
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో అవినీతి!
కుటిల రాజకీయ నాయకుడికి ఎన్నికల పోరాటంలో పేదలకు పంపిణీ చేసేందుకు అవసరమైన నిధులను అందించడానికి వ్యాపారవేత్త అవసరం. అవినీతిపరుడైన వ్యాపారికి సమాజ వనరులను, కాంట్రాక్టులను చౌకగా పొందడానికి అటువంటి రాజకీయ నాయకుడు అవసరం. రాజకీయ నాయకుడికి పేదల, వెనుకబడిన వర్గాల ఓట్లు అవసరం. ప్రతి నియోజకవర్గం మరొక నియోజకవర్గంతో చక్రీయంగా ఆధారపడి, విడదీయరానివిధంగా ముడిపడి ఉంటుంది. ఇది యథాతథ స్థితిని కొనసాగేలా చేస్తుంది. ఇలా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో అవినీతి అవినాభావ సంబంధంలో ఉంటుంది
– రఘురామ రాజన్ (రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్)
అధికారం చేతులు మారినప్పుడు గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలు వెలుగులోకి వస్తాయి. అయితే ఆంధ్రా లిక్కర్ కుంభకోణానికి ఒక ప్రత్యేకత ఉంది. అది అత్యంత అవినీతిపూరితమైన కుంభకోణమని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఎక్సైజ్ విధాన ప్రకటనతోనే అందరికీ అర్థమైంది. నిజానికి జగన్ ఎక్సైజ్ విధానం దశలవారీ మద్య నిషేధ ప్రక్రియలో భాగం అనే పేరుతో ముందుకు వచ్చి, ఆ తరువాత ‘నిషేధం’ ‘నియంత్రణ’గా మారింది.
సాధారణంగా ప్రభుత్వ పెద్దలు లిక్కర్ కంపెనీల నుంచి కమీషన్లనో, చందాలనో తీసుకుంటారని ప్రజలు భావిస్తారు. అయితే ఇటువంటి విషయాలలో జగన్ పాలన పాటించే పద్ధతి ఇతరుల ఊహకే అందనంత అతీతంగా ఉంటుంది. లిక్కర్ కంపెనీల నుంచి కమిషన్లగానో, చందాల రూపంలోనో వచ్చే ‘చిల్లర’ ఎంత వస్తే ఎంత మొత్తం అవుతుంది? అందుకే లిక్కర్ తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని, తన వాళ్ళు అనుకునేవాళ్ళతో కథ నడిపితే పెద్ద మొత్తం సొంతమౌతుంది కదా. ఈ ఆలోచనతో జగన్ ప్రభుత్వం లిక్కర్ కథ నడిపిన తీరు కనీ, వినీ ఎరుగని రీతిలో ఉంది.
ముందుగా ప్రభుత్వంలోని అధినాయకత్వానికి సన్నిహితులచేత లిక్కర్ కంపెనీలు రిజిష్టర్ అయ్యేలా చేశారు. అందుకోసం నిన్నమొన్నటి దాకా జగన్కు అత్యంత సన్నిహితుడైన నాయకుడు, తన అవినీతి కేసుల్లో నంబర్ 2గా వున్న విజయసాయి రెడ్డి తన అల్లుడి కుటుంబ కంపెనీ అయిన అరబిందో ఫార్మా నుంచి ఒక 100కోట్లు అప్పుగా ఇప్పించాడు. ఆ తరువాత రాష్ట్రంలోని వివిధ సంస్థలకు, వ్యక్తులకు చెందిన డిస్టిల్లరీలను, బ్రూవరీలను అదిరించో, బెదిరించో, బ్రతిమాలో, బామాలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలా 2019-2024 మధ్యకాలంలో ఇండియాలో విదేశీ మద్యం తయారుచేసే కంపెనీలను స్వాధీనం చేసుకుని, ఈ కంపెనీల నుంచి కమిషన్లను దండుకున్నారు. ఇదే కాలంలో 38 నాసిరకం మద్యం బ్రాండ్లను జనంపైకి వదిలారు. ఇవన్నీ వైఎస్ఆర్సి పార్టీకి చెందిన వ్యక్తులవే. అదాన్, గ్రేసన్స్, లీలా, పివి స్పిరిట్స్ వంటి 24 లిక్కర్ కంపెనీలకు 20356 కోట్ల రూపాయల రెవెన్యూ చట్టబద్దంకాని మార్గాల ద్వారా చేరింది.
