
దారిలో నడిచే వారిని ‘బాటసారి’ అంటారు. దారి చూపి నడిపించే వారిని ‘మార్గదర్శి’ అంటారు. కొత్తగా దారిని నిర్మించే వారిని ‘మార్గ నిర్మాత’ అంటారు. వర్గ దోపిడీ వ్యవస్థను రక్షిస్తూ పాలించే పాలకులలో ఈ మూడు రకాల వాళ్ళూ ఉంటారు. ఈ మూడు రకాల పాలకులనే ‘ట్రెండ్ సెటర్స్’ అంటారు. ఆ కోవలోకి వచ్చే పాలకుల్లో చంద్రబాబు ఒకరు.
1886వ సంవత్సరంలో చికాగో కార్మిక పోరాటం జరిగింది. ఇది చరిత్రలో మేడే పోరాటంగా ప్రాచుర్యం పొందింది. ఫలితంగా ఎనిమిది గంటల పని దినం అమలులోకి వచ్చింది. ప్రకృతి నియమాల ప్రకారం రోజుకు 24 గంటల సమయం ఉంటుంది. అందులో ఎనిమిది గంటలు నిద్ర కోసం, ఎనిమిది గంటలు కుటుంబ జీవితం కోసం, ఎనిమిది గంటలు పని కోసం. ఆ ఆఖరి ఎనిమిది గంటలు పరిశ్రమలు, కర్మాగారాలు, షాప్స్లలో కార్మికుల పని సమయానికి చెందింది.
నిద్రకాలం మారదు. 24 గంటల్లో ప్రకృతిసిద్ధమైన ఎనిమిది గంటలు పోగా మిగిలేది 16 గంటల కాలం. ప్రభుత్వాలు కార్మిక చట్టాలు మార్చి ఎనిమిది గంటల పని దినాన్ని పెంచితే, వారి కుటుంబ జీవిత కాలం నుంచి కబ్జా చేయడమే అవుతుంది.
పెట్టుబడిదారులు, కంపెనీ యాజమాన్యాలు నిత్యం కార్మికుల పని గంటలని పెంచుతాయి. వాళ్ళు లాభదాహంతో చేసే పని అదే! ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు ఈ పనికి పూనుకోకూడదు. అవి ఉనికిలో వున్న కార్మిక చట్టాల ప్రకారం ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి. కానీ చంద్రబాబు ట్రెండ్ సెట్టర్ కదా! స్వయంగా ప్రభుత్వ అధినేతగా వుండి కంపెనీ సీఈఓ పాత్ర పోషించారు. మోడీ ప్రభుత్వం గత అయిదారేండ్ల నుంచి లేబర్ కోడ్స్ అమలుకు వెనకాడుతోంది. ఈ సమయంలో నిఖార్సైన సీఈఓ పాత్రధారిగా పని గంటలను పెంచుతూ, ఏపీ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు సారథ్యంలో చట్ట సవరణలు చేయడం గమనార్హం.
శ్రామికులు తమ భార్యా బిడ్డలతో గడపడం కోసం, విజ్ఞానం కోసం, పత్రికల పఠనం కోసం, వినోదం కోసం కేటాయించే కాలం కుటుంబ జీవితాలకు సద్వినియోగం చేసే కాలం అంటారు. దీనిని చంద్రబాబు సర్కార్ కబ్జా చేయడానికి పూనుకుంది.
ప్రైవేటు కంపెనీలు, సంస్థలలో కార్మికులతో రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ గంటల చొప్పున పని చేయించే యాజమాన్యాలు చాలా వున్నాయి. కానీ ఇప్పటి వరకూ అధికారికంగా ఎనిమిది గంటల పని దినం అమలు జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలలో అమలు జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వమే స్వయంగా పని గంటలు పెంచిన తర్వాత ప్రైవేటు రంగంలో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు.
చంద్రబాబు సర్కార్ పెంచే పని గంటలు కార్మికుల నిద్రాకాలం నుంచి సర్దుబాటుకు వీలు పడదు. అది మనిషికి అత్యవసరమైనది. పైగా అదనంగా రెండు గంటల పని పెరిగితే, ఆ శారీరక కష్టానికి పరిహారంగా కనీసం ఒక గంట నిద్ర కాలం పెరుగుతుంది. ఎనిమిది గంటలకు బదులు తొమ్మిది గంటల నిద్ర అవసరం. దీనినిబట్టి కుటుంబ జీవిత కాలం నుంచి కొంత భాగం నిద్ర కోసం పెంచాలి.
