
దౌత్య యాత్రలో భాగంగా బీజేపీ- శివసేన ఎంపీలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సున్నితమైన అంశాలకు సంబంధించి తమ హార్డ్కోర్ సంఘ్ రాజకీయ అవగాహనకు భిన్నంగా లౌకిక రాగాలాపన అందుకుంటే, దేశంలో లౌకికతత్వ పరిరక్షణకై పోరాడుతున్న ప్రతిపక్షాలు మాత్రం పాలకపక్షం వల్లె వేసే విషయాలను వల్లె వేయడం వర్తమాన రాజకీయాలలో కనిపిస్తున్న వైచిత్రి.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదంటూ భారత ప్రభుత్వం తీసుకున్న వైఖరికి సంబంధించిన విషయాలను లోకానికి తెలియజేయడానికి 33 దేశాలకు పార్లమెంటరీ ప్రతినిధి బృందాలను మోడీ ప్రభుత్వం పంపింది. ఈ ప్రతినిధి బృందాల్లో పాలక ఎన్డీయే కూటమితో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఎంపీలు సభ్యులుగా ఉన్నారు.
లౌకికవాదం, ముస్లింల పట్ల వివక్ష, అణచివేత దాడులు వంటి కొన్ని విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఈ ప్రతినిధి బృందాలలోని భారతీయ జనతా పార్టీ, శివసేన ఎంపీలు జాతీయ రాజకీయాలలో తీసుకుంటున్న వైఖరులకు భిన్నమైన వైఖరిని తీసుకున్నారు.
మరోవైపు ఈ దౌత్య ప్రతినిధి బృందాలలో సభ్యులుగా ఉన్న ప్రతిపక్ష పార్టీ ఎంపీలు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ బీజేపీ ప్రయోగించిన భాషలోనే మాట్లాడారు.
ముస్లింల అణిచివేతపై ‘అపోహలను’ తొలగించడం, పాలస్తీనాపై వైఖరి..
ఈ ప్రతినిధి బృందంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ నిషికాంత దూబే భారతదేశంలో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలకు పెట్టింది పేరు. తాజాగా వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన మాజీ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎస్వై ఖురేషిని ముస్లిం కమిషనర్గా అభివర్ణించారు. అటువంటి వ్యక్తి దౌత్య ప్రతినిధి బృందంలో భాగంగా వివిధ వేదికలపై మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత అని, మతపరమైన వైవిధ్యం ఉన్నదని దేశంలోని ముస్లింలు కూడా ప్రజలందరితోపాటు సమాన హక్కులు అవకాశాలు పొందుతున్నారని చెప్పుకొచ్చారు. పాలస్తీనాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఇజ్రాయిల్ పాలస్తీనాలు స్వతంత్ర దేశాలుగా ఉండాలని ఆది నుంచి భారతదేశం చెప్తున్నదని వక్కాణించారు.
అల్జీరియా రాజధాని అల్జీర్స్లో ఏఎన్ఐ వార్త సంస్థతో దూబే మాట్లాడుతూ పాలస్తీనా ఇజ్రాయిల్ విషయంలో భారతదేశం ఏ పక్షం వహిస్తుంది? దేశంలో ముఖ్యంగా స్థితిగతులు ఎలా ఉన్నాయి?వంటి అంశాలకు సంబంధించి స్పందిస్తూ ఈ ప్రతినిధి బృందంలో భాగస్వామిగా ఉన్న ఓవైసీ పాకిస్తాన్లో కంటే భారతదేశంలోనే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారని సమాధానం ఇచ్చారని తెలిపారు.
“సమస్యలు లేని ఇల్లు ఏదైనా ఉంటుందా? హిందువుల్లోనే పరస్పరం సమస్యలు లేని వారు ఉన్నారా? కానీ మా ప్రతినిధి బృందంలో ఐదు మతాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. అందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. పరస్పరం సహకరించుకున్నారు” అన్నారు.
