
తెలంగాణ విద్యా కమిషన్(టిఇసి) ఇటీవల రాష్ట్ర విద్యా వ్యవస్థ పరివర్తనకు మూడు కీలక నివేదికలను సమర్పించింది. అందులో మొదటిది తెలంగాణ ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కళాశాలల ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ డ్రాఫ్ట్ బిల్- 2025. రెండవది మధ్యాహ్న భోజన పథకంలో, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఆహార నాణ్యత, భద్రతపై సిఫారసులు. మూడోవది తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరివర్తనపై సమగ్ర నివేదిక- శ్రేష్ఠమైన విద్య కోసం కీలక సిఫారసులు. ఈ నివేదికలు ఆరు నెలల కాల వ్యవధిలోపే పూర్తి చేయబడ్డాయి. ఇందులో భాగంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పౌర సమాజంతో ప్రభుత్వ అధికారులు విస్తృత సంప్రదింపులు, మేధోమధన సమావేశాలను జరిపారు.
అయితే టిఇసి కృషి ఫలితంగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో, తీవ్ర సమస్యగా ఉన్న ఫీజుల నియంత్రణకు ఒక డ్రాఫ్ట్ బిల్, మధ్యాహ్న భోజన పథకంలో, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఆహార నాణ్యత, భద్రతను మెరుగుపరచడానికి వివరణాత్మక సిఫారసులు, ప్రభుత్వ పాఠశాలల సంస్కరణ కోసం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు(టిపిఎస్), తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను(టిఎఫ్ఎస్) ఏర్పాటు చేయడానికి ఆరేళ్ల ప్రణాళిక వెలువరించబడింది. ఈ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ బోధనా మాధ్యమం, గవర్నెన్స్- విద్యా సంస్థల పనితీరు కొలతలు, గ్రేడింగులపై అతిగా ఆధారపడటం, యూనివర్సల్ నాణ్యత సాధించడం వంటి కీలక అంశాలపై మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతాయి.
ప్రశంసనీయ ఫ్రేమ్వర్క్..
తెలంగాణ ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కళాశాలల ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కోసం టిఇసి డ్రాఫ్ట్ బిల్, నియంత్రణ లేని ఫీజు పెంపుదల వల్ల మధ్యతరగతి కుటుంబాలపై పడే భారాన్ని పరిష్కరిస్తుంది. ఒక రిటైర్డ్ జడ్జి లేదా సీనియర్ ఉన్నతాధికారి నేతృత్వంలో కమిషన్ను ప్రతిపాదిస్తూ ఈ బిల్, ఫీజు పెంపును కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(సిపిఐ)తో అనుసంధానిస్తుంది. పాఠశాల వెబ్సైట్ల ద్వారా పారదర్శకతను తప్పనిసరి చేస్తూ దోపిడీ పద్ధతులను అరికట్టాలనే ఆశాభావాన్ని టిఇసి వ్యక్తపరుస్తుంది.
మధ్యాహ్న భోజన పథకమనేది విద్యలో తరచూ నిర్లక్ష్యం చేయబడే పోషణకు సంబంధించిన కీలక అంశం. ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ అభ్యసన దాని ప్రభావంపై పరిశోధన చేసి “క్లాస్రూమ్ హంగర్” నివేదికను రూపొందించారు. దీని మీద టిఇసి గణనీయమైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆహార నాణ్యత, భద్రతపై టిఇసి నివేదిక ఆందోళనకరమైన లోపాలను వెల్లడించింది. గడువు ముగిసిన పాలు, సరిగా ఉడకని ఆహారం, గుడ్లు, కీటకాలతో కలుషితమైన బియ్యం ఉంటున్నాయని టిఇసి జరిపిన క్షేత్ర సందర్శనలలో తెలిసింది. మధ్యాహ్న భోజన రేట్లను పెంచడం, స్వయం సహాయక బృందాలను వినియోగించడం, వికేంద్రీకృత విధానాలను అనుసరించడం, నాణ్యత పరిరక్షణకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ నిర్దారించడం వంటి టిఇసి సిఫారసులు విద్యార్థుల శ్రేయస్సు పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. ఈ సంస్కరణలు పిల్లల హాజరును, సరిగా నేర్చుకునే అవకాశాలను, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులలో మెరుగుపరుస్తాయని ఆశించవచ్చు.
