
గత 20 ఏండ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక- సామాజిక భద్రతను సీపీఎస్, యూపీఎస్ స్కీంలు కల్పించలేదు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా ఉద్యోగుల భవిష్యత్తును స్టాక్ మార్కెట్లో తాకట్టు పెట్టాయి. ఈ స్కీంల అమలును నిలిపివేసి, పాత పెన్షన్పై ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నడుంబిగించింది.
ఇందులో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి 15 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ అధికారుల, పెన్షనర్ల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి(తెలంగాణ ఉద్యోగుల జేఏసీ)సెప్టెంబర్ 1 పెన్షన్ విగ్రహ దినంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీపీఎస్, యూపీఎస్, ఓపీఎస్ లాభనష్టాలపై విశ్లేషణాత్మక వ్యాసం.
తెలంగాణలో దాదాపుగా 3.69 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో రెండు లక్షలకు పైగా ఉద్యోగులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)పరిధిలో పనిచేస్తున్నారు. 2004 జనవరి 1 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ స్కీం(ఎన్పీఎస్)లేదా (సీపీఎస్)ను వర్తింప చేస్తూ అప్పటి భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవోఎంఎస్ 653 తేదీ 2004 సెప్టెంబర్ 22 ప్రకారం 2004 సెప్టెంబర్ 1 నుంచి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల ఉద్యోగులు, గ్రాండ్ ఇన్ ఎయిడ్ పొందుతున్న సంస్థల్లోని ఉద్యోగులు, అటానమస్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, సీపీఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకుంటూ 2014 ఆగస్టు 23న జీవోను జారీ చేసింది. దీంతో 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ పరిధిలోకి వచ్చారు.
సీపీఎస్ ఉద్యోగి తన బేసిక్ పేడీఏలలో కలిపి 10%, మ్యాచింగ్ గ్రాంట్గా ప్రభుత్వం నుంచి మరో 10% సొమ్మును కలిపి నేషనల్ పెన్షన్ స్కీం ట్రస్ట్(ఎన్పీఎస్టీ)లో జమ చేస్తారు. ఉద్యోగికి కేటాయించిన పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్(ప్రాన్)లో ఈ సొమ్ము జమవుతుంది. ఉద్యోగి పదవి విరమణ పొందే వరకు జమైన మొత్తం నుంచి 60% డబ్బును మాత్రమే ఉద్యోగికి నగదుగా చెల్లిస్తారు. మిగతా 40% డబ్బును భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. దీనిపై వచ్చే లాభాన్ని నెలవారి పెన్షన్ కింద రిటైర్డ్ ఉద్యోగికి చెల్లిస్తారు.
ఒకవేళ షేర్ మార్కెట్ నష్టాలను చవిచూస్తే ఉద్యోగి డబ్బుల నుంచి తీసుకుంటారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల డబ్బులు స్టాక్ మార్కెట్లో పెట్టి, స్టాక్ మార్కెట్ లాభనష్టాలపై ఉద్యోగి పెన్షన్ ఇవ్వడమనేది చాలా విచారకరం. వారి సొమ్ముకు ఆర్థిక భద్రత లేకుండా పోతుంది. సీపీఎస్ విధానం నష్టదాయకంగా ఉందని, దీన్ని రద్దుచేసి ఓపీఎస్ను అమలు చేయాలని ఉద్యోగ- ఉపాధ్యాయ సంఘాలు ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నాయి.
సీపీఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశంలోని మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. పెన్షన్ల ఆర్థిక భారం ప్రభుత్వాలపై పడకుండా ఉండడానికి ఈ సీపీఎస్ను తీసుకువచ్చారు. కానీ ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రతను విస్మరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలో ఉండడం వల్ల రిటైర్మెంట్ సమయంలో వచ్చే 50% పెన్షన్, కుటుంబ సభ్యులకు 30% పెన్షన్, కనీసం 16 లక్షల గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి సౌకర్యాలను కోల్పోతున్నారు.
ఉద్యోగంలో ఉండగా సీపీఎస్ ఉద్యోగి మరణిస్తే, వారికి వచ్చే పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ల కన్నా తక్కువగా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సామాజిక- ఆర్థిక భద్రత లేక వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ వారి జీవితాంతం ప్రజలకు సేవ చేసిన ఉద్యోగులను కాపాడాల్సిన సామాజిక బాధ్యత ప్రజలపై కూడా ఉంది.
