
సమాజంలో అన్ని తరగతుల నుంచి గౌరవాలు అందుకుంటున్న ఏకైక సంస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు నోట వచ్చే ప్రతి మాట చాలా విలువైనదిగా పరిగణించడం జరుగుతుంది. ఆదేశాల రూపంలో కాకపోయినా కేసుల విచారణ జరుగుతున్నప్పుడు ధర్మాసనాలు చేసే వ్యాఖ్యానాలు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టినాకర్షిస్తాయి. ఈ వ్యాఖ్యలు వాటిపై జరిగే చర్చలు తిలక్ మార్గ్లోని సుప్రీంకోర్టు ప్రాంగణం దాటి ప్రతిధ్వనిస్తాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు తీర్పులపట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం అది. సుప్రీంకోర్టు ఏదైనా ఒక అంశాన్ని తప్పు అని వ్యాఖ్యానించి తీర్పిస్తే ప్రజలందరూ అది తప్పే అనే బలంగా నమ్ముతారు.
అటువంటి అంతిమ తీర్పుకి వేదికగా ఉన్న సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రస్తావించిన, ప్రతిపాదించిన నిబంధనలు పక్కనపెట్టి రాజ్యాంగ ప్రమాణానికి లోబడి అనుసరించాల్సిన హేతుబద్ధ వైఖరికి భిన్నంగా దేశంలో మెజారిటీవాద అభిప్రాయంతో గొంతు కలపటం కలవర పరుస్తోంది.
ఫ్యాన్సీ ఆలోచనలు, ధర్మాశాలల గురించిన వ్యాఖ్యలు..
మే 16వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చిన కేసుల్లో చిన్న పిల్లలు, మహిళలు, అడుగు తీసి అడుగు వేయలేని వృద్ధులైన రోహింగ్యాలను మయన్మార్కు తరలించే క్రమంలో అండమాన్ నికోబార్ సమీపంలో సముద్ర జలాల్లో వదిలేశారనే ఆరోపణలకు సంబంధించిన కేసు కూడా ఒకటి ఉంది.
కేసుతోపాటు సమర్పించిన సాక్ష్యాధారాలు తగినంత బలంగా లేవన్న కారణంతో వారికి కనీస రక్షణ కల్పించేందుకు ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పు సబబా కాదా అన్న విషయంపై ఎంతైనా చర్చించవచ్చు. పిటిషనర్లకు తాత్కాలిక ఉపశమనం కల్పించే విషయంలో న్యాయస్థానాలది విచక్షణా పూర్వక అధికారమే అన్న విషయం అందరికీ తెలుసు. కానీ రిట్ పిటిషన్ గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపైనే దేశం దృష్టిని కేంద్రీకరించింది.
సుప్రీంకోర్టు ధర్మాసనం “దేశం కష్టాలలో ఉన్నప్పుడు నీకు ఇలాంటి ఫ్యాన్సీ ఆలోచనలు ఎలా వస్తాయి?”అని ప్రశ్నించింది. మూడు రోజుల తర్వాత మరో ధర్మాసనం శ్రీలంక తమిళ ప్రవాసుల గురించి వ్యాఖ్యానిస్తూ భారతదేశ ధర్మశాల కాదని చెప్పింది.
ఈ రెండు వ్యాఖ్యల సారాంశం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటి వ్యాఖ్య కాకతాళీయంగా వచ్చింది కాదు. బాధితుల తక్షణ అవసరాన్ని ఫ్యాన్సీ ఆలోచనగా సుప్రీంకోర్టు భావించింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు వరకు వచ్చినందుకు పిటిషనర్లను మందలించింది కూడా.
నిజమే దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. అంతమాత్రాన అత్యున్నత న్యాయస్థానం మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో కళ్ళు మూసుకోవడానికి సిద్ధపడుతుందా? ప్రాథమిక హక్కుల సంరక్షణ, సవాళ్లు ఎదుర్కోవడం రెండు వేరువేరు విషయాలా?
