
ఎటువంటి అవకతవకలకు పాల్పడకుడా పోలీసులు న్యాయంగా సాక్ష్యాలు సేకరిస్తే న్యాయస్థానంలో నిజాలు రుజువయ్యే అవకాశం ఉంటుంది. హింసిస్తేనే నిందితులు నిజాలు చెప్పడం సాధ్యమని పోలీసులు అంటారనే విషయం చాలామందికి తెలుసు. అయినా హింసిస్తే, భరించలేక నేరాన్ని ఒప్పుకుంటారా? లేకపోతే నేరం నిజమే కాబట్టి అవునవును అంటారా? ఏదేమైనా నేరం ఒప్పుకుంటే కోర్టుకు పోయేదాకా బతికి పోవచ్చు అనుకుంటారేమో.
పోలీసులు హింసించినపుడు నిందితులు వెల్లడించిన అంశాలను కోర్టులో చూపినప్పుడు ఆ నిందితుడు ఇదంతా హింసించడం వల్ల రాసిందే అన్నాడంటే మాత్రం కేసు నిలబడదు. అప్పటి నుంచి కోర్టు తగాదా మొదలువుతుంది. పైకోర్టుకు ఆ పైకి ఈ తగాదా వెళ్తూ ఉంటుంది.
నిజానిజాలు లావుపాటి లా పాఠాలలో చదవి విప్పరు..
మరో తగాదా కూడా ఉంది. చాలామంది కలిసి నేరం చేస్తే దర్యాప్తులో ఒకరు నేరాన్ని ఒప్పుకున్నపుడు సమస్య మరింత జటిలమవుతుంది. అనుమానితుడి మీద విడిగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే, ఆ తరువాత మరో అనుమానితుడిని పట్టుకుని ఇదే డిగ్రీ ప్రయోగిస్తే తను నేరం చేసినట్లు ఒప్పుకునే అవకాశం ఉంది. చాలా సందర్భాలలో అదే జరుగుతూ ఉంటుంది.
ప్రధాన నిందితుడి ఆరోపణల ఆధారంగా సహ నేరస్తుడికి నిందితుడిగా హోదా ఇచ్చి, అరెస్టు చేసి జైలుకు పంపడం న్యాయమా అన్న ప్రశ్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల కేసులో సుప్రీంకోర్టు దాకా వచ్చింది. నేర విచారణలో ఒక నిందితుడు తనతో పాటు మరొక వ్యక్తి కూడా నేరాలు చేశాడని అంటే అతను సహ నిందితుడు అవుతాడు. మొదటి నిందితుడు జైలుకు పంపడానికి మరో సహనిందితుడి నుంచి పోలీసులు చెప్పించుకున్న నేరాంగీకారం వాడుకుని మొదటి వాడిని, తరువాత రెండో వాడినీ కూడా జైలుకు పంపిస్తారు.
ఆ నేరాంగీకార వాజ్ఞ్మూలానికి అంటే అనుమానితుడి స్టేట్ మెంట్ సిఆర్పిసి సెక్షన్ 161 కింద (ఇది పాత కేసు, పాత నేరం కావడం వల్ల కొత్త ఎన్డీయే రచించిన భారతీయ చట్టాలను ఈ సందర్భంలో ఉటంకించడం లేదు, కూడదు. లేకపోతే అయోమయంలో పడిపోతాం) కనుక 161 వాజ్ఞ్మూలానికి విలువ ఉన్నప్పటికీ, పోలీసు కస్టడీలో ఇచ్చిన నేరాంగీకారాన్ని వాడుకుంటూ అరెస్టు చేసుకోవడం న్యాయమా?
పూర్తి ట్రయల్ తరువాత శిక్ష పడడం వేరు. కానీ కోర్టు విచారణ ముగించకుందే జరిగే అరెస్టు, ముందస్తు అరెస్టు, పోలీసు కస్టడీ, జ్యుడీషియల్ కస్టడీ విషయాల్లో కూడా ఆరోపితులు పైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్తారు.
పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకుంటే అనుమానం ఉంటుంది. ఆ వాజ్ఞ్మూలానికి ఆమోదయోగ్యత ఉండదు. సెక్షన్ 24, 25, 30 కింద అనుమానితమైన ప్రకటన అని 153 సంవత్సరాల క్రితం సూత్రం ఇది. దీనిపైన ఎన్నో వందల కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు వచ్చాయి. నేరాంగీకారాన్ని అనుమానిస్తారు. పోలీసుల సమక్షంలో, లాకప్లో, లేదా మరెక్కడైనా సరే కొందరు పోలీసులు ఎదురుగా ఉన్నప్పుడు బలవంతంగా అంగీకరించేలా చేశారని అనుకుంటారు.
