
Reading Time: 3 minutes
‘‘ఈడీ హద్దులు దాటుతోంది. దేశ సమాఖ్య స్వభావాన్ని గంగపాలు చేస్తోంది’’ అని తమిళనాడు లిక్కర్ స్కాం విషయంలో జరుగుతున్న వాదనల్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా చివాట్లు పెట్టింది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ విభాగం చర్యలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష నేతలను లొంగదీసుకోవడానికి పావుగా ఈడీని వాడుతున్న సందర్భంలో ఈడీ చర్యలపై స్టే విధించటానికి సుప్రీం కోర్టు నిర్ణయించుకోవటం ప్రాధాన్యత సంతరించుకున్నది.
కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలో పని చేసే ఈడీ వ్యవహారశైలి గురించిన విచారకర సందర్భం గురించి వ్యాఖ్యానిస్తున్న సుప్రీం కోర్టు ఒకప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం రూపంలో ఈడీకి కోరలు తెచ్చింది కూడా ఇదే అత్యున్నత న్యాయస్థానం అని గుర్తుంచుకోవడం అవసరం.
మనీలాండరింగ్ చట్టపు రాజ్యాంగబద్ధతను సమీక్షించేందుకు సిద్ధం అంటున్న సుప్రీం కోర్టు
ఒకప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉన్నదని ఢంకా భజాయించిన సుప్రీం కోర్టు ప్రస్తుతం ఈ చట్టాన్ని సమీక్షించాలని ప్రతిపాదిస్తోంది. 2022 జూన్ 27న తీర్పునిచ్చిన త్రిసభ్య ధర్మాసనం ఈ చట్టం కింద ఈడీకి అపరిమిత అధికారాలు కట్టబెట్టడాన్ని సమర్ధించింది. జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సిటి రవికుమార్లు ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ చట్టాన్ని, చట్టంలో వివిధ అంశాలను సవాలు చేస్తూ 241 పిటిషన్లు సుప్రీం కోర్టు ముందు దాఖలయ్యాయి. వీటిలో ఒకసారి నేరారోపణ జరిగిన తర్వాత నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యత సదరు నిందితుడితే అన్న విషయంతో పాటు దర్యాప్తు పేరుతో ఈడీకి అంతులేని అధికారాన్ని కట్టబెట్టడాన్ని కూడా ఈ పిటిషనర్లు సవాలు చేశారు. నిందుతుల ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, సోదాలు చేయటం, సోదాలు, దర్యాప్తు సమయంలో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగించుకోవడం వంటి విషయాల్లో కూడా ఈ చట్టం ఈడీకి విశేషాధికారాలు కట్టబెట్టింది. ఈ పిటిషన్ల విచారణ అనంతరం త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన 547 పేజీల తీర్పులో ఈ చట్టం రాజ్యాంగబద్ధమేనని తేల్చింది. ఎటువంటి వివక్షకు తావు లేదని కూడా తేల్చింది.
ఇంకా గమ్మత్తుగా ఆరోపణలు ఈసిఐఆర్(ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్పర్మేషన్ రిపోర్ట్) సాధారణ కేసుల్లో ఎఫ్ఐఆర్ లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఈ తీర్పులో స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఎఫ్ఐఆర్ కాపీ పొందటం ప్రాథమిక న్యాయ సూత్రాల్లో ఒకటిగా ఉంటూ వచ్చింది ఇప్పటి వరకూ. కానీ మనీలాండరింగ్ చట్టం కింద మాత్రం అటువంటి ప్రాథమిక న్యాయ సూత్రాలు కూడా పాటించనవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పింది. కేవలం ఆరెస్టు చేసేటప్పుడు ఏయే విషయాల ఆధారంగా అరెస్టు చేస్తున్నారో చెప్తే సరిపోతుందని ఈ తీర్పు చెప్తోంది.
ఈ తీర్పులో ప్రాథమిక, సహజన్యాయ సూత్రాల ఉల్లంఘన గురించి పెద్దఎత్తున విమర్శలు వచ్చిన తర్వాత ఎట్టకేలకు 2022 ఆగస్టులో ఈ తీర్పును సమీక్షించేందుకు సుప్రీం కోర్టు సిద్ధమైంది.
అక్టోబరు 2023లో సంజయ్ కిషన్ కౌల్ నాయకత్వంలోని ధర్మాసనం మనీ లాండరింగ్ కింద ఈడికి ఇచ్చిన అధికారాలును ఖరారు పరుస్తూ ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని చర్చకు పెడతామని చెప్పారు. ఈ ప్రతిపాదన పట్ల సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మండిపడ్డారు. ఎవరో కొందరు ఫిర్యాదు చేశారన్న కారణంతో ఆధారాలు లేకుండా ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించరాదని వాదించారు. ఈ వాదనను బట్టి ప్రస్తుతం ఈడీ సాగిస్తున్న స్వైరవిహారాన్ని కొనసాగించేందుకు మోడీ ప్రభుత్వం సుముఖంగా ఉన్నదన్నది స్పస్టం.
