
ఆ మధ్య సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్కు చురకలేస్తూ కేంద్ర హోం మంత్రి, బిజెపి అగ్రనేతల్లో ఒకరైన అమిత్షా బిజెపి తమ నిబంధనలకు అనుగుణంగానే నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటుందన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఓ సందర్భంలో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక సంస్థ అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకూ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోవటం, ఆ పార్టీలోని కుమ్ములాటలకు నిదర్శనమని అఖిలేష్ విమర్శించారు.
అఖిలేష్ విమర్శకు దిగ్గున లేచిన అమిత్షా బిజెపి అధ్యక్షుడి ఎన్నిక సుదీర్ఘమైన క్రమమనీ, ఒకే కుటుంబం నుంచి పార్టీ నాయకులను ఎన్నుకోవటమంత తేలికైనదేమీ కాదని ప్రతివిమర్శ చేశారు.
ఇక్కడ అమిత్షా, అఖిలేష్లు ఇద్దరూ ఎవరికి వారే సబబు. బిజెపి అంతర్గత నిబంధనల ప్రకారం నిర్దిష్టకాలపరిమితలోగానే పార్టీరాష్ట్ర కమిటీ అధ్యక్షులను ఎన్నుకోలేకపోవడానికి కారణం పార్టీలో వివిధ స్థాయిల్లో పొడచూపుతున్న విబేధాలు, ముఠాతత్వాలే. వివిధ రాష్ట్రాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులను నియమించటంలో ఆసల్యం కావటంతో అనివార్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా వాయిదాపడుతూ వస్తోంది. ఫలితంగా ప్రస్తుత అధ్యక్షుడు జెపి నడ్డా పదవీ కాలం పదేపదే పొడిగించబడుతోంది.
బిజెపిలో ఎన్నికల క్రమం, నాయకత్వ నియామకం వంటి విషయాలను తేల్చే బిఎల్ సంతోష్కు పార్టీ వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకించి పెద్దవైన ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీలో రాజుకుంటున్న చిచ్చులను ఆర్పటం పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ అధ్యక్ష నియామకంలో బిజెపికి గురువైన ఆరెస్సెస్ మనోభావాలకు సముచిత అవకాశం ఇవ్వటం ఎలాగా అన్న సమస్యతో ప్రధాని మోడీ తలమునకలవుతున్నారు.
బిజెపి ఆవిర్భావం రోజుల నుంచి పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఆరెస్సెస్ ఆమోదం అనివార్యంగా మారింది. ఆరెస్సెస్ అనుమతి లేకుండా బిజెపి అధ్యక్షుడిని నియమించిన సందర్భాలు ఇంతవరకూ లేవు. కాకపోతే మోడీ నేతృత్వంలో పార్టీ ఆంతరంగిక నిర్మాణం విషయంలో ఆరెస్సెస్తో సంబంధం లేకుండా స్వతంత్రించి వ్యవహరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆరెస్సెస్ సహాయ సహకారాలు అవసరం లేనంత స్థాయికి బిజెపి బలం పెరిగిందని ఆ మధ్య మోడీ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోవాలి.
మోడీ పై ప్రకటన చేసిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ స్వంత బలంతో అధికారానికి రాలేకపోయింది. మోడీ ప్రకటన నేపథ్యంలో కినుక వహించిన ఆరెస్సెస్ గత లోక్సభ ఎన్నికల్లో బిజెపికి పూర్తి స్థాయిలో సహకరించలేదన్నది లోగుట్టు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ పదేపదే మోడీనుద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసిన సంగతి మనం మర్చిపోకూడదు. దేశ రాజకీయాల్లో నిరంతరం పెరుగుతున్న మోడీ ప్రభావం గురించి ఆరెస్సెస్ కూడా కలత చెందుతోందని ఆ వ్యాఖ్యలు గమనిస్తే అర్థమవుతుంది.
మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ మధ్యనే నాగపూర్ వెళ్లటం, ఆరెస్సెస్ అధినేతతో భేటీ కావటం ఇరువురి మధ్య ఉన్న విబేధాలను తగ్గించుకునే ప్రయత్నమేనని భావిస్తున్నారు.
నూతన బిజెపి అధ్యక్షుడిగా మోడీ ఇష్టపడుతున్న వారి పట్ల ఆరెస్సెస్ ఏమంత ఆసక్తి కనబర్చటం లేదన్న వార్తలు ఈ భేటీ తర్వాత కూడా వచ్చాయి. అందువల్లనే కావచ్చు అగ్రస్థానానికి జరగాల్సిన ఎంపికల్లో కదలికలు వేగంగా లేవు. డిసెంబరు నాటికి బిజెపికి కొత్త సారధి రావటం ప్రస్తుతానికి అసాధ్యమనే అనిపిస్తోంది.
దీనికి భిన్నంగా కొన్ని పార్టీలు తమతమ ఆంతరంగిక ప్రజాస్వామ్య విధానాలను తమతమ స్థాయిల్లో ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నపార్టీల పట్ల అమిత్ షా, బిజెపి నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నాయి.
గత కొంత కాలంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు మల్లిఖార్జున్ ఖార్గే పార్లమెంట్ లోపలా బయటా ముందుండి నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష నేతగా తన సామర్ధ్యాన్ని సభా వేదికగా నిరూపించుకుంటున్నారు.
ఇప్పటికైనా క్షేత్రస్థాయి నుండీ పార్టీని పునర్నిర్మించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించుకున్నది. వరుసగా జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ సమావేశాల్లో కాంగ్రెస్ను దేశంలోని విశాల ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా మార్చాలన్న అంశంతో పాటు సైద్ధాంతిక స్పష్టత కలిగిన పార్టీగా తీర్చిదిద్దాలన్న దిశగా చర్చలు సాగుతున్నాయి.
సుదీర్ఘకాలంగా నిద్రాణంగా ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఇప్పుడు మేలుకుంటున్నాయి. ఓ నమూనాని సెట్ చేయటం కోసం మొదటగా గుజరాత్లో జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామకాలు సజావుగా సాగటానికి పరిశీలకులను కూడా నియమించింది. అన్నీ ఢిల్లీ కేంద్రంగా ఉండే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ స్థాయిలోనే నిర్ణయించబడే సాంప్రదాయమున్న కాంగ్రెస్లో జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఈ నిర్ణయాలను ప్రజలకు చేరవేసే కీలకమైన వేదికలుగా ఉంటాయి.
కాంగ్రెస్ అధిష్ఠానం ప్రణాళికలు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మండల, బూత్ కమిటీల పునర్నిర్మాణం కాంగ్రెస్కు జవసత్వాలు పోసే ప్రయత్నంలో కీలకమైన మలుపు కానుంది. కేడర్ ఆధారిత పార్టీలుగా ఉన్న బిజెపి, డిఎంకె వంటి వాటితో తలపడాలంటే కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో తన అస్త్రశస్త్రాలు సమకూర్చుకోక తప్పదు.
దిగువ స్థాయి నుంచి సంస్థాగత సంస్కరణలు చేపడితే నాయకత్వ పొందిక కూడా అర్థవంతంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని ఈ స్థితికి తెచ్చిన నాయకత్వ కేంద్రీకరణ స్థానంలో వికేంద్రీకరణ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందని కాంగ్రెస్ నాయకత్వం నమ్ముతోంది.
