
జూలై 2020 నుంచి డిసెంబరు 2021 వరకు దేశంలో అతి పెద్ద రైతాంగ ఉద్యమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయక చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ల నుంచి రైతాంగం ఆందోళనకు దిగింది. వ్యవసాయోత్పత్తుల అమ్మకం, వాణిజ్య (ప్రోత్సాహం, వెసులుబాటు) చట్టం, రైతు సేవలు, ధరల భరోసా ఒప్పంద చట్టం, నిత్యావసర సరుకుల(సవరణ)చట్టం ఈ మూడు చట్టాలను రైతాంగం వ్యతిరేకించింది.
ఈ ఉద్యమంలో ప్రథమ శ్రేణిలో నిలిచి అటు రైతాంగ ప్రయోజనాలకు, ఇటు వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలకు ప్రతినిధులుగా ఉన్న వారి మనోభావాలను, అభిప్రాయాలను యధాతథంగా ఇచ్చేందుకు ఈ అధ్యాయంలో ప్రయత్నం చేశాము. 13 నెలల పాటు సాగిన ఆ పోరాటంలో రైతులు, రైతు ఉద్యమ కార్యకర్తలు, నాయకుల మనోభావాలు, ఎదుర్కొన్న సమస్యలు, అధిగమించిన పరిస్థితుల గురించిన ప్రత్యక్ష కథనాలు, వాటి సారాంశం ఇక్కడ పొందుపర్చాము. ఉద్యమం ముగిసిన నెల రోజుల తర్వాత 2022లో సవివరమైన ప్రశ్నావళితో రైతు ఉద్యమకారులను కలిశాము. వివరాలు సేకరించాము. ఓ చిన్న ప్రతిస్పందన, నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా రైతాంగాన్ని కదిలించే ఉద్యమంగా ఎలా మారిందో వివరించేందుకు ఈ అధ్యాయంలో ప్రయత్నం చేశాము. ఈ ఉద్యమకాలంలో భిన్న సంఘాలు, భిన్న సామాజిక తరగతులకు ప్రాతినిధ్యం వహించే సంస్థల నుంచి తమ ఉద్యమానికి మద్దతు సమీకరించే ప్రయత్నంలో రైతు ఉద్యమ నాయకత్వానికి ఎదురైన అనుభవాలు, ఉద్యమకాలంలో నాయకత్వం నేర్చుకున్న పాఠాలపై దృష్టి పెట్టాము.
ఉద్యమ భాగస్వామ్యంలో ఉన్న వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఇంటర్వ్యూలు కూడా ఉద్యమంలో పాల్గొన్న సంఘాలు, సంస్థలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, వారి భిన్న సామాజిక నేపథ్యాలకు ప్రాతినిధ్యం ఉండేలా ఎంపిక చేశాము. ఇందులోనే వివిధ సంఘాల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళలను కూడా కలిసి ఇంటర్య్వూలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధతో ప్రయత్నం జరిగింది. మేము ఇంటర్వ్యూ చేసిన వారు ఉద్యమకాలంలో రకరకాల బాధ్యతలు నిర్వహించారు. కొందరు జనసమీకరణపై దృష్టి పెడితే మరికొందరు ఉద్యమానికి అవసరమైన ధన సమీకరణ కోసం కృషి చేశారు. మరికొందరు ఉద్యమ శిబిరంలో ఉన్న వారికి కనీస అవసరాలు సమకూర్చటానికి కృషి చేశారు. మరికొందరు ఉద్యమకేంద్రాల్లో కావల్సిన వేదికలు, విద్యుత్ అవసరాలు, మైకులు వంటి ఏర్పాటు బాధ్యతలు తీసుకున్నారు.

తేజ్వీర్ సింగ్, 18 జనవరి 2022
తేజ్ వీర్ సింగ్ హర్యానాలోని అంబాలాకు చెందిన రైతు. సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉండే కుటుంబం నుంచి వచ్చారు. ఉద్యమం మొదటి నుంచి చివరి వరకూ ఉన్నారు. తానుగా ఏ రైతు సంఘంలోనూ సభ్యుడు కాకపోయినా భారతీయ కిసాన్ యూనియన్కు సంఫీుభావంగా నిలిచారు. చారుణి నాయకత్వంలో ఉన్న ఈ యూనియన్ హర్యానాలో పని చేస్తున్న రైతు సంఘాల్లో రెండో పెద్ద సంస్థ. మొదటి రోజు నుంచి కేంద్ర ప్రభుత్వం రైతాంగంపై యుద్ధం ప్రకటించింది అని తేజ్ వీర్ అభిప్రాయపడ్డారు. అందుకే తను తన మిత్రబృందంతో కలిసి మొత్తం ఉద్యమకాలం 13 నెలలు రంగంలో ఉన్నారు. గతంలో కూడా ఇటువంటి సుదీర్ఘ ఉద్యమాలు నిర్మించి పోరాటాలు చేసిన అనుభవం తేజ్వీర్కు ఉంది. ఉదాహరణకు 2010లో ఇండస్ట్రియల్ మోడల్ టౌన్షిప్ నిర్మాణం కోసం జరిగిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన నడిపారు.

