
పగబట్టిన పాములా వెనుకబడిన ఉత్తరాంధ్రను అణు విద్యుత్ ప్రమాదం వెంటాడుతోంది. అభివృద్ధి ముసుగులో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు పాలక పార్టీలు ప్రయత్నాలు చేస్తూనేవున్నాయి. కొవ్వాడ అణు పీడ వీడకుండానే, తాజాగా అనకాపల్లి తీరం వైపు సోకింది. ఫుకుషిమా అణు ప్రమాద అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తరాంధ్ర తీరాన్ని అణు విద్యుత్ ప్లాంట్లకు కేంద్రాలుగా మార్చే కుట్రలు ప్రభుత్వాలు పన్నుతున్నాయి. ఔషధ, రసాయన పరిశ్రమల కాలుష్య బాధను వదిలించుకోవడంపై జనం ఆలోచిస్తుంటే, అంతకంటే పెద్ద వినాశనం కల్గించే అణు విద్యుత్ ప్లాంట్లు ఉత్తరాంధ్ర నెత్తిన పెట్టాలని చూస్తున్నాయి. అనకాపల్లి జిల్లా తీరంలో రెండువేల ఎకరాల్లో 2,800 మెగావాట్ల సామర్థ్యం కల్గిన అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టిపిసి) ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నడుస్తోంది. పదేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ) తలపెట్టిన రెండువేల ఎకరాల్లో ఆరువేల మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటును ప్రజలు పోరాడి అడ్డుకున్నారు. అమెరికా ఒత్తిడితో ఎంతో వేగంగా అణు విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పాలని అనుకున్నా, అనివార్యంగా పనులు ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడిరది. ఈ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. ఏనాడైనా, ఏ క్షణమైనా తెరమీదకొచ్చే ముప్పులేకపోలేదు. స్థానికుల బలమైన ప్రతిఘటనతో ముందుకు వెళ్లలేక ప్రభుత్వాలు వెనక్కు తగ్గాయి.
కొవ్వాడను ఆవహించిన అణు భూతం తాజాగా అనకాపల్లి తీర ప్రాంతం వైపు కూడా సోకింది. తీరంలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలంపై అన్వేషణ జరుగుతోంది. ప్లాంట్ ఎక్కడ పెట్టినా ప్రతిఘటన వుంటుంది. ఈ ప్రతిఘటనను ఎదుర్కొనే వ్యూహంతో పాటు అణు విద్యుత్ ప్లాంట్కు సరైన స్థలం ఎంపికపైనా దృష్టి ప్రారంభించింది. రాంబిల్లిలో దేశ రక్షణకు సంబంధించిన నేవల్ ఆల్టర్నేట్ ఆపరేషన్ బేస్(ఎన్ఎఒబి) నిర్మాణం జరుగుతోంది. అత్యంత రహస్య రక్షణ కేంద్రానికి సమీపంలో ప్లాంట్ నిర్మాణానికి సాంకేతిక సమస్యలున్నాయి. అచ్యుతాపురం తీరంలో బార్క్ వుంది. వీటికి దగ్గరగా అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో పాయకరావుపేట ఆ పైనున్న కాకినాడ వైపు అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. కాకినాడ తీరంలో ప్రజలు అడ్డుకున్న బల్క్ డ్రగ్ పార్కును నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటుచేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్కును వద్దనుకొనే ప్రజలు అణు విద్యుత్ ప్లాంట్కు సమ్మతించే అవకాశంలేదు. అందుకని ఎటుతిరిగి అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని తీర ప్రాంతం అనుకూలంగా వున్నట్లు భావిస్తున్నారు.