శ్రేష్ఠమైన విద్య కోసం సిఫారసులు..
ఫిబ్రవరి 2025లో ప్రభుత్వ పాఠశాలల పరివర్తనపై టిఇసి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక 613 మండలాల్లో టిపిఎస్- టిఎఫ్ఎస్లను ఏర్పాటు చేయడానికి 2025-2031 వరకు ఆరేళ్ల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ఆరు దశలలో రూ. 31,600 కోట్ల అంచనా బడ్జెట్తో అడుగులు వేయాలని సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 మండలాలను కవర్ చేయడానికి రూ. 5,000 కోట్లతో ప్రారంభమై, ఈ ప్రణాళిక చిన్న, వనరులు తక్కువగా ఉన్న పాఠశాలలను నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించే సమీకృత క్యాంపస్లుగా(టిపిఎస్), ప్రాథమిక విద్య కోసం ఫౌండేషన్ స్కూళ్లుగా(టిఎఫ్ఎస్) మార్చడానికి ఉద్దేశించింది.
కానీ, 61 శాతం విద్యార్థులు ప్రైవేట్ బడుల్లో ఉన్న పరిస్థితుల్లో, మిగిలిన 39 శాతం వెనుకబడిన వర్గాల పిల్లలు కుల, మత ప్రాతిపదికన రెసిడెన్షియల్ స్కూళ్లలో, ఇంకా యాజమాన్యాల వారీగా చాలా రకాలుగా విభజించబడి ఉన్నప్పుడు కమిషన్ లక్ష్యంగా చెప్పుకున్న సమభాగస్వామ్యం(ఈక్విటీ) ఎలా సాధ్యమవుతుంది? అలానే 2014లో తెలంగాణ ఏర్పాటు నుంచి విద్యా బడ్జెట్ వాటా 11% నుంచి 6.4%కి తగ్గిన చారిత్రక గతి, ప్రస్తుత ప్రభుత్వం వాగ్దానం చేసిన 15% వాటా 7.5%కు తగ్గడం, ప్రారంభ సంవత్సరానికి మొదటి దశ కోసం రూ. 5,000 కోట్ల కేటాయింపు లేకపోవడం, విద్యారంగంలో సమూల మార్పుల కోసమని విద్యా కమిషన్ను నియమించి, విద్యాకమిషన్కు సంబంధం లేకుండానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రకటించడం, ఆ స్కూళ్ళు కూడా నిజమైన ఇంటిగ్రేషన్తో కాకుండా కేవలం ఒకే క్యాంపస్లో విడివిడిగా ఉండే స్కూళ్లుగా ఉండే మార్పులతో ఉండడం, ఈ విషయాలన్నీ ప్రభుత్వ నిబద్ధతపై సందేహాలను లేవనెత్తుతుంది.
వ్యవస్థాగత సవాళ్ల నిర్ధారణ: సంస్కరణల పునాది
ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కుంటున్న సవాళ్లను టిఇసి సమగ్రంగానే గుర్తించింది. ప్రీ-ప్రైమరీ విభాగాలు లేకపోవడం, అంగన్వాడీలపై తల్లిదండ్రుల అవిశ్వాసం, బహుళ-గ్రేడ్ బోధన, ఉపాధ్యాయులపై పరిపాలన భారం, ఇంకా పర్యవేక్షణ లేకపోవడం వంటి కీలక సమస్యలు ప్రస్తుతం ఉన్నాయి. ప్రీ-ప్రైమరీ విద్య లేకపోవడం ప్రారంభ జ్ఞానాత్మక అభివృద్ధిని దెబ్బతీస్తుంది. అంగన్వాడీలపై అవిశ్వాసం, ఆర్థిక ఒత్తిడి ఉన్నాయి. అయినప్పటికీ ప్రైవేట్ స్కూళ్ల ఎంపికల వైపు కుటుంబాలను నడిపిస్తుంది. ఉపాధ్యాయులపై పరిపాలన భారం, జనాభా లెక్కల వంటి పనులు, వారిని బోధన నుంచి పక్కకు మళ్లిస్తుంది. ఈ వ్యవస్థాగత లోపాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, టిఇసి సంస్కరణకు పునాది వేస్తుంది. ఆర్టిఈ చట్టం ద్వారా నిర్దేశించబడినట్టుగా, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు(టిపిఎస్) తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లు(టిఎఫ్ఎస్) కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను(ఎస్ఎంసీఎస్) సాధికారపరచడం ఒక పరివర్తనాత్మక దశను సూచిస్తుంది. ఈ బాధ్యతలను ఎస్ఎంఎస్లకు అప్పగించడం, ఆర్థిక లీకేజీలను తగ్గిస్తుందని టిఇసి భావిస్తుంది.