The Indian Farmers’ Protest of 2020–2021 Agrarian Crisis, Dissent and Identity
Routledge, 2025
పంజాబ్, హర్యానా కేంద్రంగా పని చేస్తున్న రైతు సంఘాలు మొదటిసారిగా 2020 జూలై 20న ఆందోళనకు పిలుపునిచ్చాయని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శన చేయాలన్నది పిలుపు. 750 ట్రాక్టర్లతో రైతులు కదిలివచ్చారు. అదే రోజున రోటొవేటర్లు కొనడానికి ఇచ్చే సబ్సిడీ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన విన్న తర్వాత 2020 ఆగస్టు 15న నిరసన దినంగా పాటించాలని నిర్ణయించాము. ఒక్క అంబాలాలోనే 7,500 మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలా మొదలైంది ఉద్యమం అన్నారు తేజ్వీర్.
“ఈ ఆందోళన ఓ ముందస్తు పథకం ప్రకారం నిర్మితమైంది కాదు. 2020 నవంబరు 5న పార్లమెంట్ ఈ నల్ల చట్టాలను ఆమోదించటంతో నిరసనగా రాస్తా రోకో చేయాలని నిర్ణయించాము. పార్లమెంట్ ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి సంతకాలు చేసిన నవంబరు 25న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. అక్టోబరు 17న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాము” అని తేజ్వీర్ తెలిపారు.
‘‘అప్పటికి మా ముందున్న మార్గం ఒక్కటే. ఉద్యమబాటలో ముందుకు పోవడమా లేక చావడమా. మా ప్రదర్శనను పోలీసులు ఎక్కడ ఆపితే అక్కడ ఆగాలని నిర్ణయించుకున్నాము. ఈ ప్రయత్నంలో చిన్నచిన్న ఘర్షణలు జరిగాయి. బారికేడ్లు పగలగొట్టడం, కొందరు పంజాబీ యువత పోలీసులపై దాడులు చేయటం వంటివి. ఇంతలో పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వం, దాని విధానాలు మన శతృవులు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు శతృవులు కాదని విడమర్చి పోరాటపథంలో ఉన్న యువతను శాంతింపచేశారు.’’
ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాక మరింత మంది రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. ఢిల్లీ బయల్దేరిన రైతాంగాన్ని నిలువరించటానికి భాష్పవాయుగోళాలు, నీటి పంపులతో డాడులు వంటి పలు ప్రయత్నాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. అయినా వీటికి వెరవకుండా రైతాంగం ఎక్కడివారు అక్కడే నిరసనకు దిగారు.
వివిధ రైతు సంఘాలతో ఏర్పాటైన కిసాన్ ముక్తి మోర్చా దేశవ్యాప్తంగా ఈ చట్టాల వలన రైతాంగానికి, ఆర్థిక వ్యవస్థకు వచ్చే నష్టాన్ని తెలియచేస్తూ ప్రచారం చేయటంలోనూ, ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమానికి అన్నిరకాల మద్దతులు సమకూర్చటంలోనూ ప్రధాన సహాయక సహాకారాలందించారని తేజ్వీర్ అన్నారు. పంజాబ్, హర్యాల్లో పెద్ద సంఘాలుగా ఉన్న ఉగ్రహాన్, దకుండాల నేతృత్వంలోని సంఘాలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం వహించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఈ ఉద్యమం విశ్వాసం కలిగించింది. ‘ఉత్తరప్రదేశ్ రైతాంగం స్థానికంగా మార్కెట్ యార్డులు లేకపోవటంతో తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది’అనే ఉదాహరణలు ఈ చట్టాలు తెచ్చిపెట్టే సమస్యలను అర్థం చేసుకోవడానికి రైతాంగానికి బాగా ఉపయోపడ్డాయి.
