
ఇప్పటికే అమలులో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టబోతోంది. ఇవి ప్రధానంగా కీలక లేదా సంఘటిత(ఫార్మల్) రంగానికి వర్తిస్తాయి. భారత శ్రామికశక్తి ఎక్కువ భాగం వీటి పరిధిలోకి రారు.
2019, 2020లో నాలుగు కొత్త కార్మిక కోడ్లను కేంద్ర కార్మిక- ఉపాధి మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న 29 చట్టాలను విలీనం చేసి వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యకరమైన పని పరిస్థితులకు సంబంధించిన నాలుగు కోడ్లుగా రూపొందించారు.
అయితే, పార్లమెంట్లో ఆమోదించబడి ఐదేళ్లు దాటుతున్నా ఈ లేబర్ కోడ్లు ఇంకా నోటిఫై చేయబడలేదు. దీనివల్ల అమలులోకి రాలేదు. భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్)తో సహా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఇందులోని కొన్ని నిబంధనలను వ్యతిరేకిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశాయి.
ఎక్కువ యాజమాన్య సంస్థలు కోడ్లపై మౌనం వహిస్తూనే, తమ అసంతృప్తిని ప్రైవేట్గా వ్యక్తం చేశారు. కొత్త లేబర్ కోడ్ల ప్రభావం స్వేచ్ఛా మార్కెట్కు పూర్తిగా అనుకూలంగా ఉండదని వారు అంటున్నారు.
మరికొన్ని నిబంధనలను రూపొందించే క్రమంలో రాష్ట్రాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ అధికారులు చెపుతున్నారే తప్ప కోడ్ల అమలు ఆలస్యం కావడానికి గల నిర్దిష్ట కారణాలను వ్యక్తం చెయ్యడం లేదు. కొన్ని నెలల క్రితం ఒక అధికారిక ప్రకటనలో కొద్దిమంది మినహా అన్ని ప్రధాన రాష్ట్రాలు, నియమాలను రూపొందించే కసరత్తును పూర్తి చేశాయని పేర్కొన్నారు.
లేబర్ కోడ్లు ఆమోదం పొందిన సమయంలోనే మూడు కొత్త వ్యవసాయ చట్టాలు కూడ అమలులోకి వచ్చాయి. వ్యవసాయ చట్టాలకు రైతుల నుంచి ఎదురైన తీవ్ర వ్యతిరేకత, వారు సుదీర్ఘకాలం చేసిన నిరసనల ఫలితంగా ఆ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే కార్మిక కోడ్ల విషయంలో ప్రధాన కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో కార్మికవర్గంలో తీవ్రస్థాయిలో నిరసనలను రగిలించలేదు. కార్మిక సంఘాల నిరసనలు ధర్నాలు, ప్రదర్శనలు, కొన్ని సాధారణ సమ్మెలు ఇంకా అక్కడక్కడా ఆందోళనలు వంటి సాధారణ కార్యకలాపాలకు పరిమితం అయ్యాయి.
సాధారణంగా కార్మిక వర్గానికి సంబంధించిన అంశాలు త్రైపాక్షిక పద్ధతిలో చర్చించబడతాయి. నాలుగు కొత్త కోడ్ల సూత్రీకరణ అనేది ఒక ముఖ్యమైన చట్టపరమైన చర్య. వీటి వలన సామాజిక ఆర్ధికంగా అంశాలలో భారీ పర్యవసానాలు ఉండబోతున్నందున వీటి వల్ల మన అందరి జీవితాల పైనా ప్రభావం ఉంటుంది.
ప్రభుత్వం లేబర్ కోడ్లను రూపొందించే ముందు తమను సంప్రదించింది. కానీ వాటిని ఖరారు చేసేటప్పుడు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాలుగు కార్మిక కోడ్ల సూత్రీకరణకు మొత్తం ప్రక్రియ‘వ్యాపారం చేయడంలో సౌలభ్యం’(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అనే అంశం ఆధారంగా జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఇది యజమానుల బాధ్యతను, భారాన్ని తగ్గిస్తుంది.
దేశంలో త్రైపాక్షిక సంప్రదింపులకు సంబంధించిన అతిపెద్ద, అతి ముఖ్యమైన వేదిక ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్(ఐఎల్సీ). నియమాలను అనుసరించి 2015 వరకు ఐఎల్సీ సమావేశాలు రెండేళ్లకి ఒకసారి జరిగేవి. ఆ తర్వాత జరపటం పూర్తిగా మానేశారు. కార్మిక కోడ్ల వంటి ముఖ్యమైన నిర్ణయాలను చర్చించడానికి లేదా ఆమోదించడానికి కూడ 2015 నుంచి ఇప్పటివరకు ఐఎల్సీ సమావేశం జరపకపోవటం చాలా ఆశ్చర్యకరం. అంతేకాకుండా, పార్లమెంటు సమావేశాల్లో కూడా కార్మిక కోడ్లపైన తగినంత చర్చ జరగలేదు. కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా కార్మికవర్గాన్ని ఏకం చేయడంలో, ఈ విషయంపై ఐఎల్సీ సమావేశాన్ని ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడంలో కార్మిక సంఘాలు కూడా విఫలమయ్యాయి.
కార్మిక కోడ్లకు కార్మికవర్గం వ్యతిరేకత..
కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన గుర్తింపు ఎందుకు రాలేదు?
దీనికి సమాధానం – నాలుగు కార్మిక కోడ్లు. కానీ ప్రస్తుతం అమలులో ఉన్న కార్మిక చట్టాలు సాధారణ భారతీయ కార్మికుల జీవితాలలో ఎటువంటి తేడాలు చూపడం లేదు. భారతీయ కార్మిక మార్కెట్ ఎక్కువగా అసంఘటిత రంగంలో(ఇన్ఫార్మల్)ఉంది. కనీస వేతనాల చట్టం వంటివి మినహా కార్మిక చట్టాలలో ఎక్కువ భాగం అసంఘాటిత కార్మికులకు వర్తించవు.
భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగుల రాష్ట్ర బీమా(ఈఎస్ఐ) ప్రయోజనాలను పొందటానికి కొన్ని నిబంధనలు రూపొందించబడ్డాయి. వాటి ప్రకారం ఒక కార్మికుడికి ఈపీఎఫ్,ఈఎస్ఐలకు అర్హత ఉంటేనే, ఆ కార్మికుడిని సంఘటిత కార్మికుడిగా పరిగణిస్తారు. మిగిలిన వారందరు అసంఘాటిత కార్మికులే. అంతర్జాతీయ నిర్వచనం ప్రకారం సామాజిక భద్రత లేకుండా పనిచేసే వారందరూ అసంఘాటిత కార్మికుల పరిధిలోకి వస్తారు. దానికి అనుగుణంగానే మన దగ్గర కూడ నిర్వచించారు.
ఫార్మల్ రంగంలో కూడా పెద్ద సంఖ్యలో అనధికారిక కార్మికులను నియమిస్తున్నారనే విషయాన్ని గమనించాలి. కార్మికులను పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు లేదా కాజువల్ విధానంలో తీసుకోవటం ద్వారా ఇది జరుగుతోంది. ఉదాహరణకు, అన్ని నిర్మాణ సంస్థలు అధికారికమైనవే. కాని వారు ఉపయోగించే కార్మికులు దాదాపు పూర్తిగా అనధికారికంగా ఉంటారు.
అధికారిక లెక్కల ప్రకారం, అన్ని రంగాల కార్మికులలో 52% మంది స్వయం ఉపాధి కలిగి ఉన్నారు. వీరిలో వేతనం చెల్లించని కుటుంబ కార్మికులు(యుఎఫ్ఎల్) కూడ ఉన్నారు. ఇటీవలి సంవత్సరాలలో గిగ్, ప్లాట్ఫాం కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గిగ్, ప్లాట్ఫాం ఆర్ధిక వ్యవస్థలో, ఈ కార్మికులను ఉద్దేశపూర్వకంగానే కార్మిక చట్టాల రక్షణ చట్రం బయట ఉంచటం ద్వారా ఉపాధి సంబంధాలకు స్పష్టమైన నిర్వచనం ఉండదు.
వాస్తవ సంఖ్యల పరంగా చూస్తే దీని అర్థం ఏంటి?
నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్ఎస్ఎస్), పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం, 2024లో భారతీయ కార్మిక శక్తి 61 కోట్లు. వారిలో 93% అనధికారిక కార్మికులు అయితే, భారతదేశంలో అనధికారిక కార్మికుల సంఖ్య 56.7 కోట్లు.
ఈ 56.7 కోట్లలో, 58% మంది స్వయం ఉపాధి, అంటే యజమాని-ఉద్యోగుల సంబంధం లేనందున వారు కార్మిక భద్రత చట్టాల పరిధిలోకి రారు. అంటే సుమారు 35.4 కోట్ల మంది. మిగిలిన 26.6 కోట్ల అనధికారిక కార్మికులు వేతనాలు పొందుతున్నారు. కనీస వేతనాల చట్టం, 1948 పరిధిలోకి వస్తారు.
కొత్త కార్మిక కోడ్లలో, వేతనాలపై కోడ్, సామాజిక భద్రతపై కోడ్లోని కొన్ని భాగాలు మాత్రమే అసంఘటిత కార్మికులకు వర్తిస్తాయి. మిగిలిన కోడ్లు ప్రధానంగా సంఘటిత రంగానికి వర్తిస్తాయి. అంటే సుమారు 61 కోట్ల మొత్తం శ్రామిక శక్తిలో 5 కోట్ల కంటే తక్కువ మందికి ఈ కోడ్లు వర్తిస్తాయి. దీని సారాంశం, కొత్త కార్మిక కోడ్లు ఇప్పటికే ఉన్న 29 చట్టాలను ఏకీకృతం చేస్తాయి. వీటిలో ఎక్కువ భాగం అధికారిక రంగానికి పరిమితం చేయబడ్డాయి. దీని అర్థం, స్వాతంత్ర్యం నుంచి కూడ చాలా మంది కార్మికులు కార్మిక చట్టాల పరిధికి వెలుపల ఉన్నారు. ఫలితంగా, అసంఘటిత కార్మికులలో ఎక్కువ భాగం పైన కొత్త కార్మిక కోడ్ల అమలు పెద్దగా ప్రభావం చూపదు.
(కింక్షుక్ సర్కార్, గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. సంతోష్ మెహ్రోత్రా న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్.)
అనువాదం : పద్మశ్రీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.