బల్క్ డ్రగ్ పార్కు కూడా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి తీరంలో ఏర్పాటుకానుంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న టిడిపి ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతల్లో అనిత వున్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై దూకుడుగా వెళ్తున్నట్లే, అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై కూడా ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలతో నిమిత్తం లేకుండా అణు కుంపటి ఈ ప్రాంతంలో పెట్టేందుకు ఆమె సహకరిస్తారన్న ఆలోచన ప్రభుత్వ స్థాయిలో వుంది. అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటైతే రోజుకు మూడు బిలియన్ గ్యాలన్ల నీరు అవసరంకానుంది. భవిష్యత్లో పోలవరం పూర్తయితే అధికభాగం నీరు అణు విద్యుత్ ప్లాంట్కు కేటాయించనున్నారు. దీంతో విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు పోలవరం నీరు దూరమవుతుంది. జపాన్లోని ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం, లక్షల మంది నిర్వాసితులైన వాస్తవాలు ప్రభుత్వం గుర్తించడంలేదు. న్యూక్లియర్ రియాక్టర్ల నుంచి ప్రతిరోజు విడుదలవుతున్న వేల టన్నుల అణుధార్మిక జలాలను శుద్ధి చేయలేని పరిస్థితి అక్కడ నేటికీవుంది. ప్రమాద రియాక్టర్లను పూర్తి శుద్ధికి మరో 30-40 సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫుకుషిమా తరహా ప్రమాదం కొవ్వాడ, అనకాపల్లి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్లలో జరగదని అనుకోలేము. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ల చుట్టూ 80 కిలోమీటర్ల పరిదిలో ప్రమాద ప్రభావం ఉంటుంది. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా న్లూక్లియర్ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపితే రాంబిల్లిలోని నేవీ రక్షణ స్థావరం, యుద్ధ సామాగ్రిని నిల్వచేసే బార్క్ వంటి సున్నిత ప్రదేశాలు దెబ్బతింటాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ కరువవుతుంది. 80 కిలోమీటర్ల పరిధిలోని నేవీ, డాక్యార్డు, షిప్యార్డు, హెచ్పిసిఎల్, స్టీల్ప్లాంట్, విశాఖపట్నం పోర్టు వంటి ప్రభుత్వరంగ సంస్థలకు ప్రమాదం పొంచివున్నట్లు అవుతుంది.
అణు ప్రమాదాల నష్టాన్ని పూడ్చుకునే సామర్థ్యం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన జపాన్ దేశానికే లేకుండా పోయింది. అలాంటిది మన దేశం ఇటువంటి విపత్తులను తట్టుకోగలదా? ప్రపంచమంతా నిషేధిస్తున్న అణు విద్యుత్ ఏర్పాటుపై అనేక అనుమానాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదం తెలిసి కూడా మోడీ ప్రభుత్వం ఎందుకు ఉవ్విళ్లూరుతోంది? రాష్ట్రంలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడిరచలేదు. కేంద్ర బిజెపి ప్రభుత్వం గుజరాత్లో 2007లో ఏర్పాటుచేయాలనుకున్న అణు విద్యుత్ప్లాంట్ను కొవ్వాడకు తరలించింది. గుజరాత్లో ఏర్పాటుచేయాలని నిర్ణయించిన అణు విద్యుత్ ప్లాంట్ను కొవ్వాడకు తరలించడం వెనుక ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం కాదు. గుజరాత్ ప్రాంత ప్రజల మేలు కోరి.
అనకాపల్లి తీరంలో అణు విద్యుత్ కేంద్రం వెనుక ఈ తరహా కుట్రలే వున్నాయి. ఉత్తరాంధ్ర ఏమైపోయినా అమెరికా చెప్పినట్లు మోడీ ప్రభుత్వం భజన చేస్తోంది. దానికి కూటమి ప్రభుత్వం తలూపుతోంది. అణు విద్యుత్ కేంద్రాల్లో భద్రత లేదని ప్రపంచంలోని అణు నిపుణులు నొక్కిచెబుతున్నారు. పార్లమెంట్లో మన రాష్ట్ర రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు వెస్టింగ్హౌస్ అనే అమెరికా కంపెనీతో ఒప్పందం ఖరారు చివరి దశలో ఉందని ప్రభుత్వం తన సమాధానంలో తెలిపింది. ఈ కంపెనీ అమెరికాలో దివాళా తీసి ఐపి పెట్టింది. అలాంటి కంపెనీతో మోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఒప్పందంలో మరో ప్రమాదకరమైన అంశమేమిటంటే, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ కంపెనీకేమీ సంబంధం ఉండదట! బహుళజాతి సంస్థల బండారం ఎలా ఉంటుందో చెప్పటానికి ఇటీవలి విశాఖ ఎల్జి పాలిమర్స్ ఉదంతం మన ముందే ఉంది.
