
భారతదేశం అప్పులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి. అప్పుల గురించి నేటి, గత ప్రభుత్వాల మధ్య ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విమర్శనాత్మక వాదనలు జరుగుతున్నాయి.
ఈ అప్పులను తీర్చడానికి ప్రభుత్వాలు సహజంగానే ఆదాయాలు పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఆదాయాలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అసహజంగా ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం పేరు మీద ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడం, సంక్షేమ పథకాలలో కోత వంటి చర్యలకు పాల్పడుతున్నాయి.
ప్రజలకు ఉచితాలు ఇవ్వడం వల్లనే ప్రభుత్వాలు అప్పుల పాలవుతున్నాయనే వాదనలు పాలకులు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. కొంతమేరకు మధ్య తరగతి ప్రజలు ఈ వాదనతో ప్రభావితం కూడా అవుతున్నారు. వీటిలోని వాస్తవాస్తవాలను తెలుసుకోవాలంటే లోతుగా పరిశీలించాలి.
దేశం, వివిధ రాష్ట్రాల అప్పుల నిర్మాణం అనేక విభాగాలను కలిగి ఉంది. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థలో విభిన్న పాత్రలు పోషిస్తున్నాయి. భారత ప్రభుత్వం, రాష్ట్రాలు, ఆర్థిక లోటు నెరవేర్చడానికి ఇంకా అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కోసం అప్పులు తీసుకుంటాయి. ప్రభుత్వ అప్పులు భారత దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన అంశం. ఏ దేశంలోనైనా ఇది అసహజం కూడా కాదు.
దేశంలో అప్పులు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ అప్పులు, రెండోది రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు, మూడోది కార్పొరేట్/ప్రైవేట్ సంస్థల అప్పులు, నాల్గవది ప్రజల అప్పులు. విచిత్రంగా ఈ నాలుగు ప్రస్తుతం దేశంలో ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లుగా శరవేగంగా పెరిగిపోతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ అప్పులు
ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి స్వదేశీ(అంతర్గత), రెండోది విదేశీ(బాహ్య) అప్పులు. ఈ రెండింటి ఆధారంగా భారతదేశ రుణ భారాన్ని అంచనా వేయవచ్చు.
దేశీయ అప్పులు..
ఎక్కువ భాగం దేశీయ మార్కెట్ నుండి తీసుకుంటారు. ఈ అప్పులు ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, ఇతర ఆర్థిక సాధనాల ద్వారా సేకరించబడతాయి. ఇది విదేశీ మారక విలువ ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతర్గత అప్పు(Internal Debt) అనేది దేశం లోపల నుంచి భారతీయ పౌరులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంకా ఇతర సంస్థల నుంచి ప్రభుత్వం తీసుకున్న రుణాలను సూచిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రకారం, భారతదేశ అంతర్గత అప్పు దాదాపు 168 లక్షల కోట్ల రూపాయలు వరకు ఉందని అంచనా.
విదేశీ అప్పులు..
విదేశీ మూలాల నుంచి అంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలయిన ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, విదేశీ వాణిజ్య బ్యాంకుల వంటి లేదా ఇతర విదేశీ రుణదాతల నుంచి తీసుకునే అప్పులు. వీటిని సాధారణంగా విదేశీ కరెన్సీలలో రుణంగా పొందుతారు, కాబట్టి మారక విలువ మార్పులపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు డాలరుతో రూపాయి విలువ తగ్గిపోవడంతో మన విదేశీ రుణ చెల్లింపులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. విదేశీ అప్పుల అధికభారం ఉన్నప్పుడు మారక విలువ ప్రమాదాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్పులు దేశ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2024 డిసెంబర్ నాటికి భారతదేశ విదేశీ అప్పు సుమారు 54 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.
మొత్తం అప్పులు..
అంతర్గత- బాహ్య అప్పులను కలిపితే భారతదేశ మొత్తం అప్పు 2024-25లో సుమారు 205-210 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇది దేశ GDPలో 55-60% వరకు ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీనిలో విదేశీ అప్పు(external debt) 2024 చివరి నాటికి సుమారు (650 బిలియన్ డాలర్లు) రూ. 54 లక్షల కోట్లు)గా ఉంది. ఈ అప్పులు భవిష్యత్ తరాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.
ఒక్కో వ్యక్తిపై అప్పుల భారం..
