
శాస్త్రవేత్తలు, తత్త్వవేత్తలు, రచయితలు, కళాకారులు, ప్రపంచ పౌర సమాజ సభ్యులమైన మేము ఈ పరిస్థితులలో 1925లోలాగా నూతన ఫాసిస్ట్ పోకడలను తిరస్కరించాల్సిన బాధ్యత మాపై ఉందని భావిస్తున్నాము. వివిధ రంగాలలో ఫాసిజానికి వ్యతిరేకంగా అన్ని రూపాలలో ప్రతిఘటన పోరాటాలను నిర్మించాల్సిన అవసరం కూడా ఉందని భావిస్తున్నాము. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన వారందరూ ఈ క్రింది చర్యలు చేపట్టాలని పిలుపునిస్తున్నాము.
1925లో ఇటలీలో బెనిటో ముస్సోలినీ అధికారానికి రావడానికి వ్యతిరేకిస్తూ తొలిసారిగా ఇటలీకి చెందిన పౌరమేధావి బెనిడేటో క్రోస్ ఫాసిస్టు వ్యతిరేక ప్రణాళికను ప్రకటించారు.
శతాబ్దం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పౌర మేధావులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, కళాకారులు తాజా లేఖలో బెనిడేటో ఫాస్టెస్ట్ వ్యతిరేక ప్రణాళికను పునరుద్ఘాటిస్తున్నారు. తాము ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఫాసిజ ప్రమాదం విషయంలో మౌనం పాటించదల్చుకోలేదని ఈ లేఖ రాసిన మేధావులు స్పష్టం చేశారు.
లేఖలోని పూర్తి పాఠాన్ని కింద ఇస్తున్నాము.
శతాబ్ది తర్వాత పునరుత్థానం పొందుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా బహిరంగ లేఖ..
1925 మే 1 నాటికి ఇటలీలో ముస్సోలినీ అధికారానికి వచ్చారు. ఫాసిస్ట్ చర్యలను ప్రారంభించారు. ముస్సోలినీ ఫాసిస్ట్ చర్యలను వ్యతిరేకిస్తూ మే ఒకటో తేదీన ఇటలీకి చెందిన పలువురు పౌర మేధావులు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖపై సంతకం చేసిన వారిలో శాస్త్రవేత్తలు, తత్త్వవేత్తలు, రచయితలు, కళాకారులు ఉన్నారు. వీరంతా ఒక స్వేచ్ఛాయుతమైన సమాజం కోసం, శాసనబద్ధమైన పరిపాలన కోసం, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, మేధో స్వయంప్రతిపత్తి కోసం అంకితం అయిన వారే. నిర్దాక్షిణ్యంగా దేశంలో అమలవుతోన్న ఫాసిస్టు సిద్ధాంతాన్ని, ఆచరణను బహిరంగంగా వ్యతిరేకిస్తే వచ్చే ప్రమాదాలు ఎలా ఉంటాయో తెలిసే ఈ లేఖ రాశారు.
లేఖ ద్వారా ఫాసిజాన్ని వ్యతిరేకించటం సాధ్యమే అని చెప్పడమే గాక అనివార్యమని కూడా ఈ మేధావులు తెలియజేశారు. వందేళ్ల తర్వాత మరోసారి ఫాసిజం ప్రమాదం ప్రపంచం ముంగిట్లోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇటలీకి చెందిన పౌర మేధావులు చూపించిన ధైర్యం, తెగువ, సాహసం మనం కూడా ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది.
వందేళ్ల క్రితం ఇటలీలో ఆవిర్భవించిన ఫాసిజం నూతన తరహా నియంతృత్వానికి తెర తీసింది. అనతి కాలంలోనే యూరప్లోను ప్రపంచంలోను అనేక దేశాలకు ఈ నియంతృత్వం విస్తరించింది. ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఈ నియంతృత్వం వేరువేరు అవతారాలలో కనిపించినా దాని ఆచరణ, సారం మాత్రం ఒక్కటే.
