
ప్రతిపక్షం ముందు ప్రస్తుతం రెండు ప్రశ్నలున్నాయి. దేశ రాజకీయ ఎజెండాను పాలకపక్షానికి అప్పగించటమా లేక ప్రజాతంత్ర సూత్రాల ప్రాతిపదికన దేశానికి అవసరమైన ఎజెండాను ముందుకు తీసుకురావటమా అన్నవే ఈ ప్రశ్నలు.
ఆపరేషన్ సిందూర్ గురించి భారతీయ వ్యాఖ్యానాన్ని ప్రపంచానికి వినిపించేందుకు రూపొందించి, అఖిలపక్ష ఎంపీల ద్వారా పలికిస్తున్న మాటల మంత్రాంగం ప్రశ్నార్థకంగా ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయ భౌగోళిక దృక్కోణాన్ని అందించేందుకు ప్రయత్నించకుండా భారతీయ జనతా పార్టీ రూపొందించిన దృక్కోణాన్ని ప్రతిపక్షం అత్యుత్సాహంతో సమర్ధించటానికి పరిమితం అయ్యింది. ప్రత్యేకించి ఈ ప్రతినిధి బృందాలు పాకిస్తాన్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని నెత్తికెత్తుకుని ఊరేగుతున్నాయి.
ప్రభుత్వ వాదనతో గొంతు కలపటం జాతీయ విద్వక్త ధర్మంగా భావించబడుతోంది. కానీ ఇతర దేశాల ప్రభుత్వాలు ఇప్పటి వరకూ బీజేపీ వినిపిస్తున్న వాణినే మళ్లీమళ్లీ ప్రతిపక్షాల నోట వినటానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారని భావించటం ఎంతవరకూ సబబో అర్థం కావటం లేదు. ఈ విశ్వవ్యాప్త ప్రచారం మొదలు పెట్టి రెండు వారాలు అవుతోంది. ఈ ప్రచారాన్ని కనీసం ప్రపంచం గుర్తించను కూడా గుర్తించలేదు.
ఈ ప్రచార వ్యూహాల వలన పాకిస్తాన్ పట్ల ఇతర దేశాలకు ఉన్న అభిప్రాయంలో మౌలికమైన మార్పులు వచ్చినట్లు ఆధారాలేమీ లేవు. ఈ కాలంలోనే పాకిస్తాన్ ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణాలు పొందింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తాలిబాన్లపై ఆంక్షలు విధించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిషన్కు పాకిస్తాన్ అధ్యక్ష హోదా అందుకున్నది. అన్నిటికంటే మించి ఐక్యరాజ్యసమితి భద్రతామండలి కౌంటర్ టెర్రరిజం గ్రూపులో ఉపాధ్యక్ష హోదాను కూడా దక్కించుకుంది.
నిష్పలమైన ఈ ప్రచార హోరులో పాలకపక్షంతో గొంతు కలపాలని ప్రతిపక్షం నిర్ణయించుకోవటం ఆసక్తికరమైనది. ఈ పరిస్థితులు తలెత్తుతాయని ప్రతిపక్షంలో అనుభవజ్ఞులైన నాయకులకు తెలీనిదేమీ కాదు. ప్రతిపక్ష ఓటర్లు తమ నుంచి ఈ రకమైన స్పందనే ఆశిస్తున్నారని భావించి, తామే అందుకు సిద్ధం కావటం మరింత ఆసక్తికరమైన అంశం. ఈ రకమైన అభిప్రాయం కలగటానికి ముఖ్యకారణం దేశీయంగా రాజకీయ ఎజెండాను పాలకపార్టీ హైజాక్ చేయటం. గత కొంతకాలంగా భారతదేశం అనుసరించే విదేశాంగ విధానంపై ప్రతిపక్షాలు, పాలకపక్షం మధ్య అర్థవంతమైన చర్చలేకపోవడాన్ని గమనించవచ్చు. విదేశాంగ విధానంపై చర్చ దేశ రక్షణకు సంబంధించిన అంశంగా మారిపోయింది. విదేశాంగ విధానాన్ని ప్రశ్నించటం అంటే దేశ ద్రోహంగా పరిగణించే పరిస్థితులు తలెత్తాయి.