1984లో భోపాల్లో జరిగిన ఘోర గ్యాస్ లీకు ప్రమాదానికి సంబంధించి ఇదే అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ బహుళజాతి సంస్థ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా నేటికీ పూర్తిగా పరిహారం చెల్లించలేదు. వారు చెల్లించక, మన ప్రభుత్వాలూ పట్టించుకోకపోవడంతో నేటికీ వేలాది మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో అక్కడ బాధపడుతూనే ఉన్నారు. అదే విధంగా అమెరికాలోని ఐస్లాండ్, రష్యాలోని చెర్నోబిల్, 2011లో జపాన్లోని ఫుకుషిమాలో జరిగిన ప్రమాదంతో ఆ రాష్ట్రమంతా తీవ్రంగా నష్టపోయింది. పూర్తిగా వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఆ రాష్ట్రంలో రేడియేషన్ వల్ల గాలి, భూమి, నీరు విషతుల్యమైపోయాయి. ఈ విస్పోటనం తరువాత ఏ దేశంలోను అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు. ఇప్పటికే వున్న అణు విద్యుత్ కేంద్రాలను అనేక దేశాలు మూసివేస్తున్నాయి. మనకు రియాక్టర్లను ఎగుమతి చేస్తున్న అమెరికా తమ దేశంలో 4 విద్యుత్ కేంద్రాలు మూసివేసింది. జపాన్ దేశంలో 2 అణు విద్యుత్ కేంద్రాలు తప్ప మిగిలినవన్నీ మూసివేశారు. అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగితే 80 కిలోమీటర్లు వరకు ప్రమాద తీవ్రత వుంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఒక మెగావాట్ అణు విద్యుత్ ఉత్పత్తికి రూ.48కోట్లు ఖర్చు అయితే ఒక మెగావాట్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 5 కోట్లు ఖర్చు అవుతుంది. సోలార్ టెక్నాలజీ నేడు బాగా అభివృద్ధి చెందుతున్నది. పర్యావరణ సమస్య వుండదు. విండ్, సీట్కెడల్ టెక్నాలజీ కూడా అభివృద్ధి అవుతుంది. పర్యావరణ సమస్యలేని విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టకుండా సామాన్యులకు అందుబాటులో లేని ప్రమాదకరమైన అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సరికాదు.
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తనకు సన్నిహితుడిగా చెప్పుకొనే మోడీతో తన దేశంలో కాలం చెల్లిన అణు సాంకేతికతను, అణు విద్యుత్ కేంద్రాల తుక్కు సామగ్రిని భారతదేశంలో వినియోగించడానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత అణు విద్యుత్ కేంద్రాలు తెరమీదకొచ్చాయి. అమెరికాలో మోడీ పర్యటన అనంతరం అణు ప్రాజెక్టుపై ఎన్టిపిసి తమ ప్రయత్నం ఆరంభించింది. ప్రజల ప్రాణాలకు భద్రతలేని, పర్యావరణాన్ని దెబ్బతీసే, సామాన్యులకు అందుబాటులో విద్యుత్ సరఫరా చేయని అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి. అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై ప్రజలు అప్రమత్తంగా వుండి ఐక్యంగా అడ్డుకోవాలి.
– అల్లు రాజు, సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ సభ్యులు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.