
బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో మరొకరిని నియమించడంలో జరుగుతున్న ఆలస్యానికి ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకత్వానికి వారి రాజకీయ గురువు అయిన ఆర్ఎస్ఎస్ మధ్య ప్రత్యామ్నాయ నేత పై ఉన్న విభేదాలు పరిష్కారం కాకపోవడమే ప్రధాన కారణం.
బీజేపీ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా దీర్ఘకాలం పాటు మరో అధ్యక్షుడిని బీజేపీ నియమించుకోలేకపోవడం పట్ల విశ్లేషణల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024లో అప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో గత సంవత్సరం జూన్ వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. దాంతో జూన్ తర్వాత బీజేపీ నూతన అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారని అందరూ భావించారు. ఈలోగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నడ్డా నాయకత్వంలోనే ఎన్నికల వ్యూహాలు రూపొందాయి.
బీజేపీ మనుగడకు, ఒక పార్టీగా ఆరోగ్యవంతంగా ఉండటానికి నడ్డా అనివార్యమైన వ్యక్తి అని నమ్మే అంత రాజకీయ పరిశీలకులు ఎవరూ లేరు. దేశానికి అసలైన నాయకత్వం అందిస్తున్న ఆ ఇద్దరిలో పార్టీ అంతర్గత వ్యవహారాలను శాసించేది ఎవరన్న ప్రశ్నకు సమాధానం బీజేపీలో ఉన్న క్షేత్రస్థాయి కార్యకర్తలకు సైతం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే అధిష్టానం ముందు ఎదుర్కొంటున్న సమస్యల కంటే దారుణమైన సమస్యలు నడ్డా ఎదుర్కొంటున్నారు.
విశాలమైన సంఘపరివారం నేతృత్వంలో అటు ఢిల్లీలో కానీ ఇటు నాగపూర్లో గణనీయమైన సంఖ్యలో ఉన్న సీనియర్లు మోడీషాల ద్వయం తీసుకుంటున్న అనేక నిర్ణయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మోడీ అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ సంఘపరివారంలోనూ, తనదైన వ్యక్తిగత వ్యవహారశైలిని పెంచుకుంటూ పోవటాన్ని ఇవాళ కాకపోతే రేపైనా నాగపూర్ కేంద్రంగా ఉన్న సంఘపరివారం నాయకత్వం అడ్డుకుంటుందన్న ఆశాభావం వీరికి ఉంది. ఈ వ్యక్తిగత వ్యవహారశైలిని కల్ట్ అంటుంటారు.
మోడీ వ్యక్తిగత వ్యవహార శైలిని, ఆర్ఎస్ఎస్ అధిష్టానాన్ని ధిక్కరించే స్వభావాన్ని ప్రస్తుతానికి ఏమీ చేయలేకపోతున్నా కనీసం పార్టీకి నూతన అధ్యక్షుడు నియమించే విషయంలోనైనా మోహన్ భగవత్ ఆయన బృందం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. తద్వారా బీజేపీ యంత్రాంగంపై మోడీషాల పట్టును తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ అధినేత ఆయన బృందంలో ఉన్న వ్యక్తుల గురించి మోడీకి, షాకి ఒక అవగాహన లేకుండా ఏమీ లేదు. స్వయంసేవకులు అధికార సోపానాలను అధిరోహించటం తద్వారా వచ్చే ప్రయోజనాలను ఆస్వాదించడం మొదలుపెట్టిన తర్వాత రాజకీయ పార్టీ కేంద్రంగా పనిచేసే స్వయంసేవకులపై సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ పట్టు కోల్పోయింది. గతంలో గోల్వాల్కర్ చెప్పిన ఆదర్శాలు, ఔన్నత్యాలు ప్రస్తుతం మధ్యంతర దొంతర్లలో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఎప్పుడో వదిలేసుకున్నారు.