అంతర్జాతీయ సంబంధాలను భద్రతా సమస్యలుగా మార్చటం అంటే ముందుకొచ్చే ప్రతి సమస్యా దేశ ఉనికిని సవాలు చేసే ప్రశ్నలుగా పరిగణించటం, రోజువారీ రాజకీయ చర్చకు అతీతమైన, దేశమంతా ముక్తకంఠంతో స్పందించాల్సిన అంశంగా పరిగణించటమే. ఒక సమస్యను అంతర్జాతీయ భద్రతా సమస్యగా పరిగణించటం అంటే వినేవాళ్లకు దాని లోతుపాతులు అర్థమవుతాయా లేదా అన్నదాంతో నిమిత్తం లేదు.
ఒకసారి సదరు సమస్య దేశ భద్రతతో ముడిపడి ఉన్నదన్న అభిప్రాయాన్ని రుద్దిన తర్వాత సదరు అంశంపై జరిగే సాధారణ చర్చ జరగదు. అటువంటి చర్చలో భాగంగా పాటించాల్సిన విధి విధానాలకు నీళ్లొదులుతారు. సదరు సమస్య జనాభా పెరుగుదల గురించి కావచ్చు, ఓ సూత్రం కావచ్చు లేదా కనీసం ఒక ఆలోచనే కావచ్చు.
ఉదాహరణకు ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా ప్రారంభించిన యుద్ధం ఏకంగా ప్రపంచ మనుగడతో ముడిపడిన అంశంగా ప్రచారం చేశారు. దాంతో బలప్రయోగం, నేరన్యాయ పాలన, ఖైదీలను చూసే విధానం, పశ్చిమ దేశాల్లో పౌర హక్కులు వంటి అంతర్జాతీయ న్యాయ సూత్రాలు తుంగలో తొక్కడానికి కారణమైంది. ఈ ఉల్లంఘనలన్నిటికీ చట్టబద్ధత కల్పించేందుకు తెచ్చిన చట్టం పేరు దేశభక్తి చట్టం.
ఈ రకంగా రోజువారీ రాజకీయ సమస్యలను భద్రతా సమస్యలుగా మార్చటం అన్నది అంతర్జాతీయ సమస్యలకే పరిమితం కాలేదు. దేశీయ రాజకీయ వివాదాలను అంతర్జాతీయ భద్రతా సమస్యలుగా మార్చే ప్రక్రియకు చక్కని ఉదాహరణ ప్రవాసుల హక్కుల గురించి మొదలైన చర్చ. ఆశ్రయం అర్థించి దేశంలోకి వచ్చే వారే దేశానికి అత్యంత ప్రమాదకరమని ప్రచారం చేయటం వారిని దోషులుగా నిలబెట్టడం ఈ కాలంలో పరాకాష్టకు చేరింది. ప్రత్యేకించి పాశ్చాత్య జీవన విధానానికి ప్రవాసుల ఉనికి ప్రమాదకరం అన్నది ఈ చర్చ సారాంశం. అటువంటి ప్రవాసులను దేశం నుంచి తరిమికొట్టేందుకు పార్టీలకతీతంగా అధికార ప్రతిపక్ష పార్టీలు మద్దతివ్వడం పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరిస్తోంది.
భారతదేశంలో బంగ్లాదేశీ ప్రవాసులు, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాల విషయంలో జరిగిన చర్చలో ఈ ధోరణి ప్రస్ఫుటంగా ముందుకొచ్చింది. ఈ ధోరణిని పాలకపక్షంతో పాటు పలు ప్రతిపక్షాలు కూడా సమర్ధించాయి. ఈ పరిణామం చివరకు అస్సాంలో దశాబ్దాలుగా నివసిస్తున్న వారిని ప్రవాసులుగా గుర్తించి వారి పౌరసత్వం రద్దు చేసి బంగ్లాదేశ్ సరిహద్దులకు తరలించేదాకా వెళ్లింది.
మయన్మార్ సరిహద్దు సముద్ర జలాల్లోకి తీసుకెళ్లి రోహింగ్యాలను నావికాదళ నౌకల నుంచి బతికి బట్టకట్టడానికి వీలుగా ఏర్పాట్లు చేసి సముద్ర జలాల్లోకి తోసేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను వేగవంతంగా విచారించేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించటం మరింత ఆందోళనకరమైన అంశం. దానికి సుప్రీం కోర్టు చెప్పిన కారణం దేశం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న అంశాలు చర్చింలేము అని. మానవ హక్కుల సమస్యను దేశభద్రతా సమస్యలతో ముడిపెట్టి చూడటానికి ఇంతకంటే తాజా ఉదాహరణ దొరకదు.