వివిధ సంఘాలు ఉద్యమానికి అవసరమైన నిధులను చందాల రూపంలో సేకరించాయి
‘‘గ్రామ గ్రామాన ఈ ఉద్యమం పోరాటం ఎందుకో వివరించి గ్రామస్తుల నుంచి చందాలు సేకరించాము. ట్రాక్టర్ రాలీ జరపాలంటే ప్రతి గ్రామం నుంచి 2100 రూపాయలు వసూలు చేసేవాళ్లం. ఆగస్టు 15న నిరసన పాటించటానికి అయ్యే ఖర్చు సమకూర్చుకోవటంలో భాగంగా గ్రామం నుంచి 500 రూపాయలు చొప్పున సేకరించాము. భవిష్యత్తులో ఇటువంటి ట్రాక్టర్ ర్యాలీలు జరిగినప్పుడు అయ్యే ఖర్చుల కోసం ప్రతి కుటుంబం కొంత పొదుపు చేయాలని కూడా నిర్ణయించాము.’’
నిరసన శిబిరాల వద్ద శిరోమణి గురుద్వారా ప్రభందక్ కమిటీ ఆధ్వర్యంలో ఆహారపు ఏర్పాట్లు చేశారు. ఉదాహరణకు మర్డోన్ సాహిబ్ గురుద్వారా, లక్నౌర్ సాహిబ్ గురుద్వారాలు ఈ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకొచ్చాయి. ఈ గురుద్వారాల ద్వారానే రోజుకు కనీసం 200 నుంచి 400 క్వింటాళ్ల వరకూ గోధుమ పిండి, పప్పులు, బియ్యం వంటివి సేకరించాము. ఈ విధంగా సేకరించిన నిధులు, సరుకులు తేజ్వీర్ సింగ్ సమన్వయంలో ఉన్న 200 గ్రామలకు పంపేవారు. ఆ కటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు, ఆహార కొరతకు గురికాకుండా ఈ ఏర్పాటు చేశారు.
వివిధ యూనియన్ల మధ్య అర్థవంతమైన సమన్వయం చేసుకోవటం ద్వారా ఈ శిబిరంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడిందని తేజ్వీర్ అన్నారు. ఛండీగడ్ లాంటి చోట్ల కిసాన్ ముక్తి మోర్చా సంఘటన ప్రతినిధులు దాదాపు 32 వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. వాట్సప్ గ్రూపుల ద్వారా ఆ సమస్యలు, ఉద్యమం, ప్రభుత్వ స్పందనల గురించి నిరంతరం తెలుసుకునేందుకు అవకాశం కలిగింది. ఈ ప్రయత్నం సభ్యుల్లో భరోసా కల్పించటానికి, ఐక్యత భావాలు పెంపొందించటానికి అవకాశమిచ్చాయి.
‘ఈ ఉద్యమం నీరుగారకుండా ఉండటానికి ప్రతి రోజూ కనీసం పది గ్రామాల్లో సభలు జరపాలని నిర్ణయించాము. ఈ సభల్లో అప్పటి వరకూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ కొత్త చట్టాల వలన అదనంగా తలెత్తే సమస్యలను రైతాంగానికి వివరించాము. అదనంగా ఉద్యమ నిర్వహణ కోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు, ట్విటర్ ఖాతాలు ప్రారంభించటం, అందులో ఎక్కువమంది రైతాంగాన్ని సభ్యులుగా చేర్చటం ద్వారా ధర్నా శిబిరం వద్ద జరుగుతున్న విషయాలు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి ఉపకరించాయి.’ అని తేజ్వీర్ అన్నారు.