నిషికాంత దూబే సభ్యుడిగా ఉన్న ఈ బృందం ప్రధానంగా ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియాలలో పర్యటించింది. భిన్నత్వంలో ఏకత్వంతో సహజీవనం చేస్తున్న లౌకిక భారతావనిని ఈ పర్యటనలో దూబే ప్రశంసించక తప్పని పరిస్థితి తలెత్తింది. పాలకపక్ష సభ్యులతో సహా దేశంలో ప్రజలందరికీ పౌర జీవనంలోనూ చట్ట పరంగాను సమాన అవకాశాలు కల్పిస్తున్నామని ప్రపంచానికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
ఓవైపు పాలస్తీనాను సమర్థిస్తున్న వారిపై బీజేపీ, బీజేపీ ఐటీ సెల్ విరుచుకుపడుతుంటే దూబే మాత్రం పాలస్తీనా విషయానికి వస్తే ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని భారతదేశం సమర్ధించదు కాబట్టి హమస్ చర్యలను వ్యతిరేకిస్తున్నామని పాలస్తీనా పట్ల పాలస్తీనా ప్రజల పట్ల భారతదేశం ఎప్పుడూ సంఘీభావాన్ని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
రెండో విషయానికొస్తే భారతదేశంలో ముస్లింల పరిస్థితి. భారతదేశంలో ముస్లింలు ఇతర లౌకిక దేశాలలో ఉన్న ముస్లింల కంటే మెరుగైన జీవనంతో జీవిస్తున్నారని అన్నారు. ఈ బృందంలో భాగస్వామి అయిన ఓవైసీ రాజ్యాంగంలోని 25వ అధికరణం మైనారిటీలకు కూడా సమాన హక్కులు ఇస్తుందని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందని సూడాన్లోనైనా టర్కీలోనైనా అమెరికాలోనైనా జరుగుతున్న ఉగ్రవాద దాడులకు మూలాలు పాకిస్తాన్లోనే ఉన్నాయని అందువల్ల పాకిస్తాన్పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో భాగంగా ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు.”
“భారత ప్రధాని అభిప్రాయాలను ప్రపంచం ముందు ఉంచాము. ఉగ్రవాదంపై ఎటువంటి మీనమేషాలు లెక్కించేది లేదు. పాకిస్తాన్ తన ప్రజలకే తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఉంది. పాకిస్తాన్ ఏ రకమైన సహాయం కోసం ఈ దేశాలను అర్థించిన, ఉగ్రవాదానికి సహాయాన్ని నిలిపివేయకపోతే మిమ్మల్ని కాపాడలేమన్న విషయాన్ని స్పష్టం చేయాలని ఈ దేశాలను కోరాము. అమెరికా, ప్రపంచ బ్యాంకు, ఐఎఫ్ఎఫ్ లేదా మరే దేశమైనా పాకిస్తాన్కు అప్పిస్తే, అదంతా అవినీతిమయమైన సైన్యం చేతుల్లో వృధాగా ఖర్చు అయిపోతోందని, పాకిస్తాన్ ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఉపయోగపడటం లేదని వివరించాము” అని తెలిపారు.
చర్చల కోసం గత ప్రభుత్వాల ప్రయత్నం..
ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న బీజే పాండా భారతదేశంలో ప్రకటించిన నూతన సాధారణ స్థితి గురించి వివరించే ప్రయత్నంలో మరింత సున్నితంగా వ్యవహరించారు. బీజేపీ అధినాయకత్వం ప్రయోగిస్తున్న ఉగ్రవాదం- చర్చలు జమిలిగా ముందుకు వెళ్ళవు, రక్తం- నీరు కలిసి ప్రవహించవు వంటి పదజాలాన్ని ప్రయోగించినప్పటికీ భారతదేశం పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటుందని పాండా అన్నారు.
“ఈ ప్రతినిధి బృందంలో ఉన్న సభ్యులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వేర్వేరు భాషలు మాట్లాడుతున్నారు. వివిధ మత విశ్వాసాలు పాటిస్తున్నారు. ఇదే అసలైన నిజమైన భారతదేశం. మానవ చరిత్రలో భారతదేశమంత అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మరోటి లేదు. మేము ఇవ్వగలిగిన అతి పెద్ద సందేశం ఇదే. మేము కొన్ని చర్యలను తీసుకుంటాము, ఉదాహరణకు సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తాము. వీసాలు ఇవ్వటం, ఓడరేవుల ద్వారా వాణిజ్యం లాంటి లావాదేవీలను నిలుపుదల చేస్తున్నాము. ఎందుకంటే చాలా కాలం శాంతియుత పద్ధతుల్లో ప్రయత్నం చేశాము. సాంస్కృతిక కార్యక్రమాలు ఉమ్మడిగా నిర్వహించాము. క్రికెట్ కూడా ఆడాము. అయినా పరిస్థితి మారలేదు” అని పాండా పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్తో చర్చలు జరపడానికి ప్రయత్నించిందని బీజేపీ దుమ్ము ఎత్తిపోసింది. ఈ వైఖరికి భిన్నంగా “పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అర్థవంతమైన చర్యలు తీసుకుంటే, భారతదేశం నాలుగడుగులు ముందుకు వేసి స్నేహ హస్తాన్ని అందించడానికి వెనుకాడబోద”ని అన్నారు.
