
టీవీ చర్చాకార్యక్రమంలో వేరే వ్యక్తి అన్న మాటలకు పోలీసుల చేత అరెస్టై. జిల్లా కోర్టులో న్యాయాధికార ఉత్తర్వుతో 14 రోజుల రిమాండ్ను గురైన తరువాత, అక్కడి నుంచి అత్యున్నత న్యాయస్థానం తీర్పు వరకు ఓ జర్నలిస్టు స్వేచ్ఛ కోసం సాగిన కథనం ఇది.
సాక్షీ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 6న అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జర్నలిస్టు కాలనీకి వెళ్లిన తుళ్లూరు పోలీసులు తన నివాసంలో కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో హాజరుపరిచి, అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ తీసుకు వెళ్లారు. అరెస్టు చేసిన తర్వాత రోజు నల్లపాడు పోలీసు స్టేషన్ నుంచి తీసుకువెళ్లి మంగళగిరి కోర్టులో హాజరుపరచారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో జూన్ 13న సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తూ కొమ్మినేనికి ఊరటననిచ్చింది.
ఇదంతా కొనసాగుతున్న క్రమంలో పోలీసులు, రాజకీయనాయకులు, ఏపీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, తదితర ప్రముఖుల మధ్య ప్రకటనల యుద్ధం నడిచింది. వరుస నాటకీయ పరిణామాల తరువాత న్యాయ పోరాటంతో, ప్రజాస్వామికంగా పాత్రికేయ విజయం సాధ్యమైంది.
అరెస్టుపై ప్రతిపక్ష నేత జగన్ స్పందన..
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ఈ అరెస్టు చట్ట విరుద్ధమైనది. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని తలకిందులు చేసే దాడి” అని ఎక్స్లో ట్వీట్ చేస్తూ అభివర్ణించారు.
అయితే, సాక్షి ఛానల్లో ప్రసారమైన చర్చా కార్యక్రమంతో ఈ గొడవంతా మొదలైంది. డిబేట్లో వ్యాఖ్యాతగా పాల్గొన్న జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ రావుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. జర్నలిస్టు హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛపై గౌరవంతో శరవేగంగా సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అరెస్ట్ రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన అని న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విమర్శించింది. “ఈ మాటలను స్వయంగా జర్నలిస్టు(పిటిషనర్) అనలేదు. జర్నలిస్టు హక్కులను కాపాడి స్వేచ్ఛను రక్షించే అవసరం ఉందని, ట్రయల్ కోర్టు విధించే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని ఆదేశిస్తున్నాం” అని ప్రకటించింది.
షరతులో ప్రధానమైనదేంటంటే “భవిష్యత్తులో స్వయంగా లేదా ఇతరుల ద్వారా అవమానకర వ్యాఖ్యలు చేయకూడదని, తాను వ్యాఖ్యాతగా ఉన్న టీవీ డిబేట్లో ఇటువంటివి ఉపేక్షించరాద”ని శ్రీనివాస రావుకు ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.
సీఎం చంద్రబాబు హెచ్చరిక..
ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మహిళల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి మాటలు “పరమ బాధ్యతలేని” చర్యలని ఆయన అన్నారు. దీనిని ఏపీ రాజధాని అమరావతిపై జరుగుతోన్న కుట్రని అభివర్ణించారు. విశ్లేషణ పేరిట ఇటువంటి అసభ్య వ్యాఖ్యలు చేయడం సహించబోమని, క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయితే ఈ మాట గురించి సుప్రీంకోర్టులో ప్రస్థావించలేదు. కానీ ఇలా బెదిరించి పాత్రికేయుడిని పోలీసులు అరెస్టు చేసేలా ఉసిగొల్పినట్టైతే అర్థమవుతోంది.
సుప్రీంకోర్టులో వాదోపవాదాలు..
కేసు విచారణలో సుప్రీంకోర్టులో న్యాయవాదుల హాస్యంతో కూడిన వాదనలు వినవలసిందే. న్యాయవాది సిద్ధార్థ్ దావే పాత్రికేయుని పక్షాన వాదిస్తూ, “జర్నలిస్టు(పిటిషనర్) ఈ మాటలు అనలేదు. డిబేట్ ప్యానెల్లో పాల్గొన్న మరొక వ్యక్తి ఈ మాటలు అన్నారు. కేవలం కొమ్మినేని చేసిన తప్పేంటంటే నవ్వడం. అదికాస్తా అవునన్నట్టు అనిపించేలా ఉంది” అన్నారు.