ఇది ‘‘భారతీయ’’ సాక్ష్య చట్టం కాదు. ఆంగ్లేయులు రాసిపెట్టిన సాక్ష్యాల చట్టం. ఇండియన్ ఎవిడెన్స్ చట్టం. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 పైన 2025లో అంటే 153 సంవత్సరాల క్రితం నుంచి అమలులో ఉన్న ఒక పాత చట్టం. ఒక తీర్పు కిందటి వారంలో సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. సెక్షన్ 24 కింద నేర విచారణలో అసంబద్ధం అయినప్పుడు, ప్రేరేపణ, బెదిరింపు లేదా వాగ్దానం కారణంగా జరిగిన ఒప్పుకోలు చెల్లవు. నేరారోపణకు గురైన వ్యక్తి చేసిన అంగీకారాన్ని గనుక, కోర్టుకు ఏదైనా ప్రేరణ లేదా బెదిరింపు లేదా లాభం చేస్తామనే వాగ్దానం లేదా కీడు చేస్తామని బెదిరించినా జరిగినట్లు కనిపిస్తే , నేరారోపణకు గురైన వ్యక్తి చేసిన అంగీకారాన్ని ఒప్పుకోరని అది అసంబద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది.
మే 2న హైకోర్టు తీర్పు, మార్చిన మే 16న సుప్రీంకోర్టు..
ఆంధ్రప్రదేశ్ పోలీసులు కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఎఎస్ ధనుంజయ్ రెడ్డి, వికాస్ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ గురించి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత మే 2న ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. అక్కడ ‘‘దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మద్యం కేసులో రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్టు ఆధారాలు దొరికినప్పుడు శతాబ్దన్నర నాటి సూత్రం ఆధారంగా నేరాంగీకారం, పోలీసుల భయ ప్రయోగం కారణమైనపుడు అది నిలబడదు”అని మే 16న సుప్రీంకోర్టు వివరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళగిరి పోలీసు స్టేషన్లో నమోదైన నేరంలో పిటిషినర్లకు ఎందుకు ఆంటిసిపేటర్ ముందస్తు బెయిల్ నిరాకరించిందనేది ముఖ్యమైన ప్రశ్న. రిజిస్టర్ చేసిన కేసులో ఆరోపణలు తీవ్రమైనవిగా ఐపిసి సెక్షన్ 409, 420, 12-బి, సెక్షన్ 34, 37లు పేర్కొన్నారు. అందులో దేశీయ న్యాయ సంహిత 2023లు ఏదో చెబుతూ, అవినీతి నిరోధక- 1988 చట్టంలో కూడా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరణ తరువాత సుప్రీంకోర్టుకు బెయిల్ జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టి, సహ నిందితుడి పోలీసు భయం ఆధారంగా నేరాంగీకార ప్రకటన నిలబడదని, కనుక అరెస్టు చెల్లదని బెయిల్ మీద విడుదల ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
సురేశ్ బుధర్మల్ కలానీ కేసులో..
ఇది మరొక కేసును సుప్రీంకోర్టు అమరావతి రాజధాని హైకోర్టులో తాజా తీర్పులో 38 పేజీలో ఉటంకించింది. ఇది చాలాకీలమైంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం ఒక నిందితుడు ఇచ్చిన అంగీకార పత్రం(confession) అదే కేసులో అదే నేరానికి సంబంధించి కొందరు నిందితులు లేదా అనుమానితులు అందరు వారిని సంయుక్తంగా విచారణ ఎదుర్కొంటున్న మరో నిందితుడిపై కూడా వర్తిస్తుందని 1988లో సుప్రీంకోర్టు సురేశ్ బుధర్మల్ కలానీ కేసులో స్పష్టం చేసింది. అయితే, అటువంటి నేరాంగీకారాన్ని ఛార్జిలో ఆరోపణ పత్రం తయారు చేసినపుడు(framing of charges) సమయంలో ఉపయోగించడం సాధ్యపడదు. మిగతా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఆ అంగీకారం,(అంగీకార పత్రమే అయినా పోలీసుల సమక్షంలో లేదా వారి భయప్రలోభాలతో చేయించిన దాన్ని ఒప్పందం అని కూడా అంటారు) వాటి ఆధారంగా నేరారోపణలు మోపలేరు. అంతేగాక, ఒక నిందితుడిని వదిలేసిన (discharged) పరిస్థితిలో ఆ వ్యక్తి నేరాంగీకారాన్ని మిగతా నిందితులపై వర్తింప చేయడం కూడా చట్టపరంగా వీలు కాదు. ఎందుకంటే సెక్షన్ 30లో పేర్కొన్న ‘సంయుక్త విచారణ’ అనే మౌలిక నిబంధన ఇక్కడ అమలులో ఉండదు. హైకోర్టు తీర్పులో సాక్ష్య చట్టం సెక్షన్ 30 ప్రకారం అమోదయోగ్యమైన నేరాంగీకార ఒప్పందాన్ని ముందస్తు బెయిల్ లేదా రెగ్యులర్ బెయిల్ అంశాల్లో కూడా పరిగణించవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు దీనిపై ఆశ్చర్యం ప్రకటించింది.