రెండో వ్యాఖ్య మరీ దారుణంగా ఉంది. న్యాయబద్ధమైన సహృదయంతో, రాజ్యాంగపు మౌలిక ఉద్దేశాలను ఆచరించడానికి బదులు సాధారణ ప్రజల్లో వ్యక్తం అయ్యే అసహనాన్ని న్యాయమూర్తులు ప్రదర్శించారు. 1951లో తయారైన అంతర్జాతీయ ప్రవాసుల ఒప్పందాన్ని భారతదేశం ఆమోదించనప్పటికీ వివిధ ప్రత్యేక సందర్భాలలో దేశంలోకి ప్రవాసులుగా వచ్చేవారి విషయంలో ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన చర్యలు నియంత్రించే అనేక అంతర్జాతీయ ఒప్పందాలు, అవగాహనలు అమలులో ఉన్నాయి.
దశాబ్దాలుగా భారతదేశం ప్రవాస టిబేటన్లకు, ఆఫ్ఘన్లకు, రోహింగ్యాలకు, శ్రీలంక తమిళులకు ఆశ్రయం ఇస్తూ వచ్చింది. ఇది కేవలం ఒక విధానం మాత్రమే కాదు, నాగరికత విలువల రీత్యా కూడా ముఖ్యమైన అంశం. ఇటువంటి ఉన్నత విలువలకు కేంద్రమైన భారతదేశాన్ని ధర్మశాల స్థాయికి దిగజార్చడం, పోల్చడం కనీస మానవ లక్షణమైన సహానుభూతి ప్రదర్శించ లేకపోవడం, మానవ విలువలు పట్ల భారతదేశానికి ఉన్న అంకితభావాన్ని పునర్వ్యాఖ్యానించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
ఈ రెండు సందర్భాలలోనూ సుప్రీంకోర్టు అనుసరించిన, ప్రదర్శించిన వ్యంగ్య వ్యాఖ్యానం, వ్యక్తం చేసిన సైద్దాంతిక దృక్కోణం న్యాయవ్యవస్థ, న్యాయ పరిపాలనకు భిన్నమైన ఉమ్మడి ఆలోచన ధోరణిని ప్రదర్శిస్తుంది. భారత రాజ్యాంగం అర్థవంతమైన, హేతుబద్ధమైన, గౌరవప్రదమైన మానవ విలువలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సమయంలో గానీ వివిధ సందర్భాలలో దానిని వ్యాఖ్యానించే విషయంలో కానీ ఎన్నడూ మూకుమ్మడి భావావేశాలకు తావు ఇవ్వలేదు.
ఫేస్బుక్ పోస్టుపై ప్రత్యేక దర్యాప్తు బృందం ..
ఫ్యాన్సీ ఆలోచనలు అన్న కోణం నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం వెనకకు మళ్ళినట్లు కనిపించడం లేదు. అశోక విశ్వ విద్యాలయానికి చెందిన అలీ ఖాన్ మహమూదాబాద్ అరెస్టును ఛాలెంజ్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ పై ధర్మాసనం వ్యవహరించిన తీరు కూడా ఇదే ధోరణిని ప్రతిబింబిస్తోంది. అలీ ఖాన్ ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్ట్ మహిళలను కించపరిచేదిగా ఉందంటూ గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించి, రాష్ట్ర నేతగా ఎదిగిన వ్యక్తి చేసిన ఆరోపణల ఆధారంగా హర్యానా పోలీసులు అశోక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న అలీ ఖాన్ మహమూదాబాద్ను అరెస్టు చేశారు. సాధారణ మనిషి ఎవరైనా ఆ పోస్ట్ చూసిన తర్వాత సదరు హర్యానా రాజకీయ నేతకు వచ్చిన నిర్ధారణకు రాలేరు.
అటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానం తక్షణ పరిశీలనకు ప్రాతిపదికగా ఉండాల్సిన అంశం ఏమిటి? సదరు ప్రొఫెసర్ను అరెస్టు చేసేందుకు వీలైన స్థాయిలో నేరం జరిగిందా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలి. ఈ కేసులో సంఘటన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన విషయం గురించి కాబట్టి న్యాయస్థానం ప్రొఫెసర్కు తాత్కాలిక వెసులుబాటు కల్పిస్తూనే సదరు పోస్టు పెట్టటం నేరమా కాదా అన్నంతవరకే తన పరిశీలనను పరిమితం చేసుకోవాలి.