ఏ దేశంలో ఫాసిజం అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష గొంతు నులమడం ద్వారా రాజకీయ వ్యవస్థలో ఏకచత్రాధిపత్యం సాధించడం జరిగింది. అంతేకాకుండా నయానోభయానో మీడియా రంగాన్ని నియంత్రించడం, మహిళల హక్కుల హననం, ఆర్థిక న్యాయం కోసం సాగుతున్న కార్మిక పోరాటాలను చిదిమెయ్యటం జరిగాయి. శాస్త్ర విజ్ఞాన మేధో సాంస్కృతిక రంగాలన్నింటినీ వక్రీకరించి ధ్వంసం చేయటం ఈ పాలకుల విధానంలో అంతర్భాగమైంది. మరణ శాసనాలు లిఖించటం పట్ల ఫాసిజానికి ఉన్న ఆసక్తి సామ్రాజ్యవాద యుద్ధాలకు, ఆయా దేశాలలోనే కొన్ని మతాలు, జాతులకు చెందిన ప్రజల ఊచకోతకు, అంతిమంగా రెండో ప్రపంచ యుద్ధానికి, యూదుల నరమేధానికి, లక్షలాది మంది మరణానికి, మానవాళికి, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఘోరమైన నేరాలకు దారి తీసింది.

అదే సమయంలో ఫాసిజానికి, అనేక రకాలైన ఫాసిస్టు సిద్ధాంతాలకు ఎదురైన ప్రతిఘటన కూడా ఆయా సమాజాలు అంతర్జాతీయ సంబంధాలను వినూత్నమైన పద్ధతుల్లో పునఃసంఘటితం చేసుకోవడానికి కావలసిన ఎన్నో ప్రత్యామ్నాయాలను ముందుకు తీసుకువచ్చింది.
రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్యసమితి ఆవిర్భావానికి, అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనకు, నేటి యూరోపియన్ యూనియన్ ఏర్పాటు కావడానికి కావలసిన సైద్దాంతిక పునాదులు సిద్ధం చేయటానికి, వలసవాదానికి వ్యతిరేకంగా చట్టబద్ధమైన వాదనలకు, లోతైన అసమానతలకు దారులు వేసింది. స్థూలంగా రెండో ప్రపంచ యుద్ధాంతర పరిస్థితుల్లో శాసనబద్ధమైన అర్థవంతమైన అంతర్జాతీయ సంబంధాల పునఃస్థాపనకు ప్రయత్నం జరిగింది. విశ్వశాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ, పౌర రాజకీయ హక్కులతో పాటు ఆర్థిక సామాజిక, సాంస్కృతిక, హక్కుల సంరక్షణతో కూడిన నూతన సమాజాల ఆవిష్కరణకు ఆశలు, అవకాశాలు పెరిగాయి.
ఫాసిజం ఎన్నడూ శాశ్వతంగా అంతర్ధానం కాలేదు. తాత్కాలికంగానే నిలువురించబడింది. గత రెండు దశాబ్దాలలో కరుడుగట్టిన మితవాద ఉద్యమాల ఉధృతి పెరిగింది. ఈ ఉద్యమాలు తరచూ ఫాసిస్టు లక్షణాలను బాహాటంగానే ప్రదర్శిస్తూ వచ్చాయి. ప్రజాతంత్ర విలువలు వ్యవస్థలపై బహిరంగంగా దాడులు, జాతీయోన్మాదంతో కూడిన దేశభక్తి ధోరణులు, నియంతృత్వ లక్షణాలు, ఈ శక్తులు నిర్మించిన నూతన అధికార వ్యవస్థలో ఇమడలేని వారిపై, వారి హక్కులపై భౌతిక దాడులు, మతోన్మాదం, పురుషాధిక్యత వంటి అవలక్షణాలతో మేళవించిన రాజ్యాధికారం, రాజకీయాలతో నయా ఫాసిజం ముందుకు వస్తోంది.
