
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 2024 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలతో విస్తృతమైన సంక్షేమ అజెండాను ప్రకటించారు. రైతులు, మహిళలు, యువత, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం లక్ష్యంగా పెట్టిన ఈ పథకాల్లో కొన్ని మాత్రమే ముందుకు సాగగా, చాలావరకు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అసలు ఈ ఏడాది ప్రభుత్వం ఎన్ని హమీలను అమలు చేసింది? హమీల అమలుకు ప్రభుత్వం ముందున్న ఇబ్బందులేంటీ? ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏడాది పాలన పై ది వైర్ తెలుగు ప్రత్యేక కథనం.
టీడీపీ ప్రభుత్వం తొలి సంవత్సరంలో సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది. అయితే వీటిని అమలు చేయడంలో ఆర్థిక పరిమితులు అడ్డంకులుగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే అనేక సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేయగా, టీడీపీ ప్రభుత్వం మాత్రం మొదటి ఏడాదిలో తాము ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వెనుకబడిందనే విమర్శలు వస్తున్నాయి.
సూపర్ సిక్స్ వర్సెస్ ‘నవరత్నాలు..
టీడీపీ ప్రభుత్వం తీసుకున్న అతి ప్రధానమైన నిర్ణయాల్లో ఒకటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను రూ 3,000 నుంచి రూ 4,000కు పెంచడం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి నెల నుంచే వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, వికలాంగులకు ఈ పెన్షన్లు అమలయ్యాయి. ఇదే పథకాన్ని గత వైసీపీ హయంలో వైఎస్సార్ పెన్షన్ కానుకగా దీనిని అందజేసింది. రూ 2,250గా ఉన్న పెన్షన్ను రూ 3,000కు పెంచి, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను అందించింది. 2024 ఎన్నికల సమయంలో ఈ పథకాన్ని నాలుగు వేలకు పెంచుతున్నట్లు చంద్రబాబు హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం విద్యా ప్రోత్సహకంగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడాన్ని రెండు పార్టీలు రాజకీయంగా ముఖ్యమైన అంశంగా గుర్తించాయి. టీడీపీ తాజాగా ప్రకటించిన “తల్లికి వందనం” పథకం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు రూ 15,000 ఇవ్వాలని 2025-26 బడ్జెట్లో ప్రతిపాదించింది. జూన్ 2025 నాటికి ఇంకాను ఈ పథకం ప్రారంభం కాలేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన అతి ముఖ్యమైన పథకాల్లో ఈ “అమ్మఒడి” ఒకటి. సుమారు రూ. 26,000 కోట్లను పలు దశల్లో ఈ పథకం కోసం అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. వాస్తవానికి జగన్ 2019 ఎన్నికల సమయంలో ఈ పథకం మొదట్లో కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లవాడికి వర్తిస్తోందని చెప్పినప్పటికీ, తర్వాత ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేశారు.
రైతు సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన అంశం. టీడీపీ ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుకు ఏటా రూ 20,000 ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జగన్ ప్రభుత్వం అందించిన రూ 13,500 రైతు భరోసా కంటే ఎక్కువ. అయితే 2025 బడ్జెట్లో రూ 6,300 కోట్లు కేటాయించినప్పటికీ జూన్ 2025 నాటికి ఈ పథకం అమలుకు నోచుకోలేదు. జగన్ ప్రభుత్వం తొలిదశలోనే రూ 34,378 కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే ఇందులో కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలతో కలిపి అప్పటి ప్రభుత్వం అందించింది.
టీడీపీ దీపం 2.0 పథకం ద్వారా ప్రతి సంవత్సరం మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం రూ 2,601 కోట్లతో 90 లక్షల కుటుంబాలకు చేరువ చేయాలని ప్రణాళిక వేసింది. డిజిటల్ లక్ష్మి పథకం ద్వారా 10,000 మంది మహిళల ఆధ్వర్యంలో డిజిటల్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రకటించింది. అయితే, ఈ పథకం ఇంకాను ప్రణాళికా దశలోనే ఉంది. కాగా, జగన్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా రూ 19,189 కోట్లు జమ చేసింది. స్వయం సహాయక గ్రూపులకు అప్పులను మాఫీ చేసింది.
టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ 3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. జూన్ 2025 నాటికి వీటి అమలు జరగకపోవడమే కాకుండా ఈ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు కూడా జరగలేదు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వ కాలంలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ఈ నియామకాల్లో పార్టీ వ్యక్తులకు ప్రాధ్యానత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను నేరుగా ఇంటి వద్దకే అందించే విధానాన్ని అమలు చేసింది. 2.6 లక్షల మందికి పైగా వాలంటీర్లు పెన్షన్లు, రేషన్, ఇంటి వద్దకే తీసుకెళ్లారు. టీడీపీ ప్రతిపాదించిన డిజిటల్ లక్ష్మి పథకం కియోస్క్ ఆధారిత మోడల్. ఇది పూర్తిగా మహిళలతో నిర్వహించబడేలా చంద్రబాబు ప్రణాళిక చేశారు. కానీ ఇది ఇంకా ప్రారంభం దశలోనే ఉంది.
సంక్షేమ పథకాలు అమలులో జాప్యం ఎందుకు?
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, అంటే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కొన్ని అడుగులు ముందుకేసింది. కానీ, అవి ఇంకా పూర్తిగా అమలు కాలేదు. పూర్తిస్థాయిలో అమలైన పథకం కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మాత్రమే. అంటే, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్. మిగతా హామీలు ప్రణాళికల దశలోనే ఉన్నాయి, వాటిని ఇంకాను అమలు చేయలేదు.
గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చాలా సంక్షేమ పథకాలను వేగంగా ప్రారంభించింది. ప్రజల్లో వాటి పట్ల మంచి పేరు వచ్చింది. జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకాల వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా చాలా నష్టం జరిగిందని విమర్శలు కూడా ఉన్నాయి.
ఏదిఏమైనా, మొదటి సంవత్సరంలో జగన్ ప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఒక వైపు ప్రపంచ స్థాయి క్యాపిటల్ను నిర్మించిడం, మరో వైపు ఎన్నిక సమయంలో ఇచ్చిన మితిమిరిన సంక్షేమ పథకాల హమీల అమలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.