మనలో కొంతమంది తమకు అప్పులు లేవని భావిస్తూ ఉంటారు. కానీ వారిపై కూడా ప్రభుత్వం అప్పుల భారం వేస్తోంది. భారతదేశ జనాభా సుమారు 142 కోట్లుగా పరిగణిస్తే, ఒక్కో వ్యక్తిపై సగటు అప్పు దాదాపు 1.44 లక్షల రూపాయల నుంచి 1.48 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అయితే, ఈ అంచనా సాధారణ లెక్క మాత్రమే. ఆర్థిక వ్యవస్థలోని రూపాయి విలువ వంటి వివిధ అంశాలను బట్టి మారవచ్చు.
రాష్ట్రాల అప్పులు..
కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు కూడా గణనీయంగా ఉన్నాయి. 2025 మార్చి నాటికి, రాష్ట్రాల మొత్తం అప్పు సుమారు 83.3 లక్షల కోట్ల రూపాయలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది జాతీయ GDPలో 25-30% స్థాయిలో ఉంది.
దేశంలో వివిధ రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. కేంద్రం నుంచి చట్టపర సహాయం కూడా సక్రమంగా అందక పోవడంతో అప్పులు చేయడం, ప్రజలపై భారాలు వేయడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం వంటివి మార్గాలుగా అనుసరిస్తున్నాయి. ఈ అప్పుల్లో కూడా స్వదేశీ, విదేశీ అప్పులు ఉంటున్నాయి. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇటివలే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల వంటి విదేశీ సంస్థల నుంచి అప్పులు తీసుకుంది.
ఆంధ్ర ప్రదేశ్..
అప్పుల విశ్లేషణకు ఆంధ్ర రాష్ట్రాన్నే ఉదాహరణగా తీసుకుంటే తాజా సమాచారం ఆధారంగా, వివిధ వనరుల నుంచి వచ్చిన డేటా ప్రకారం రాష్ట్ర అప్పులు గణనీయంగా పెరిగాయి. 2024 జూన్ నాటికి రాష్ట్ర అప్పు సుమారు రూ. 5,19,192 కోట్లుగా ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి శాసన మండలిలో వెల్లడించారు.
పదేళ్ళ క్రితం అంటే 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అప్పు 1.18 లక్షల కోట్ల రూపాయలు ఉంది. 2019 నాటికి ఇది 2.64 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. 2023 మార్చి నాటికి రాష్ట్రం మొత్తం అప్పు 4.28 లక్షల కోట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదికలో పేర్కొనబడింది. అయితే, సీఎం చంద్రబాబు 2024 నవంబర్లో రాష్ట్ర అప్పు 9.74 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వ అప్పులతో పాటు కార్పొరేషన్ అప్పులు, విద్యుత్ రంగ బాకీలు ఇతర బాకీలు కూడా ఉన్నాయి.
2025 మార్చి నాటికి, కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పు 5.62 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని తెలిపారు. ఇందులో 2019 వరకు టీడీపీ పాలనలో చేసిన అప్పు 2.64 లక్షల కోట్ల రూపాయలు. 2024 తర్వాత కూటమి ప్రభుత్వం చేసిన అప్పు 1 లక్ష కోట్ల రూపాయలుగా కొందరు వాదిస్తున్నారు. అయితే, ఈ గణాంకాలు వివిధ రాజకీయ పక్షాల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి.
ఏదేమైనా ఎవరు చేసినా అప్పులు మాత్రం వాస్తవం. ఈ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తి(GSDP)లో 34.47%గా ఉన్నట్లు కాగ్(CAG) తాజా నివేదికలో పేర్కొంది. ఇది గరిష్ట పరిమితి 33.1% కంటే ఎక్కువ.
రాష్ట్ర అప్పులు పెరగడానికి కారణాలుగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక నిర్వహణలో సమస్యలు వంటివి చెప్పబడుతున్నాయి.
అధికారంలో ఉన్న పార్టీలు మారినా, ప్రభుత్వాలు ఈ అప్పుల సాకు చూపి ప్రజలపై విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్నులు వంటివి భారీగా పెంచుతున్నాయి. మరోపక్క సంక్షేమ పథకాలలో కోత విధిస్తున్నాయి. హామీలు అమలు చేయడం లేదు.
జీడీపీతో అప్పుల నిష్పత్తి..
జీడీపీ, అప్పుల నిష్పత్తి దేశ ఆర్థిక శక్తిని బట్టి అప్పుల భారం కొలిచే ఒక ముఖ్యమైన సూచిక. భిన్న పరిస్థితుల వల్ల ఈ నిష్పత్తి మారవచ్చు. 2023 చివరి నాటికి భారతదేశం రుణం జిడిపి నిష్పత్తి 81% పైగా ఉంది. (ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రుణం రెండూ ఉన్నాయి). వీటిలో కేంద్ర ప్రభుత్వ అప్పు జీడీపీలో 55-60%,మిగిలింది రాష్ట్రాల రుణంగా చెప్పుకోవచ్చు.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సుమారు 60% లేదా అంతకంటే తక్కువ జీడీపీ నిష్పత్తి సాధారణంగా స్థిరమైనదిగా పరిగణించబడుతుంది. అది కూడా అభివృద్ధి, ఉపాధి కల్పనకు ఉపయోగడితేనే. నేడు మొత్తం నిష్పత్తి 81 శాతం పైగా ఉండడం ఆందోళన కరమైనది.
