
గతంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో హిస్టరీ స్కాలర్గా వున్న ఉమర్ను తప్పుడు సాక్ష్యాలతో ఏకపక్షపు ఆరోపణలతో బూటకపు కేసులో ఇరికించారు. ఆ తర్వాత ఢిల్లీలోని తీహార్ జైల్లో నిర్బంధించారు. సెప్టెంబర్ వస్తే ఉమర్ఖలీద్ను జైల్లో వేసి ఐదేళ్ళు పూర్తవుతుంది.
అయితే, ఉమర్ ఖలీద్ ఇటీవల పంపించిన లేఖ చాలా ఆసక్తికరంగా వుంది. తన లేఖలో ఉమర్ – ఫ్యోదోర్ దోస్తోవ్ స్కీ రచించిన ‘ది హౌస్ ఆఫ్ ది డెడ్’ని పేర్కొన్నారు. నాలుగేళ్ళపాటు సైబీరియన్ జైల్లో చేతులకూ, కాళ్ళకూ సంకెళ్ళతో తాను గడిపిన జీవితం ఆధారంగా దోస్తోవ్ స్కీ ఈ నవలను రాశారు. అప్పుడు దోస్తోవ్ స్కీని అత్యంత ప్రమాదకరమైన దోషుల్లో ఒకడిగా పరిగణించారు. ఈరోజు ఆయనను గొప్ప రచయితల్లో ఒకరిగా పేర్కొంటున్నాం. జీవిత సారాంశాన్ని ఇతర రచనల కంటే “ది బ్రదర్స్ కరమజోవ్”, “క్రైం అండ్ పనిష్మెంట్” గొప్పగా చిత్రీకరిస్తాయని కొంతమంది నమ్ముతారు.
“మనం బతికి ఉన్నంత మాత్రాన జీవిస్తున్నట్లు కాదు. చనిపోయినంత మాత్రాన సమాధుల్లో వుండిపోము” అనే నవలలోని భాగాన్ని ఉమర్ లేఖలో పేర్కొన్నారు.
“ఆ నవల వచ్చి 150 ఏళ్ళు గడిచిపోయింది. ప్రపంచం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అయినా గానీ చాలా సందర్భాల్లో తీహార్ జైల్లో నా చుట్టూ వున్న పరిస్థితులని, జరుగుతున్న విషయాలని ఆయన వర్ణిస్తున్నాడనిపించింది” అని ఉమర్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వెలువడిన అనేక జైలు డైరీల్లో పేర్కొన్నట్లుగానే, ఉమర్ మిగతావాటి కంటే ఎక్కువగా పదేపదే ఆలోచిస్తున్న విషయం “కాల స్వభావం” ఏంటన్నది. నవలాకారులు కాల స్వభావంతోనూ, జ్ఞాపకశక్తితోనూ ఎప్పుడో ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా మాసెల్ ప్రూస్ట్ రచించిన “À la recherche du temps perdu(Remembrance of Things Past or In Search of Lost Time)”లో ‘గురుత్వాకర్షణ పరంగా ఎక్కువ సాంద్రత కలిగిన వస్తువుల ద్వారా స్థలాన్ని అనుసరించి కాలం అనేది ఒంపు తిరిగే మరొక అంశం’ అని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెప్పారు. అన్ని భౌతిక దృగ్విషయాలను వివరించగలిగిన గ్రాండ్ యూనిఫైడ్ థియరీని వివరించే క్రమంలో శాస్త్రవేత్తలు సబ్-అటామిక్ పార్టికల్స్ని కాలంలో వెనక్కి పంపుతున్నారు. తత్వవేత్తలేమో – ఘటనలని క్రమబద్ధీకరించడంలో కాలం మనకు సూచిస్తుందా, లేక మనమే కాలాన్ని నిర్మిస్తామాని తర్కిస్తారు. ఇక సంగీతకారులు మైల్స్ డేవిస్ ఆల్బం ‘కైండ్ ఆఫ్ బ్లూ’లాగా కాలానికి లోపలా బైటా తేలుతూ వుంటారు.
ఉమర్ తీవ్ర నిరాశతో లేఖలో తనకిక ఆశ లేదన్నారు. దీనికి అతన్ని తప్పు పట్టలేం. ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ, అతనికి బెయిలివ్వడానికి నిరాకరిస్తోంది. నరెంద్రమోదీ ప్రధానిగా వున్నంతకాలం అతనికి జైల్లోనే వుంచాలనుకొంటున్నారనేది స్పష్టం. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాళ్ళకు, అందరు ముస్లింలకు అతని కేసు ఒక ఉదాహరణ. ప్రాథమిక హక్కు వాక్స్వాతంత్య్రాన్ని మీరు ఎంత తక్కువగా అయినా సరే ఉపయోగించుకోడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం మిమ్మల్ని అరెస్టు చేసి, దూరంగా విసిరేస్తుంది.
‘అధికారం’ పాల్పడే దురాగతాలకు వ్యతిరేకంగా ఉమర్ చాలా కాలం నుంచీ నిజాలు మాట్లాడుతూనే వున్నారు. 2016లో జేఎన్యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం కావడం గురించి మాట్లాడారు. 2018లో ఎల్గార్ పరిషత్ ర్యాలీలో అతను ‘రెచ్చగొట్టే’ ప్రసంగం చేసిన అనంతరం మతఘర్షణలు చెలరేగాయని ఆరోపించారు. 2019-2020లో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా షహీన్ బాగ్లో జరిగిన శాంతియుత నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. సీఏఏని తమ సమూహానికి వ్యతిరేకంగా ప్రయోగిస్తారని ముస్లిం మహిళలు ఆందోళన చెందారు. (అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వకర్మ ఇటీవల ముస్లింలను- వాళ్ళు బెంగాలీలు అయినా కాకపోయినా- బంగ్లాదేశ్లోకి తరిమేసిన చర్యలు అలాంటివే. అల్పసంఖ్యాకులైన నివాసితులను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వెంటాడడం అలాంటిదే.)