దీర్ఘ కాలం మనుగడ సాగించిన ప్రజాస్వామిక వ్యవస్థలలో సైతం దీర్ఘకాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యల వలన ఇబ్బంది పడుతున్న విషయాల కారణంగా ప్రజానీకం ఈ శక్తుల పట్ల ఆకర్షితులవుతున్నారు. నానాటికి పెరుగుతున్న అసమానతలు సామాజిక అణచివేత, వెలి వంటి ప్రజాస్వామిక వ్యవస్థలోని అవలక్షణాలకు బలవుతున్న వారు ఆ పరిస్థితుల నుంచి తమను తాము అధిగమించేందుకు ఈ శక్తులు వైపు ఆశగా చూస్తున్నాయి. సాంప్రదాయక ఫాసిస్టు వ్యవహార శైలికి అనుగుణంగానే ఈ నూతన ఫాసిస్టు నేతలు అపరిమితమైన ప్రజాదరణ పొందుతున్నారు. అంతేకాకుండా దాన్నే పెట్టుబడిగా మార్చుకుని జాతీయ, అంతర్జాతీయ, శాసనాధారిక వ్యవస్థలను అతిక్రమిస్తున్నారు. న్యాయ వ్యవస్థ, మీడియా, సాంస్కృతిక సంస్థలు ఉన్నత విద్యాసంస్థలు శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించే సంస్థల స్వయంప్రతిపత్తిపై దాడి చేస్తున్నారు. దీంతో పాటు చివరకు శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన మౌలికమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ వాస్తవాలను సృష్టిస్తున్నారు. మనలోనే మన మధ్య శత్రువులను సృష్టిస్తున్నారు. భద్రతా సమస్యలను ఆయుధంగా వాడుకుని తమ అధికారాన్ని సంఘటితం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయా దేశాలలో ఒక్క శాతం కంటే తక్కువగా ఉన్న అపర కుబేరులు ప్రభుత్వం పట్ల చూపిస్తున్న విధేయతకు తగిన ప్రతిఫలం పొందుతూ ఉన్నారు.
అడ్డగోలు అరెస్టులు, హింసాత్మక చర్యలు, భయోత్పాతం, దేశంలో కాళ్లూనకుండా చేయటం, ప్రచారహోరు ద్వారా అసమ్మతి గొంతు నులమటం ద్వారా ఈ క్రమం మరింత వేగం పుంజుకుంటుంది. ఈ ప్రచార హోరుతో ఊదరగొట్టడానికి సాంప్రదాయక మీడియాతో పాటు సోషల్ మీడియా అధిపతులు కూడా నయా ఫాసిస్టు పాలకులకు వత్తాసు పలుకుతున్నారు. కొంతమంది ఈ ఫాసిస్టు ధోరణుల పట్ల చూసీ చూడనట్టు వ్యవహరిస్తుంటే మరికొందరు బాహాటంగానే ఈ ఉన్మాదాన్ని సమర్ధిస్తున్నారు.
ప్రజాస్వామ్యాలు ఎటువంటి లోపాలూ లేని స్వచ్చమైన పాలవంటివి కావు. తప్పుడు ప్రచారాలకు బలవుతూనే ఉంటాయి. కావల్సినంత స్థాయిలో అందరినీ కలుపుకు పోయేంత సమ్మిళిత సమాజాలను నిర్మించడంలో ప్రజాస్వామిక వ్యవస్థల్లో వైఫల్యాలు లేకపోలేదు. అదే సమయంలో ఈ సమాజాలు మేధోపరమైన, సాంస్కృతిక పురోగమనానికి కావలసిన మెరుగైన భూమికను సిద్ధం చేస్తాయి.
ఈ రంగాల్లో నిరంతరం మెరుగుదల సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ప్రజాతంత్ర వ్యవస్థలలో మానవ హక్కులు, స్వేచ్ఛలు విస్తరించవచ్చు, కళలు వికసించవచ్చు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు ఆవిష్కరించబడవచ్చు, పాలకులను నిలదీయవచ్చు, నూతన సిద్ధాంత ప్రతిపాదనలు ముందుకు తీసుకురావచ్చు. ఇవన్నీ మానవాళి పురోగమనానికి అవసరమైన మౌలిక అంశాలు.
సామాజిక అన్యాయాలను అర్థవంతంగా పరిష్కరించడానికి ప్రజాతంత్ర వ్యవస్థలు దోహదపడతాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం ముందుకు వచ్చిన పని చేసే హక్కు, కనీస విద్యార్హత సాధించే హక్కు, కనీస ఆరోగ్య సంరక్షణ హక్కు , సామాజిక భద్రత హక్కు, సాంస్కృతిక శాస్త్ర సాంకేతిక జీవితంలో భాగస్వామ్యం పొందే హక్కు, ప్రజల అభివృద్ధికి సంబంధించిన ఉమ్మడి హక్కులు, స్వయం నిర్ణయాధికార హక్కు, శాంతి కాంక్ష వంటి వాటిని నెరవేర్చుకోవడానికి ప్రజాతంత్ర వ్యవస్థలో అవకాశాలు ఉంటాయి. వీటిని సాధించుకోలేకపోతే మానవాళి పురోగమనం. సంక్షుభితం అవుతుంది. అసమానతలు, అన్యాయాలు, వైపరీత్యాలు పెచ్చరిల్లుతాయి. ప్రపంచం అత్యవసరంగా ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభాన్ని గుర్తించడానికి కూడా నూతనతర ఫాసిస్టు శక్తులు తిరస్కరిస్తున్నాయి.
