
ది వైర్ వెబ్సైట్ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసి 12- 15 గంటల తర్వాత, మేము ఇదేమి పద్ధతి అని కేంద్రానికి లేఖ రాసిన తొమ్మిది గంటల తర్వాత కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నిన్న రాత్రి (మే 9) రాతపూర్వకమైన వివరణ వచ్చింది.
మే 9న రాత్రి 9.41 గంటలకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఈ-మెయిల్ వచ్చింది. ది వైర్ వెబ్సైట్లో ఫ్రాన్స్కు చెందిన అధికారిని ఉటంకిస్తూ భారత్ ప్రయోగించిన రాఫెల్ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ నేలకూల్చిందంటూ అమెరికాకు చెందిన సీఎన్ఎన్ వార్త సంస్థ ప్రచురించిన కధనాన్ని ది వైర్ ప్రసారం చేసినందుకు గాను వెబ్సైట్ను బ్లాక్ చేయాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయని ఈ-మెయిల్లో తెలిపారు.
హెచ్టిటిపి ఫార్మాట్లో నిర్వహించబడే వెబ్సైట్లను పూర్తిగా బ్లాక్ చేయటం తప్ప ఏ ముక్కకు ఆ ముక్క, లేదా ఏ పేజీకి ఆ పేజీ ప్రకారం బ్లాక్ చేయటం సాధ్యం కాదని, అందువలన ఆ ఒక్క వార్తను బ్లాక్ చేయాలంటే మొత్తం సైట్ను బ్లాక్ చేయాల్సి వచ్చిందని, ఇది సాంకేతిక పరిమితుల వలన జరిగిందేనని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ రాసిన వివరణలో పేర్కొన్నారు. ఈ విషయంగా సదరు కథనం గురించి వైర్ చర్య తీసుకుని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సమాచారం ఇస్తే కేంద్ర ప్రభుత్వం తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని ఈ- మెయిల్లో తెలిపారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021 కింద ఏర్పాటయ్యే బహుళ మంత్రితశ్వశాఖల ప్రతినిధులతో కూడిన కమిటీ ముందు ది వైర్ తమ అభ్యంతరాలు వ్యక్తం చేయవచని కూడా ఈ-మెయిల్లో తెలియజేశారు.
పత్రికా స్వాతంత్య్రం గొంతు నులిమే ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను సవాలు చేసే హక్కును రక్షించుకుంటూనే సదరు వార్త కథనాన్ని వైర్ వెబ్సైట్ నుంచి తొలగించినట్లు ది వైర్ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ పూర్తి పాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాము.
డియర్ సర్,
మా వెబ్సైట్ బ్లాక్ చేయటానికి సంబంధించిన కారణాలు తెలుసుకోగోరుతూ మేము రాసిన లేఖకు మీరు ఇచ్చిన సమాధానం అందింది.
మీరు ప్రస్తావించని ఐటి రూల్స్ గురించి కొంత స్పష్టత ఇవ్వాల్సి రావటం మా దురదృష్టంగా భావిస్తూ ఈ క్రింది విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను. మీరు ప్రస్తావించిన చట్టం ప్రకారం మీరు అభ్యంతరకరంగా భావిస్తున్న వార్త గురించి ది వైర్కు ముందు నోటీసు జారీ చేయాలి. ఆ నోటీసుకు ది వైర్ సమాధానం లేదా వివరణ ఇచ్చుకోవాలి. తదుపరి బహుళ శాఖల ప్రతినిధులతో ఏర్పాటైన కమిటీ ముందు ది వైర్ సంపాదకవర్గం ఈ కథనాన్ని ఎందుకు తీసేయాల్సిన అవసరం లేదో వివరించాలి. ఆ తర్వాత కూడా సదరు కమిటీ సదరు కథనాన్ని తొలగించాలని నిర్ణయిస్తే, ఆ నిర్ణయాన్ని ది వైర్ అమలు చేయకపోతే అప్పుడు వెబ్సైట్ను బ్లాక్ చేయవచ్చు.
ఒకవేళ ఇవన్నీ చేసేంత సమయం లేని అత్యవసర పరిస్థితి ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తే సదరు కథనాన్ని తొలగించమని సంబంధిత నియమ నిబంధనల క్రింద సమాచారం అయినా ఇవ్వాలి. ముందస్తు సమాచారం ఇవ్వకపోగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మేము వివరణ కోరుతూ లేఖరాసిన ఏడుగంటల వరకూ స్పందించకుండా మిన్నకుండిపోయింది.