నూతన పెన్షన్ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నప్పటి నుండి దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలు చేయడం ప్రారంభించాయి. ఈ ఉద్యమాల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే గల్లీలో ప్రారంభమైన ఉద్యమాలు ఢిల్లీ వరకు చేరాయి. సీపీఎస్ రద్దు చేయడం అసాధ్యమని, ఉద్యోగుల సామాజిక- ఆర్థిక భద్రత కోసం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కమిటీని ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది. ఎన్పీఎస్లో చేయాల్సిన మార్పులపై సమీక్షలు జరిపి యుపీఎస్ సిఫారసు చేసింది. కేంద్ర క్యాబినెట్ యూనిఫైడ్ పెన్షన్స్ స్కీం యుపీఎస్ని ఆమోదిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది.
యూనిఫైడ్ పెన్షన్ పథకం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. యూపీఎస్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేరితే అదన భారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది.
యూనిఫైడ్ పెన్షన్ స్కీం గురించి వివరంగా..
ఉద్యోగి పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న మూలవేతన సగటులో 50% పెన్షన్ అందుతుంది. ఈ పెన్షన్కు కనీస సర్వీసు 25 ఏళ్లు ఉండాలి. పెన్షన్ దారుడు మరణించాక వారి భాగస్వామికి 60% పెన్షన్ అందే అవకాశం ఉంది. ఉద్యోగికి అందించే కనీస పెన్షన్ 10000కు అర్హత సాధించాలంటే కనీస సర్వీసు పది ఏండ్లు ఉండాలి.
యుపీఎస్లో ప్రభుత్వ వాట 14.5% నుంచి 18% పెరుగుతుంది.యుపీఎస్ పాత సీసాలో కొత్త సార లాగ ఉంది తప్ప ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కల్పించేదిగా లేదు. పాత పింఛను పథకంతో పోల్చుకుంటే ఈ యుపీఎస్లో ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ అదనంగా ఉంది. సొమ్ము షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల భద్రత లేదు, పెన్షన్ పై పీఆర్సీ అమలు లేకపోవడం భవిష్యత్లో ఉద్యోగి వచ్చే పెన్షన్లో పెరుగుదల ఉండదు. ఓపీఎస్ ద్వారా మాత్రమే ఉద్యోగులకు సామాజిక- ఆర్థిక భద్రత ఉంటుంది.
సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం అనేక రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. కేవలం సీపీఎస్ రద్దు కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్ సంఘాలు ఏర్పడ్డాయి.
సీపీఎస్ని రద్దు చేసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ)చట్టం ప్రకారం వీలు కల్పిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వారి ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత కోసం సీపీఎస్ని రద్దు చేయాలనుకుంటే చేసుకునే స్వేచ్ఛ ఉంది.
జంగ్ సైరన్ మోగించిన తెలంగాణ ఉద్యోగులు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీపీఎస్ ఉద్యోగుల కోసం జీవో ఎంఎస్ నెంబర్ 58 తేదీ 11-6-2021 ప్రకారం ఉద్యోగి మరణిస్తే వారి వారసులకు కుటుంబ పెన్షన్ చెల్లించబడుతుందని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో అప్పటివరకు ఉద్యోగ జీతం నుండి మినహాయించబడిన సీపీఎస్ చందా మొత్తం ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుంది.
భారతదేశంలోని రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ను రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరించాయి. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను గుర్తించి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలుచేస్తామని అభయహస్తంలో గ్యారెంటీ ఇచ్చింది. ప్రభుత్వం సీపీఎస్ను రద్దు చేసి ఓపిఎస్ను పునరుద్ధరిస్తుందని ఉద్యోగ- ఉపాధ్యాయులు ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏండ్లుగా సీపీఎస్ రద్దు కోసం పోరాటం చేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తుంది. పీఆర్సీ బకాయిలను కూడా చెల్లించింది. ఏండ్లుగా సాధ్యం కానీ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు మోక్షం కల్పించింది. 317 జీవో బాధితుల పక్షాన సానుకూల నిర్ణయం తీసుకునే చర్యలు ప్రారంభించి ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా నిలిసింది.కానీ డీఏలు, పీఆర్ఎస్లు, రిటైర్మెంట్ బెనిఫిట్లు పెండింగ్లో ఉన్నాయి.
ఉద్యోగులకు హెల్త్ కార్డ్ల స్కీమ్ కూడా సరిగా అమలు చేయడం లేదు. సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఊసే లేదు. ఎన్నికల మేనిఫెస్టో అభయహస్తంలో ఇచ్చిన గ్యారంటీ ప్రకారం, సీపీఎస్ని రద్దు చేసి ఓపిఎస్ను పునరుద్ధరిస్తుందని ఉద్యోగ- ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు.
రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నారు. రెండేళ్లుగా సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన, సమస్యల సాధన కోసం తెలంగాణ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.