
జీవితంలో ఎవరి కెరీర్కైనా ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్లోనే విద్యార్థులు తమ జీవితానికి పునాదులు వేసుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నెన్నో లక్ష్యాలు పెట్టుకుంటారు. కానీ, పేద విద్యార్థులు చదువుకోవాలంటే, ముందుగా వారి కడుపు నిండాలి. అదికూడా సరైన పోషకాహారం అందినప్పుడే విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెట్టగలుగుతారు.
ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గుతోంది. దానికి కారణం పేదరికం, ఆకలేనని తేలడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారంగా స్వాతంత్ర సమరయోధురాలు, నిత్య అన్నదాతగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది.
విద్యార్థుల హాజరు శాతం పెంచి, డ్రాపౌట్స్ తగ్గించడం, విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి కలిగించడంతో పాటు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేయడం, పేద విద్యార్థుల ఆకలి తీర్చడం. అంతేకాకుండా విద్యార్థులలో సామాజిక సమానత్వాన్ని కల్పించడంలాంటివి పథకం ముఖ్య ఉద్దేశ్యాలుగా ఉన్నాయి. పథకంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరుతున్నాయా? పథకం వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకోవడానికి పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా పలు కాలేజీలను సందర్శించి, లోతుగా అధ్యయనం చేసింది.
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వివిధ మండలాల్లోని 48 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ పరిశోధక బృందం సందర్శించింది. పథకం కింద అందిస్తున్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతుల గురించి విద్యార్థుల అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చ్ 7 వరకు క్షేత్రస్థాయిలో ఈ అధ్యయనం కొనసాగింది. క్షేత్రస్థాయి సర్వేలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, వంటపనివారు, సామాజిక కార్యకర్తల నుంచి సంస్థ పరిశోధక బృంద సభ్యులు అభిప్రాయాలను సేకరించి, నివేదికను రూపొందించింది.
పథకం నేపథ్యం..
గోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ‘డొక్కా సీతమ్మ’ పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు. గతంలో పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని పేరు మార్చి ఇంటర్మీడియట్ కాలేజీలకు కూడా విస్తరించారు. 2025 జనవరి 4న విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పథకాన్ని మానవ వనరుల శాఖామంత్రి లోకేశ్ లాంఛనంగా ప్రారంభించారు.
మండల కేంద్రాల్లో ఉండే ప్రభుత్వ కాలేజీలకు దూర గ్రామాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి వస్తుంటారు. వీరిలో చాలామంది బడుగు బలహీనవర్గాలకు చెందిన వారే ఉంటారు. పలు కారణాలతో చాలా మంది లంచ్ బాక్స్ తెచ్చుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో హాజరు శాతం తగ్గడాన్ని గమనించిన టీడీపీ ప్రభుత్వం 2018 ఆగస్టులో ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే, ఈ పథకాన్ని నిలిపివేసింది. 2024లో తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని పునఃప్రారభించింది.
475 కాలేజీల్లో అమలు..
రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,48,419 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకంలో భాగంగా భోజనం అందించడానికి 398 కాలేజీలను సమీపంలోని ప్రభుత్వ పాఠాశాలలకు అనుసంధానం చేశారు. కాగా మిగిలిన 77 కాలేజీలను సెంట్రలైజ్డ్ కిచెన్లకు అనుసంధానించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.29.39 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.85.84 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జీవో 40లో లోపాలు..
పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 40 జారీ చేసింది. జీవోలో మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో పథకం అమలు చేయడంలో అనేక సమస్యలకు కారణమవుతున్నట్టు సర్వే బృందం దృష్టికి వచ్చింది. భోజనాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వండించి కాలేజీలకు తరలిస్తున్నారు. కానీ, వాహన ఖర్చుల గురించి జీవోలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదని సర్వేలో వెల్లడయ్యింది. ‘విద్యార్థులకు అందించే భోజనానికి సంబంధించిన వివరాల మీద కూడా స్పష్టత ఇవ్వలేదు. భోజనం వండిన నాలుగు గంటల్లోనే విద్యార్థులకు వడ్డించాలని జీవో చెప్తోంది. కానీ, సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి పొద్దున్నే ఆహారం వస్తుంది. దానిని నాలుగు గంటల తర్వాతే వడ్డిస్తున్నారు. దీనివల్ల ఆహారపదార్థాలు చల్లబడిపోతున్నాయి.’అని నివేదిక ప్రస్తావించింది.
పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం ఒక్కో విద్యార్థి భోజనానికి రూ.14.50లు మాత్రమే ప్రభుత్వం అందజేస్తుంది. ఈ విషయంపై జీవో 40లో ఎక్కడా స్పష్టం చేయలేదు. ప్రభుత్వం కేవలం రేషన్ బియ్యం, కోడిగుడ్డు, చిక్కి మాత్రమే అందజేస్తోంది. విద్యార్థులకు ఆహారాన్ని డ్వాక్రా మహిళలు, అక్షయపాత్ర, స్వచ్ఛంద సంస్థలు వండుతున్నాయి. వీటికి ప్రభుత్వం ఇచ్చే రూ.14.50ల్లోనే కూరగాయలు, గ్యాస్ సిలిండర్, వంటచెరుకు, నూనె, ఉప్పు, కారం, పసుపు, ఇతర వంట సామాగ్రిని వారే సమకూర్చుకోవాలి.
వంట సిబ్బందికి నెలకు రూ.3,000 జీతమే ఇస్తున్నారు. దీనికితోడు వంట సిబ్బందికి గ్యాస్ సిలిండర్లు కూడా తమ ఖర్చుతోనే కొనాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కూరలను నీళ్లలా వండుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ పథకం అమలు, నిర్వాహణకు ఇంటర్ విద్యా డైరెక్టర్ చర్యలు తీసుకుంటారని చెప్పినా, వారు ఏమి చేయాలని మాత్రం చెప్పలేదు. తనిఖీ వ్యవస్థ గురించి కూడా జీవోలో స్పష్టంగా పేర్కొనలేదు.
పిండి కొద్దీ రొట్టె
పిండికొద్దీ రొట్టె సామెతలా పథకానికి తగిన నిధులు కేటాయించకుండా ఆశించిన లక్ష్యాలు చేరుకోవడం సాధ్యం కాదు. ఏ కార్యక్రమం చేపట్టిన తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ‘డొక్కా సీతమ్మ’ భోజన పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం సాధ్యపడటం లేదని నివేదిక ద్వారా అర్థం అవుతుంది.
‘ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సరిపోకపోవడం వల్ల కూరలు, ఇతర ఆహారపదార్థాలు నాణ్యతపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న భోజనాన్ని తీసుకోవడానికి విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో భోజనం చేయడానికి ఇష్టపడటం లేదు. నాణ్యమైన భోజనం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’అని కర్నూల్లో ఒక అధ్యాపకులు(పేరు వెల్లడిరచడానికి ఇష్టపడ లేదు) తెలిపారు.
ఇపుడున్న ధరల ప్రకారం కనీసం ఒక్కొక్క విద్యార్థికి ఒక్క భోజనానికి రూ.30 కేటాయిస్తేనే ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం విద్యార్థులకు అందించవచ్చు.
పాయకాపురం నుంచే సర్వే ప్రారంభం..
పథకాన్ని ప్రారంభించిన విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచే పీపుల్స్ పల్స్ సంస్థ బృందం సర్వేను ప్రారంభించింది. పథకం ప్రారంభించిన మొదటి రోజు ప్రజా ప్రతినిధులు, అధికారులు హడావిడి చేయడం తప్ప ఆ తర్వాత ఆ కాలేజీలకు ఎవరు రాలేదని, కనీసం తనిఖీలు కూడా చేయడంలేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చినప్పుడు నాణ్యమైన ఆహారం పెడతారని, తర్వాత నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
బడుగు, బలహీనవర్గాల ఆకలి తీరుస్తున్న పథకం..
ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారా అని పీపుల్స్ పల్స్ సంస్థ పరిశోధకులు విద్యార్థులను ప్రశ్నించినప్పుడు, తింటున్నామని 61.2 శాతం మంది చెప్పారు. కాగా 32.5 శాతం మంది అప్పుడప్పుడు తింటున్నామని, 1.3 శాతం మంది తినడం లేదని చెప్పారు. నివేదిక ప్రకారం రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, కర్నూల్ లాంటి పట్టణాల్లో 50 శాతం మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తింటున్నారు. దీనిపై కొంతమందితో సర్వేయర్లు మాట్లాడినప్పుడు ‘నీళ్లలా ఉండే కూరలు, మెత్తటి అన్నం కంటే పొద్దునే మా ఇంట్లో వండే అన్నమే బాగుంటుంది. అందుకే అంతకముందులా రోజూ బాక్స్ తెచ్చుకుంటాను’ అని కాకినాడలో ఐశ్వర్య అనే విద్యార్థిని చెప్పింది.