సదరు వార్త కథనాన్ని మే 8వ తేదీ రాత్రి మూడున్నర గంటల ప్రాంతంలో పోస్టు చేశాము. అంతకు కనీసం 12 గంటల ముందే సదరు కథనానికి సబంధించి సిఎన్ఎన్ ప్రచురించిన వార్త, సంబంధిత వివరాలు అందుబాటులోనే ఉన్నాయి. కానీ ఈ కథనం ప్రచురించిన 24 గంటల వరకూ కనిపించని అత్యవసర పరిస్థితి ఏం ఉత్పతన్నమైందో అర్థం కాలేదు. కనీసం కేంద్రానికి ఉన్న అభ్యంతరమేమిటో కూడా తెలీకుండా మా మొత్తం వెబ్సైట్ను బ్లాక్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
మా తక్షణ ప్రాధాన్యత ది వైర్ వెబ్సైట్ను పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడం. అలా చేయాలంటే ముందు వెబ్సైట్ అన్ బ్లాక్ చేయించుకోవాలి. కాబట్టి ప్రభుత్వ డిమాండ్ల అర్థరాహిత్యాన్ని గుర్తించిన తరాత్వ కూడా పాఠకుల విస్తృత ప్రాధాన్యత ప్రయోజనాలు, పాత్రికేయ విలువల పట్ల నిబద్ధతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం అడిగిన కథనాన్ని వెబ్సైట్ నుంచి తొలగించాము. అదే సమయంలో రాజ్యాంగం పరిధిలో మా హక్కులు, అవకాశాలు కాపాడుకుననేందుకు పోరాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము.
మీరు కోరిన కథనాన్ని మేము తొలగించామని సాధికారికంగా ఈ మెయిల్ ద్వారా మీ దృష్టికి తెస్తున్నామని మీరు పరిగణించవచ్చు.
ఇక్కడ ఈ రోజు గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించుకోవటం అసందర్భం కాదు. సమాజంలోనూ మీడియాలోనూ చర్చలకు అవకాశం ఉండాలని, న్యాయ వ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యను మనం గమనించవచ్చు.
రేపు జరగబోయే బహుళ విభాగాల ప్రతినిధుల కమిటీలో మా నుంచి పూర్తి వివరణను మీ ముందుంచేందుకు ఎదురు చూస్తున్నాను.
ఈ సమాధానం పంపిన తర్వాత మా వెబ్సైట్ను ప్రసారం చేయమని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆదేశాలు వచ్చిన 12 గంటల తర్వాత కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో పాఠకులు చందాదారులు వెబ్సైట్ను చేరుకోలేకపోతున్నామని పోస్టులు పెడుతున్నారు.
మా వెబ్సైట్ను బ్లాక్ చేయటానికి ముందు ఫలానా కథనాన్ని తొలగించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం నుంచి మాకు రాకపోవడం గమనార్హం.
రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చామని పాకిస్తాన్ చెప్పినట్లు సిఎన్ఎన్ ప్రసారం చేసిన ఓ కథనాన్ని మేము ప్రసారం చేస్తే ఆ పేజీని తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపైనా, మాకు నోటీసు కూడా ఇవ్వకుండా మొత్తం వెబ్సైట్ను బ్లాక్ చేయటం గురించీ రేపు మద్యాహ్నం రెండున్నరకు జరిగే సమావేశంలో మా వాదన వినిపిస్తాము.
సిఎన్ఎన్లో వచ్చిన ఒరిజినల్ కథనం, దానికి సంబంధించిన ఇతర అంతర్జాతీయ మాధ్యమాల్లో వస్తున్న కథనాలు ఇప్పటికీ భారతదేశంలో నెటిజెన్లకు అందుబాటులోనే ఉన్నాయి. మరి మా ఒక్క వెబ్సైట్ను మాత్రమే బ్లాక్ చేయించటంలో ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటో అర్థం కావడం లేదు. మిగిలిన వార్త సంస్థల వెబ్సైట్లు అన్నీ యథాతథంగానే నడుస్తున్నాయి.
స్పష్టమైన, వాస్తవికమైన, కీలకమైన వార్తలను, విషయాలను, విశ్లేషణలను పాఠకులకు చేర్చాలన్న నిబద్ధతకు ది వైర్ కట్టుబడి ఉంది.
ది వైర్ సంపాదక మండలి
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.