జస్టిస్ మిశ్రా తన వాదనను వినిపిస్తూ “ఇది నవికా(టైమ్స్ నౌ), సర్దేశాయ్(రాజ్దీప్) చేసిన షోలా ఉంది” అని అభివర్ణించారు. దీనికి ప్రతిస్పందించిన లాయర్ దావే “నిశ్చయంగా!” అంటూ మిశ్రా మాటలతో ఏకీభవించారు.
“ఇతరులన్న మాటలకు డిబేట్లోని వ్యాఖ్యతను ఎలా అరెస్ట్ చేస్తారు?” అని జస్టిస్ మన్మోహన్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున న్యాయవాది ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. “ఆ వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయి. జర్నలిస్టు నవ్వడం ద్వారా ప్రోత్సహించాడని మేము అనుకుంటున్నాం” రోహత్గి అన్నారు
ఈ మాటలకు జస్టిస్ మన్మోహన్ హాస్యంగా స్పందిస్తూ “అయ్యో, ఎవరో తీవ్రమైన వ్యాఖ్య చేస్తే మనం కూడా నవ్వుతాం. కానీ దీన్ని కుట్ర చేయడమని, ప్రోత్సహించడమని అనలేం కదా!” అన్నారు. మరోవైపు జస్టిస్ మిశ్రా కూడా వ్యంగ్యంగా “ఇలాంటి కామెంట్లు ప్రతిరోజూ జరుగుతూనే ఉంటాయి!”అని పేర్కొన్నారు. దీనికి బదులు సమాధానం చెప్తూ న్యాయవాది రోహత్గీ “ఇతను నిస్సహాయంగా చూస్తున్న వ్యక్తి కాదు. అదే డిబేట్లో భాగమైన వ్యక్తి ఈ వ్యాఖ్యాత తెలుసా?’’ అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో జస్టిస్ మిశ్రా కొంచెం ఘాటుగా “కానీ, ఆయనే ఆ వ్యాఖ్య చెయ్యలేదు కదా?” బదులిచ్చారు. దీనికి సమాధానంగా న్యాయవాది రోహత్గీ “అతను ప్రేరేపించాడు. ‘అమరావతి వేశ్యల రాజధాని’ అనేలా అనుమతించాడని అనుకోవచ్చు!” చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుతం పక్షాన మరో న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా “ఇది కేవలం పరువు నష్టం కాదు. రాష్ట్రాన్ని అత్యాచార రాజధానిగా చూపే ప్రయత్నం” అని అన్నారు.
ఈ నేపథ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడే బాధ్యత ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తూ కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది.
చర్చలు కొనసాగుతోన్న వేళ “పిటిషనర్ ఓ సీనియర్ జర్నలిస్టు. అంతేకాకుండా ఆయన వయసు 70 ఏళ్లు ఉన్నాయి. ఆయన ‘లైవ్ విత్ కేఎస్ఆర్’ అనే కార్యక్రమంలో వ్యాఖ్యాతగా ఉన్న సమయంలో ఓ ప్యానెలిస్టు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యాత నవ్వినప్పటికీ ఆయనే ఆ వ్యాఖ్యలను చేయలేదు. జర్నలిస్టుగా ఒక వ్యక్తి చర్చాకార్యక్రమంలో పాల్గొనే వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉంది. కనుక, పిటిషనర్ను విడుదల చేయాలని నిర్ణయిస్తున్నాం. అయితే, భవిష్యత్తులో అవమానకర వ్యాఖ్యలు చేయకుండా లేదా అనుమతించకుండా ఉండాలని హెచ్చరిస్తున్నా”మని న్యాయవాదులు పేర్కొన్నారు.
ఈ తీర్పుతో సుప్రీంకోర్టు పత్రికా స్వేచ్ఛను రక్షించిన సంఘటనగా ఈ వ్యవహారాన్ని గుర్తుంచుకుంటుంది. రాజకీయ ప్రభావంతో పోలీసు అధికారులు వ్యవహరించరాని, ఈ క్రమంలో న్యాయవ్యవస్థ ప్రజల స్వేచ్ఛను నిలబెట్టిందని అనుకోవలి. ఈ సంఘటన ఒక కేసుగా మారకపోయినా, పూర్తిగా ముగిసిపోకపోయినా కూడా జర్నలిస్టుకు స్వేచ్ఛ లభించడం మాత్రం పాత్రికేయ రంగంలో సాధారణ ప్రజలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే పరిస్థితిని ఇచ్చింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.