అధికారం తెచ్చి పెడుతున్న అవినీతి అవకాశాలకు ఆర్ఎస్ఎస్లోని ఎక్కువమంది దూరంగా ఏమీ లేరు. దేశ రాజకీయ చిత్రపటంలో తనకంటూ కొన్ని నైతిక విలువలు, ప్రమాణాలు ఉన్నాయని చెప్పుకుంటుంది ఆర్ఎస్ఎస్. అధికారంతో అంది వస్తున్న అభ్యంతరకర వ్యవహారాలు గమనించినప్పుడు మిగిలిన సాంప్రదాయక రాజకీయ పార్టీలలో ఉన్న అవలక్షణాలకు వీరు ఏమి తీసిపోవడం లేదన్నది వాస్తవం.
అయినా సరే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో నాగపూర్ కేంద్రంగా పనిచేసే ఆర్ఎస్ఎస్ అధిష్టానం వారసత్వంగా సంక్రమించిన నైతిక ఆదర్శాలను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తారని నమ్ముతున్న కొద్దిమంది ఉన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో వ్యవస్థాగతమైన పెరిగిపోతున్న అవినీతి పట్ల మెజారిటీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు నిర్వేదంతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలాక్ మోహన్ భగవత్ ఆయన బృందం తమకు నచ్చిన వ్యక్తిని అయినా కనీసం బీజేపీ అధ్యక్షుడిగా నియమించేందుకు ప్రయత్నించాలని ఈ శ్రేణులు ఆశిస్తున్నాయి.
నడ్డాకు ప్రత్యామ్నాయం వెతకడంలో జరుగుతున్న ఆలస్యానికి ప్రధాన కారణం ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న బీజేపీ నాయకత్వానికి నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ అధిష్టానానికి మధ్య ఏకాభిప్రాయం రాకపోవడమే అన్నది వాస్తవం. బీజేపీ అగ్రనాయకత్వానికి జరిగిన నియామకాలలో ఆర్ఎస్ఎస్ వీటో అధికారాన్ని ప్రయోగించే స్థితిలో ఇప్పుడు లేదు. మహా అయితే బీజేపీ నాయకత్వం తమ అంతర్గత విషయాలలో ఆర్ఎస్ఎస్ను సంప్రదించడానికి సిద్ధమవుతుంది తప్ప ఆమోదం కోసం ఎదురు చూడదు.
భారత రాజకీయాలు ఆరోగ్యంగా ఉన్న సమయంలో కూడా ఏనాడు ప్రధానమంత్రి తన అధికారాన్ని పార్టీని శాసించేందుకు వేదికగా ఉపయోగించుకోలేదు. 1969లో ఈ విషయంలో ఇందిరాగాంధీ ప్రారంభించిన విధానమే నేటికీ అమలవుతోంది. ప్రధానమంత్రి అధికారాన్ని చలాయించలేని పరిస్థితి వచ్చినప్పుడు వైదొలగటం మినహా ఆయన ముందు మరో దారి ఏది ఉండదు.
సోనియా గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించిందనే విమర్శలు ఎన్ని వచ్చినా ప్రధానమంత్రిగా తన అధికారాన్ని పార్టీ నాయకత్వం సవాలు చేయకుండా ఉండేలా మన్మోహన్ సింగ్ ఎంతో ఓపిగ్గా ఎన్నో జాగ్రత్తలను తీసుకున్నారు. ఆ మాటకు వస్తే 2014లో ప్రమాణ స్వీకారం చేసిన మోడీ కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి ఉన్న రాజ్యాంగ హోదాను పునరుద్ధరిస్తామని, స్వయం ప్రతిపత్తిని కాపాడుతామని వాగ్ధానం చేశారు. ప్రధానిగా ఆయన ఇచ్చిన వాగ్ధానాలలో సంపూర్ణంగా అమలైన వాగ్ధానం ఇది ఒకటే అని చెప్పి చెప్పుకోవచ్చు.
