
అది 1931 మార్చి 23వ తేదీ తెల్లవారుజామున మూడు- నాలుగు గంటల మధ్య భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను నాటి బ్రిటిష్ పాలకులు హడావుడిగా ఉరి తీశారు. ఆ తర్వాత తెల్లవారితే జనం తాకిడి ఎక్కువైతే ఆపలేమని, చిమ్మచీకట్లోనే ఆ ముగ్గురి మృతదేహాలను సట్లెజ్ నదీ తీరానికి తీసుకువెళ్లి దహనం చేసేశారు. ఇంకా వారి కసి తీరక ఆ మృతదేహాల్లో సగం కాలీకాలని భాగాలను తీసి సట్లెజ్ నదిలోకి విసిరివేశారు.
2025 జూన్ 26వ తేదీ సాయంసంధ్య వేళ అప్పటికి ఆరు రోజులుగా మృతుల బంధువులు తమ వారి భౌతికకాయాలను తమకు అప్పగిస్తే తాము తమ తమ స్వగ్రామాలకు తీసుకువెళ్లి తమ తమ సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారం చేసుకుంటామని పాలకులను వేడుకున్నారు. నంబాల కేశవరావు సోదరుడైతే హైకోర్టు ఆర్డర్ కూడా తీసుకుని సమర్పించాడు. అయినా సరే పాలకులు కనికరించలేదు. వారు భౌతికంగా కేశవరావు, ఆయన సహచరులను మట్టుబెట్టినా వారి శవాలను తెలుగు రాష్టాలకు పంపిస్తే ఆ ప్రభావంతో మరికొంతమంది మావోయిస్టులు కొత్తగా తయారవుతారనే భయం పాలకులను వెంటాడుతోంది.
ఈ రెండు సంఘటనలకు మధ్య దాదాపు వందేళ్ల వ్యత్యాసముంది. రాజ్య వ్యవస్థలో కూడా మార్పు ఉంది. నాడు బ్రిటిష్ పాలకులు, నేడు మనం స్వయంగా ఎన్నుకున్న మన స్వదేశీ పాలకులు. అయితే రాజ్యహింసలో, పాశవిక అణచివేతలో, అమానవీయంగా ప్రవర్తించడంలో మాత్రం తేడా లేదు.
“ఒక వీరుడు మరణిస్తే వేయి వేల వీరులు ప్రభవింతురు” అనే వాక్యం వారి చెవుల్లో మార్మోగుతుంది కాబోలు. అందుకే మావోయిస్టు నేతల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించడానికి కూడా భయపడ్డారు. ఆరు రోజుల పాటు ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ మభ్యపెట్టి చివరకు 26వ తేదీ సాయంత్రం చత్తీస్గఢ్ అడవుల్లో పోలీసులే సామూహికంగా తగులబెట్టేశారు.
నలభై ఏళ్ల కిందట తమను వదిలివెళ్లిన నంబాల కేశవరావును కడసారి చూసుకుందామన్న వారి కుటుంబసభ్యుల ఆశలు ఆవిరయ్యాయి. తమ బాబాయి ఎలా ఉంటాడో కూడా తెలియని ఆయన అన్న పిల్లలు ఒక్కసారి ఆయన్ను చూడాలని తపించారు. గత వారం రోజులుగా మీడియాలో ఆయన గురించి వస్తున్న వార్తలు విని, చూసి తమకు తాత వరసయ్యే ఆయన్ను చూడాలని ఆయన అన్న మనవళ్లు, మనవరాళ్ల ఎదురు చూపులు కూడా ఫలించలేదు.
అందుకే కాబోలు అభం శుభం తెలియని చిన్నపిల్లలు, అదే నంబాల కేశవరావు అన్న మనవళ్లు- మనవరాళ్లు అమాయకంగా “తాత చేసిన తప్పేంటి? మేము పుస్తకాల్లో చదువుకున్నట్టు అప్పడు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల కోసం ఏం చేశాడో, ఇప్పుడు అక్కడ గిరిజనుల కోసం మన తాత అలాగే చేశాడు కదా. అప్పుడు బ్రిటిష్ వాళ్లు ఆయన్ను దేశ ద్రోహి అన్నారు. ఇప్పడు మనవాళ్లు మన తాతను దేశద్రోహి అంటున్నారు” అని ప్రశ్నించారట. ఈ మాటలు విన్న తర్వాత నాకు చిన్నప్పడు మా ఊళ్లో తెల్లటి సున్నం గోడల మీద ఎర్రటి అక్షరాలతో రాడికల్స్ రాసిన వాక్యాలు గుర్తు వచ్చాయి.
“తెల్లవారు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నారు..
నల్లవారు నేడు నిన్ను నక్సలైటు అన్నారు..
ఎల్లవారు రేపు నిన్ను వేగుచుక్క అంటారు..” అప్పుడు వాళ్లు అలాగే రాస్తారులే అని అనుకున్నాను. కానీ, ఇప్పుడు అవి నిజమేనని అనిపిస్తోంది. మీకేమనిపిస్తోందో కాని నాకు అలాగే అనిపిస్తోంది. కార్పొరేట్లు అడవులని విధ్వంసం చేసి మైనింగ్ పేరుతో మొత్తం తవ్వుకుపోయి డాలర్ల కలలు పండించుకుంటారేమో కానీ, పర్యావరణం నాశనమై మరికొన్ని దశాబ్దాల తర్వాత ప్రకృతి ప్రకోపించి ఈ భూమిని భస్మీపటలం చేసిన నాడు కాని మన సమాజం కళ్లు తెరుచుకోవేమో..! అప్పుడు అందరికీ అవును ఆరోజు ఆయన అన్నది నిజమేననిపిస్తుందేమో..!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.