
ఢిల్లీ నుంచి భోపాల్కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఝాన్సీలోని బాబినాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ మద్దతుదారులు ఓ ప్రయాణికుడిని చితకబాదారు. సీటు మారడానికి ఆ ప్రయాణికుడు నిరాకరించినందుకే ఆయనపై దాడికి దిగారు. అయితే బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి నిరాకరించగా, ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేనే ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో సీటు మారడానికి నిరాకరించినందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ మద్దతుదారులు ఓ ప్రయాణికుడిని చితకబాదారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం, ఝాన్సీ జిల్లాలోని బాబినా అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే తన భార్య, కొడుకుతో కలిసి ఢిల్లీ నుంచి ఝాన్సీకి తిరిగి వెళ్లున్నారు. రైలులో ఎమ్మెల్యేకు సంబంధించిన సీట్లలో రెండు సీట్లు ఒకదానికొకటి పక్కపక్కనే ఉన్నాయి. మూడవ సీటు కొంచెం దూరంలో ఉంది. తమ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చోవడానికి వీలుగా వేరే సీటులో కూర్చోమని తోటిప్రయాణికుడు రాజ్ప్రకాష్ను ఎమ్మెల్యే అభ్యర్థించారు. కానీ ప్రకాష్ సీటు మారడానికి నిరాకరించారు. దీంతో, మూడు సీట్లను ఒకదానికొకటి పక్కకు చేయమని టీటీఈని ఎమ్మెల్యే అభ్యర్థించారు.
ఒక సారి బుక్ అయిపోయిన తర్వాత సీటు మార్చలేమని టీటీఈ చెప్పారు. దీని తర్వాత, ఎమ్మెల్యే మళ్ళీ అడిగినప్పుడు, ప్రకాష్కు ఎమ్మెల్యేకు వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఝాన్సీ రైల్వే స్టేషన్కు రైలు చేరుకున్నప్పుడు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే సహచరులు కొందరు రాజ్ప్రకాష్ను కొట్టారని, దాని కారణంగా అతను గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో కొంతమంది ప్రయాణికుడిని కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఫిర్యాదు చేయడానికి నిరాకరించిన బాధితుడు..
భోపాల్లోని రాణి కమలపతి రైల్వే స్టేషన్కు చేరుకున్న రాజ్ ప్రకాష్ను జీఆర్పీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని, అయితే అతను ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రోహిత్ చతుర్వేది తెలిపారు.
ఝాన్సీ రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) విపుల్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, భోపాల్ పోలీసులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, రాజ్ ప్రకాష్ అక్కడ కూడా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని వారు నిర్ధారించారని అన్నారు.
బాధితుడిపైనే ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే..
ఇదిలా ఉండగా, బాధిత ప్రయాణికుడు రాజ్ ప్రకాష్పై ఎమ్మెల్యే సింగ్ ఫిర్యాదు చేసినట్లు ఝాన్సీ జీఆర్పీ తెలిపింది.
ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం, ఇద్దరు గుర్తు తెలియని ప్రయాణికులు రైలులో కాళ్ళు చాచుకొని కూర్చున్నారని, ఇది ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఎమ్మెల్యే ఆరోపించారు. వారిని సరిగ్గా కూర్చోమని అడిగినప్పుడు, వారిద్దరూ తనతో దురుసుగా ప్రవర్తించారని, అంతేకాకుండా దుర్భాషలాడారని అన్నారు.
తాను అధికారులకు ఈ విషయాన్ని చెప్పానని అనుమానించిన ఇద్దరు వ్యక్తులు తనతో మళ్లీ దురుసుగా ప్రవర్తించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఝాన్సీ రైల్వే స్టేషన్కు రైలు చేరుకున్నప్పుడు, ఆ ఇద్దరు ప్రయాణికులు తమ స్నేహితులను స్టేషన్కు పిలిపించారని, స్టేషన్లో ఎమ్మెల్యేను స్వాగతించడానికి వచ్చిన వ్యక్తులతో కూడా వారు దురుసుగా ప్రవర్తించారని ఎమ్మెల్యే ఆరోపించారు.
ఎమ్మెల్యే దాఖలు చేసిన ఫిర్యాదుకు సంబంధించి ప్రయాణికుడు రాజ్ ప్రకాష్ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు జీఆర్పీ అధికారులు తెలిపారు.
ఎమ్మెల్యే దాఖలు చేసిన ఫిర్యాదుపై తదుపరి దర్యాప్తు కోసం ఆధారాలను సేకరించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.
అనువాదం: క్రిష్ణా నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.