ప్రిప్రైమరీ ప్రాముఖ్యత దృష్ట్యా ఆ విద్యను అంగన్వాడీలతో గాక, ప్రైమరీ స్కూళ్లతోనే అనుసంధానించాలనే కమిషన్ సిఫార్సు చాలా ప్రశంసనీయమైనది. అయితే ఆ స్థాయి టీచర్ల నియామకంపై కమిషన్ సిఫార్సు సరిగా లేదు. ఒక ఎస్జిటి టీచర్కు కొంత ఓరియెంటేషన్తో, ఒక స్థానిక మహిళా గ్రాడ్యు యేట్కు కొంత శిక్షణనిచ్చి వీటిని నడపాలని కమిషన్ సూచిస్తుంది.
పూర్తి స్థాయి ప్రొఫెషనలిజం లేని టీచర్లతో ఈ స్థాయి విద్య నష్టాన్నే కలుగజేస్తుంది. నిజానికి , విద్యారంగాన్ని సమూలంగా సంస్కరించాలని అనుకున్నప్పుడు, అతి కీలకమైన ఉపాధ్యాయ విద్యతోనే విద్యారంగ సంస్కరణలు ప్రారంభించబడాలి. కానీ ఈ ప్రిప్రైమరీ ఉపాధ్యాయ విద్య గురించి కానీ, మిగతా స్థాయిల ఉపాధ్యాయ విద్య గురించి కానీ కమిషన్ తర్వాత స్థాయిలో సిఫార్సులు చేస్తామని చెప్పుకున్నారు.
ప్రస్తుతం విద్యారంగంలోని అన్ని విభాగాల్లో కెల్లా ఉపాధ్యాయ విద్య అంత్యంత దయనీయస్థితిలో ఉంది. 90 శాతానికి పైగా విద్యారంగంలో టీచర్ ఎడ్యుకేటర్ల ఖాళీలు ఉన్నాయి. మరో 90 శాతం ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నాయి. అవి చాలా వరకు సర్టిఫికెట్లను అమ్ముకునే దుకాణాలుగానే ఉన్నాయి.
ఇంగ్లీష్ మాధ్యమ సమస్య..
టిఇసి సిఫార్సుల్లో వివాదాస్పదమైనది, ఇంగ్లీష్ మాధ్యమ బోధనను సమర్థించడం. ఇది తల్లిదండ్రుల డిమాండ్గా భావించబడింది. వలస పాలన, స్థానిక భాషలను సరైన రీతిలో అభివృద్దిపరుచుకోకపోవడం, ఇంగ్లీష్ భాష ఉపయోగితా విలువ దృష్ట్యా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అనివార్యమైన పరిస్థితులు వచ్చాయి. కానీ, ఇంగ్లీషును సరిగా నేర్చుకోవడం ఎలా అనేది ప్రధాన సవాలు. ఈ సవాలును అధిగమించే శాస్త్రీయమైన పరిష్కారాలు కమిషన్ రిపోర్ట్లో లేవు. ఇంగ్లీష్ మీడియంలో బోధనను పరిష్కారంగా చూపింది. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సరైన విధానాల గురించి సిఫార్సులు లేవు.
అయితే, ఈ రకమైన దృక్పథంతోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించబడిన సక్సెస్ స్కూళ్లు వైఫల్యం అయ్యాయని మరిచిపోకూడదు. టిఇసి, ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ప్రతిపాదన, ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తుతుంది. పిల్లల కోసం బోధనా మాధ్యమాన్ని ఎవరు నిర్ణయిస్తారు? వారి సహజమైన, భారం లేని నేర్చుకునే ప్రాథమిక హక్కులు ఏంటి?
