
అస్సాంలోని ఒక జిల్లాలో దాదాపు సగం కంటే ఎక్కువ భూమిని బడా కార్పొరేట్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పింది. ఈ కేటాయింపుపై గౌహతి హైకోర్టు జడ్జి ఇటీవల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ వార్త విన్న తర్వాత, కర్ణాటకలోని దేవనహళ్లిలో వేలాది ఎకరాల పచ్చని పంట పొలాలను బడా కార్పొరేట్ శక్తులకు ఫలహారంలా పంచి పెడుతున్న ఘటన గుర్తుకు రాక తప్పదు. అలానే ఈ బలవంతపు భూసేకరణపై ఆ ప్రాంత రైతులు మూడేళ్ల నుంచి అవిశ్రాంత పోరాటం చేసి, విజయం సాధించిన అరుదైన ఘటన కూడా గుర్తుకురాక తప్పదు.
దేవనహళ్లి రైతుల భూపోరాటం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాలలో అక్రమ భూసేకరణలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటాలకు ఎంతో ఉద్యమ స్ఫూర్తిని– ఉత్తేజాన్ని అందిస్తుంది.
దేవనహళ్లిలోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములను ఏరోస్పేస్ పార్కు కోసం బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు. ఇలానే నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో వేలాది ఎకరాల పచ్చని పంట భూములను బడా కార్పొరేట్ శక్తి ఇండోసోల్కు అందజేస్తున్నారు. సోలార్ విద్యుత్తు పరికరాల తయారీ కోసం కారుచౌకగా భూములను ఈ కంపెనీకి అప్పజెప్పటానికి ఏపీ ప్రభుత్వం పూనుకకుంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రజా- రైతు వ్యతిరేక ప్రయత్నాలపై పోరాట శంఖారావాన్ని కరేడు రైతాంగం పూరించింది. వీరి పోరాటానికి, దేవనహళ్లి రైతుల భూపోరాట విజయం ఉద్యమ స్ఫూర్తిని అందిజేస్తోంది. అంటే, దేవనహళ్లి రైతుల భూపోరాటం అంతటి స్ఫూర్తివంతమైన ఉద్యమ చరిత్రను సంతరించుకుంది.
కార్పోరేట్ల కోసం కపట నినాదాలు..
బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈశాన్యంగా దేవనహళ్లి ఉంటుంది. ఈ ఊరు తాలూకాలోని చన్నరాయపట్నానికి చెందిన 13 గ్రామాల్లో ఏరో స్పేస్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. పార్కు రెండోదశ నిర్మాణం కోసమని, కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు ద్వారా 1,777 ఎకరాల సాగుభూమిని సేకరించటానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
భారత అంతరిక్ష పరిశోధానా కేంద్రం(ఇస్రో), కర్ణాటక ప్రభుత్వం రెండూ కలిసి మొదటి దశ ఏరో స్పేస్ పార్కును దేవనహళ్లిలో పూర్తిచేశాయి. ఇప్పటికే ఏరో స్పేస్ పార్కు మొదటి భాగానికి, ఫోక్సో కంపెనీకి, అమెజాన్ ఇండియా ప్రధాన కార్యాలయానికి, బెంగుళూరు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి వేలాది ఎకరాల భూములను రైతుల నుండి తీసుకున్నారు.
అభివృద్ధి కోసం రైతులు మరిన్ని త్యాగాలు చేయాలని ఆగస్టు 2021లో, అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి బీఆర్ బొమ్మై ప్రభుత్వం ఎయిరో స్పేస్ పార్కు రెండవ భాగం నిర్మాణం కోసం భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేసింది.
