
దేశ భద్రతలో ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం మరో అడుగు ముందుకేస్తోంది. నేవీకి కీలక స్థావరంగా ఏర్పడబోతోంది. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో భూగర్భ అణు జలాంతర్గామి స్థావరం నిర్మాణమవుతోంది.
తూర్పు నౌకాదళ కేంద్రంగా వున్న విశాఖపట్టణానికి దక్షిణంగా సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని రాంబిల్లి ఇందుకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడ భారత అణు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు ఓ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికి ఐఎన్ఎస్ వర్షగా నామకరణం చేశారు. తూర్పు తీరంలో రక్షణ అవసరాల కోసం నిర్మిస్తున్న నేవీ ప్రత్యామ్నాయ స్థావరం ఐఎన్ఎస్ వర్షను 2026లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
అసలేంటీ ఐఎన్ఎస్ వర్ష..
విశాఖకు సమీపంలో అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి సముద్ర తీరాన్ని ఆనుకొని నేవీ ప్రత్యామ్నాయ స్థావర నిర్మాణం జరుగుతోంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 670 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించగా, ఏపీ ప్రభుత్వం కూడా భూసేకరణలో సహరించింది. ఈప్రాజెక్టు తొలి దశ 2022 నాటికి, మలి దశ నిర్మాణం 2025 నాటికి పూర్తి కావాల్సి ఉన్నా, కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతం తొలి దశ నిర్మాణం పూర్తి కావొచ్చింది.
ఇది శత్రువుల కంట పడని రీతిలో యుద్ధనౌక స్థావరం. ఇప్పటి వరకూ రష్యా, చైనా మాత్రమే ఇలాంటి స్థావరాలను నిర్మించుకున్నాయి. ఇప్పుడు భారత్ కూడా రాంబిల్లిని ఐఎన్ఎస్ వర్ష వ్యూహాత్మక స్థావరంగా ఎంచుకుంది. ఇది భారత నౌకాదళానికి జలాంతర్గామిల హబ్గా ఉంటుంది. ఇక్కడ 12 సబ్మెరైన్లను ఒకేసారి లంగరు వేసుకోవచ్చు. ఇందులోనూ అణు జలాంతర్గాములకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. 2014 ఆగస్టులో ఇక్కడ స్థావరాన్ని నిర్మిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీని నిర్మాణానికి పదేళ్ల కాలం పట్టింది. రాంబిల్లి స్థావరంలో అణు జలాంతర్గాముల నిర్మాణమే కాకుండా మరమ్మతులు, నిర్వహణలాంటి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈ కేంద్రంలో బంకర్లు, సొరంగ వ్యవస్థలు, ఇన్నర్- ఔటర్ హార్బర్ వంటి సౌకర్యాలున్నాయి. హైసెక్యూరిటీతో ఏర్పాటు చేస్తున్న ఈ వ్యూహాత్మక స్థావరం బంగాళాఖాతం, హిందూమహాసముద్ర ప్రాంతంలోని జలాల్లో నిఘాను పెంచనుంది. అచ్యుతాపురంలో బాబా అటమిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) నుంచి ఐఎన్ఎస్ వర్షకు సంపూర్ణ సహకారం అందుతోంది.
రాంబిల్లిలోనే ఈ స్థావరం ఎందుకు?
హైనాన్ ద్వీపంలో చైనా అణు జలాంతర్గామి స్థావరం తరహాలోనే రాంబిల్లిలో సముద్రం నీటి లోతు ఎక్కువగా ఉంటుంది. దీంతో జలాంతర్గాములు ఉపగ్రహాల కంటపడే అవకాశాలు ఉండవు. సునాయశంగా నీటిలోకి చేరుకుంటాయి. బయటకు వెళ్లగలవు. వీటిని ఉపగ్రహాలు గానీ, నిఘా విమానాలు గానీ కనిపెట్టే అవకాశం ఉండదు. సముద్రంలో టన్నెళ్ల గుండా సబ్మెరైన్లు హబ్కు చేరుకునేలా నిర్మాణం చేశారు. చైనాకు ధీటైన సమాధానం చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా చర్యలను పసిగట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అరిహంత్- అరిఘాత్..
విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో 2004 నుంచి న్యూక్లియర్ సబ్మెరైన్ల నిర్మాణం జరుగుతోంది. స్ట్రాటజిక్ స్ట్రయిక్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ పేరుతో నాలుగు న్యూక్లియర్ సబ్మెరైన్ల నిర్మాణానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్టును 2004లో ప్రారంభించారు. ఇందులో భాగంగానే అరిహంత్, అరిఘాత్ రూపుదిద్దుకున్నాయి.