న్యాయస్థానం ప్రొఫెసర్కు బెయిల్ ఇచ్చింది. కానీ చాలా కఠినమైన షరతులను కూడా విధించింది. అంతటితో ఆగలేదు, ఆ పోస్టులో ఉన్న భావావేశాన్ని, అర్థాలను, తాత్పర్యాలను, వాడిన పదజాలాన్ని అధ్యయనం చేయడానికి ఏకంగా ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రాజ్యాంగానికి భాష్యం చెప్పే సుప్రీంకోర్టుకే ప్రొఫెసర్ అలీ ఖాన్ ప్రయోగించిన పదజాలాన్ని అర్థం చేసుకోవటం సంక్లిష్టంగా కనిపించినప్పుడు సాధారణ పోలీసు అధికారులు ఆ పదజాలాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు? దీనికంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే సుప్రీంకోర్టుకు కూడా అంతు పట్టని విషయాన్ని హర్యానాలో ఒక సాధారణ సర్పంచి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా అర్థం చేసుకోగలిగారు! ఇది నేరం నేరపూరిత చర్య అని ఎలా అభియోగం మోపగలిగారు?
అలీ ఖాన్ మహమూదాబాద్ కేసుని పరిశీలిస్తే హౌస్ ఆఫ్ లార్డ్స్ ముందు విచారణకు వచ్చిన లివర్సిడ్జ్ వర్సెస్ అండర్సన్ కేసు గుర్తుకొస్తుంది. అందులో ప్రయోగించిన “సెక్రటరీ ఆఫ్ స్టేట్కు విశ్వసించదగిన బలీయమైన కారణం ఉంటే” అన్న వాక్యాన్ని వ్యాఖ్యానించేటప్పుడు “బలియమైన కారణం ఉన్నదని సెక్రటరీ ఆఫ్ స్టేట్ భావిస్తే” అని కూడా అనే అర్థంలో కూడా చూడవచ్చు అని హౌస్ ఆఫ్ లార్డ్స్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యానంతో విభేదిస్తూ లార్డ్ ఆట్కిన్ ఎలీస్ ఇన్ ద వండర్లాండ్ కథలో ఒక అంశాన్ని ప్రస్తావిసస్తూ:
“ఈ రకమైన నిర్మాణాన్ని సమర్ధించుకోగలిగిన అధికారం సామర్థ్యం నాకు తెలిసి ఒకే ఒక్కరికి ఉన్నది. నేను హంప్టి డంప్టి అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు అది కూడా వ్యంగ్యంగా ఉపయోగించినప్పుడు నా అభిప్రాయం ఆ పదాలలో వ్యక్తం చేసిన అభిప్రాయం మాత్రమే. ఎక్కువ కాదు తక్కువ కాదు. ఈ పదాలకు వేరే అర్థాలను మీరు సమకూర్చకోగలుగుతారా అన్నది ప్రధాన ప్రశ్న. హంప్టీ డంప్టి అంటే సర్వాధికారి అన్నదే అర్థం. దానికి మరో అర్థం లేదు. ఒక మనిషికి ఉంటే అనే పదానికి ఒక మనిషికి తనకు ఉన్నది అని భావిస్తే అన్నదే సరైన అర్థం అనుకుంటే వీలు కాదు. నా అభిప్రాయంలో ఒకరు ప్రయోగించిన పదాలకు వేరొకరు ఎవరికి తోచిన అర్ధాన్ని వాళ్ళు సమకూర్చుకోకూడదు. అండర్సన్ కేసును ఈ సూత్రం ప్రాతిపదికనే నిర్ణయించాలి” అని స్పష్టం చేశారు.