దేవనహళ్లి కోటలో ఉన్న టిప్పు సుల్తాన్ స్మారక స్థూపం నుంచి పోరాట వారసత్వాన్ని ఈ ప్రాంత రైతులు అందిపుచ్చుకున్నారు. రెండో దశ ఏరోస్పేస్ పార్కుకు వ్యతిరేకంగా ‘భూ స్వాధీన విరోధి హోరాట సమితి’ పేరు మీద వీరందరు సమీకృతులై అయ్యారు. వివిధ వామపక్ష రైతు సంఘాల, ప్రజాస్వామ్యవాదుల సహాయ- సహకారాలతో ఉద్యమించారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని స్ఫూర్తిదాయకంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.
రైతుల మీద అనేక క్రిమినెల్ కేసులు నమోదు..
ఉద్యమాన్ని ముందుకు నడిపించే క్రమంలో ఉద్యమకారులు అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. రైతుల మీద వందల కొద్ది క్రిమినల్ కేసులను పోలీసులు పెట్టారు. 2022 ఆగస్టు 15న పోలీసులు జరిపిన లాఠీచార్జీలో రైతులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రజల, వివిధ ప్రజా సంఘాల, కళాకారుల నుంచి రైతు ఉద్యమానికి పెద్ద ఎత్తున సంఘీభావం లభించింది. ప్రకాష్ రాజ్ లాంటి సినీనటులు రైతులకు మద్దతుగా నిలబడ్డారు. మాధవరెడ్డి నాయకత్వంలోని ఏఐకేఎంకేఎస్ రైతాంగ సమస్యలపై నిరంతరం ఆందోళన చేస్తోంది. దీనికి అనుబంధ కర్ణాటక రాజ్య రైతు సంఘం రైతులు కూడా ఉద్యమం కోసం నడుంబిగించారు. చెన్నరాయపట్న ధర్నా స్థలం నుంచి 25వ రోజున పాదయాత్ర చేపట్టి, రైతులంతా మరింత పట్టుదలతో నిలబడాలని ప్రచారం చేశారు. రైతులు విజయం సాధించే వరకు 1,198 రోజులు వివిధ దశలలో రైతులు సాగించిన సమైక్య పోరాటానికి వివిధ రైతుసంఘాలతో కలిసి రైతు సంఘాలు అండగా నిలబడ్డాయి.
2021 ఆగస్ట్లో ఏరో స్పేస్ పార్కు రెండవదశ కోసం భూసేకరణకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడింది. ప్రభుత్వం నుంచి అధికారిక నోటీసులు 2022 జనవరి తొలి వారంలో వచ్చాయి.
ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించాల్సిన గ్రామ సభలను ఉద్దేశపూర్వకంగానే నిర్వహించలేదు. 2022 జనవరి చివర్లో, కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు జారీ చేసిన నోటీసులను రైతులు తగలబెట్టారు.
ఫిబ్రవరిలో చన్నరాయపట్న నుంచి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అలా ఈ ఉద్యమం అంచెలంచెలుగా అందర్నీ కలుపుకొంటూ ముందుకు సాగింది. 2022 సెప్టెంబర్ 15న బెంగుళూరు ఫ్రీడం పార్కు దగ్గర రైతులు ధర్నా చేశారు. అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రైతులు తమ నిరసనోద్యమాన్ని బెంగుళూరుకు మార్చుకొన్నారు.
ఉద్యమం చేస్తున్న నాయకులకు కాంగ్రెస్ హామీ..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం మొదలుపెట్టిన ఏరోస్పేస్ పార్కు రెండవదశ భూసేకరణను నిలిపి వేస్తామని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు- 2023 సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధరామయ్య దేవనహళ్లి రైతులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకోకపోవటంతో రైతులు మళ్లీ పోరాటబాట పట్టారు.
2025 జూన్లో, సిద్ధరామయ్య ప్రభుత్వం భూముల కోసం రైతులకు ఇచ్చిన చివరి నోటిఫికేషన్ తరువాత ఈ పోరాటం పెద్ద మలుపు తీసుకుంది. ‘ఛలో దేవనహళ్లి’ అనే పిలుపును సంయుక్త హోరాట కమిటీ ఇచ్చింది. ఈ పిలుపులో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలపై పోలీసులు క్రూరమైన అణచివేతను ప్రయోగించారు. ముఖ్యమంత్రితో రెండు సమావేశాలు జరిగి, పోరాటం తీవ్రమవుతున్న దశలో ఈ నిర్బంధం జరిగింది.
