
11 రోజుల పాటు జరిగిన నిరంతర బాంబు దాడుల తర్వాత ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ ఏం సాధించింది? అనే ప్రశ్న ప్రస్తుతం ముందుకు వస్తుంది. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ప్రకటనలో ఇజ్రాయెల్ లక్ష్యాలు సాధించబడ్డాయని కాల్పుల విరమణను అంగీకరిస్తూ పేర్కొన్నారు. కనిపిస్తున్న వాస్తవాల వెలుగులో చూసినప్పుడు అలాంటి ప్రకటన సమస్యాత్మకంగా అనిపిస్తుంది.
స్వల్పకాలిక యుద్ధ ప్రారంభంలో “అణు కార్యక్రమాన్నిఅంతమొందించడం”, “పాలకుల మార్పు” అనే రెండు లక్ష్యాలను నెతన్యాహు ప్రకటించారు.
అణు కార్యక్రమం అంతమొందించబడిందా? అనే ప్రశ్నకు సమాధానం ప్రతికూలంగా ఉండవచ్చు. అమెరికా దాడి చేసిన ఫోర్దో అణుసౌకర్యం నుంచి శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ తరలించినట్టు తెలుస్తోంది. ఈ పదార్థం నిల్వ ఇరాన్ అణు కార్యక్రమంలో అతి ముఖ్యమైన భాగం. కాబట్టి “అంతమొందించడం” విఫలమైనట్లు అనిపిస్తుంది.
ఇరానియన్ అణు కార్యక్రమానికి ఇజ్రాయెల్ ఏదైనా నష్టం కలిగించగలిగిందా అంటే అది కూడా అస్పష్టంగా ఉంది. బంకర్-బస్టర్ బాంబులను, మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్(MOPs)ను ఉపయోగించి ఇరానియన్ అణు సౌకర్యాలపై దాడి చేయడానికి అమెరికాను ఇజ్రాయెల్ ఒప్పించగలిగింది. ఇరాన్పై చేస్తున్న యుద్ధంలో ఇజ్రాయెల్ ఇంతకుమించి ఏమీ చేయలేదు. ఇరాన్ బయటి వారి ప్రవేశాన్ని అనుమతించే అవకాశం లేనందున విధ్వంసం విస్తృతిని అంచనా వేయడం కష్టం(అమెరికా చేసిన దాడిలో ఇరాన్ అణు సౌకర్యాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని అంతర్జాతీయ అణుశక్తి సంఘం ధ్రువీకరించింది- అనువాదకుడు).
ఇరాన్లో “పాలకులను మార్చిందా?’’ లేక ‘‘పాలన మార్పు”ను ఇజ్రాయెల్ సాధించిందా? ఈ ప్రశ్నకు సంక్షిప్త సమాధానం ఏమిటంటే అది చాలావరకు ప్రస్తుత పాలకుల అధికారం మరింత స్థిరపడేలా చేసింది. ఇరాన్లోని వివిధ భద్రతా వ్యవస్థలకు చెందిన సైనికాధికారులను ఇజ్రాయెల్ చంపడం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రేరేపించడానికి ప్రయత్నించింది. శత్రువును అస్థిరపరచడానికి ఉత్తమ మార్గం సీనియర్ నాయకుల హత్యలు అనే దృఢమైన ఇజ్రాయెల్ నమ్మకంపై ఈ వ్యూహం ఆధారపడి ఉంది. ఇది ఎప్పుడూ పని చేయలేదు. హసన్ నస్రల్లా మరణం లెబనాన్లోని హిజ్బుల్లాపై చూపిన ప్రభావం మాత్రమే ఇందుకు మినహాయింపు. కానీ అది లెబనీస్ అంతర్గత రాజకీయ గతిశీలతతో చాలావరకు ముడిపడి ఉంది. మిగిలిన సందర్భాలన్నింటిలోను ఇజ్రాయెల్ చేసిన హత్యలు ఎటువంటి రాజకీయ మార్పును తేలేకపోయాయి.