దీపక్ కేసులో..
ఒక నిందితుని నేర అంగీకార ఒప్పందాన్ని ఇతర నిందితులపై పరిగణించడానికి, ముందు ఆ ఒప్పందాన్ని చట్టరీత్యా సాక్ష్యంగా నిరూపించాలి. అంటే అది 1872 సాక్ష్యం చట్టం సెక్షన్ 24 ప్రకారం బలవంతంగా తీసుకోలేదని, సెక్షన్ 25 ప్రకారం పోలీస్ అధికారికి ఇచ్చినదీ కాదన్నదనీ విచారణలో ధృవీకరించాలి. ఈ తతంగం ట్రయల్ విచారణలో మాత్రమే పూర్తిగా పరిశీలించే అవకాశం ఉంటుంది అని దీపక్ కేసులో 2019లో స్పష్టం చేసింది.
పోలీస్ అధికారి ఎదుట ఇచ్చిన నేర అంగీకారం కనీసం పరిశీలనార్హం కూడా కాదు. అంతేకాకుండా, దాన్ని రుజువుచేయడం అసలే సాధ్యం కాదు. సెక్షన్ 30 కింద ఉన్న అంగీకార పత్రం చట్టపరంగా అమోదయోగ్యమైనదై ఉండాలి. ఇది ఆ కాలపరీక్షలో నిలబడిన సెక్షన్కు మూల సూత్రం.
సెక్షన్ 30 ప్రకారం, అటువంటి ఒప్పందాన్ని పరిగణించాలంటే నిందితులు ‘ఉమ్మడి ట్రయల్ (సంయుక్త విచారణ’)లో ఉండాలి. కేవలం ఒకే నేరానికి సంబంధించి నిందితులు ఉన్నారంటే సరిపోదు, వారంతా ఒకటే ట్రయల్ విచారణలో ఉండాలని 1894, 1938 నాటి తీర్పులలో ఉంది. ‘సంయుక్త విచారణ’ అనే పదాన్ని సీఆర్పీసీ సెక్షన్ 223 అర్థంలో చదవాలి. అంటే, నిందితులు ఒకేసారి అభియోగాలను ఎదుర్కొంటున్నట్లయితేనే తప్ప, సెక్షన్ 30 సూత్రం వర్తించదని 2005 తీర్పులో(బద్రి ప్రసాద్ ప్రజాపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ- 2025 సీఆర్ఎల్జే 1856), తాజా సుప్రీంకోర్టు తీర్పులో ప్రస్తావించింది.
ఏదైనా సందర్భంలో అటువంటి నేర అంగీకార ఒప్పందాన్ని బెయిల్ దశలో పరిగణించవచ్చని భావించినా, కశ్మీర సింగ్ కేసులో చెప్పినట్టు, అటువంటి ఒప్పందాన్ని “ప్రామాణికతకు భరోసా కలిగించే న్యాయబద్ధ ఆచారంగా” మాత్రమే పరిగణించవచ్చు. అంటే, ఇతర ఆధారాలు ఉన్నపుడే అటువంటి ఒప్పందం దానిని బలపరచడానికి ఉపయోగించవచ్చు.
