
హైదరాబాద్: జూన్ 5 నుంచి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పులలో ఇప్పటి వరకు(జూన్ 7) ఏడుగురు మావోయిస్టు నాయకులు హతమయ్యారు. పౌర హక్కుల సంస్థలు పేర్కొన్న ప్రకారం 1,250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న జాతీయ పార్క్లో మావోయిస్టులు తలదాచుకున్నారు. పార్క్లోనే కలిసి ఉన్న పార్షగఢ్ గ్రామం నుంచి 10 మంది మావోయిస్టులను పోలీసులు ఖైదు చేసి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్న సమయంలో ఈ ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి.
వారిలో జూన్ 5న ఒకరిని, జూన్ 6న నలుగురిని, జూన్ 7న ఇద్దరిని రోజువారీ అమానుష టార్చర్ తర్వాత మొత్తం ఏడుగురిని చంపినట్టుగా హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. ఇంకా ముగ్గురు మావోయిస్టులు పోలీసు కస్టడీలో ఉన్నారని, సివిల్ లిబర్టీస్ కమిటీ తెలంగాణ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎం నారాయణ రావు, ఇతర కార్యవర్గ సభ్యులు తెలియజేశారు.
పోలీసులు ఇప్పటి వరకు కేవలం ఇద్దరి మృతదేహాలను మాత్రమే గుర్తించినట్టుగా పేర్కొన్నారు. అయినప్పటికీ, హక్కుల కార్యకర్తలు పోలీసు కస్టడీలో ఉన్న పదిమంది మావోయిస్టుల పేర్లను విడుదల చేశారు.
ఈ పేర్లలో సీపీఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యులు టెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్(జూన్ 5న హతం), సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు మైలారపు అదేలు అలియాస్ భాస్కర్(జూన్ 6న హతం) ఉన్నారు. చనిపోయారని పోలీసులు ధృవీకరించింది వీరిని మాత్రమే. అదనంగా లక్ష్మణ్ జారీ చేసిన ప్రకటన ప్రకారం జూన్ 7న మరొక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాశ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు పాపారావు మరణించినట్లు తెలుస్తోంది.
పోలీసు కస్టడీలో ఉన్నవారిలో డివిజనల్ కమిటీ సభ్యులు రామన్న, నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సెక్రటరీ దిలీప్, దండకారణ్య ఏరియా కమిటీ మహిళా కార్యదర్శి సీతు, నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యులు సునిత, మహేష్, మున్నా ఉన్నారు.
భిన్నాభిప్రాయాలు..
జూన్ 5 సాయంత్రం లక్ష్మణ్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో పోలీసు కస్టడీలో ఉన్న ప్రకాశ్, ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరించారు. వారికి ఎటువంటి హానీ చేయకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. అలానే మావోయిస్టులతో శాంతిచర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు.
భద్రతాదళాల స్పందన..
బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర కుమార్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దాని ప్రకారం మృతుల్లో ఇద్దరు గుర్తుతెలియని మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.
లక్ష్మణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 10 మంది మావోయిస్టులు సివిల్ దుస్తుల్లో, తమ ఆలివ్ గ్రీన్ యూనిఫార్మ్లు వదిలివేసి, జూన్ 5న పార్షాగఢ్ గ్రామంలో తలదాచుకున్నారని చెప్పారు.
మావోయిస్టులను ఉదయం 7 గంటల ప్రాంతంలో తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత వారిని ఒక్కొక్కరిగా చంపారని చెప్పారు. ఇటువంటి చర్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్, సుప్రీం కోర్టు సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్పీ వాదనలు..
ది వైర్తో మాట్లాడిన ఎస్పీ యాదవ్, కార్యకర్తల ఆరోపణలను అసత్య ప్రచారంగా ఖండించారు. సుధాకర్, బండి ప్రకాశ్, పాపారావు జాతీయ పార్క్ ప్రాంతంలో సమావేశమయ్యారని ఖచ్చితమైన సమాచారంతోనే ఆపరేషన్ ప్రారంభించామని చెప్పారు.
జాయింట్ బలగాలు అయిన స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా యూనిట్లు అడవిని జల్లెడపట్టారని పేర్కొన్నారు.