“ఉగ్రవాదం- చర్చలు జమిలిగా సాగవు. నీళ్లు- రక్తం ఒకే సమయంలో ప్రవహించవు. కానీ మేము ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాము. మాకు స్నేహ సంబంధాలు కావాలి. కాకపోతే ఇప్పటి వరకు చర్చలు ఫలప్రదం కాలేదు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. 1947 నుంచి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాళ్లు కాల్పులు నిలువరిస్తే, మేము కాల్పులు నిలువరిస్తాము. ఈ చర్యలకు పాకిస్తాన్ సుముఖంగా ఉంటే? మేము నాలుగడుగులు అదనంగా ముందుకు వేయటానికి సిద్ధపడతాము. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద స్థావరాలను, శిక్షణా కేంద్రాలను కట్టడి చేయటానికి పాకిస్తాన్ అర్థవంతమైన చర్యలు తీసుకుంటే అంతకంటే సంతోషం ఏమీ లేదు. స్నేహ హస్తాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అన్నారు.
బుల్లెట్లు తినటానికి సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్ ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ అంతటివ్యక్తే హెచ్చరిస్తే, దౌత్య పర్యటనలో ఉన్న ప్రతినిధి బృందం మాత్రం భారతదేశానికి పాకిస్తాన్ ప్రజల పట్ల ఎటువంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు.
“పాకిస్తాన్లో కూడా ప్రజలందరూ శాంతిని కోరుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ దైనందిన రాజకీయాలపై సైన్యం కబ్జా పెట్టింది. ఈ పరిస్థితులు మారాలి” అని పాండా పేర్కొన్నారు.
మాజీ కాంగ్రెస్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కూడా ఈ బృందంలో భాగస్వామిగా ఉన్నారు. గులాం నబీ ఆజాద్కు పాలస్తీనా విముక్తి సంఘానికి మధ్య ఉన్న సుహృద్భావ సంబంధాలను పాండా మెచ్చుకున్నారు. అదేవిధంగా ఆ సంబంధాలను కూడా ఈ సందర్భంగా ఒక సానుకూల అభిప్రాయం కలిగించడానికి ఉపయోగించుకున్నారు.
ఈ విషయంపై మాట్లాడుతూ పాండా “మా బృందంలో ఒక సీనియర్ రాజకీయవేత్త గులాంనబీ ఆజాద్ సభ్యులుగా ఉన్నారు. అలీనోద్యమ కాలంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి పాలస్తీనా విముక్తి సంఘం అధినేత యాసర్ అరాఫత్తో ముఖాముఖి సంభాషణ జరిపారు. ఇవన్నీ భారతదేశ విశ్వసనీయతకు తార్కాణాలు” అన్నారు.
మోడీ ప్రభుత్వం గత పన్నెండేళ్ల కాలంలో పాలస్తీనాతో రానురాను సంబంధాలు కుదించుకుంటూ వచ్చింది. అలీనోద్యమ నేపథ్యాన్ని మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు. ఈ విషయాలను మాత్రం పాండా అంతర్జాతీయ వేదికలపై దాటవేశారు.
ఉగ్రవాద బాధితుల మానవ హక్కులు..
ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, డెన్మార్క్ దేశాలు పర్యటించిన పార్లమెంటరీ దౌత్య బృందానికి బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నాయకత్వం వహించారు. హిమాన్షి నర్వాల్ గురించి ప్రసాద్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడుల్లో పసుపు కుంకుమలు కోల్పోయిన యువతి మానవ హక్కుల గురించి ప్రస్తావించారు.
దేశం శాంతి సుభిక్షాలతో కొనసాగాలని ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ చెప్పినందుకు బీజేపీ సోషల్ మీడియా సైన్యం ఆమెపై విరుచుకు పడింది. అంతేకాకుండా ఆన్లైన్లో వెంటాడి మానసికంగా వేధించింది. ఈ విషయాలను రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించలేదు. ఉగ్రవాదులు చేసిన దాడిని సాకుగా తీసుకొని దేశంలోని ముస్లింలపై అణిచివేతకు పాల్పడరాదని నర్వాల్ చెప్పారు.