అంతేకాకుండా, చాలా కాలేజీలలో తక్కువమంది మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారు. మిగతావారు భోజనానికి సంక్షేమ హాస్టల్స్ లేదా ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. నాణ్యతతో పాటు అక్కడ కూడా శుభత్ర లేకపోవడంతో కొంతమంది కేవలం గుడ్డు, చిక్కి తీసుకుంటూ, భోజనం మాత్రం చేయడం లేదు. ఇలాంటి చోట్ల అధ్యాపకులు లేదా ప్రిన్సిపల్స్ చొరవ తీసుకుని పర్యవేక్షణ పెంచితే, భోజనం తినే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని నివేదిక తెలిపింది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎక్కువ శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులే చదువుకుంటున్నారు. బీసీలు 60శాతం, ఎస్సీలు 22శాతం, ఎస్టీలు 6శాతం, ఓసీలు 12శాతం ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది రైతులు, రోజువారి కూలీలు, ప్రయివేట్ ఉద్యోగులు, కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరి పిల్లలు ఉదయం గ్రామాల నుంచి 8 గంటలకే బయల్దేరి మండల కేంద్రాల్లో ఉండే జూనియర్ కాలేజీలకు చేరుకుంటారు. కొన్ని సార్లు ఇంటి నుంచి లంచ్బాక్స్ తెచ్చుకోవడం వీలుకాకపోవడంతో అర్థాకలితో గడిపేవాళ్లు. ఈ పరిస్థితుల్లో పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించి ఈ పథకాన్ని బలోపేతం చేస్తేనే లబ్ధిదారులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం గుర్తించాలి.
మెనూ మారాలి..
తమ బృందం పరిశీలించిన కాలేజీల్లో ఎక్కడా మెనూ బోర్డులు కనిపించలేదని పీపుల్స్ పల్స్ సంస్థ నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా మెనూ ప్రకారమే అన్ని పదార్థాలు ఉంటున్నాయా? అని తమ బృందం విద్యార్థులను అడిగినప్పుడు ఉంటున్నాయని 76.7 శాతం మంది, కొంత తేడా ఉంటుందని 20.8 శాతం మంది, ఉండటం లేదని 2.5 శాతం మంది చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న మెను మీకు నచ్చిందా? లేక ఏమైనా మార్పులు చేయాలా? అని వారిని అడిగినప్పుడు 29.7 శాతం మంది నచ్చిందని చెప్పగా, 3.8 శాతం మంది నచ్చలేదని, 66.5 శాతం మంది మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పారు.

భోజనంపై విద్యార్థుల అభిప్రాయం..
గుంటూరు పెనుమాక గర్ల్స్ కాలేజీలో పీపుల్స్ బృందం పర్యటించినప్పుడు అక్కడ అక్షయ పాత్ర సంస్థ ఆహారం సరఫరా చేస్తోంది. వారు పంపిన పులిహోర పిల్లలు తినకుండా వదిలివేశారు. అక్షయపాత్ర అందజేస్తున్న ఆహారం ఉదయం 10.30కే వస్తోంది. దీంతో అది మధ్యాహ్నానికి చల్లబడిపోవడం, మెత్తబడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రయివేట్ సంస్థలు సరఫరా చేస్తున్న ఇతర కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
మహిళా సంఘాలే బెటర్..