సుధాకర్ మొదటి రోజు ఎదురుకాల్పుల్లో హతమయ్యాడని, సంఘటన స్థలంలో ఒక ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇది మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు మే 21న నారాయణపూర్ జిల్లాలో హతమైన తర్వాత పోలీసులకు మరొక పెద్ద విజయమని పేర్కొన్నారు.
మరో నలుగురు మావోయిస్టులు జూన్ 6 ఉదయం, రాత్రికి హతమయ్యారని, భాస్కర్ వారిలో ఒకరని తెలిపారు. జూన్ 7న మరో ఇద్దరు హతమయ్యారని చెప్పారు.
సుధాకర్, భాస్కర్ మినహా మిగతా ఐదుగురి మృతదేహాల గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మావోయిస్టుల మృతదేహాల గుర్తింపు ప్రకటించిన హక్కుల సంస్థలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇతర వివరాలు..
ఎదురుకాల్పులలో కొంతమంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరికొంతమంది పాము కాటుకు గురయ్యారు. కొంతమందికి డీహైడ్రేషన్ బారిన పడ్డారని తెలిపారు.
ఒక రాజ్యాంగ సంక్షోభం..
ఇతరుల పక్షాన సీపీఐ(మావోయిస్టు)కు చెందిన 18 మంది సీనియర్ నాయకులు పోలీసుల కస్టడీలో ఉన్నారని శాంతి చర్చల సమన్వయ కమిటీ మద్యవర్తులైన జీ హరగోపాల్ అన్నారు. అంతేకాకుండా వారి ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉన్నదని తెలిపారు.
“ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న రాజ్యాంగ సంక్షోభం కారణంగా ప్రజాస్వామ్య విలువలు, ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం కోర్టు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి” అని పేర్కొన్నారు. గతంలో ఛత్తీస్గఢ్లో కలెక్టర్లు అలెక్స్ పాల్, వినయ్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు వారిని విడుదల చేయడానికి హరగోపాల్ మధ్యవర్తిగా ఉన్నారు.
ఇప్పటి హత్యలు కొత్త ఉదంతాలకు నాంది..
2004లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేపట్టిన శాంతి చర్చలలో పాల్గొన్న మావోయిస్టు ప్రతినిధులలో సుధాకర్ ఒకరిగా ఉన్నారు. అతను సీపీఐ(మావోయిస్ట్) రివల్యూషనరీ పొలిటికల్ స్కూల్ రీజినల్ బ్యూరోకు నాయకత్వం వహించేవారు. మావోయిస్టు పార్టీ నుంచి అతనికి రెండంచెల భద్రత ఉండేదని హక్కుల కార్యకర్తలు చెప్పారు. అతను నిజమైన ఎన్కౌంటర్లో హతమయ్యాడని, అందువల్లనే అతని మృతదేహమే అక్కడ లభించిందని పోలుసులు అంటున్నారు.
సుధాకర్ సైనిక దుస్తులకు బదులుగా సివిల్ డ్రెస్సులో కనిపించడమూ అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. ఆయన విజయవాడలో ఆయుర్వేద కాలేజీని మధ్యలో విడిచి 40 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడిపారు. మరోవైపు రామకృష్ణపూర్(ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా)లో పనిచేసే భాస్కర్ ఆర్ఎంపీగా జీవితం మొదలు పెట్టారు. 1995లో అప్పటి పీపుల్స్ వార్లో సుధాకర్ చేరారు.
అవమానకర హత్యలనే ఆరోపణలు..
సుధాకర్, భాస్కర్ నకిలీ ఎన్కౌంటర్లో మరణించారని రాజకీయ ఖైదీల విడుదల కోసం పని చేస్తున్న కమిటీ అధ్యక్షుడు బళ్ల రవీంద్రనాథ్ ఆరోపించారు.
ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ సభ్యులు పిచుక సుధాకర్ లేఖ రాశారు. మరొక పోస్ట్మార్టం నిర్వహించేందుకు వారి మృతదేహాలను భద్రంగా ఉంచాలని కోరారు.
ఆపరేషన్ కగార్ వల్ల భారీ మరణాలు..
సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు ప్రకారం, గత సంవత్సరం జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో 550 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో సుమారు 400 మంది పేద ఆదివాసీలేనని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ ఉద్దేశ్యం ఛత్తీస్గఢ్లోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడాన్ని వ్యతిరేకించే ఆదివాసీ పోరాటాలను అణచివేయడమేనని తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.