దాన్ని అలా ఉంచితే అలీ ఖాన్ మహమూదాబాద్ కేసులో ధర్మాసనం వ్యాఖ్యానించిన తీరు ఆందోళనకరంగా ఉంది. సదరు పోస్టు ఒక హెచ్చరికగా కూడా పెట్టి ఉండవచ్చు అని వ్యాఖ్యానిస్తూనే “విశ్లేషణాత్మక సామర్థ్యం కలిగిన వారు కొన్ని పదాలకు ద్వంద్వ అర్ధాలు ఉంటాయని ఉత్తరాదిన ప్రయోగించే కొన్ని పదాలు దక్షిణాది వాళ్లను లక్ష్యంగా చేసుకొని ప్రయోగించినట్లు భావించబడతాయని” సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
అలీ ఖాన్ బెయిల్ పిటిషన్ పై జరుగుతున్న వాదనలు ముగింపుకు వచ్చేసరికి ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రొఫెసర్కు మద్దతుగా వివిధ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్న విద్యార్థులు ఆందోళన చేస్తున్న విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు వాళ్లేమీ మాకు అందనంత దూరంలో లేరు. వాళ్ళతో ఎలా వ్యవహరించాలో కూడా మాకు తెలుసు అని హెచ్చరించింది.
బోధన రంగంలోని విద్యార్థులు, అధ్యాపకులు మేధావులు రాయాలి. ప్రశ్నించాలి. అది వారి హక్కు మాత్రమే కాదు రాజ్యాంగం వారిపై పెట్టిన గురుతర బాధ్యత. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఏ ప్రకారం మానవీయతను సంస్కరణను శాస్త్రీయ ఆలోచన విధానాన్ని ప్రశ్నించే స్ఫూర్తిని పెంపొందించాలి. అటువంటి వారి నోరుమూయించే ప్రయత్నం చేయడమంటే నేరుగా రాజ్యాంగంపై దాడి చేయడమే. రాజ్యాంగంపై చేసే దాడి అనివార్యంగా ఉన్నత విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం సాగే ప్రయత్నాలపై జరుగుతున్న దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది.
సహజ న్యాయ సూత్రాలను సమర్థవంతంగా అమలు చేసే ఏకైక అంతిమ వేదిక సుప్రీంకోర్టు అని ప్రజల్లో ఉన్న విశ్వాసమే సుప్రీంకోర్టుకు గుర్తింపు, గౌరవం, అస్తిత్వం. అటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మానవీయతను, మానవీయ కోణాన్ని, ఆర్ద్రతను పక్కనపెట్టి వీధుల్లో చెలరేగే భావావేశాలకు ప్రభావితం కావడం ఆందోళన కలిగిస్తుంది. తీర్పులు కచ్చితంగా న్యాయం- చట్టం పరిధికి లోబడి ఉండాలి. కోర్టునాశ్రయించే ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడే వేదికగా న్యాయస్థానాలు ఉండాలి. లేనిపక్షంలో న్యాయవ్యవస్థ మౌలిక విలువల విషయంలో తీవ్రమైన రాజీలకు దారితీస్తుంది. ఈ సందర్భంగా 1820లో హౌస్ ఆఫ్ లార్డ్స్లో జరిగిన వాదనల్లో కేరోలిన్ రాణి తరఫున వాదించిన హెన్రీ బ్రౌహాం వ్యాఖ్యలను ప్రస్తావించుకోవాలి. కేరోలిన్కు రాణి అనే బిరుదుని రద్దు చేయాలన్న ప్రతిపాదనపై జరిగిన వాదోపవాదాలు ఇవి.
“గౌరవ న్యాయమూర్తులు ఒక నిమిషం ఆగాలని మనవి చేస్తున్నాను. మీరు కొండ చర్యలకు అంచున ఉన్నారు. రాణికి వ్యతిరేకంగా తీర్పునిస్తే మీరు కూడా కింద పడతారు. బహుశా మీరు ఇచ్చే తీర్పు చరిత్రలో తిరిగి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆచరణకు వీలుగానే ఏకైక తీర్పుగా మిగిలిపోతుంది. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడండి ప్రభువులారా. మిమ్మల్ని మీరు కాపాడుకోండి దేశాన్ని కాపాడండి. ఈ దేశానికి మీరు ఆభరణాలు లాంటివారు. ప్రజల నుంచి వేరుపడితే మీకు గౌరవం పెరగదు. పెకలించబడిన చెట్టుకు మొక్కకు పూలు పోయావు కదా. తెగిపడిన కొమ్మకు కాయలు కాయవు కదా.”
అనువాదం: కొండూరి వీరయ్య
వ్యాస రచయిత అంతర్జాతీయ గుర్తింపు కలిగిన న్యాయవాది. న్యాయశాస్త్ర పండితుడు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.