ఏ సమస్యనైనా భద్రతా సమస్యగా మార్చటం పట్ల నిపుణులు, మేధావులు రెండు వాదనలు ముందుకు తెస్తారు. ఉదాహరణకు అన్ని రకాల యుద్ధాలు, ఉగ్రవాదాలు రాజకీయ చర్చ నుంచి మాయం కాలేదు. మొదటిది తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తకుండానే ఏ సమస్యనైనా జాతీయ భద్రతతో ముడిపడిన అంశంగా పరిగణించటం. ఇది వాక్చాతుర్యం, భాషాప్రయోగానికి సంబంధించిన సమస్య. ఉదాహరణకు అన్ని యుద్ధాలు రాజకీయ చర్చకు దూరంగా లేవు. 1962 నాటి భారత్ చైనా యుద్ధం సమయంలో నెహ్రూ విమర్శల జడివానలో తడిసి ముద్దయ్యారని ఫ్రాన్సిస్ ఫ్రాంకెల్ రాశారు. ఈ విమర్శలు చేసిన వారిలో ప్రభుత్వం యుద్ధ పరిశ్రమలపై కేంద్రీకరించి మిగిలిన పరిశ్రమలన్నింటినీ ప్రైవేటు రంగానికి అప్పగించాలని విమర్శించిన పెట్టుబడిదారులున్నారు. విపి మీనన్, నెహ్రూల కమ్యూనిస్టు సానుకూలత కారణంగా అలినోద్యమ వైఫల్యాలను గుర్తించలేకపోయారని, పంచశీల ఒప్పందం విఫలమైందని విమర్శించిన వారూ ఉన్నారు. అదేవిధంగా 26/11 ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో యుపీఏ ప్రభుత్వ స్పందన కూడా తీవ్రమైన శోధనకు, విమర్శలకు గురయింది. విస్తృతమైన రాజకీయ చర్చకు కేంద్రమయింది.
ఒక ప్రభుత్వం ఒక సమస్యను దేశపు మనుగడతో ముడిపెట్టినంత మాత్రాన అది దేశ మనుగడతో ముడిపడిన అంశం అయిపోదు. సమస్యను చూసేవాళ్ల దృష్టిలో అది దేశ మనుగడతో ముడిపడిన సమస్యగా ఉండాలి. ఈ కోణంలో దేశంలో ప్రతిపక్షం పాత్ర కొరత కనిపిస్తోంది. ఏ రాజకీయ సమస్యనైనా దేశ భద్రత ముడిపెట్టడం గత పదేళ్ల బీజేపీ పాలనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లక్షణం. మతోన్మాద ఉద్రిక్తతల సమయంలో మైనారిటీలను మాత్రమే శిక్షించటం, విద్యార్ధి సంఘ నేతలు, పౌరసమాజ ప్రతినిధులపైనా దేశ ద్రోహం కేసులు బనాయించటం రూపంలో ఇది దేశీయ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది.
రాజకీయ ప్రతిపక్షాలు కూడా మాటవరుసకైనా ఈ విషయాలపై పాలక బీజేపీ వైఖరిని ప్రతిఘటించలేదు. ఉదాహరణకు 2019లో ఉపా చట్టం పరిధిని ప్రమాదకరంగా మార్చే మరిన్ని సవరణలకు రాజ్యసభలో కాంగ్రెస్ సైతం ఓటు వేసింది. భీమాకోరేగాం కేసులో కానీ, ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసుల్లో కానీ ముద్దాయిల పక్షాన నిలబడిన ప్రతిపక్ష పార్టీల సంఖ్య నామమాత్రమే.