“వాట్ ఈజ్ వర్త్ టీచింగ్?” పుస్తకంలో ప్రముఖ భారతీయ విద్యావేత్త ప్రొఫెసర్ కృష్ణ కుమార్ ఒక విమర్శ చేస్తారు. పాఠ్యాంశాలు, బోధనా మాధ్యమం విషయంలో తరచూ పెద్దలు(విధాన నిర్ణేతలు, ఉన్నతాధికారులు) పిల్లల తరఫున నిర్ణయాలు చేస్తారని అంటారు. అంతేకాకుండా దీనివల్ల అభ్యసన- బోధన లక్ష్యాలు, పిల్లల హక్కులు మరుగున పడతాయని వాదిస్తారు. ఆయన దీనిని భారతదేశ వలస వారసత్వానికి ఆపాదిస్తారు. మొదటి నుంచి పాలక- ఉన్నత వర్గానికి విద్య సేవ చేసింది, ప్రస్తుతం మార్కెట్ సేవ కోసం అదే చేస్తుంది. దీంతో రెండు సందర్భాలలోనూ విద్య ప్రయోజనం, పిల్లలు నేర్చుకునే హక్కులు నిర్లక్ష్యమవుతున్నాయి. ప్రొఫేసర్ కృష్ణ కుమార్ ఇటువంటి నిర్ణయాలు పిల్లలను వారి మాతృభాష నుంచి దూరం చేస్తాయని, సహజంగా పిల్లలు నేర్చుకునే హక్కును ఉల్లంఘిస్తాయని వాదిస్తారు.
అంతేకాకుండా, విద్యావేత్త డాక్టర్ జిమ్ కమిన్స్ పరిశోధనలు కూడా ప్రారంభ దశలో మాతృభాష విద్య అవగాహనను పెంచుతుందని, ద్విభాషా విద్యను క్రమంగా పరిచయం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చూపిస్తుంది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ట్రాన్సిషన్ ప్లాన్ లేకుండా ఇంగ్లీష్ను ముందస్తుగా రుద్దడం, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు నేర్చుకోవడంలో అంతరాలను విస్తరింపజేసే ప్రమాదం ఉంది. తల్లిదండ్రుల “డిమాండ్” తరచూ పిల్లల ఆసక్తుల కంటే, సామాజిక ఆర్థిక ఒత్తిడుల వలన ఇంగ్లీష్ ఒక స్థాయి చిహ్నంగా, ఉద్యోగ మార్కెట్కు ప్రవేశ టికెట్గా మారుతుందని సైకాలజీ, లింగ్విస్టిక్స్ స్కాలర్ ఏకే మోహంతి హెచ్చరిస్తారు.
దక్షిణాఫ్రికా, వర్ణ వివక్ష అనంతర కాలంలో ఇంగ్లీష్ మాధ్యమ విద్యకు మారడం ఇలాంటి సమస్యలను ప్రపంచం చూసింది. అవకాశాలను సమానం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నప్పటికీ, ఇది ఇంగ్లీష్ మాట్లాడని విద్యార్థులను నష్టపరిచింది. దీంతోపాటు డ్రాపౌట్ రేట్లను పెంచింది.
టిఇసి ఉపాధ్యాయ శిక్షణ, పాఠ్యాంశ రూపకల్పనల విషయాలకు సంబంధించిన నివేదికలను తర్వాత సమర్పిస్తామని తెలిపారు. ముఖ్యమైన ఈ విషయాలను వాయిదా వేయడం ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తుంది. దృఢమైన ఫ్రేమ్వర్క్ లేకుండా ఇంగ్లీష్ మాధ్యమ ఒత్తిడి ఒక ఖాళీ వాగ్దానంగా మారవచ్చు. వ్యవస్థాగత మార్పుకు ఉపాధ్యాయ సామర్థ్య నిర్మాణం ముందుగానే అవసరమని, తర్వాతి ఆలోచనగా కాదని విద్యావేత్త మైఖేల్ ఫుల్లాన్ అంటారు.
పరిపాలన నమూనా: సరైన అడుగేనా?
జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, ఫౌండేషనల్ స్కూళ్లకు అధ్యక్షుడిగా నియమించబడతారని, కలెక్టర్ పాఠశాలలను సందర్శించి, వాటి పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తారని, అధ్యక్షుడు టిపిఎస్-టిఎఫ్ఎస్ల అన్ని ప్రధానోపాధ్యాయులతో ఫ్యాకల్టీని ప్రేరేపించడానికి, ప్రోత్సహించడానికి వాట్సాప్ గ్రూప్ను నిర్వహిస్తారని టిఇసి నివేదిక పేర్కొంటుంది. ఈ పరిపాలన నమూనా టిఇసి దృష్టిని మరింత సంక్లిష్టం చేస్తుంది. వృత్తిపరమైన విద్యావేత్తల కంటే, జిల్లా కలెక్టర్ల వంటి ఉన్నతాధికారులకు గణనీయమైన అధికారాన్ని అప్పగించడం శాస్త్రీయం కాని వైఖరిని అవలంబిస్తుంది. ప్రొఫెసర్ కృష్ణ కుమార్ దీనిని వలస వారసత్వంగా విమర్శిస్తారు. ఇటువంటి పరిస్థితులలో ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కింద కేవలం యాంత్రికమైన కార్యనిర్వాహకులుగా తగ్గించబడతారని పొలిటికల్ ఎజెండా ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకంలో ఆయన రాస్తారు.
మైఖేల్ ఫులాన్ వంటి విద్యావేత్తలు సమర్థవంతమైన పాఠశాల సంస్కరణకు బోధనా నైపుణ్యంపై ఆధారపడిన సహకార నాయకత్వం అవసరమని, పరిపాలన ఆదేశాలు కాదని వాదిస్తారు. కలెక్టర్లు విధి నిర్వహణా నిపుణులు కావచ్చు. కానీ తరగతి గది డైనమిక్స్ను పరిష్కరించడానికి అవసరమైన సూక్ష్మమైన అవగాహన వారికి ఉండదు. ఈ రకమైన ఉన్నతాధికార అతి నియంత్రణ, విద్యా ఫలితాలను సాధించడంలో అవాంతరాలను కలిగించవచ్చు.
అంతర్జాతీయంగా ఫిన్లాండ్ విజయం, ఉన్నతాధికారుల కంటే వృత్తిపరమైన విద్యావేత్తలకు పాఠశాలలను నడిపించడానికి అధికారం ఇవ్వడం నుంచి వచ్చిందని పాసీ సహ్ల్బెర్గ్ చెప్పారు. దీనికి విరుద్ధంగా టిఇసి కలెక్టర్లపై ఆధారపడటం ఇంగ్లాండ్ ఆఫ్ స్టెడ్ మోడల్ను పునరావృతం చేసే ప్రమాదం ఉంది. ఇక్కడ టాప్- డౌన్ తనిఖీలు సృజనాత్మకత కంటే విధేయతను పెంచాయని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ జేన్ పెర్రీమన్ అన్నారు. విద్యావేత్త పాసి సహ్ల్బెర్గ్ ఇటువంటి వ్యవస్థలు జవాబుదారీతనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయని హెచ్చరిస్తారు. ఈ పరిశోధనలన్నీ తెలంగాణకు ఓ హెచ్చరికను ఇస్తాయి.
టిఇసి, విద్యా నాయకత్వాన్ని పెంపొందించే ప్రతిపాదనలను ఏమీ చేయకుండానే, ఉన్నతాధికారులపై అతిగా ఆధారపడటం దాని సంస్కరణ ఉద్దేశాన్ని బలహీనపరుస్తుంది. విద్యను నిర్వహించడానికి విద్యావేత్తలను ఎందుకు నమ్మకూడదనే ప్రశ్నను లేవనెత్తుతుంది.
కొలతపై ఆసక్తి: ఆడిట్ సంస్కృతి ఉచ్చు?