“మానవ హక్కులు ఎవరికోసం ఉన్నాయి? ఉగ్రవాద బాధితులకు మానవ హక్కులు ఉన్నాయా లేవా? పెళ్లైన పది రోజులకే ఉగ్రవాదుల దాడుల్లో ఆమె భర్త మరణించారు. మరి ఈ యువవితంతువుకు మానవ హక్కులు ఉన్నాయా లేవా? మానవ హక్కులు అనే భావనను సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఉగ్రవాద బాధితుల మానవ హక్కుల కోసం మేము పనిచేస్తాం” అని బ్రసెల్స్లో మాట్లాడుతూ రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
“మాది ప్రజాస్వామ్య దేశం, నిలకడగా పురోగమిస్తున్న దేశం. ఈ తాజా పరిస్థితుల గురించినటువంటి అభిప్రాయాలను బెల్జియం కేంద్రంగా ఉన్న యూరోపియన్ యూనియన్కు తెలియజేయాలి. మానవ హక్కుల విషయంలో మేము లేవనెత్తిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. ఉగ్రవాదుల మానవ హక్కుల గురించి ఆలోచించింది చాలు. ఇంతటితో దీనికి స్వస్తి చెప్పాలి” అని కూడా అన్నారు.
లౌకిక భారతం..
2019లో ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోడీ “ఈ దేశంలో లౌకికవాదం ముసుగు వేసుకొని ప్రజలను, దేశాన్ని ఇక పక్కదారి పట్టించడానికి ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ప్రయత్నం చేసే సాహసం కూడా చేయలేదు” అని ఎగతాళి చేశారు. కానీ బీజేపీ దాని మిత్రపక్షం శివసేన ఈ దౌత్యపర్యటనలో మాత్రం లౌకిక భారతాన్ని ఆకాశానికి ఎత్తక తప్పని పరిస్థితి ఎదురైంది.
“ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి వచ్చాము. దీర్ఘకాలంగా ఉగ్రవాదంతో భారతదేశం పోరాడుతోంది. పహల్గాంలో విహార యాత్రకు వెళ్లిన యువతి యువకులు, వారి కుటుంబ సభ్యులను ఏప్రిల్ 22న కాల్చి చంపారు” అంటూ లైబీరియా పార్లమెంట్ స్పీకర్ రిచర్డ్ నాగ్బే కూన్తో మాట్లాడుతూ శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే తెలిపారు.
“యువతీ యువకులు, కొత్తగా పెళ్లయిన దంపతులు, పిల్లలతో సేద తీరుతున్న తండ్రులను కాల్చి చంపారు. భార్యల ముందు భర్తలను కాల్చి చంపారు. మతం అడిగి మరీ కాల్చారు. చంపబోయే ముందు బాధితుల మతం ఏంటో తెలుసుకొని కాల్చడంలో ఉగ్రవాదుల ఉద్దేశ్యం దేశంలో ఉన్న మత సామ్రాస్యాన్ని నాశనం చేయడమే. భారతదేశంలో అన్ని మతాలు కలిసిమెలిసి సామరస్యంగా జీవిస్తున్నాయి. ఎవరు యుద్ధాన్ని కోరుకోవడం లేదు” అన్నారు.
పనికిమాలిన జోకర్లు..
స్వరం మార్చింది పాలకపక్ష ఎంపీలు మాత్రమే కాదు. ప్రతిపక్ష ఎంపీలు కూడా. ఈ పర్యటనలో భాగస్వాములైన ప్రతిపక్ష ఎంపీలు జాతీయ రాజకీయాల్లో మాట్లాడే భాష కంటే భిన్నంగా పాలక పార్టీ భాషను వల్లె వేశారు.
ఎంఐఎంకు చెందిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ ప్రభుత్వం ముస్లింలను ఏరుకోరి వెంటాడి వేధిస్తోందని తరచూ విమర్శిస్తుంటారు. విమర్శలకు స్పందనగా బీజేపీ గోధీ మీడియా ఓవైసీపై ఎదురు దాడికి దిగుతుంది. ఓ సీనియర్ బీజేపీ ఎంపీ గతంలో కావాలంటే నువ్వు పాకిస్తాన్కు వెళ్ళవచ్చని ఓవైసీని హెచ్చరించారు. అటువంటి ఓవైసీ పర్యటనలో భాగంగా బీజేపీ పరిభాషని ఉపయోగించారు.