ఉప్పు, కారంతో పాటు రుచి విషయంలో మహిళా సంఘాలు వండిన భోజనమే బాగుందని ఎక్కువ మంది విద్యార్థులు పరిశోధక బృందానికి చెప్పారు. ప్రయివేట్ సంస్థల కిచెన్ల నుంచి వస్తున్న ఆహారం చప్పగా ఉంటుందన్నారు. దీనితో పాటు వాళ్లు గుడ్లు ఇవ్వడం లేదని, దీంతో ఉడకబెట్టిన గుడ్లు బయట నుంచి తీసుకువస్తున్నామని చెప్పారు. కాబట్టి, మహిళా సంఘాలకు మరింత పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని అప్పగిస్తే, భోజన నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
సర్వే నివేదికలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం స్థానికంగా వండకుండా అక్షయపాత్ర, కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఉదాహరణకు జగ్గంపేట, కిర్లంపూడి కాలేజీల్లో పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వండి తీసుకొస్తుండగా, కాకినాడ కాలేజీకి అక్షయ పాత్ర నుంచి వస్తోంది. సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు కాలేజీలకు బెండపూడిలోని అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ నుంచి ఆహారం వస్తోంది.
ఇలా తీసుకొస్తున్న ఆహార పదార్థాలు వేడిగా ఉంటున్నాయా? అని పీపుల్స్ పల్స్ సంస్థ పరిశోధక బృందం అడిగినప్పుడు 58 శాతం మంది కొన్నిసార్లు మాత్రమే వేడిగా ఉంటుందని చెప్పారు. కొన్ని కాలేజీల్లో దాతలు ఇచ్చిన హాట్ బాక్సుల్లో తెచ్చి వడ్డించడం వల్ల వేడిగా ఉంటున్నాయని, కొన్ని కాలేజీల్లో మామూలు గిన్నెలో వడ్డించడం వల్ల తొందరగా చల్లబడిపోతున్నట్టుగా నివేదిక ద్వారా అర్థం అవుతుంది.
వృధా అవుతోందా?
మధ్యాహ్న భోజనంలో వేస్టేజ్ ఉందా? ఉంటే ఎందుకుంటోందని పీపుల్స్ పల్స్ సంస్థ సభ్యులు విద్యార్థులను ప్రశ్నించినప్పుడు. రైస్ సరిగ్గా లేనప్పుడు 34.8 శాతం, కూరలు బాగాలేనప్పుడు 18.4 శాతం, పదార్థాలు రుచి లేనప్పుడు 14.6 శాతం వేస్టేజ్ ఉంటుందని, వేస్టేజ్ ఉండటం లేదని 32.2 శాతం మంది విద్యార్థులు చెప్పారు.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ప్రైవేట్ సంస్థలు సరఫరా చేస్తున్న ఆహారం పొద్దున్నే రావడం, గంటల తరబడి బాక్సుల్లో నిల్వ ఉంచడంతో మెత్తబడిపోతోంది. కొన్నిసార్లు పాచిపోవడం కూడా జరగుతోంది. దీంతో విద్యార్థులు తినలేక ఆహారం వృధా అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా భోజనం నాణ్యత మెరుగుపరిచేలా కాలేజీలోనే వండి, వడ్డించే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పరిశుభ్రత కరువు..
భోజనం వండే ప్రదేశం, విద్యార్థులు భోజనం చేసే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. మధ్యాహ్న భోజనం చేయడానికి ఇచ్చే ప్లేట్లు, గ్లాసులు శుభ్రంగా ఉంటున్నాయాని విద్యార్థులను బృంద సభ్యులు అడిగినప్పుడు ఉంటున్నాయని 56.1 శాతం చెప్పగా, ఉండటం లేదని 17.6 శాతం, కొన్నిసార్లు మాత్రమే శుభ్రంగా ఉంటున్నాయని 26.3 శాతం చెప్పారు. భోజనం చేసే ప్రదేశం శుభ్రంగా ఉంటుందాని అడిగినప్పుడు 50.5 శాతం ఉంటుందని చెప్పగా, 32.6 శాతం ఉండటం లేదని, కొన్నిసార్లు మాత్రమే శుభ్రంగా ఉంటున్నాయని 16.9 శాతం మంది చెప్పారు. శుభ్రత ఉండాలంటే:కచ్చితంగా సంబంధిత అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేయాల్సిన అవసరాన్ని నివేదిక గుర్తుచేసింది.
సరిగా లేని తనిఖీలు..