ప్రపంచ దేశాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ప్రస్తుత తరుణంలో ప్రజాస్వామిక వ్యవస్థలు ఒంటరిగా మనుగడ సాగించలేవు. జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యం, ప్రజాతంత్రం పరిడవిల్లాలంటే ఆ వ్యవస్థలు పనిచేయటానికి కావలసిన బలమైన సంస్థలు, అంతర్జాతీయ సహకారం, బహుళ జాతీయ వేదికలపై ప్రజాతంత్ర సూత్రాల ప్రాతిపదికన వివిధ దేశాల మధ్య ఉన్న సంబంధాలను నియంత్రించడం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి సమాజంలో అందరిని భాగస్వాములను చేయటం అవసరం. ప్రస్తుతం అంతర్జాతీయ శాసన ఆధారిత వ్యవస్థలను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. అయిననప్పటికీ ఈ అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలను ఆటవిక న్యాయంపై విశ్వాసం కలిగిన వ్యక్తులు తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు వినాశకర పరిణామాలకు దారితీయనున్నాయి. ఈ దేశాలు సైనిక బలం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యాలే ప్రాతిపదికలుగా పెత్తనం చెలాయించడం కోసం సిద్ధపడుతున్నాయి.
ఈ పరిస్థితులలో 1925లోలాగా శాస్త్రవేత్తలు, తత్వేత్తలు రచయితలు కళాకారులు ప్రపంచ పౌర సమాజ సభ్యులు ఆయన మేము, ఈ నూతన ఫాసిస్ట్ పోకడలను తిరస్కరించాల్సిన బాధ్యత మాపై ఉందని భావిస్తున్నాము. ఫాసిజానికి వ్యతిరేకంగా అన్ని రూపాలుగా వివిధ రంగాలలో ప్రతిఘటన పోరాటాలను నిర్మించాల్సిన అవసరం కూడా ఉందని భావిస్తున్నాము. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన వారందరూ ఈ క్రింది చర్యలు చేపట్టాలని పిలుపునిస్తున్నాము.
• సాంస్కృతిక, ప్రజాతంత్ర, విద్యా విషయక సంస్థలను సంరక్షించాలి. ప్రజాతంత్ర విలువలు, మానవ హక్కుల ఉల్లంఘనను నిస్సంకోచంగా ఖండించాలి. లొంగుబాటుకు సిద్ధం కారాదు.
• స్థానిక, అంతర్జాతీయ స్థాయిలోను ఉమ్మడి కార్యాచరణలో భాగస్వాములు కావాలి. అవసరాన్ని బట్టి సహాయనిరాకరణకు, సమ్మెకు సిద్ధం కావాలి. ప్రతిఘటనను విస్మరించడం, అణచివేయడం ప్రమాదకరమని పాలకులకు అర్థమయ్యేలా చెప్పాలి.
• వాస్తవాలు, ఆధారాలను సంరక్షించాలి. విమర్శనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచన విధానాన్ని జీవన విధానంగా మార్చుకోవాలి. వీటి ప్రాతిపదికన మనం ఉన్న ప్రాంతాలు క్షేత్రాలలో పనిచేయాలి.
ఇది నిరంతరం సాగే పోరాటం. మన కృషి, మన సూత్రాలు-సిద్ధాంతాలు, మన ప్రతిఘటన స్వరాలు నియంతృత్వానికి వ్యతిరేకంగా అడ్డుగోడలుగా నిలవాల్సిన సమయం ఇది. ఈ ప్రకటన ఫాసిజానికి వ్యతిరేకంగా ధిక్కారస్వరాన్ని పునరుద్ఘాటించడమే.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.