తరువాత 40వ పేరగ్రాఫ్లో, సాహిబ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యాణా- 1997, 7 ఎస్సీసీ 231 కేసులో పేర్కొన్నట్టు ఒక నేర అంగీకార ఒప్పందం సెక్షన్ 25 లేదా 26 ప్రకారంగా పరిశీలించేందుకు అవసరమైనదైతే, అటువంటి ఒప్పందాన్ని సెక్షన్ 30 ఆధారంగా మరొక నిందితుడిపై వర్తింప చేయడం చట్టవ్యతిరేకం. సెక్షన్ 25 ప్రకారం పోలీస్ ఎదుట నేరాన్ని ఒప్పుకోవడం పూర్తిగా నిషేధించబడింది. సెక్షన్ 26 ప్రకారం, పోలీసు కస్టడీలో ఉన్నపుడు ఇచ్చిన ఒప్పందం మేజిస్ట్రేట్ ఎదుట ఇవ్వలేకపోతే న్యాయపరంగా ఆ ఒప్పందం చెల్లదు.
నందినీ సత్పతి కేసు..
సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఒక నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ను మరో నిందితుడిపై వర్తింప చేయవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తాం అంటూ సుప్రీంకోర్టు ఈ విధంగా వివరించింది. నందినీ సత్పతి వర్సెస్ పీఎల్ డాని 1978 ఎస్సీ 1025 ప్రకారం, ఒక నిందితుడిని పోలీసులు విచారించి సెక్షన్ 161 క్రింద స్టేట్మెంట్ నమోదు చేయవచ్చు. అయితే అటువంటి స్టేట్మెంట్ చట్టపరంగా ఎంతవరకు అమోదయోగ్యమో మహాబీర్ మండల్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 162 ప్రకారం, పోలీసు విచారణ సమయంలో ఇచ్చిన స్టేట్మెంట్ను సాక్షిగా ఉపయోగించకూడదు. కేవలం సెక్షన్ 145 ప్రకారం వ్యతిరేకంగా విచారణ చేస్తూ లేదా ఉపయోగించి, అనుసరించి వివరించాలనిపించినప్పుడు మాత్రమే ఉపయోగించవచ్చు.
సెక్షన్ 161 కింద నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఒప్పందం(confession) లేదా అంగీకారం(అడ్మిషన్) అయి ఉండవచ్చు. ఇది చాలా సార్లు ఉటంకించిన కేసు పాకాల నారాయణ స్వామి కేసు ప్రకారం, ఒక ఒప్పందం అంటే నేరాన్ని ఒప్పుకునే స్టేట్మెంట్. కానీ, ఒక అంగీకారం అనేది కేవలం దుష్ప్రభావం కలిగించే ఒక అంశాన్ని మాత్రమే ఒప్పుకునే ప్రకటన. అటువంటి స్టేట్మెంట్ ఒప్పందంగా ఉంటే సెక్షన్ 25, 26 బలంగా వర్తిస్తాయి. అంగీకారంగా ఉంటే అది సెక్షన్ 161 కింద ఉన్నదే కావడం వలన సీఆర్పీసీ సెక్షన్ 162 వర్తిస్తుంది.
ఒక నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ అపరాధాన్ని ఒప్పుకోవడం కాకుండా ఆ వ్యక్తిని ని నిర్దోషిగా చూపించేలా(exculpatory) ఉన్నా, అది ఇతర నిందితుడిపై ప్రభావం చూపించకూడదు. ఎందుకంటే అటువంటి స్టేట్మెంట్ను న్యాయవాది అడ్డంగా ప్రశ్నల ద్వారా (క్రాస్ ఎగ్జామినేషన్) చేయలేరు. మినహాయింపుగా ఉండేది కేవలం సొంత నేరాన్ని ఒప్పుకున్నప్పుడు మాత్రమే, అది ఇతరులపై కూడా కొంతమేర వర్తిస్తుంది.
ఇటువంటి స్టేట్మెంట్లు దర్యాప్తు సమయంలో దిశ తెలుసుకునే ఉద్దేశంతో ఉపయోగపడవచ్చేమో గానీ, ఛార్జ్షీట్తో పాటు కోర్టులో సమర్పించడానికి వీల్లేదు. సెక్షన్ 30 ప్రకారం ఒప్పందాన్ని ఇతరులపై వర్తించాలంటే, దాన్ని న్యాయంగా రుజువు చేయాలి(ప్రూవ్ చేయాలి). ఆ విధంగా అటువంటి నేర అంగీకారాన్ని ఒప్పందానికి తోడుగా ఇతర ఆధారాలు కూడా ఉండాలి. కేవలం పోలీసు ఎదుట ఇచ్చిన ఒప్పందం ఆధారంగా ఇతరులను నిందించడం న్యాయబద్ధం కాదని తాజా తీర్పులో సుప్రీంకోర్టు వివరించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.