మధ్యాహ్న భోజనం సరిగా పెడుతున్నది, లేనిది తనిఖీలు చేయడానికి ఎవరైనా వస్తుంటారా? అని విద్యార్థులను రిసర్చర్లు అడిగినప్పుడు 79.8 శాత మంది రావడం లేదని చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు, ప్రజా ప్రతినిధులు రానప్పుడు కనీసం అధ్యాపకుల పర్యవేక్షణ అయినా ఉండాలి. కానీ, తమకు అనేక బాధ్యతలు ఉండటం వల్ల పర్యవేక్షణ సరిగ్గా చేయలేపోతున్నామని అధ్యాపకులు చెప్తున్నారని నివేదిక ప్రస్తావించింది. ఈ విషయాలను పరిశీలిస్తే భోజనం నాణ్యత, పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు కచ్చితంగా ఆకస్మిక తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. దీంతో విద్యార్థులకు మేలు కలిగించేలా మధ్యాహ్న భోజన పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుందని తెలిపింది.
విద్యార్థుల గోడు వినేది ఎవరు?
సేవలైనా, పాలనైనా మెరుగుపడాలంటే సరైన ఫీడ్బ్యాక్, ఫిర్యాదుల్ని స్వీకరించి పరిష్కరించే వ్యవస్థ కచ్చితంగా ఉండాలి. కానీ, మధ్యాహ్న భోజన పథకానికి అలాంటి వ్యవస్థ లేకపోవడం విద్యార్థులకు పెద్ద సమస్యగా మారింది. 81.8 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన సమస్యల గురించి ఫిర్యాదు చేసే సౌకర్యమే లేదని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా దీనిని పట్టించుకోవడం లేదని పీపుల్స్ పల్స్ సంస్థ పరిశోధకులకు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పారు. కొంతమంది విద్యార్థులు సమస్యలను ప్రిన్సిపల్ లేదా అధ్యాపకులకు తెలియజేస్తున్నా పరిస్థితిలో ఏ మార్పు రావడం లేదని అన్నారు. ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకుని వెంటనే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ లేదా ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది. అంతేకాకుండా ప్రతినెలా అధికారులు సమీక్ష నిర్వహించి, విద్యార్థుల ఫిర్యాదులపై స్పందించాలి. ప్రిన్సిపల్స్, అధ్యాపకులు తక్షణ చర్యలు తీసుకునేలా వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పాలి. విద్యార్థుల సమస్యల్ని పట్టించుకోకపోతే, మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం నీరుగారిపోవడం ఖాయమని నివేదిక హెచ్చరించింది.
మంచినీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి..
భోజనానికి కంటే ముందు మంచి నీరు చాలా ముఖ్యం. తాగడానికి సరిపడా నీళ్లు లేకపోతే, భోజనం చేయాలనిపించదు. కానీ, చాలా కాలేజీల్లో తాగునీటి వ్యవస్థ సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. కాలేజీల్లో కనీస అవసరమైన తాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నివేదిక పేర్కొంది.
భోజనం చేయడానికి వసతుల కొరత..
నివేదిక ప్రకారం, కాలేజీల్లో భోజనం సమయానికి అందిస్తున్నప్పటికీ, తినేందుకు సరైన వసతులు లేకపోవడం విద్యార్థులకు ప్రధాన సమస్యగా మారింది. భోజన సమయంలో సరైన చోటులేకపోవడంతో ఎక్కువమంది చెట్ల కింద, లేక ఆరు బయట కూర్చోని తినడం పీపుల్స్ పల్స్ బృందం అనేక కాలేజీల్లో చూసింది. కాలేజీల్లో డైనింగ్ హాల్స్ లేకపోవడంతో మధ్యాహ్న భోజనం ఒక అన్నదాన కార్యక్రమంలా సాగుతోందని తెలిపింది.
అయితే, ఇక్కడ మెచ్చుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే విద్యార్థులు మానవతా విలువలు పాటిస్తున్నారు. రాజకీయ నాయకులు సృష్టించే కులమత భావనలు వారిలో లేవు. భోజన సమయంలో ఇతరులతో కలిసి కూర్చుంటున్నారాని విద్యార్థులను పరిశోధక బృంద సభ్యులు అడిగినప్పుడు కలిసే తింటామని 90 శాతం చెప్పడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భోజనం పెట్టడమే కాక, విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో తినేలా చూడటం కూడా ప్రభుత్వ బాధ్యతేనని నివేదిక వెల్లడించింది.

విద్యార్థి సంఘాల వైఫల్యం..
