
2025 ఫిబ్రవరి 27న కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు వేసే విధానాన్ని అవగాహన చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పలు ఎన్నికలలో ఎమ్మెల్సీ కౌంటింగ్ సందర్భంగా పట్టభద్రులు ఉపాధ్యాయ ఓట్లు వేల సంఖ్యలో చెల్లకుండా పోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అప్పుడు విద్యావంతులకే ఓటు వేయడం రాకపోతే ఎలా? అనే సందేహం సర్వత్రా వినిపించింది.
అంతేకాకుండా సమర్ధులను ఎన్నుకోవాలన్నా, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న నమోదు చేసుకున్న ప్రతి సభ్యుడు ఓటు వేయడంతో పాటు తప్పులు జరగకుండా చూసుకుంటే చెల్లని ఓట్ల శాతాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించవచ్చు. దీంతో ఫలితాలను సరిగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అవగాహన రాహిత్యంతో ఓట్లేస్తే అంతకుమించినటువంటి అప్రతిష్ఠ మరొకటి ఉండదు. ఓటు వేసే విధానం కానీ ఓట్ల లెక్కింపు విధానం కానీ శాసనసభకు ఇతర సాధారణ ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు భిన్నంగా ఉంటుంది అందుకోసమే దీని గూర్చి ప్రత్యేకంగా చర్చించుకోవడం పోలింగ్ రోజున తప్పులు జరగకుండా చూసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిద్దాం.
ఎన్నికల సంఘం సూచించిన కొన్ని నిబంధనలు..
ఎన్నికలలో పార్టీల గుర్తులు, ఎలక్ట్రానిక్ మిషన్లు ఉండవు బ్యాలెట్ పేపర్లతో మాత్రమే ఎన్నిక జరుగుతుంది. బ్యాలెట్ పేపర్ లో కూడా ఒకటి క్రమ సంఖ్య, రెండు అభ్యర్థి పేరు, మూడు ఫొటో చివరి కాలంలో ప్రాధాన్యత ఓటు సంఖ్య వేయవలసి ఉంటుంది.
– బ్యాలెట్ పేపర్లో ఉన్న అభ్యర్థులందరిలో సమర్ధులైన వారని నచ్చిన అభ్యర్థికి 1 నెంబర్ వేయాలి. ఆ క్రమంలో పోటీలో ఉన్న అందరికీ కూడా వేయవచ్చు. కానీ వేసిన నంబర్ మళ్లీ వేయడానికి వీలు లేదు వరుసక్రమం తప్పినా కూడా ఓటు చెల్లదు.
– 1 నెంబర్ వేయకుండా 2, 3, 4 వేస్తే ఆ ఓటు చెల్లదు .ఆంగ్ల సంఖ్యలు మాత్రమే వేయాలి కానీ రోమన్ అంకెలు వేస్తే ఆ ఓటు చెల్లదు.
– టిక్ పెట్టడం, one, two, three అని ఆంగ్లంలో కానీ ఒకటి, రెండు, మూడు అని తెలుగులో రాసినా కూడా ఓటు చెల్లదు.
– వేద్దామనుకున్నా ఓట్లు ఉదాహరణకు 10 మందికి అయినప్పుడు మధ్యలో ఏ ఒక్కటి మిస్ అయినా ఆ ఓటు చెల్లదు.1, 2, 3, 5, 6, 7, 8, 9, 10 రాశారని అనుకుందాము. ఇక్కడ 4వ సంఖ్య మిస్ అయింది.
కాబట్టి ఓటు చెల్లదు.
– ఒకే అభ్యర్థికి రెండు నెంబర్లు వేసిన ఆ ఓటు చెల్లదు.
– ఒక అభ్యర్థికి వేసిన నెంబరు మరొక అభ్యర్థికి కూడా అదే వేసినా ఆ ఓటు చెల్లదు.
– బ్యాలెట్ పేపర్ మీద ఎక్కడ సంతకం పెట్టిన వేరే ఏదైనా రాసిన ఆ ఓటు చెల్లదు .
– పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి. సొంత పెన్నుతో నెంబర్ వేస్తే కూడా ఆ ఓటు చెల్లదు .
– నచ్చినవారికి 1 నెంబరు వేసిన తర్వాత ఇష్టముంటే మిగతా వాళ్లకు కూడా నెంబర్లు వేసి ప్రాధాన్యత కేటాయించవచ్చు. లేదా వేయకుండా వదిలిపెట్టిన అభ్యంతరం లేదు.
సాధారణంగా ఓట్ల సందర్భంలో ఎన్నికల సంఘం సూచించే గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పకుండా తీసుకు వెళ్ళవలసి ఉంటుంది. వీలున్నంతవరకు మొదటి ప్రాధాన్యతతో పాటు ఎక్కువ మందికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేయవచ్చు. ఈ పద్ధతిలో మొదటి ప్రాధాన్యత ఇచ్చిన అభ్యర్థికి ఎలాంటి నష్టం ఉండదు. సాధారణ ఎన్నికల్లో ఒకే వ్యక్తికి ఓటు వేసే అవకాశం ఉంటుంది కానీ శాసనమండలి అభ్యర్థుల ఎన్నికల్లో మాత్రం ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు సమర్థులు అని అనిపించినప్పుడు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే పెద్దగా నష్టం లేదు. 1 ప్రాధాన్యత ఓటు మాత్రమే అత్యంత కీలకమైన దశలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందే నమూనా బ్యాలెట్ పేపర్ ఆధారంగా నిర్ణయించుకొని ఉండడం వల్ల సులభం అవుతుంది. ఆ తర్వాత ఇష్టముంటే మిగతా అభ్యర్థులకు వేయవచ్చు లేకపోయినా అభ్యంతరం లేదు, అది పూర్తిగా చెల్లుబాటు అవుతుంది ఇంకా చట్టబద్ధంగా లెక్కించబడుతుంది. ఈ సూచనలను పట్టబద్రులు ఉపాధ్యాయ ఓటర్లు జాగ్రత్తగా పాటించడం వల్ల పెద్దల సభకు ఎన్నుకునే అత్యంత ప్రాధాన్యత కలిగిన సమర్థులైన అభ్యర్థులను పంపడం మనందరి బాధ్యత. దీంతో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ రంగంలో ఉచిత నాణ్యమైన విద్య, నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కారం, విద్యకు హెచ్చు బడ్జెట్, ప్రైవేటు ఫీజుల జులుమును పూర్తిగా నిర్మూలించడం వంటి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి.
– వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.