ప్రతి జిల్లాల్లోనూ ఓ రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేయటం ద్వారా ఆయా జిల్లాల్లో ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై జిల్లా కాంగ్రెస్ కమిటీలు నిర్దిష్ట విధానాన్ని రూపొందించుకునేందుకు, ఆందోళనలు చేపట్టేందుకు, జిల్లా స్థాయి నాయకత్వంలో ఉన్న విబేధాలు పరిష్కరించేందుకు ఉపకరిస్తుందని ఎఐసిసి భావిస్తోంది. ఈ కమిటీలను సీనియర్లతో కూడిన బృందం పర్యవేక్షించాలన్నది ఆ పార్టీ ప్రతిపాదనల్లో ఒకటి.
పార్టీ నిర్మాణాన్ని పునరుద్ధరించటంలో గుజరాత్లో చేపట్టిన ప్రయోగాలు విజవంతమైతే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదే పద్దతులు ప్రమాణాలు పాటించొచ్చు. దేశ వ్యాప్తంగా పార్టీని పట్టి పీడిస్తున్న సంస్థాగత సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ నాయకత్వం కదులుతుందన్న విశ్వాసాన్ని శ్రేణుల్లో నింపుతుంది. 2029 లోక్సభ ఎన్నికల ముందు పార్టీని పట్టాలెక్కించేందుకు కావల్సిన ఈ సంస్థాగత సంస్కరణలను రూపొందించటంలో ఖార్గే, రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.
కాషాయదళాలకు, వామపక్షాలకు మధ్య ఉన్న సైద్ధాంతిక ఘర్షణ తెలీనిదేమీ కాదు. గత కొంతకాలంగా ఇబ్బందుల్లో ఉన్న వామపక్షాలు కూడా ఇప్పుడు దేశానికి సానుకూల సూచనలు పంపుతున్నాయి. కేంద్రీకృత ప్రజాస్వామ్యం సూత్రం అమలు జరిపే క్రమంలో గత కొన్ని దశాబ్దాలుగా వామపక్షాల్లో కేంద్రీకృతం పెరిగిపోయిందన్న విమర్శలు వినపడుతున్నాయి. వామపక్షాలు జరుపుకనే మహాసభల నివేదికల్లోనూ ఈ సారి ఈ విమర్శల గురించిన ప్రస్తావనలు చోటు చేసుకున్నాయి. ఈ విమర్శలు ఎలా ఉన్నా వామపక్షాలు తమ జాతీయ ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోవటంలో పార్టీ రాజ్యాంగం ప్రతిపాదించిన పద్దతులు పాటించటంలో వెనకబడిన సందర్భాలు లేవు.
ఏప్రిల్ మొదటి వారంలో మదురైలో ముగిసిన సిపిఎం జాతీయ మహాసభల్లో ఎంఎ బేబీని కొత్తగా కార్యదర్శిగా ఎన్నుకోవటంతో పాటు పార్టీలో అత్యున్నత నిర్ణాయక సంస్థ పొలిట్బ్యురోలో ప్రకాష్, బృందావంటి సీనియర్లు వైదొలగి యువతరానికి అవకాశం ఇచ్చారు.
ఈ పరిస్థితుల్లో బిజెపి నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవటంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దేశం గమనిస్తోంది. మోడీ, షాలు శిఖరాగ్ర నాయకులుగా ఉన్నంత కాలం పార్టీ బలంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ ఇరువురి నాయకత్వంలో బిజెపిలో అంతర్గత ప్రజాస్వామ్యం మసకబారుతోంది. ఈ పరిస్థితులు రానున్న కాలంలో పార్టీని నష్టపెట్టే అవకాశాలు లేకపోలేదు. పైన ప్రస్తావించినట్లు కాంగ్రెస్, సిపిఎంల సంస్థాగత నిర్మాణంలో మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ ఇప్పటికిప్పుడే ఆ పార్టీలు బిజెపితో బాహాబాహీకి దిగే పరిస్థితులున్నాయని చెప్పలేము. కాకపోతే ముందున్నవి మంచిరోజులని మాత్రం చెప్పేందుకు ఈ మార్పులు సంకేతంగా ఉన్నాయి.
అజయ్ ఆశీర్వాద మహాప్రశస్త
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.