దేశంలో ప్రతి సమస్యనూ దేశ భద్రత, మనుగడతో ముడిపెట్టే ఈ ధోరణి వలన అత్యధికంగా లాభపడింది దేశంలోని టెలివిజన్ ఛానళ్లు, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ, ప్రధానంగా సినీ పరిశ్రమ మాత్రమే. ప్రతి సమస్య దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల మనుగడకు ప్రమాదమని చూపించటం, చర్చించటం, ప్రచారం చేయటం ఈ రెండు రకాల పరిశ్రమలకు బాగా లాభదాయకంగా మారింది. అటువంటి చర్చల సమయంలో ( ప్రతి సమస్యనూ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల మనుగడను సవాలు చేసే సమస్యగా చూపించటం) పాపులర్ టీవీ ఛానళ్ల వీక్షకుల (టీఆర్పీ) సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇదే కథనంతో సాగిన కశ్మీర్ ఫైల్స్. కేరళ స్టోరీస్ సినిమాలు కూడా బాక్సాఫీసుల వద్ద కోట్లు కూడబెట్టాయి. దీన్ని బట్టి ఏ సమస్యనైనా అడ్డగోలుగా దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశంగా మార్చటం ద్వారా దేశంలో పాలకపక్షానికి రాజకీయ లబ్డి కలగటమే కాకుండా వాణిజ్యపరంగా కూడా తేలిగ్గా ప్రజలవద్దకు తీసుకెళ్లే సరుకుగా మారుతోందని అర్థమవుతోంది. ఈరెండు కోణాలు దేశ ప్రజలను శాశ్వతంగా ఉద్రేకులుగా మార్చటానికి తోడ్పడే అంశాలే.
ఒకసారి దేశ ప్రజలు ఈ రకంగా శాశ్వతంగా తమ మనుగడ, ఉనికి గురించి కలిగే ఆందోళన, ఉద్రిక్తతలను ఉఛ్చ స్థితికి తీసుకెళ్తే వారి భావోద్వేగాలను, మానసిక స్థితిని సాధారణ స్థాయికి తీసుకురావటం చాలా క్లిష్టమైన పని. ఫలితంగా అంతర్జాతీయంగా విదేశాంగ విధానాన్ని సైనికీకరించటం, దేశీయంగా సాధారణ ప్రజల చట్టబద్ధమైన హక్కులను చిదిమేయటం, తుంగలో తొక్కటం తప్ప అటు ప్రజలు, ఇటు ప్రభుత్వానికీ మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ గురించి కాంగ్రెస్ చేస్తున్న విమర్శల్లా అంత తొందరగా కాల్పుల విరమణ ఎలా ఒప్పుకుంటారు అన్నదే. చైనా వంటి దేశాలతో ఉన్న సరిహద్దు వివాదాల విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని విమర్శించటంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. కాంగ్రెస్ తీసుకున్న వైఖరిలో తప్పొప్పుల గురించి లోతుల్లోకి వెళ్లటం లేదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఏదైనా సమస్యను దేశ భద్రత, మనుగడతో ముడిపెట్టి చర్చించటం మొదలు పెట్టిన తర్వాత సదరు సమస్యపై ప్రభుత్వం కానీ దేశం కానీ మరింత దూకుడుగా ఎందుకు లేవు అన్న చర్చను తప్ప మరే చర్చనూ ప్రజలు స్వాగతించే పరిస్థితిలో ఉండరు.
ఎంత సైనిక శక్తిని ప్రయోగించినా ఆశించిన ఫలితాలు సాధించలేనప్పుడు ఈ చర్చ మరింత ఉధృతంగా ఉంటుంది. ముదిరిపోతుంది. జోసెఫ్ నీ చెప్పినట్లు శక్తి లేదా అధికారం రాజ్యాల (దేశాల) ప్రవర్తనను శాసిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఎంత శక్తిని ప్రయోగించినా ఎవరి ప్రవర్తన మార్చటానికి ఈ శక్తిని ప్రయోగిస్తున్నామో వారి ప్రవర్తన ( ఆయా దేశాల ప్రవర్తన) మారనప్పుడు అటువంటి శక్తిని ప్రయోగించినా వృధా అవుతుంది. అది శక్తిని సద్వినియోగిం చేయటంకాదు. అంతేకాకుండా, ఏ ప్రభుత్వం అయితే జరిగిన తప్పులను సమీక్షించుకుని సరైన దారిలో నడవటానికి వీల్లేకుండా ప్రజాభిప్రాయం నిలువరిస్తుందో అటుంటి ప్రజాభిప్రాయం ఆ ప్రభుత్వాన్ని మరింత బలహీనపరుస్తుంది.