భూసేకరణను రద్దు చేయటం వల్ల వచ్చే న్యాయ అడ్డంకుల గురించి తెలుసుకోవటానికి 10 రోజుల సమయం కావాలని జులై 4న జరిగిన మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి కోరారు. న్యాయం కోసం పని చేసే ఆల్ ఇండియా లాయర్ల అసోసియేషన్(ఏఐఎల్ఏజే)కలగచేసుకొని, దేవనహళ్లి భూసేకరణ విషయంలో ఒక వివరణాత్మక ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం, భూసేకరణను ఆపటానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు వుండవని స్పష్టంగా ప్రకటించింది.
ఫలించిన దేవనహళ్లి రైతుల పోరాటం..
రైతులు దీర్ఘకాలికంగా పోరాట కమిటీ నాయకత్వాన సాగిస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించటానికీ, రైతుల ఐక్యతను భగ్నం చేయటానికీ, రైతులను ప్రలోభ పెట్టటానికి అధికారపక్ష నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. రైతులు తమ భవిష్యత్తుకు మూలమైన భూమిని వదులుకోవడానికి సిద్ధంగా లేమని దృఢంగా ప్రకటించటం, ప్రభుత్వం ఎరచూపిన తాయిలాలను రైతులు సమైక్యంగా దృఢంగా ఉద్యమశక్తితో తిప్పికొట్టటంతో చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
జులై 15న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య భూసేకరణను వెంటనే ఆపివేయాలని అధికారులను ఆదేశించక తప్పలేదు. నూతన ఆర్థిక విధానాలను అమలు చేయటంలో పాలక పార్టీలు పోటీపడి అదాని, అంబానీలాంటి బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను పెంచి పోషిస్తున్నాయి. ఆ విధానాలలో భాగంగానే కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సిద్ధరామయ్య ప్రభుత్వం రైతులను మోసం చేయాలని చూసినా, మూడు సంవత్సరాలు తమ భూముల కోసం రాజీలేని పోరాటం చేసిన ఫలితంగా రైతులు గొప్పవిజయం సాధించారు.
అయితే ఇది తాత్కాలిక విజయం మాత్రమే. ఇప్పుడు సాధించిన విజయం వెలుగులో కర్ణాటక రైతులు బడా కార్పొరేట్ శక్తుల నుంచి తమ భూముల రక్షణ కోసం, భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సంసిద్ధం కావాలి.
ఉద్యమాన్ని సాగిస్తున్న క్రమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రైతులు విజయం సాధించారు. వీరి పోరాట అనుభవాల వెలుగులో, తమ పచ్చని పంట పొలాల రక్షణ కోసం మన రాష్ట్రంలో కరేడు రైతాంగంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అక్రమ భూసేకరణలకు వ్యతిరేకంగా రైతాంగం సాగిస్తున్న పోరాటాలను విజయవంతంగా ముందుకు నడిపించడానికి రైతులు నడుం బిగించాలి.
రైతుల ప్రాథమిక హక్కుల కోసం నిలబడే ప్రజాస్వామ్య వాదులతో పాటు, వామపక్ష రైతు సంఘాలు రైతుల ఉద్యమం విజయం సాధించే వరకు సంఘటితంగా నడిపించే బాధ్యతను చేపట్టటానికి దృఢమైన రాజకీయ సంకల్పంతో ముందడుగులు వేయాలి.
ముప్పాళ్ళ భార్గవశ్రీ,
సీపీఐ ఎంఎల్(క్లాస్ స్ట్రగుల్) నాయకులు
9848120105
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.