చంద్రబాబు సర్కార్ పెంచిన పని గంటల కాలం లక్షల మంది కార్మికుల, ఉద్యోగుల కుటుంబ జీవిత కాలం నుంచి అనివార్యంగా కబ్జా చేయాల్సిందే. ఇది కార్మికులు తమ భార్యా బిడ్డలతో గడిపే కాలాన్ని కబ్జా చేయాల్సిందే.
మరో ఘోరం ఏంటంటే, ఇంతకాలం మహిళా కార్మికులకు రాత్రి డ్యూటీ నుంచి మినహాయింపు వుండేది. వారికి భద్రత ఒక ముఖ్య సమస్య! ఈనాటి పితృస్వామ్య సమాజంలో పురుష, స్త్రీ కార్మికులకు సమాన అవకాశాలు వుండవు. సమానత సాధించే పేరిట రాత్రి డ్యూటీ చేయాలని చట్ట సవరణ చేసింది. ఆ క్లాజు చూపి మహిళా కార్మికులకు తమకు తోచిన డ్యూటీలు వేసి వేధించి, బాధించి, సాధించే చర్యలు ఏం జరుగుతాయో తెలియనిది కాదు.
ఎక్కువ పని గంటలు చేసి మానసిక ఒత్తిడికి గురై డ్యూటీ నుంచి ఇంటికి చేరిన కార్మికులు ఇంట్లో చిరాకు పడతారు. డ్యూటీ నుంచి ఇంటికి చేరిన కార్మిక తండ్రుల చెంతకు చేరిన పిల్లలని కసురుకొని మంచం ఎక్కి విశ్రాంతి తీసుకుంటారు. డ్యూటీ నుంచి ఇళ్లకు చేరే కార్మిక తల్లులని ప్రేమతో కౌగలించుకోవాలని వచ్చే పసిబిడ్డలను ముద్దులతో ముంచెత్తే అవకాశం కూడా ఉండదు.
పని గంటల పెంపుతో చంద్రబాబు ప్రభుత్వం చేసిన చట్ట సవరణ మున్ముందు లక్షల మంది కార్మిక తండ్రులు, శ్రామిక తల్లులు కన్నబిడ్డలతో ప్రేమను పంచుకునే అవకాశం లేకుండా చేస్తుంది. ఈ అదనపు శారీరక పని భారం ఆచరణలో అదనపు మానసిక ఒత్తిళ్లను పెంచుతుంది. ఫలితంగా మానసిక రోగాలు కూడా పెరుగుతాయి. ఇది ఆచరణలో సామాజిక పరిస్థితిని అస్థిరపరుస్తుంది. ఇది చరిత్రలో అతిపెద్ద సామాజిక నేరంగా మారుతుంది.
నూరేళ్ళ క్రితమే యాంత్రిక యుగం దాటి, ఇటీవల ఇంటర్నెట్(కంప్యూటర్) యుగం కూడా దాటి, కృత్రిమ మేధ దశలో చేరుకున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇలాంటి నూతన అన్వేషణల గురించి నిత్యం మాట్లాడే చంద్రబాబు కార్మికుల పని కాలాన్ని పెంచుతూ చట్ట సవరణ చేయడం ఘోరం.
ఇందులో జీతాలు, నిరుద్యోగం, సర్వీసుల క్రమబద్ధీకరణ వంటి మరెన్నో కోణాలు కూడా ఉన్నాయి. వాటిలోకి ఇప్పుడు వెళ్లడం లేదు.
చంద్రబాబు ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదు. ఈ లక్షలాది కార్మికులతో పాటు వారి భార్యా బిడ్డలకు చేసే ఇలాంటి అన్యాయాన్ని సమాజం కూడా క్షమించదు. కార్మికవర్గం పట్ల ఇలా వ్యవహారిస్తే మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాలం ఎల్లప్పడూ ఒకేలా ఉండదు. కార్మికవర్గం ఆలస్యంగా అప్రమత్తం కావచ్చు. శ్రామికవర్గం కళ్ళు తెరిచిన రోజు ఈ ట్రెండ్ సెట్టర్స్ చరిత్ర చెత్తకుప్పలోకి చేరక తప్పదు.
పి ప్రసాద్
భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.