ప్రజాస్వామిక సమాజాల్లో రక్షణ విషయాలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలనూ ప్రశ్నించలేని ఆదర్శాలుగా మార్చకూడదన్న విషయంలో రాజనీతిజ్ఞుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఆయా సందర్భాలను బట్టి కొన్ని సమస్యలకు రక్షణరంగ సమస్యల స్వభావం ఏర్పడుతుంది. ఆ సమస్యలను అటువంటి స్వభావం నుంచి మళ్లించటం దీర్ఘకాల ప్రణాళికలు, అర్థవంతమైన చర్చలు, వ్యయ ప్రయాసలతో కూడుకున్న కర్తవ్యం. అటువంటి సమస్యలను భద్రతా వలయం నుంచి బయటకు తెచ్చి సాధారణ రాజకీయ సమస్యల జాబితాలో చేర్చి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పౌరసమాజం కృషి చేయాల్సి ఉంది.
గత దశాబ్దకాలంగా దేశంలో ఏ రాజకీయ సమస్యను బహిరంగంగా చర్చించుకోవచ్చూ, ఏ రాజకీయ సమస్యలను రక్షణ వలయంలోకి నెట్టి చర్చను నిరోధించాలనే విషయాన్ని నిర్ణయించటంలో ప్రతిపక్షాలు పాలకపక్షానికి పూర్తి స్వేఛ్చనిచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని మల్చటంలోనూ, ప్రజాభిప్రాయంపైనా బిగువైన పట్టుకలిగిన బీజేపీ దీనికి భిన్నంగా వ్యవహరించటం కూడా రాజకీయంగా క్షేమదాయకం కాదని భావించి ఉండొచ్చు.
ఏ సమస్యనైనా రక్షణ రంగ సమస్యగా పరిగణించటమనేది అదేదో అమాయకంగా జరుగుతున్న పని కాదు. ఏ సమస్య దేశ భద్రతకు సంబంధించిన సమస్య, ఏ సమస్య రాజకీయ సమస్య అన్నది నిర్ణయించేది రాజకీయాలే. మనం అనుసరించే రాజకీయాలు ఏమిటన్నదాన్ని బట్టి సమస్యల పట్ల మన దృక్ఫథం, ఆ సమస్యల ద్వారా మనం సాధించదల్చుకున్న రాజకీయ ప్రయోజనాలు గురించి అవగాహన ఏర్పడుతుంది. ఇదేదో కేవలం అధికారం ఉంటేనే జరిగే పని కాదు. భావజాల రంగంలో వాద ప్రతివాదనల్లో జరపాల్సిన పోరాటం ఇది. దేశీయ విషయాల్లో కానీ, విదేశాంగవిధానంలో కానీ ఏ సమస్యనైనా పాలకపక్షం భద్రతా సమస్యల గొంగడిలో కప్పెట్టేందుకు ప్రయత్నిస్తున్నపుడు దాన్ని సవాలు చేయటానికి ప్రతిపక్షాలు సిద్ధం కాకపోటం, పైగా దానికి వంత పాడటం అంటే దేశంలో రాజకీయ చర్చను కుదించటమే. గత పదేళ్ల కాలంలో దేశంలోని ప్రతిపక్షాలు చేస్తున్నది ఇదే.
ప్రతిపక్షం ముందు రెండు ప్రశ్నలున్నాయి. దేశ రాజకీయ ఎజెండాను పాలకపక్షానికి అప్పగించటమా, లేక ప్రజాతంత్ర సూత్రాల ప్రాతిపదికన దేశానికి అవసరమైన ఎజెండాను ముందుకు తీసుకురావటమా అన్నవే ఈ ప్రశ్నలు. ప్రజాతంత్ర సూత్రాల ప్రాతిపదికన దేశానికి అవసరమైన ఎజెండాను ముందుకు తీసుకురావటం అంటే ప్రతి సమస్యనూ దేశ భద్రతతోనూ, దేశంలో మెజారిటీ అయిన హిందువుల మనుగడతోనూ ముడిపెట్టే పాలకపక్షం ప్రయత్నాలను సవాలు చేయాలి. మొదటి అంశానికి పరిమితం అయితే దేశంలో ప్రతిపక్షం తన ఉనికిని కోల్పోతుంది అని స్పష్టంగా గుర్తించాల్సిన తరుణం ఇది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.