మీడియా కూడా రైతాంగం సమస్యలను దేశం దృష్టికి తేవటంలో ముఖ్యమైన పాత్ర పోషించిందనీ, ప్రత్యేకించి పంజాబ్లోని టివి ఛానళ్లతో పాటు డిజిటల్ న్యూస్ పోర్టల్స్ అయిన ద వైర్, న్యూస్ లాండ్రీ సంస్థలు కూడా రైతాంగానికి పెద్దఎత్తున మద్దతుగా నిలిచాయని తేజ్వీర్ అన్నారు. మరోవైపున గోదీ మీడియా ఈ ఉద్యమాన్ని భ్రష్టుపట్టించేందుకు శాయశక్తులా పని చేసిందని కూడా తేజ్వీర్ అభిప్రాయపడ్డారు. టివి స్టూడిల్లోని యజమానులు తమతమ భిన్న ప్రయోజనాలకోసం రైతాంగ ఉద్యమాన్ని విచ్ఛిన్నకర ఉద్యమంగా చూపించే ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయిలో పని చేసే జర్మలిస్టులు, కెమెరామెన్లకు మా సమస్యలోని వాస్తవికత, చట్టబద్ధత అర్థం అవుతుంది. కాబట్టే వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మేము సిద్ధమాయ్యమని కూడా తేజ్వీర్ తెలిపారు. పలు మీడియా సంస్థలకు తాను స్వయంగా వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చిన అనుభవంతో ఆయన ఈ విషయం చెప్పారు. నిరసనకారులు సాధారణ జనం. పెద్దగా చదువుకున్నవాళ్లు కాదు. వాళ్లకు తెలిసిందల్లా ఒక్కటే. వాళ్లు నిరసనలు తెలుపుతుంటే గోది మీడియా నిప్పులు కక్కుతోందన్నంత వరకే అన్నారు.
ఈ ఉద్యమాన్ని సిక్కుల ఆందోళనగా పిలవవచ్చా అన్న ప్రశ్నకు స్పందిస్తూ తేజ్వీర్
‘‘ఇది సిక్కుల ఉద్యమమని చెప్పటం సత్యదూరమవుతుంది. కానీ సిక్కుమత విశ్వాసాలు ఈ ఉద్యమ నిర్మాణంలో బాగా పని చేశాయని మాత్రం చెప్పవచ్చు. హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు.’’ అని గుర్తు చేస్తూ గురునానక్ చెప్పిన మానవ సేవ భావనను ఈ ఉద్యమం ఎలా ప్రతిబింబించిందో తేజ్వీర్ వివరించారు.
ఆందోళనకారుల్లో సిక్కుమతానికి చెందిన వారే ఎక్కువ మందిగా ఉండటాన్ని ప్రస్తావించగా ఈ ఉద్యమం 1783లో బాబా భగేల్ సింగ్ 30 వేలమందితో మొఘల్ రాజధాని ఎర్రకోటపై జరిగిన దాడితో సమానమని వివరించారు. ‘‘అంతేకాక ఆ పోరాటంలో సైతం ఖురాన్ మొదలు పురాణాలు, ఇతిహాసాలు చదివేవారు. ఆ విధంగా చూసినప్పుడు ఉద్యమకారులు కూడా సర్వమత సమభావన తత్వంతోనే వ్యవహరించారు. అదో పెద్ద పోరాటం. మతగ్రంథాల పఠనం కూడా ఉద్యమరూపం. నేటి రైతాంగ పోరాటం కూడా నాటి భగేల్ సింగ్ పోరాటానికి ప్రతిరూపమే’’
ఈ ఉద్యమంలో మహిళల పాత్ర, భాగస్వామ్యం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా వ్యవసాయం కేవలం మా జీవితం, జీవనాధారం మాత్రమే కాదనీ, మా సంస్కృతిలో భాగమనీ అన్నారు. కుటుంబ ఖర్చులు జాగ్రత్తగా నిర్వహించటంలోనూ, గురుద్వారాలతో పాటు వివిధ ధార్మిక సామాజిక అవసరాలకు ఎంతెంత చందాలు ఇవ్వాలో కూడా నిర్ణయించేది మహిళలే అన్నారు.

తన కుటుంబ అనుభవాలే వివరిస్తూ తేజ్వీర్
‘‘మా అమ్మలేకోపోతే నాన్న రోజూ ఉదయాన్నే లేచి పొలం పనికి వెళ్లేవారు కాదు. నా చదువులకయ్యే ఖర్చుల కోసం మా అమ్మ పశువులు కాయటానికి వెళ్లేది. ఈ ఆందోళనల్లో పాల్గొన్న మా అమ్మ ఒకరోజు ఉపన్యాసం ఇస్తూ తాను ఓ రైతు బిడ్డననీ, మరో రైతుకు భార్యననీ, ఇంకో రైతుకు తల్లిననీ గర్వంగా చెప్పుకుంది.’’