ఈ పరిస్థితుల్లో బీజేపీ నూతన అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు తీసుకుంటారా, లేక మనోహర్లాల్ కట్టర్ ఆ సీట్లో కూర్చుంటారా, లేదా దేవేంద్ర ఫడ్నవీస్ను ఈ పదవి వరిస్తుందా అన్నది ముఖ్యమైన ప్రశ్న కాదు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యత చేపట్టినా పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాలలో ఎటువంటి మార్పు ఉండదు, రాదు. అమిత్ షాయే అనధికారిక అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు.
ఒకప్పుడు పటిష్టమైన నిర్మాణం కలిగిన పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ ప్రజాదరణ కలిగిన నాయకుల ఆరోహణపర్వంతో సంస్థాగతంగా బలహీనమైంది. ఎన్నికల రోజున పోలింగ్ బూత్ల వద్ద సహాయకులుగా నిలబడే వేలాదిమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా దీనిని విలువైన పార్టీగా పరిగణించటం లేదు.
తనను తాను యోధునిగా చూపించుకుంటున్న మోడీ..
మోడీ ఆయనకున్న ప్రజాదరణ, పార్టీలో ప్రత్యర్థి లేకుండా చూసుకోగల ఆయన నేర్పు సామర్థ్యం కారణంగా ఆయన పేరుతో ఎవరు బరిలో నిలబడ్డా గెలుస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆపరేషన్ సిందూర్ పేరుతో నాలుగు రోజుల పాటు సాగిన యుద్ధంలో యోధుడు, సారథి అన్నీ తానే అయి నడిపించినట్లు ఆయన తననుతాను ప్రదర్శించుకుంటున్నారు. ఆపరేషన్ సిందూర్లో కాల్పుల విరమణ జరగలేదని కేవలం తాత్కాలికంగా నిలుపుదల మాత్రమే జరిగిందని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉండటం గమనార్హం.
ఇంకా మన సైన్యాలు యుద్ధ రంగంలో ఆయన ఆదేశానుసారం నిలిచే ఉన్నాయి. ఒక యుద్ధ కమాండర్గా యుద్ధ నిర్వహణకు సంబంధించి పూర్తి స్వయంప్రతిపత్తి కావాలనుకోవడం సహజం. ఆయన పిలుపునిచ్చినప్పుడు యుద్ధం పునఃప్రారంభించాలన్న నిబద్ధత సైన్యం నుంచి కోరుకుంటున్నారు. ప్రజల్లో దిగజారిపోతున్న బీజేపీ పరువు ప్రతిష్టలు కాపాడుకోవడానికి అటువంటి యుద్ధం అవసరమే. అటువంటి యుద్ధం పునఃప్రారంభమైతే జాతీయోన్మాదాన్ని పెంపొందించడానికి కావలసిన భాజాభజంత్రీలు మోగించేవాళ్లు చుట్టూ ఉండనే ఉన్నారు.
పాకిస్తాన్కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో భావావేశాలను రెచ్చగొట్టడంలో ప్రధాని క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మోడీని నియంత్రించేందుకు పావులు కదపాలనుకుంటున్న నాగపూర్కు ఈ భావావేశాల సమీకరణ ఒక హెచ్చరిక. అలాగే ప్రతిపక్ష పార్టీలకు కూడా. మోడీ యంత్రాంగం ఆర్ఎస్ఎస్ అధిస్థానం మధ్య వివాదం పూర్తిగా సమసి పోలేదు.
రానున్న కాలంలో 75 ఏళ్లు పైబడిన వాళ్ళు ఎవరూ ప్రజాసేవలో ఉండకూడదునే మోడీ వాక్యాలను మోడీకే గుర్తుచేసే వారు తటస్థించవచ్చు. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ అనుభవాలు పరిణతికి తలొగ్గడానికి మోడీ సిద్ధంగా లేరు. బీజేపీ అధ్యక్షుడిగా తాము మెచ్చిన వారిని ఆర్ఎస్ఎస్ అదిష్ఠానం కుర్చీలో కూర్చోబెట్టగలిగితే మోడీ మంత్రంగానికి ఆర్ఎస్ఎస్ యంత్రాంగానికి మధ్య జరిగే పోరు తీవ్రంగా ఉంటుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.