
15 సంవత్సరాల తర్వాత జనగణన రెండు దఫాలుగా 2026 అక్టోబర్ నుంచి మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు కులగణనను కూడా జోడించారు. జనగణన ఆలస్యం కావటం గురించి ప్రతిపక్షాలు ప్రశ్నలను లేవనెత్తాయి. అంతేకాకుండా డీలిమిటేషన్ ద్వారా దక్షిణ రాష్ట్రాల సీట్లను తగ్గించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించాయి.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జూన్ 4 బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో, జనగణనతో పాటు కులగణనను రెండు దఫాలుగా పూర్తి చేయనున్నట్టుగా స్పష్టం చేసింది. కుల- జనగణన 2026 అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతున్నట్టుగా తెలియజేసింది.
కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటనలో జన- కులగణన తేదీలను వెల్లడించారు. ఈ ప్రకటన ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలైన లద్ధాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఇంకా ఉత్తరాఖండ్లాంటి మంచు ప్రాంతాలలో ఇది 2026 అక్టోబర్ 1న అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. మిగితా ప్రదేశాలలో 2027 మార్చి 1న రాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది.
15 సంవత్సరాల తర్వాత జనగణన చేయడం ఇది తొలిసారి అవుతుంది. ఇంతకు ముందు జనగణన 2011లో చేయడం జరిగింది. కోవిడ్-19 అంటువ్యాధి వల్ల 2021లో ప్రస్థావించబడ్డ జనగణన చేయబడలేదు.
హోం మంత్రిత్వశాఖ ప్రకటనలో భారతదేశంలో గత జనగణన 2011లో రెండు దఫాలుగా చేయబడింది. మొదటి దశలో 2010 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇళ్లను గుర్తించారు. రెండో దశలో ప్రజల సంఖ్యను లెక్కించారు. ఇది 2011 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు కొనసాగింది. దీని సూచిత తేదీ 2011 మార్చి 1 అర్థరాత్రి 12 గంటలుగా ఉంది. అయితే, మంచు ప్రాంతాలైన జమ్మూ-కశ్మీర్, ఉత్తరాఖండ్ ఇంకా హిమాచల్ ప్రదేశ్లో ఈ ప్రక్రియ 2010 సెప్టెంబర్ 11 నుంచి 30 మధ్య చేయబడింది. ఇంకా సూచిత తేదీ 2010 అక్టోబర్ 1న అర్థరాత్రి 12 గంటలుగా పెట్టబడింది.
2021 జనగణన కూడా ఇదే విధంగా రెండు దశలలో నిర్ణయించబడిందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ గుర్తుచేసింది. మొదటి దశ 2020లో ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య రెండో దశ 2021 ఫిబ్రవరిలో జరిగేది. కానీ ఇది కోవిడ్ వల్ల వాయిదా వేయబడింది. అయితే, కోవిడ్ తర్వాత కూడా ఐదు సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైందో మాత్రం మంత్రిత్వశాఖ తెలియజేయలేదు.
“2021లో మొదటి దశ జనగణన ఏర్పాట్లకు అన్ని పూర్తి అయ్యాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలలో/కేంద్రపాలిత ప్రాంతాలలో 2020 ఏప్రిల్ 1 నుంచి క్షేత్రస్థాయి పనులు మొదలు కావాల్సి ఉంది. కానీ దేశవ్యాప్తంగా కోవిడ్-19 అంటువ్యాధి వ్యాపించడం వల్ల జనగణన పనులు వాయిదా వేయబడ్డాయి”అని మంత్రిత్వశాఖ తెలిపింది.
జనగణన ఆలస్యంపై ప్రశ్నలను లేవనెత్తిన ప్రతిపక్షాలు..
జనగణనకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయం మీద ప్రతిపక్షాలు ప్రశ్నలను లేవనెత్తాయి. “2021లో జరగవలసిన జనగణనను ప్రస్తుతం ఇంకా 23 నెలలు ఆలస్యం చేయడానికి ఎటువంటి సరైన కారణం లేదు. మోడీ ప్రభుత్వం నిరంతరం కేవలం వార్తలలో ఉండడానికి చూపించే ఆసక్తి సమయానికి పని పూర్తి చేయడానికి చూపించదు.” అని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీని మీద స్పందించారు. 2027లో జనగణన తమిళనాడు ఎంపీ సీట్లను బీజేపీ తగ్గించాలని చూడడానికి తార్కాణంగా నిలుస్తోందని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ “భారతీయ రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాత జరగబోయే తొలి జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం బీజేపీ జనగణను 2027 వరకు వాయిదా వేసింది. దీంతో వాళ్లు తమిళనాడు ఎంపీ సీట్లను తగ్గించాలని కోరుకుంటున్నట్టుగా వారి ఉద్దేశ్యం తేటతెల్లమైంది . నేను ముందే దీని గురించి హెచ్చరించాను. ప్రస్తుతం ఇది వాస్తవం కానున్నది” చెప్పుకొచ్చారు.
ప్రత్యేకించి దక్షిణ రాష్ట్రాలలో డీలిమిటేషన్ ఒక వివాదపూరిత అంశంగా మారింది. ఈ రాష్ట్రాలు సరైన కుటుంబ నియంత్రణ చర్యలను పాటించాయి. అయితే, ప్రస్తుతం డీలిమిటేషన్ వల్ల పార్లమెంట్లో తమ ప్రాతినిధిత్వం తగ్గుతోందని భయపడుతున్నాయి.
1971 జనగణన నివేదిక ఆధారంగా డీలిమిటేషన్కు 1976లో అడ్డుకట్ట వేశారు. ఫలితంగా కుటుంబనియంత్రణ పథకాలతో జన సంఖ్యను తగ్గించిన రాష్ట్రాలు చట్టసభలలో తమ సీట్లను కోల్పోలేదు. డీలిమిటేషన్ను 2026 వరకు వాయిదా వేస్తూ 2001లో నిర్ణయం తీసుకున్నారు.
కులగణన..
జనగణనతో పాటుగా కులగణన సర్వేను కూడా జరుపుతామని ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే జన- కులగణన ఎప్పుడు జరుగుతుందో మాత్రం ఆ ప్రకటనలో తెలియజేయలేదు.
కులగణన డిమాండ్ను ప్రతిపక్షాలు దీర్ఘకాలంగా లేవనెత్తుతూ వచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికలలో కూడా జన- కులగణన ఒక కీలకమైన రాజకీయ ఎజెండాగా ఉంది
ఏప్రిల్ 20 నాడు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ “ఈ నిర్ణయం సమాజ, దేశ విలువలకు సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిబద్ధతకు తార్కాణం” అన్నారు. అంతేకాకుండా “వాళ్లు కులగణనను “రాజకీయ అస్త్రం”లా ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పటి నుంచో కులగణనను వ్యతిరేకిస్తుండేవి” అని ఆయన ప్రతిపక్ష ఇండియా కూటమి మీద ఆరోపణలు చేశారు.
ఏదిఏమైనా ఈ నిర్ణయం బీజేపీ 2024 ఎన్నికల సమయంలో తీసుకున్న వైఖరికి పూర్తి విరుద్ధరంగా ఉంది. గతంలో బీజేపీ కుల ఆధారిత జనగణన డిమాండ్ను సమాజాన్ని విభజించే చర్య అని అభివర్ణించింది.
సమాజ్వాదీ పార్టీ అధినేత, లోక్సభ ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఈ అంశాన్ని 2027లో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు జోడించారు.
“అర్థమేంటంటే, ఎప్పుడైతే యూపీలో పీడీఏ ప్రభుత్వం వస్తుందో, అప్పుడే కుల ఆధారిత జనగణన మొదలవుతుంది”. 2024 ఎన్నికల నినాదం “అణగారిన, దళిత, అల్పసంఖ్యాకుల”ను దృష్టిలో పెట్టుకొని ఆయన ఇలా అన్నారు.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.