో ఆశ్రయం పొందాడు. అతను ఏడుస్తున్నాడు” అని అతని సోదరుడు ముజిబుర్ చెప్పాడు.
తమను తాము సమర్థించుకున్న మహారాష్ట్ర పోలీసులు..
తమ చర్యను సమర్థించుకుంటూ షేక్ తన జాతీయతను నిరూపించుకోవడానికి పత్రాలను సమర్పించడంలో “విఫలమయ్యారని” మహారాష్ట్ర పోలీసులు అన్నారు. దీంతోపాటు, పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి అతను ఆధార్, పాన్ కార్డులపై ఆధారపడలేదని తెలియజేశారు.
గమనించాల్సిన విషయం ఏంటంటే, పహల్గాం ఉగ్రవాదదాడి తర్వాత భారతదేశ ‘పుష్ బ్యాక్’ వ్యూహంలో భాగంగా వందలాది మంది అనుమానిత అక్రమ వలసదారులను తూర్పు సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్కు పంపించారు. దేశవ్యాప్తంగా పోలీసులు అక్రమ వలసదారులను గుర్తించడానికి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో, దీనికంటే ముందు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 8న భారతదేశానికి ఒక లేఖ పంపింది. అందులో తమ దేశంలోకి ప్రజలను ఈ విధంగా నెట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, భారత ప్రభుత్వం డిపోర్టేషన్ విధానాలను అనుసరించడంపై మండిపడింది.
అనువాదం: క్రిష్ణా నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.