టిఇసి, ఫలితాల కొలత, సంస్థల ర్యాంకింగ్పై దృష్టి మరో ఆందోళనకర సంకేతంగా కనబడుతోంది. తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటు, న్యాక్ తరహాలో స్కూళ్ల గ్రేడింగ్కు చర్యల పోటీని పెంచి జవాబుదారీతనం పెంచడానికి ఉపయోగపడుతాయని భావించబడుతుంది. కానీ, కొలతలపై అతిగా ఆధారపడటం “ఆడిట్ సంస్కృతి”ని పెంచే ప్రమాదం ఉంది.
విద్యా కార్యకలాపాలు ఆచారబద్ధంగా మారి, సరిగా నేర్చుకోవడానికి ప్రాధాన్యత తగ్గి, స్కోర్ల ప్రలోభంలో పడుతాయని నెదర్లాండ్ విద్యావేత్త గెర్ట్ బియెస్టా అంటారు. ఉపాధ్యాయ శిక్షణ, పాఠ్యాంశాలు, మూల్యాంకన పద్ధతులను “తగిన సమయంలో” రూపొందిస్తామనే నివేదిక వాగ్దానం ఈ ఉచ్చును నివారించడానికి అవసరమైన యంత్రాంగాల వాయిదాగా అనిపిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్(పీఐఎస్ఏ) ఈ ఆడిట్ సంస్కృతి పరిణామాలను చక్కగా వివరిస్తుంది. పిసా ర్యాంకింగ్లు నాణ్యతను బెంచ్మార్క్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల్లో సమగ్ర అభివృద్ధి కంటే పరీక్ష తయారీకి ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా నడిపించాయి. విద్యార్థులపై ఒత్తిడిని పెంచాయని యాంగ్ జావో రచనలు తెలుపుతున్నాయి. టిఇసి కొలతలపై చూపిస్తున్న ఆసక్తి, తెలంగాణలో ఇప్పటికే తీవ్రంగా ఉన్నపరీక్ష ఫలిత- కేంద్రీకృత విధానాల ఒత్తిళ్లు ఇంకా తీవ్రతరం కావచ్చు. టిపిఎస్- టిఎఫ్ఎస్లు నేర్చుకునే కేంద్రాలుగా కాకుండా పరీక్ష కర్మాగారాలుగా మారవచ్చు. కొలతలపై అతి ఆసక్తి “కొలవబడేది మాత్రమే ముఖ్యమై పోతుందని” విద్యావేత్త గెర్ట్ బియెస్టా హెచ్చరిస్తారు. దీనివల్ల సృజనాత్మకత, వైఖరులు, పౌరసత్వం వంటి కొలవలేని లక్ష్యాలు పక్కనపడిపోతాయి.
ఆశలు, అడ్డంకులు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యారంగానికి సంబంధించి పలు ఆశలను రేకెత్తించింది. ఈ సమయంలోనే కెజి టు పిజి అందరికీ సమాన విద్య నినాదమయింది. దీనికి అనుగుణంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యా వ్యవస్థను సంస్కరించుకునే చాలా అరుదైన అవకాశాన్ని పొందింది. మొదటి దశాబ్దంలో బడ్జెట్ కోతలు, విద్యారంగం పట్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ అవకాశం చేజారిపోయింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల నమోదు తగ్గిపోయింది. టిఇసి నియామకం ద్వారా రెండవ అవకాశానికి దారులు పడ్డాయి.
విలువలతో కూడిన, నాణ్యమైన విద్యను సమానత్వ ప్రాతిపదికన అందించే లక్ష్యంతో టిఇసి పని చేస్తుందని నియామక ఉత్తర్వులు చెబుతున్నాయి. ఆర్టికల్ 21 స్ఫూర్తితో యూనివర్సల్ యాక్సెస్ మాత్రమే కాకుండా దాన్ని అదిగమించి యూనివర్సల్ నాణ్యతను కూడా టిఇసి సాధిస్తుందని నివేదిక ద్వారా చెప్పబడింది. కాని నాణ్యతను సంకుచితంగా, కొలవదగిన ఫలితాల(ఔట్కమ్స్) ప్రాతిపదికన అర్థం చేసుకున్నట్టు కనబడుతుంది. అయితే సమభాగస్వామ్యం(ఈక్విటీ) లేకుండా నాణ్యత సాధ్యపడదు.
