
సీబీఐ ద్వారా నమోదు చేయబడిన తప్పుడు కేసులలో తనను ఇరికించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తుందని జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ అన్నారు. గత నెలలో కిరూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రోజెక్టు కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో మాలిక్తో పాటు మరో ఏడుగురిపై అభియోగం మోపబడింది.
న్యూఢిల్లీ: సీబీఐ ద్వారా నమోదు చేయబడిన తప్పుడు కేసులో తనను ఇరికించడానికి
కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శనివారం(జూన్ 7)నాడు ఆరోపించారు.
దీని గురించి ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ పోస్ట్లో “ఏ టెండర్నైతే నేను రద్దు చేశానో, ఆ టెండర్లో నన్ను ఇరికించాలని కోరుకుంటున్నారు. నేను ఆ కేసు విషయంలో అవినీతి గురించి ప్రధానమంత్రికి తెలియజేశాను. ఆయన సూచించిన తర్వాత నేను స్వయంగా ఆ టెండర్ను రద్దు చేశాను. నా బదిలీ తర్వాత ఆ టెండర్కు అనుమతినిస్తూ వేరే వ్యక్తి సంతకం చేయడం జరిగింది” అని పేర్కొన్నారు.
సత్యపాల్ మాలిక్ చాలా సార్లు బహిరంగంగా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతేకాకుండా అనేక వేదికల మీద భారతీయ జనతా పార్టీ(భాజపా) మీద అవినీతి అభియోగాలను మోపారు. తాను ఎప్పుడైతే గవర్నర్గా ఉన్నారో అప్పుడు తనకు రూ 150 కోట్ల లంచాన్ని సిఫార్సు చేశారని ఆయన ఒకానొక సందర్భంలో చెప్పారు.
ప్రస్తుతం కిడ్నీ సంబంధిత సమస్యలతో మాలిక్ ఒక ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
“నా పరిస్థితి చాలా విషమంగా మారుతోంది. నేను ఉంటానో ఉండనో తెలియదు. అందుకే మన దేశవాసులకు నిజం చెప్పాలని అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను గవర్నర్ పదవిలో ఉన్నానో ఆ సమయంలో నాకు రూ 150 కోట్ల లంచం ఇవ్వాలని ఆశ చూపారు. కానీ నేను నా రాజకీయ గురు, రైతు దూత స్వర్గీయ చౌదరి చరణ్సింగ్లా నిజాయితీగా పని చేశాను. నా అకుంఠిత దీక్షను వాళ్లు ఎప్పుడు భగ్నం చేయలేకపోయారు” అని మాలిక్ గతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చారు.
ఏప్రిల్ 2022 కేసుకు సంబంధించిన విషయాన్ని మాలిక్ తన పోస్టులో ప్రస్థావించారు. ఆ సందర్భంలో కిరూ హైడ్రో ఎలక్ట్రీక్ ప్రాజెక్టు ఆర్థికలావాదేవీలకు సంబంధించిన కేసును సీబీఐ నమోదు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం 2,200 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచన మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
ఎఫ్ఐఆర్లో పలు ఆరోపణలు చేయబడ్డాయి. దాని ప్రకారం, చినాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్(పీ)లిమిటెడ్(సీవీపీపీపీఎల్) తన 47వ బోర్టు సమావేశంలో అప్పటికే విడుదలైన టెండర్ ప్రక్రియను రద్దు చేయడం. ఇంకా రివర్స్ ఆక్షన్తో పాటు ఈ- టెండర్ ద్వారా వర్క్ కాంట్రాక్టు కేటాయించడానికి నిర్ణయించింది.
మరో దఫా జరిగిన సీసీవీపీపీఎల్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని మార్చారని, 2019లో పటేల్ ఇంజనీరింగ్తో ఒప్పందం కుదుర్చుకొని కాంట్రాక్ట్ను ఇచ్చారని ఎఫ్ఐఆర్లో ఆరోపించబడింది.
గత నెల కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ ప్రకారం మాలిక్ ఆగస్టు 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు జమ్మూ-కశ్మీర్ గవర్నర్గా ఉన్నారు. అదనంగా మరో ఏడుగురి మీద అభియోగాలు మోపబడ్డాయి. ఈ పేర్లలో అప్పటి సీవీపీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎస్ బాబు, డైరెక్టర్ ఎంకే మిట్టల్, అరుణ్ కుమార్ మిశ్ర, పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రూపెన్ పటేల్(చనిపోయారు) మొదలైన వారు ఉన్నారు.
తాను నిరంతరం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానని, అందుకే ప్రభుత్వం తనను తప్పుడు కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తుందని మాలిక్ తన పోస్టులో వివరించారు.
“నేను గవర్నర్గా ఉన్నప్పుడు, ఆ సమయంలోనే దేశవ్యాప్తంగా రైతు ఆందోళన కూడా నడుస్తోంది. నేను రాజకీయాలకు అతీతంగా ఉండి రైతుల డిమాండ్ను లేవనెత్తాను. అంతేకాకుండా మహిళా మల్లయోధుల ఆందోళనలో జంతర్మంతర్ నుంచి ఇండియా గేట్ వరకు సాగిన ప్రతి నిరసన పోరాటంలో వారితో ఉన్నాను. పుల్వామా దాడిలో అమరులైన సైనికుల విషయాన్ని లేవనెత్తాను, దానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎటువంటి విచారణ చేపట్టలేదు.” అని చెప్పుకొచ్చారు.
దీని గురించి మాలిక్ ఇంకా ప్రస్థావిస్తూ “నన్ను సీబీఐతో భయపెట్టించి, అబద్ధపు చార్జ్షీట్లో ఇరికించేందుకు ప్రభుత్వం సాకులను వెతుకుతోంది. నేను ప్రభుత్వానికి, ప్రభుత్వ సంస్థలకు ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే, నేను రైతు సంఘం నుంచి వచ్చాను. కాబట్టి నేను భయపడేవాడిని కాదు, తాటాకు చప్పుళ్లకు తటపటాయించేవాడిని అసలే కాదు.” అన్నారు.
“నన్ను అభాసుపాలు చేయడానికి ప్రభుత్వం తన శక్తియుక్తులన్నింటిని ధారపోస్తోంది. చివరికి ప్రభుత్వం, దాని ఎజెన్సీలకు నా డిమాండ్ ఎంటంటే, దయదేసి ప్రియమైన నా దేశవాసులకు నిజం చెప్పండి. తమ విచారణలో నాకు వ్యతిరేకంగా ఏం పొందారు? అసలు నిజం ఏంటంటే, నేను నా రాజకీయ జీవితంలో 50 సంవత్సరాలకంటే ఎక్కువ సమయం వరకు చాలా ఉన్నత పదవులలో ఉన్న తర్వాత కూడా నేను ఒక గది ఇంటిలో ఉంటున్నారు. ఇంకా అప్పులలో మునిగిపోయాను. ఒకవేళ ఈరోజు నా దగ్గర డబ్బులు ఉన్నట్లైతే నేను ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకునేవాడిని” అని పేర్కొన్నారు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.