ఇరాన్లో ఇజ్రాయిల్ చేసిన హత్యల పర్యవసానంగా ప్రజలు ప్రభుత్వానికి దన్నుగా నిలిచారు. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)కు చెందిన సీనియర్ కమాండర్లను ఇజ్రాయెల్ హత్య చేసింది. ఈ హత్యాకాండను ఇరాన్ ప్రజలు ఎక్కువగా ద్వేషించారు. ఏదేమైనా, ఇస్లామిక్ రిపబ్లిక్కు ముఖ్యంగా ఐఆర్జీసీకి గట్టి వ్యతిరేకులుగా భావించే చాలా మంది ఇరానియన్లు దానికి మద్దతు ఇస్తున్నారు. ఇరాన్ పైన చేస్తున్న ఇజ్రాయెల్ దాడిని ఇరానియన్లు “ప్రభుత్వపై దాడి”గా కాకుండా యావత్ దేశంపై జరుగుతున్న దాడిగా చూశారు.
“ప్రభుత్వ చిహ్నాల”పై బాంబు దాడి చేయడానికి ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నాలు పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ అణచివేతకు వ్యతిరేకంగా ఇరానియన్ ప్రజలు చేస్తున్న పోరాటానికి తోడ్పడటానికి, రాజకీయ ఖైదీలను హింసించడంలో అపఖ్యాతి పాలైన ఎవిన్ జైలుపై వైమానిక దాడులను తిప్పికొట్టడానికి ఇరాన్ ప్రయత్నించింది. కానీ ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా ఖైదీలలో చాలా మందిని తెలియని ప్రదేశాలకు తరలించారు. దీంతో వారి పరిస్థితి మరింత దిగజారింది.
ఇజ్రాయెల్ను నాశనం చేయాలనే ఇరాన్ కాంక్షకు నిదర్శనంగా తరచుగా ఉపయోగించే “ఇజ్రాయెల్ డూమ్స్ డే గడియారం”పై ఇజ్రాయెల్ బాంబు దాడి చేయడం చాలా దారుణం.
ఇరానియన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్ఐబీపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేయడం కూడా అసంబద్ధం. ప్రభుత్వ ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. చాలా మంది ఇజ్రాయెల్ ప్రజలు ఎత్తి చూపినట్లుగా, ఈ బాంబు దాడి ఇరానియన్లకు ఇజ్రాయెల్ టెలివిజన్ స్టేషన్లను కూడా బెదిరించడానికి అవసరమైన సమర్థనను ఇచ్చింది.
ఇజ్రాయెల్ తన యుద్ధ లక్ష్యాలను సాధించలేకపోతే, కనీసం ప్రపంచాన్ని తన వెనుక సమీకరించి, గాజా గురించి ప్రజలను మరచిపోయేలా చేసి, ఇజ్రాయెల్ను మంచి కోసం పోరాడుతున్నట్లు తిరిగి చూపించగలిగిందా? అంటే అది కూడా సందేహాస్పదమే. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరానియన్ అణు సౌకర్యాలపై దాడి చేయడం నిజమే అయినప్పటికీ, అలా చేయడం ద్వారా అమెరికా అంతర్జాతీయ చట్టంలోని అనేక ప్రధాన నియమాలను ఉల్లంఘించింది. ఇది దీర్ఘకాలిక చిక్కులను కొని తెచ్చే అవకాశం ఉంది. అయితే, ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ట్రంప్ అమెరికాను భాగస్వామిని చేయలేదు. ఇరాన్ అణు సౌకర్యాలపై దాడి చేసిన తర్వాత వెంటనే వ్యూహాత్మక బాంబర్లు అమెరికాకు మరలిపోయాయి.