స్వామినాథన్ కమిటీ వంటి ముఖ్యమైన నివేదికల్లో సైతం వ్యవసాయంలో మహిళల శ్రమ పాత్రను నిర్లక్ష్యం చేయటం పట్ల తేజ్వీర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ ఉద్యమంలో వివిధ కులాలకు చెందిన వారి భాగస్వామ్యం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అన్ని కులాలకు చెందిన భూమి లేని పేదలు ఈ ఉద్యమాన్ని విజయపథంవైపు నడిపించటంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రైతాంగ కులాలకు, భూమిలేని పేదలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధమే దీనికి కారణమని అంటూ ఆయన ‘‘ భూమి లేని పేదలకు పాల ఉత్పత్తుల అమ్మకం అదనపు ఆదాయ అవకాశంగా ఉంటుంది. వారి పశువులకు కావల్సిన మేత మా పొలాల నుంచే ఉచితంగా తీసుకుంటారు. ఈ కోణంలో చూసినప్పుడు వ్యవసాయక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం వారికీ ప్రయోజనం కలిగించే పోరాటమే. ఈ కూలీలే రోజుకు 200 నుంచి 300 వందల గ్రామాలలో ఐదు నుంచి ఆరువందల కిలోల పాలు సేకరించి, ఉద్యమ కేంద్రానికి పంపటంలో కీలక పాత్ర పోషించారు.’’ అన్నారు.
నిరసన శిబిరాన్ని నిర్మించటంలో జాట్లు, గుజ్జర్లు కృషి చేశారు. ఉద్యమకారులు సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో కలిసేందుకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. మరికొన్ని కులాలకు చెందిన వారు ఉద్యమానికి సహకరించలేదన్నది వాస్తవం అంటూ తేజ్వీర్ ‘‘నేను రాసి ఇవ్వగలను. రెండు కులాలకు చెందిన వారు మాత్రం రైతు ఉద్యమానికి దూరంగా ఉన్నారు. బహుశా వారు పాటించే హిందూ సాంప్రదాయాలు దానికి కారణం అయి ఉండొచ్చు. యాదవులు, రాజ్పుత్ రాణాలు ఉద్యమానికి సహకరించకపోగా సరిహద్దుల్లో మాపై దాడి కూడా చేశారు.’’ అన్నారు.
ఆదివాసీ రైతుల భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ ‘‘మధ్యప్రదేశ్కు చెందిని ఆదివాసీ రైతులు, ఉదాహరణకు మీనా సమాజ్ ఈ ఉద్యమానికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. కానీ ఇక్కడ శిబిరాలు నిర్వహించటానికే మాకు ఆర్థికంగా భారం కావటంతో వారి కోసం ప్రత్యేకంగా ధర్నా శిబిరాలు ఏర్పాటు చేసేందుకు వారి స్థానిక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు భరించే స్తోమత మాకు లేకపోయింది. పైగా కోవిడ్ కారణంగా రైలు టిక్కెట్లు కూడా దొరకలేదు.’’
తదుపరి కార్యాచరణ గురించి ప్రశ్నించగా మా డిమాండ్లు ఇంకా నెరలేదంటూ తేజ్వీర్ ‘‘స్వామినాథన్ కమిటీ నివేదిక అమలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, సరసమైన ధరలకు విత్తనాల అందుబాటులో ఉంచటం, సహకార సంఘాలకు ప్రభుత్వ మద్దతు, విస్తరణ వంటి అనేక డిమాండ్లున్నాయి. మాకు మేము స్వయం సమృద్ధత సాధించాలంటే గ్రామంలో ఉత్పత్తి అయ్యే సంపద గ్రామంలోనే అందుబాటులో ఉండాలి. నేను పంజాబ్, హర్యానా రైతుని, ఉప్పు, టీ పొడి తప్ప మా అవసరాలకు కావల్సినవన్నీ మేము గ్రామంలోనే ఉత్పత్తి చేసుకోగల సామర్ధ్యం మాకుంది. అందువలన మేము గ్రామంలో సృష్టించే ఆదాయం గ్రామంలోనే ఉండేలా చూసుకోవాలి. బయటికి వలస వెళ్లేందుకు అవకాశం ఇవ్వకూడదు. దీనికోసం సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి. సహకార వ్యవస్థ బలంగా ఉంటే కార్పొరేట్ రంగాన్ని సైతం ఎదుర్కుని నిలబడవచ్చు. ఈ కార్పొరేట్ కంపెనీలే జనాన్ని, ఆదాయాన్ని గ్రామాల నుంచి బయటికి తీసుకెళ్తున్నాయి.’’ అన్నారు.
సాక్షి చిందాలియా, దీపాంషు మోహన్, జిగ్నేష్ మిస్త్రీ, సిద్ధార్థ జి
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.