కార్పొరేట్ అప్పులు..
భారతదేశంలో వివిధ కంపెనీలు వ్యాపార విస్తరణ, ఆపరేషన్లు- పెట్టుబడుల కోసం రుణం తీసుకుంటాయి. భారీ కార్పొరేట్ అప్పులు దేశ ఆర్థిక స్థితిగతులను ప్రభావితంచేస్తాయి. పార్లమెంటులో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ పదేళ్ళ కాలంలో కార్పొరేట్ల సంస్థలు 16.35 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో పాటు గడచిన
ఐదేళ్ళలో ఒక్క కార్పొరేట్ పన్ను రాయితీలే 4,53,328 కోట్ల రూపాయల మేరకు ఇచ్చింది.
2025 మార్చి నాటికి దేశంలో ఈ కార్పొరేట్ కంపెనీల అప్పులు మొత్తం 87.13 లక్షల కోట్ల రూపాయలని ఇండియన్ ఎక్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్ పత్రికలు పేర్కొన్నాయి. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల మొత్తం అప్పులకంటే ఎక్కువ. ఈ అప్పుల వల్ల వీరి లాభాలు, ఆస్తులు పెరగడం తప్ప దేశానికి మాత్రం ప్రయోజనమేమీ లేదు, తిరిగి భారాలు మోయడం తప్ప. వీరి రుణాలు దేశానికే భారంగా మారాయి.
కుటుంబ(హౌస్హోల్డ్) అప్పులు..
భారతదేశంలో వ్యక్తిగత అప్పులు సాధారణంగా గృహ రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డ్ అప్పులు, వ్యక్తిగత రుణాల రూపంలో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా ఇతర ఆర్థిక సంస్థల డేటా ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తిగత రుణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు 2023-24లో భారతదేశంలో రిటైల్ రుణాలు సుమారు 30% వార్షిక వృద్ధి చెందాయి. ముఖ్యంగా గృహ రుణాలు, క్రెడిట్ కార్డ్ వినియోగం వల్లను, గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ ఆర్థిక సంస్థల(microfinance institutions)ద్వారా చిన్న రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవి ఎక్కువగా వ్యవసాయం లేదా చిన్న వ్యాపారాల కోసం ఉపయోగపడుతున్నాయి. కొన్నితరగతుల ప్రజల్లో ముఖ్యంగా తక్కువ ఆదాయం గల కుటుంబాలలో అప్పులు, వడ్డీల భారం పెరుగుతోంది. 2024 జూన్ నాటికి కుటుంబాల అప్పులు జీడీపీలో 42.9 శాతం ఉన్నాయని ద ఎకనామిక్స్ టైమ్స్ పేర్కొంది. ఇక్కడ కూడా కుటుంబ ఆదాయాలు, ఆస్తులు పెరగడానికి ఈ అప్పులు ఉపయోగపడితే అది సముచితమే.
కానీ నేడు అత్యధిక కుటుంబాలు వైద్యం, కుటుంబ రోజువారీ అవసరాలు, పాత అప్పులు తీర్చడం వంటి వాటికే ఖర్చు చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రుణాలు తగ్గిపోవడంతో ఎక్కువగా అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు తీసుకోవడం వల్ల రైతాంగం రుణాల ఊబిలో కూరుకుపోతోంది. కుటుంబ అప్పుల ప్రభావం ఆర్థిక, సామాజిక రంగాలలో ప్రస్ఫుటంగా కనపడుతుంది.
ఆర్థిక ప్రభావాలు..
సరిగ్గా నిర్వహించిన అప్పులు ప్రజల ఆదాయాలను పెంచేవిగా ఉండాలి. ఉపాధి కల్పన పెంచేవిగా ఉండాలి. మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సామాజిక కార్యక్రమాలకు మద్దతుగా ఉండాలి. అలాంటి అప్పులు దీర్ఘకాలంలో దేశ వృద్ధిని ప్రేరేపిస్తాయి. దీనికి భిన్నంగా ఉండే అదనపు అప్పులు లేదా తప్పుగా నిర్వహించిన అప్పులు ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయి.
సామాజిక ప్రభావాలు..