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు విద్యార్థి సంఘాల మద్దతు లేదని పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ పథకంపై విద్యార్థి సంఘాలు శ్రద్ధ పెడుతున్నాయాని పరిశోధకులు ఆరా తీయగా ఏ విద్యార్థి సంఘం ఈ పథకంలోని లోపాలను పట్టించుకోవడం లేదని తెలిసింది. విద్యార్థి సంఘాలు ఎంతసేపూ ప్రైవేట్ విద్యా సంస్థల చుట్టూ తిరుగుతూ తమ బంధువులకు ఫ్రీఅడ్మిషన్స్ ఇప్పించుకోవడం, సెటిల్మెంట్స్ చేసుకోవడంలోనే బిజీగా ఉంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నట్టుగా నివేదిక ద్వారా తెలుస్తోంది. ప్రతిపక్ష వైసీపీ విద్యార్థి సంఘం సహా కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు కూడా ఈ సమస్యలపై మౌనంగా ఉండటం గమనించాల్సిన విషయమని నివేదిక తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడం కోసం ఏర్పడ్డ సంఘాలు ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తి చూపాలి, పరిష్కారం కోసం పోరాడాలి. కానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేయడం దురదృష్టకరమని నివేదిక తెలిపింది.
ప్రచారానికే పరిమితమవుతున్న నేతలు, మీడియా..
పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం, డొక్కా సీతమ్మ పథకం ప్రారంభంలో రాజకీయల నేతలతో పాటు మీడియా కూడా ఎంతో హడావుడి చేసింది. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత వాటిలో లోటుపాట్లను గమనించడంలో నేతలతో పాటు మీడియా కూడా పూర్తిగా విఫలమైనట్లు అధ్యయనంలో తేలింది. స్థానిక నేతలు పథకం అమలు తీరును పట్టించుకుంటున్నారా? అప్పుడుడప్పుడు పర్యవేక్షిస్తున్నారా? అని విద్యార్థులను సర్వేవర్లు అడగ్గా అలాంటిదేమీ లేదనే అభిప్రాయం అన్నిచోట్ల వినిపించింది. ఇక మీడియా కూడా ఏదో ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప, ఈ పథకం అమలు తీరుపై వార్తలు రాసిన దాఖలాలు ఎక్కడా లేవని సమస్యను నివేదిక ఎత్తి చూపింది.
‘ఇంటర్ విద్యార్థులకు పోషకాహారం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆదారణ పెరిగే అవకాశం ఉంది. ఇంటర్ పూర్తి కాగానే, విద్యార్థులకు ఓటు హక్కు కూడా వస్తుంది. కాబట్టి, ప్రభుత్వం వారికి మంచి ఆహారం అందిస్తే భవిష్యత్తులో వారు గుర్తుపెట్టుకుని ఓట్లు కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి, ఈ పథకాన్ని ఏదో మొక్కుబడిగా అమలు చేయకుండా, వారి భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడిగా భావించాలి’ అని నివేదిక తెలియజేస్తుంది.
పీపుల్స్పల్స్ అందించిన అదనపు సూచనలు..
మధ్యాహ్న భోజన పథకంపై ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తూ అంతా బాగుందనే భ్రమల్లో ప్రభుత్వం ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. పథకం ఎలా అమలవుతుందో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహిస్తే ప్రయోజకరంగా ఉంటుంది. సోషల్ ఆడిట్లో పథకం అమలు తీరులో లోటుపాట్లతో పాటు, ఎక్కడైనా అవినీతి జరిగినా గుర్తించి చర్యలు తీసుకోవచ్చు.
మధ్యాహ్న భోజనం పథకం విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టమైన వైఖరీతో జీవోను విడుదల చేయాల్సిన అవసరం ఉంది. పేరు ప్రఖ్యాతలున్న అక్షయ పాత్ర సంస్థపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా, వారు తయారు చేసే ఆహార పదార్థాలు విద్యార్థులకు నచ్చడం లేదు. కాబట్టి భోజనం వండే బాధ్యతలను పాఠాశాలల మాదిరిగా, అన్ని కాలేజీల్లో మహిళా సంఘాలకే అప్పగిస్తే విద్యార్థుల రుచులకు అనుగుణంగా ఆహారం వండే అవకాశాలుంటాయి.