కువైట్లో జరిగిన చర్చల్లో భారతదేశంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలకు ఓవైసీ స్పందిస్తూ “భారతదేశంలో ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని పాకిస్తాన్ వాదించలేదు. పాకిస్తాన్లో ఉన్న మొత్తం జనాభా కంటే భారతదేశంలో ముస్లింలు ఎక్కువ. వారి కంటే మాకు ముందు నిబద్ధత కూడా ఎక్కువే. పాకిస్తాన్ చేస్తోంది తప్పుడు ప్రచారం” అన్నారు.
ఓవైసీ స్వయంగా పార్లమెంట్లో అనేక సందర్భాలలో దేశంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింల కనీస రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తున్న సందర్భాలపై స్పందించారు, విమర్శించారు.
సాధారణంగా బీజేపీ పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు విద్వేషంతో కూడిన భాష ప్రయోగిస్తుంది. కానీ ఈసారి ఈ వంతు ఓవైసీకి వచ్చింది. రావల్పిండిలో ఏర్పాటు చేసిన విందులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు ఫేక్ బొమ్మలు బహుమతిగా ఇచ్చిన ఆసిం మునీర్కు ఫీల్డ్ మార్షల్ స్థాయికి పదోన్నతి ఇవ్వటంపై ఓవైసీ స్పందిస్తూ “పనికిమాలిన జోకర్లు” అని పాకిస్తాన్ నాయకత్వాన్ని నిందించారు.
“ఒక విందు సమావేశానికి హాజరైన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు మునీర్ ఓ తప్పుడు ఫొటోని బహుమతిగా చూపించారు. 2019లో చైనా సైన్యం కవాతు చేస్తున్న ఫొటోను చూపించి భారతదేశంపై విజయం సాధించిన సేనలని ప్రధానమంత్రికి వివరించారు. అక్కడే దేశ అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఈ రకమైన పనికిమాలిన పనులకు పాకిస్తాన్ నాయకత్వం పాల్పడుతుంది” అని విమర్శించారు.
అంతకుముందు దుబాయ్ సంభాషణలో ఓవైసీ పాల్గొంటూ దేశీయ రాజకీయాలలో ప్రభుత్వంతో విభేదాలు ఉన్న దౌత్య యాత్రలో సభ్యులుగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి సహకరిస్తారని చెప్పారు.
2016లో మెరుపు దాడులు..
ఈ దౌత్య యాత్రకు ఎంపిక చేసిన ఎంపీల పేర్లను ప్రభుత్వం ప్రకటించిన తర్వాత శశిథరూర్ సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్నారు. దౌత్యయాత్రలో భాగంగా పనామాలో మాట్లాడుతూ భారతదేశంలో తొలిసారిగా 2016లో వాస్తవాధీన రేఖను దాటి మెరుపు దాడులు చేసిందని ప్రకటించడంతో తాజా వివాదానికి తెర లేచింది.
కేంద్ర ప్రభుత్వం పురమాయించిన ఏడు దౌత్యబృందాలలో ఒక బృందానికి శశిథరూర్ నాయకత్వం వహించారు. పనామాలో శశిథరూర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ 2018లో శశికళ రాసిన “ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్” పుస్తకంను ప్రస్తావనకు తెచ్చింది. 2016 సర్జికల్ స్ట్రైక్ను సిగ్గులేకుండా బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని పుస్తకంలో రాసిన భాగాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ హయాంలో కూడా అటువంటి దాడులు పాకిస్తాన్పై జరిగాయని ఆ పుస్తకంలో శశికళ రాశారు.
విదేశీ పర్యటనలో ఉన్న భారతీయ ప్రతినిధి బృందాలు ఒక యునైటెడ్ ఫ్రంట్లా వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ పశ్చిమాసియా దేశాల్లో ఈ బృందాలు పర్యటిస్తున్నప్పుడు, భారతదేశంలో మైనారిటీల స్థితిగతులపైన, పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని చెప్పడానికి సాక్ష్యాధారాలు ఏమున్నాయివంటి ప్రశ్నలకు సమాధానాలను దాటివేశాయి.
మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి శ్యామ్ శరన్తో సహా పలువురు విదేశాంగ విధాన విశ్లేషకులు పరిశీలకులు కేంద్ర ప్రభుత్వం ఈ దౌత్య యాత్రల నుంచి దక్షిణాసియా దేశాలను మినహాయించడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నిజానికి భారతదేశానికి కావలసిన మెజారిటీ మద్దతు ఇరుగుపొరుగు దేశాల నుంచి అన్నది వాస్తవం.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.