అప్పులు పెరగడం వల్ల పన్నులు పెరిగే అవకాశం ఉంది. ఇది సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు తీర్చలేక రైతులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. వేల సంఖ్యలో రైతుల ఆత్మ హత్యలకు అప్పులే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
సామాన్యులే సమిధలు..
భారత దేశంలో ప్రజల అప్పుల గురించి రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటి వ్యక్తిగత అప్పులు, రెండోది దేశం మొత్తం మీద ప్రభుత్వ అప్పులు. ఎందుకంటే ప్రభుత్వ అప్పులు కూడా వివిధ రకాలైన భారాల ద్వారా అంతిమంగా ప్రజలపైనే ప్రభావం చూపుతాయి. విచిత్రమేమిటంటే కార్పొరేట్ సంస్థల అప్పుల భారం కూడా అంతిమంగా సామాన్య ప్రజల మీదే పడుతుంది. అదెలాగంటే కార్పొరేట్ బ్యాంకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడం వల్ల పోయేది ఆ బ్యాంకులలో దాచుకున్న ప్రజల సొమ్మే కదా, కార్పొరేట్ సంస్థలేవీ బ్యాంకులలో సొమ్ము దాచుకోవు కదా.
క్షీణిస్తున్న జీవన ప్రమాణాలు..
2014 – 24 మధ్య పదేళ్లకాలంలో భారత దేశం, దేశంలోని రాష్ట్రాల అప్పులు భారీగా పెరిగాయని ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక పేర్కొంది. భారత దేశ విదేశీ రుణం 2014 లో 440.06 బిలియన్ డాలర్లు ఉండగా, మార్చి 2024 లో 711.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే డాలర్లలో 61 శాతం పెరిగింది. అదే రూపాయలలో అయితే 26.87 లక్షల కోట్ల రూపాయల నుంచి 60.86 లక్షల కోట్ల రూపాయలకు అంటే రెట్టింపుకు పైగా పెరిగిందని తెలుస్తోంది.
ఇదే కాలంలో స్వదేశీ రుణం 55.87 లక్షల కోట్ల రూపాయల నుంచి 147 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే సుమారు మూడు రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం మరింత పెరిగి 168 లక్షల కోట్లకు చేరింది.
పదేళ్లలో మొత్తం రుణాలు 82.74 లక్షల కోట్ల రూపాయల నుంచి 207.86 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. అంటే 151 శాతం పెరుగుదల కనిపిస్తోంది.
అప్పులు పెరగడం వల్ల పోనీ ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగేయా అంటే లేదు సరికదా ప్రజల అప్పులు మాత్రం పెరిగాయి. పేదరికం పెరిగింది. ఉపాధి కల్పన తగ్గింది. వలసలు పెరిగాయి. అప్పులు తీర్చలేక రైతుల ఆత్మ హత్యలు పెరిగాయి.
అప్పుల సొమ్ము ఎటు?
అప్పులు సరే, ఈ పెరిగిన అప్పులతో ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రధాన అంశం. ఈ పదేళ్ళ కాలంలో ఒక్క భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమను కూడా స్థాపించ లేదు. ఒక్క భారీ నీటి ప్రాజక్టును కూడా నిర్మించలేదు. మొత్తంగా చూస్తే ఉపాధి కల్పన ఈ కాలంలో ప్రభుత్వ పెట్టుబడి వలన ఏమీ పెరగలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రెండే రెండు పనులు చేస్తోంది.
ఒకటి ప్రభుత్వ పెట్టుబడులు ప్రధానంగా జాతీయ రహదారులు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి ఖర్చు చేస్తోంది. విశేషమేమిటంటే వీటిని నిర్మించి, అన్నింటినీ ‘నేషనల్ మోనటైజేషన్ పైప్ లైన్’ పేరుతో తిరిగి ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ రెండో పెద్ద ఖర్చు కార్పొరేట్ సంస్థల రుణాల మాఫీ, వారికి రాయితీలు ఇవ్వడం.
పరిష్కారం..
ఈ అధిక అప్పుల వల్ల ఒక పక్క దేశంలోని అత్యధిక ప్రజానీకం కుదేలవుతుండగా, మరో పక్క కొద్ది మంది కార్పొరేట్లు మాత్రం పెద్ద ఎత్తున లాభ పడుతున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే అప్పుల భారాలు సామాన్య ప్రజలు మోస్తుండగా, శత కోటీశ్వరులు మాత్రం దిలాసాతో కులాసాగా ఉంటున్నారు. ఈ విధానాలు ఇలాగే కొనసాగితే దేశం, ప్రజలు దివాళా అంచుకు చేరడం ఖాయం. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవడం అత్యవసరం. అది ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యం.
ఎ అజ శర్మ
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.