ఈ పథకం పర్యవేక్షణ, వాటి నిర్వహణ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక ప్రత్యేక అధికారి నియామకంతో పాటు, కార్పొరేషన్ బాధ్యతలను ఒక ప్రజా ప్రతినిధికి లేదా సమర్థతగల నాయకుడికి అప్పగించాలి. ఇందులో కాలేజీ ప్రిన్సిపల్తో పాటు కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, సంఘ సేవకులను, విద్యార్థి సంఘాల నేతలను, కార్మికులను కూడా సభ్యులుగా నియమించి వీటి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నిత్యం పర్యవేక్షించాలి.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఈ పథకంలో దాతలు, పారిశ్రామిక వేత్తలు పాలు పంచుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. దాతల సహాయానికి గుర్తింపుగా కాలేజీలలో ఒక డిస్ ప్లే బోర్డ్లో వారి వివరాలు నమోదు చేస్తే గౌరవప్రదంగా ఉండడమే కాకుండా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. దీని కోసం స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గడంతో పాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. పథకానికి సంబంధించి వివిధ రూపాల్లో దాతలను ప్రోత్సాహించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తే పథకం లక్ష్యం కూడా నెరవేరుతుంది.
ప్లేట్లను శుభ్రంగా కడిగేలా సిబ్బందికి సూచించాలి. శుభ్రతకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కొన్ని చోట్ల వంట సిబ్బంది అపరిశుభ్రంగా ఉంటుండడంతో అక్కడ తినడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. వంట వండే సిబ్బందికి శుభ్రతతో పాటు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం వేసని కాలంలో ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి.
వంట సిబ్బందికి ప్రస్తుతం అందిస్తున్న వేతనాలను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వంట మాస్టర్లకు, వారి అసిస్టెంట్లకు మంచి డిమాండు ఉంది. వారు రోజుకు రూ.500 నుండి రూ.1000 వరకు సంపాదిస్తున్నారు. ఇందుకు భిన్నంగా ఈ పథకంలో వంట సిబ్బంది అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నారు. ధరలు ఆకాశానంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలనే డిమాండ్ ఉంది.
వంట వండే సిబ్బందికి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఒక్కోసారి ఐదారు నెలలు కూడా బిల్లుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించకపోవడంతో వీరు అప్పులు తెచ్చి విద్యార్థుల కోసం వండాల్సి వస్తుంది. నిరుపేదలైన వీరికి బయట అప్పు పుట్టడం కూడా గగనమవుతోంది. నిధులు లేకుండా ఆహారం వండడం సాధ్యపడదు కాబట్టి ప్రభుత్వం ప్రతి నెల వంట సిబ్బందికి బిల్లులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. గ్యాస్ సిలిండర్లను ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం కోసం అందించాలి.
విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటానికి వంట షెడ్లు, డైనింగ్ రూమ్స్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. వీటి ఏర్పాటుకు దాతలను కూడా ప్రోత్సాహిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులతో పాటు లెక్చరర్లు, సిబ్బంది కూడా మధ్యాహ్న భోజనం పథకంలోనే తింటే నాణ్యత మరింత మెరుగ్గా ఉంటుందని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన అనంతరం అంతా బాగుందనే భావనలో ప్రభుత్వం ఉన్నా వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. పథకం ఎలా ఉందనే దానిపై విద్యార్థుల స్పందనను పరిశీలిస్తే బాగుందనే వారు 23.3% మాత్రమే ఉన్నారు. 49.7 శాతం పర్వాలేదని అభిప్రాయపడ్డారంటే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
ఈ పథకాన్ని ఏడాది పొడవునా నిర్వహించాలని 86.2% మంది విద్యార్థులు సర్వేలో అభిప్రాయపడిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తే బాగుంటుంది. మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణకు గ్రామ సచివాలయం సిబ్బందిలో ఒకరికి బాధ్యతలు అప్పగించాలి. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో సహా మధ్యాహ్న భోజన పథకం పనితీరుపై కనీసం నెలకు ఒక్కసారి క్రమం తప్పకుండా ఉన్నతస్థాయిలో సమీక్షించాలి. దీంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు సాధించవచ్చు.
ఈ పథకంలోని లోపాలను సరిదిద్ది వచ్చే విద్యా సంవత్సరంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పాఠశాలల్లో వండుతున్న ప్రాంతాల్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఆయా కాలేజీలలోనే వండేలా చర్యలు తీసుకోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.