బాంబు దాడికి ముందు ఆ తరువాత, అమెరికా- ఇరాన్ల మధ్య ఒప్పందం కోసం తన కోరికను ట్రంప్ పునరుద్ఘాటించారు. అందులో ఇజ్రాయెల్ కూడా ఉండవచ్చు. అమెరికా అధ్యక్షుడు తన సొంత ప్రయోజనాలతో పాటు గల్ఫ్లోని తన మిత్రదేశాల ప్రయోజనాలను కూడా నెరవేర్చుకోవడానికి ఇజ్రాయెల్కు సహాయం చేసినట్లు తెలుస్తోంది.
అనేక మంది ప్రపంచ నాయకులు, ముఖ్యంగా జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, అమెరికా దాడులకు, “ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునే హక్కు”కు మద్దతు ఇవ్వడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించినప్పటికీ, ఇరాన్ యురేనియంను అస్సలు శుద్ధి చేయకూడదనే ఇజ్రాయెల్ చేస్తున్న కఠినమైన డిమాండ్ల జాబితాను ఎవరూ ఆమోదించలేదు.
ప్రపంచం “అణ్వాయుధం ఉండకూడదు”అనే సూత్రానికి తిరిగి వచ్చింది. ఇప్పటికే దీనికి కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇరాన్ ప్రకటించింది.
మధ్యప్రాచ్యంలో వ్యాపార సంబంధాల, అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాల విషయానికి వస్తే, వ్యాపారం చేయడానికి ఇరాన్ చట్టబద్ధమైన భాగస్వామిగా ప్రపంచం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇరాన్కు విజయం, ఇజ్రాయెల్కు నష్టం.
ఇజ్రాయెల్లోని ప్రధాన ప్రాంతాలకు జరిగిన అపారమైన నష్టాన్నికూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక ఆధిపత్యాన్ని చాలా త్వరగా సాధించింది. దాదాపు ఇష్టానుసారంగా దాడి చేసింది. అయితే, ఇరానియన్ క్షిపణులు పదేపదే ప్రఖ్యాత ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ(ఐరన్ డోమ్)లోకి చొచ్చుకుపోయి ఇజ్రాయెల్లో భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. దాంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థకు ఆయువుగా ఉండే ఇంటర్సెప్టర్ క్షిపణులకు తీవ్ర కొరత ఏర్పడింది. పర్యవసానంగా ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోయింది. ఇది ఇరాన్కు మరో విజయం.
ఇరాన్ క్షిపణి దాడులలో వేలాదిమంది గాయపడ్డారు. వందలాది మంది మరణించారు. యావత్ ఇజ్రాయెల్ విధ్వంసాన్ని చవిచూచింది. కానీ ఇజ్రాయెల్ దాడులను ఇస్లామిక్ రిపబ్లిక్ అత్యంత తీవ్ర స్థాయిలో ఎదుర్కొన్నప్పటికీ కూలిపోలేదు.
ఇరానియన్ క్షిపణులు ఇజ్రాయిల్పై పెను విధ్వంసాన్ని సృష్టించాయి. అయినప్పటికీ ఇరాన్ ప్రతిష్ఠ దిగజారలేదు(ప్రపంచంలో చాలా మంది ఇరాన్ను ఇజ్రాయెల్ దాడి బాధితురాలిగా భావించారు). ఇరాన్ ప్రతిస్పందనల కోసం ఎటువంటి పరిమితులను ఎదుర్కోలేదు. ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై తాను చేయబోయే “ప్రతీకార దాడి” గురించి అమెరికాను ముందుగానే హెచ్చరించడం ద్వారా ఇరాన్ విజయవంతంగా అమెరికా ప్రతిస్పందన తీవ్రతను తగ్గించుకుంది.
కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు కనిపించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ను ఇరాన్ పై దాడి చేయవద్దని ట్రంప్ను హెచ్చరించేలా ఇరాన్ శక్తివంతంగా వ్యవహరించింది. అలా అజేయంగా ఆవిర్భవించిన ఇరాన్కు సంభావ్య ఆశావహ భవిష్యత్తు మిగిలే ఉంది.
అనువాదం: నెల్లూరు నరసింహారావు
(అల్ జజీరా న్యూస్ సౌజన్యంతో)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.