విద్యా సంస్థలు కులం, మతం, డబ్బు వెచ్చించే సామర్ధ్యాలపై ఆధారపడి ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ స్కూళ్ళు, బడ్జెట్ స్కూళ్ళు, ప్రభుత్వ రంగంలో లోకల్ బాడీ, గవర్నమెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కస్తూరిబా, ఏకలవ్య , మోడల్ స్కూళ్ళు అని వేరువేరుగా ఉన్నాయి. ఇటువంటప్పుడు ఈక్విటీ సాధ్యపడదు.
కాబట్టి విద్యలో నాణ్యతను నిజంగా సాధించాలనుకుంటే వివిధ రకాల విద్యాసంస్థల ఇంటిగ్రేషన్కు సంబంధించి ప్రతిపాదనలు, ప్రణాళిక ఉండాలి. కానీ టిఇసి రిపోర్ట్లో ఈ అంశాల ప్రస్తావన ఎక్కడా లేదు. ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రిస్తూ ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్రమంగా పిల్లలు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ సంస్థలకు రాగలుగుతారనే దృక్పథం అంతర్లీనంగా కనబడుతుంది. ఆ రకంగా టిఇసి నివేదిక ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరిచే సిఫార్సులను మాత్రమే కలిగి ఉంది. కానీ అది తెలిపిన సమూల మార్పులను తీసుకొచ్చేదిగా కనబడడం లేదు.
టిఇసి మూడు నివేదికలు విద్యా సంస్కరణ వైపు ఒక అడుగును సూచిస్తాయి. వాటి విస్తృతి, వేగం ప్రశంసలకు అర్హమైనవి. ఫీజు నియంత్రణ, ఆహార భద్రత, పాఠశాల పరివర్తన కోసం సిఫార్సులు తక్షణ అవసరాలను పరిష్కరిస్తాయి. వ్యవస్థాగత సవాళ్ల నిర్ధారణ సరిగానే ఉంది. కానీ ఇంగ్లీష్ మాధ్యమ ఒత్తిడి, ఉన్నతాధికార పరిపాలన, పని తీరు కొలతలపై ఆసక్తి ఆందోళనలను కలిగిస్తాయి.
చిలీ లాంటి దేశాలలో షికాగో బాయ్స్ ప్రేరిత సంస్కరణలు విద్యను నష్టపరిచిన విధానాల నుంచి ప్రైవేటీకరణ, పోటీ, పరీక్షా ఫలితాలతో టీచర్ల పనితీరు కొలతలు, నానా రకాల స్కూళ్ల ఏర్పాటు(పాఠశాలల ఎంపిక) వంటి విద్యా సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా కలగజేసిన చెడును గురించి ఫినిష్ విద్యావేత్త పాసీ సహ్ల్బెర్గ్ హెచ్చరించారు. ఇటుంటి విద్యావేత్తలు చేసిన హెచ్చరికల నుంచి, స్కూల్ విద్యలో పది శాతం మాత్రమే ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్న అమెరికాలో డయన్ రావిచ్ 14 లాంటి వారు చేస్తున్న ఉద్యమాల నుంచి మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి.
సింగపూర్, సౌత్ కొరియా, చైనా, వియత్నాం దేశాలలో వచ్చిన విద్యారంగ మార్పులు బోధనా మాధ్యమం, విద్యా నాయకత్వం, టీచర్ ఎడ్యుకేషన్ విషయాల్లో మార్పులకు చాలా దోహదపడతాయి. ఈ ఎవిడెన్స్లతో సంబంధం లేకుండా చేపట్టబడే సంస్కరణలు ఏవీ కూడా ధైర్యవంతమైనవి కావు. వీటిని విస్మరిస్తే తెలంగాణకు టిఇసి రూపంలో వచ్చిన ఈ రెండవ అవకాశం మరో నెరవేరని వాగ్దానంగా మారే ప్రమాదం ఉంది. తెలంగాణ భవిష్యత్తు, దాని ఆశలను, ఆశయాలను, నిర్ణయాత్మక చర్యతో సమన్వయం చేయడంపై, చరిత్ర నుంచి నేర్చుకొని తగిన విధంగా స్పందించడంపై ఆధారపడి ఉంది.
ఎడమ శ్రీనివాస రెడ్డి
(వ్యాస రచయిత హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.