ఆ ప్రాజెక్ట్లో మొదటిగా అరిహంత్ వచ్చింది. రష్యా సహకారం తీసుకుని నిర్మితమైన అరిహంత్ను 2009లో జలప్రవేశం చేశారు. అనేక ట్రయల్స్ తర్వాత 2016 ఆగస్టులో నేవీకి అప్పగించారు. మరో ప్రతిష్టాత్మక జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్. 2017లో ట్రయల్స్ చేసి 2024 ఆగస్టు 29న రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. వీటిని అరిహంత్ క్లాస్ అణు జలాంతర్గాములుగా పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్లో మిగిలిన రెండు సబ్మెరైన్ల నిర్మాణానికి 40 వేల కోట్లను కేంద్రం కేటాయించింది.
అరిహంత్- అరిఘాత్లని మించిన అర్ధమాన్..
ఐఎన్ఎస్ అరిహంత్- ఐఎన్ఎస్ అరిఘాత్ కంటే అర్థమాన్ పెద్దది. సబ్ మెరైన్ ప్రాజెక్టులో నిర్మించిన మూడో న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అర్థమాన్. 7 వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఈ సబ్మెరైన్ 3,500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. మరిన్ని కే- 4 క్షిపణులను మోసుకెళ్తుంది. ఇది 2024 అక్టోబరులోనే సీట్రయల్స్కు వెళ్లింది. త్వరలో కమిషనింగ్ చేసి నేవీకి అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు.
అర్దమాన్ తర్వాత నిర్మిస్తున్న మారో న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రాజెక్ట్ ఎస్-4. అయితే బయటకు చెప్పక పోయినా దాని నిర్మాణం కూడా పూర్తయిందని తెలుస్తోంది. ప్రాజెక్టు ఎస్-4 సీ ట్రయల్స్లో ఉందని సమాచారం.
దేశ భద్రతే కీలకం..
అణ్వస్త్ర ప్రయోగానికి భారత్ పూర్తి వ్యతిరేకం. ముందుగా ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ప్రయోగించేది లేదని భారతదేశం స్వీయ నియంత్రణ పాటిస్తోంది. అణ్వస్త్ర నిరోధక ఒప్పందంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే అణ్వస్త్ర పరిజ్ఞానం పెంచుకోవడంలో, దేశ భద్రత అంశంలో రాజీ పడే ప్రసక్తే లేదంటోంది.
తూర్పు తీరంలో వర్ష ప్రాజెక్టులాగానే, పశ్చిమంలో కార్వార్ సిద్ధమౌతోంది. కర్నాటకలోని కార్వార్ నౌకా స్థావరం విస్తరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్ట్ సీబర్డ్లో భాగంగా కర్నాటకలోని కార్వార్ స్థావరం పశ్చిమ తీరాన్ని కాపాడుతోంది. ఇదే తరహాలో రాంబిల్లి వర్ష ప్రాజెక్ట్ తూర్పు తీరానికి రక్షణగా, పహారాగా వుంటుంది. ప్రాజెక్టు వర్షతో సముద్ర రక్షణ వలయ సామర్థ్యాన్ని పెంచే దిశలో భారత్ మరో అడుగు ముందుకేసినట్లే. ఇది పూర్తిగా వ్యూహాత్మక స్థావరం కూడా. ఈ స్థావరంలో 32 నౌకలు, సబ్మెరైన్లతోపాటు మరికొన్ని నౌకలు అందుబాటులోకి రానున్నాయి.
హైనన్ దీవిలో చైనా అణు జలాంతర్గాముల స్థావరం మాదిరిగా రాంబిల్లి నౌకా స్థావరం కూడా ఉపగ్రహాలకు దొరకదు. లోతైన జలాల్లో సబ్ మెరైన్ల రాకపోకలకు ఇది అనువైన ప్రాంతం. అవసర సమయాలలో గుట్టుగా ఖండాంతర క్షిపణులను మోసుకెళ్లడానికి న్యూక్లియర్ సబ్మెరైన్లకు ఈ స్థావరం తప్పనిసరి. దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పటమే కాక అణ్వస్త్ర జలాంతర్గాముల బేస్ పాయింట్గా ఇప్పుడు ఆంధ్రా తీరం ప్రసిద్ధి కెక్కింది. మొత్తంమీద దేశ సరిహద్దుల రక్షణలో ఆంధ్ర ప్రదేశ్ తూర్పు తీరప్రాంతం కీలకంగా మారింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.