ఎట్టకేలకు జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ ఉజ్వల్ భుయాన్, జస్టిస్ సిటి రవికుమార్ల నేతృత్వంలో ఈ చట్టం కింద ఈడీకి ఉన్న విస్తృతాధికారాలను సమీక్షించటానికి ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జనవరి 2025లో జస్టిస్ సిటి రవికుమార్ పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో జస్టిస్ కోటీశ్వర్ సింగ్ను ఈ త్రిసభ్య ధర్మాసనంలో సభ్యునిగా నియమించబడ్డారు. మే 7న తొలిసారి రివ్యూ పిటిషన్లు విచారణకు చేపట్టిన ధర్మాసనం సమీక్షలో భాగంగా చర్చకు చేపట్టాల్సిన విషయాలను పునఃప్రతిపాదించాలని పిటిషనర్లు, సొలిసిటర్ జనరల్స్ను ధర్మాసనం కోరింది.
సాక్ష్యాధారాలు లేకుండానే సోదాలు అరెస్టులు, ఆస్తుల జప్తులు చేస్తున్న ఈడీ: సుప్రీం కోర్టు
మే ఏడో తేదీ ఈ త్రిసభ్య ధర్మాసనం తొలి సిట్టింగ్కంటే రెండ్రోజుల ముందు మరో ఈడీ కేసును విచారణకు చేపట్టిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎటువంటి ఆధారాలు లేకుండానే ఈడీ ఆరోపణలే ప్రాతిపదికగా అరెస్టులు చేయటం, ఆస్తుల జప్తులకు పాల్పడుతోందని ఈడీ వ్యవహార శైలిలో ఇది ఓ ధోరణిగా కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. ఉజ్వల్ భుయాన్, అభయ్ ఓకాల నేతృత్వంలోని ధర్మాసనం చత్తీసగఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హయాంలో జరిగిందంటున్న లిక్కర్ స్కాంకు సంబంధించిన పిటిషన్ను విచారణకు చేపట్టింది. 2024 ఏప్రిల్లో చత్తీస్గఢ్కు చెందిన ఓ వ్యాపారవేత్త మనీలాండరింగ్కు పాల్పడ్డారంటూ ఈడీ నమోదు చేసిన కేసుపై దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో కూడా సుప్రీం కోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేసింది.
‘‘ప్రభుత్వం తరఫున కేసులు దాఖలు చేసేటప్పుడు కోర్టు ముందుకు తెచ్చే సాక్ష్యాధారాల నాణ్యత మెరుగ్గా ఉండేట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనా, ప్రభుత్వ ఏజెన్సీలపైనా ఉంది. ప్రాథమిక ఆధారాలున్నాయని ఏజెన్సీ భావించిన ప్రతి కేసులోనూ సంబంధిత సాక్ష్యాధారాలను కోర్టులో నిరూపించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది’’ అని ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు ధర్మాసనం సూచించింది. సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన రోజుకు ముందు రోజు అంటే 2024 ఆగస్టు 6న పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన ప్రభుత్వం 2014- 2024 మధ్య పదేళ్లలో మనీలాండరింగ్ చట్టం కింద 5297 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇప్పటి వరకూ ఈ కేసుల్లో 40 కేసుల్లో శిక్షణలు పడితే ముగ్గురు నిర్దోషులుగా బయటకు వచ్చారు. నవంబరు 2024లో 73 ఏళ్ల తృణమూల్ నేత పార్దాఛటర్జీని ఎటువంటి విచారణ లేకుండా కేవలం ఆరోపణల ప్రాతిపదికనే రెండున్నరేళ్ల పాటు జైల్లో ఉంచటం పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో మీరు చేసే వాదనల ఆధారంగా శిక్షలు పడుతున్నది నామమాత్రమేనని సుప్రీం కోర్టు సొలిసిటర్ జనరల్కు గుర్తు చేసింది.
నోరు మూసుకుంటారా ఈడీని ఇంటికి పంపమంటారా?
పై వివరాలు కేంద్ర ఆర్థికశాఖ పార్లమెంట్కు సమర్పించటానికి ఓ ఏడాది ముందు పార్లమెంట్లో జరిగిన చర్చలో పాల్గొంటూ బీజేపీ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖిలు ‘నోరు మూసుకుంటారా లేక ఈడీని ఇంటికి పంపమంటారా’ అని బహిరంగంగానే హెచ్చరించారు.
ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లో అధికార పార్టీ ఎంపీ మీనాక్షి లేఖి ప్రతిపక్ష ఎంపీలకు చేసిన హెచ్చరిక 2022లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించిన వివరాలతో ఏకీభవిస్తుంది. వివిధ న్యాయస్థానాల్లో మనీ లాండరింగ్ చట్టం కింద విచారణ జరుగుతున్న కేసులకు సంబంధించిన వివరాలను ఇండియన్ ఎక్స్ప్రెస్ సేకరించింది. ఈ వివరాల ప్రకారం యుపీఏ హాయంలో నమోదైన ఈడీ కేసుల కంటే బీజేపీ హయాంలో నాలుగు రెట్లు పెరిగాయని విశ్లేషించింది.
గత పదేళ్లలో మనీలాండరింగ్ కేసుల విషయంలో ఈడీ అనుసరిస్తున్న వ్యవహారశైలి గురించి సుప్రీం కోర్టు పదేపదే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈడీ తన పరిధులు ఉల్లంఘిస్తోందా అన్న ప్రశ్న లేవనెత్తింది. ఆగస్టు ఏడో తేదీన ఈ కేసులో తదుపరి విచారణ జరగనున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.