స్వేచ్ఛా మానవులు-అసలు మనుషులు..
జీవితాన్ని అర్థం చేసుకోవడంలో స్వేచ్ఛా మానవునికి, జైల్లో మనిషికి వుండే తేడాను ఉమర్ నిర్వచించారు. స్వేచ్ఛా మానవుడు జీవిత ప్రపంచంలో చిక్కుకుపోయాడు. కానీ ఖైదీ విషయంలో “అతనికి కూడా జీవితం వుంది- జైలు ఇచ్చిన జీవితం. నేరస్తుడు ఎవరైనా కానీ, శిక్ష ఎలాంటిదైనా కానీ, ఇదంతా తన జీవితంలో భాగమని భావించి సానుకూలంగా ఈ జీవితాన్ని అంగీకరించలేక పోతున్నాడు. శిక్ష పడిన ప్రతి వ్యక్తీ తన చోటు ఇది కాదని, కొద్దికాలం ఉండడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని భావిస్తాడు.” అందువల్ల ఈ అనిశ్చితస్థితి కారణంగా కాలాన్ని గడపడం కష్టమవుతుంది. ఉమర్-కాలం మొత్తాన్నీ గంపగుత్తగా చూడకుండా కోర్టు తేదీల మధ్య వుండే భాగాలుగా గడపడం నేర్చుకున్నారు.
అక్కడ జైల్లో 29 ఏళ్లుగా వున్న ఖైదీ గురించి ఉమర్ ప్రస్తావించారు. (ఇరవై ఏళ్ల వయసులో వచ్చిన ఆ ఖైదీకి ఇప్పుడు యాభై ఏళ్ళు) జీవిత ఖైదులు చాలా వరకు పద్నాలుగేళ్ళు దాటాక ఎప్పుడో ఒకప్పుడు ముగుస్తాయి. కానీ ఈ ఖైదీ త్రిశంకు స్వర్గంలో వున్నారు. అతనికి మరణశిక్ష పడింది. కానీ ప్రెసిడెంట్ ఇచ్చిన ఆదేశంతో మరణశిక్ష రద్దయింది. అతను తన మిగిలిన జీవితపర్యంతం జైల్లోనే గడపాలి. బెయిల్ పొందే అర్హత లేదు.
ఇటీవల సుప్రీంకోర్టు అతని సత్ప్రవర్తనకు గాను 21 రోజులు సెలవు(ఫర్లో) ఇచ్చింది. అతను తిరిగొచ్చాక “మాట్లాడిన కొద్ది మాటల్లో, బైట అతను గడిపింది 21 నిమిషాల్లా వుంది. కానీ 21 రోజులు కాదని చెప్పారు” అని ఉమర్ రాశారు. ఆనందాన్ని అణిచేయడానికి, ఒంటరితనాన్ని పెంచడానికి కాలం మనసుతో ఆడే క్రీడ.
ఖైదీలు ఫర్లోని ఉపయోగించుకొని బైటికి వెళ్లి, మళ్ళీ తిరిగి రాకుండా తప్పించుకోవచ్చని అనిపిస్తుంది. కానీ కొత్తగా వచ్చిన ఖైదీలు మాత్రమే ఈ ప్రయత్నం చేస్తారని ఉమర్ అంటారు.
దోస్తోవ్ స్కీ కూడా ‘ది హౌస్ ఆఫ్ ది డెడ్’లో ఖైదీలు తప్పించుకోడానికి ప్రయత్నించరని రాశారు. “ఖైదీలు పారిపోరని, ఎందుకంటే వాళ్ళు జైల్లో గడిపే సమయానికి విలువనిస్తారని దోస్తోవ్ స్కీ రాశారు” అని ఉమర్ చెప్తారు.
వాళ్ళదగ్గర ఉన్నదల్లా సమయం ఒక్కటే. వాళ్ళ దగ్గరున్న సమయంతో రాజ్యానికి పని లేదు. కానీ మనుషులకు ఇది చాలా విలువైనది. నేను జంతు ప్రేమికుడిని అయినప్పటికీ, మనం మనుషులం సమయాన్ని అర్థం చేసుకున్నట్లు, లేదా సమయానికి విలువిచ్చినట్లు జంతువులు చేస్తాయో లేదో తెలీదు. కొన్ని జంతువులకు గొప్ప జ్ఞాపకశక్తి వుండేమాట నిజమే, ఏనుగులకు, దశాబ్దం తర్వాత యజమాని తిరిగి వచ్చాడన్న ఆనందంలో ప్రాణాలు ఒదిలేసిన ఒడిస్సీలో విశ్వాసపాత్రురాలైన ఆర్గోస్ అనే కుక్కకి వున్నట్టు. కానీ ఇవేవీ కూడా సమయం పట్ల వాటికున్న అవగాహనను వివరించవు.
“దాదాపు ఐదేళ్ళు గడిచిపోయాయి. అర్థ దశాబ్దం. ఈ టైంలో జనం పీహెచ్డీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెతుక్కుంటారు.” అని చెప్తూ ఉమర్ ముగించారు.
అనువాదం: అమలేందు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.