సాధారణంగా మద్యపానంలో అనేక రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. మద్యపాన రసాయన శాస్త్రం చాలా సంక్లిష్టమైనది. అందుచేతనే కొన్ని దేశాలకు మాత్రమే కొన్ని రకాల మద్యాన్ని ఉత్పత్తి చేయటంలో ప్రావీణ్యత ఉంది. ఉదాహరణకు విస్కీకి ఇంగ్లాండులోని స్కాట్లాండ్ ప్రసిద్ది. అందుకే ‘స్కాచ్’ అనే పేరు వచ్చింది. అలాగే ఫ్రెంచ్ బ్రాండీకి, రష్యా ఓడ్కాకి ప్రసిద్ది. స్కాచ్ చేసే కంపెనీగానీ, దేశంగానీ ఓడ్కాను ఉత్పత్తి చేయదు. చేయలేదు.
ఇదంతా చెప్పటం ఎందుకంటే జగన్ పాలనలో లిక్కర్ తయారు చేసిన కంపెనీలు నాణ్యతను ఏమాత్రం పట్టించుకోకుండా అన్నిరకాల మద్యాన్ని తయారు చేయటమే కాకుండా తమవైన బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి, సంప్రదాయంగా మార్కెట్లో లభించే బ్రాండ్లను ప్రణాళికాబద్దంగా కనుమరుగయ్యేలా చేశారు. ఇక్కడ వినియోగదారు ఏమి తాగాలన్నా జగన్ బ్రాండ్లలో నుంచి మాత్రమే ఎంచుకోవలసివుంటుంది. అంటే తమ యాజమాన్యంలోని లిక్కర్ తయారు చేసే కంపెనీలు ఉత్పత్తిచేసే మద్యానికి చెందిన వివిధ బ్రాండ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అవి నాసిరకమని తెలిసినా వినియోగదారుడు ఏమీ చేయలేని స్థితిలోకి నెట్టబడతాడు. 2014-2019మధ్యకాలంలో పేద ప్రజలు చీప్ లిక్కర్ను ఆశ్రయించకుండా ఉండటానికి 31బ్రాండ్లు ఉండేవి. చంద్రబాబు పాలనలో అటువంటి బ్రాండ్ల 2,69,71,788 కేసులను విక్రయించారు. జగన్ పాలనలో ఈ బ్రాండ్ల సంఖ్యను కేవలం రెండుకు కుదించారు. వాటి విక్రయాలు నామమాత్రంగా 8,454 కేసులకు పరిమితం అయ్యాయి. పర్యవసానంగా అనేక లక్షలమంది ఆరోగ్యం ప్రతికూలంగా ఎలా ప్రభావితం అయిందో లిక్కర్ స్కాంపైన విడుదల చేసిన శ్వేతపత్రంలో వివరించారు.
ఒకవైపు నాసిరకం లిక్కర్ని మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేలా చేసి, మరోవైపు లిక్కర్ ధరలను 75% పెంచారు. దానితో బ్లాక్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. 1.78 కోట్ల లీటర్ల స్మగుల్డ్ లిక్కర్ పట్టుబడిందంటే దాని తీవ్రత ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన లెక్కను శ్వేతపత్రంలో ఇచ్చారు. 2018-2019లో అంటే చంద్రబాబు గత పాలనలోని చివరి సంవత్సరంలో లిక్కర్ విక్రయాలు 384లక్షల కేసులువుంటే 2023-2024లో అంటే జగన్ పాలనలోని చివరి సంవత్సరంలో లిక్కర్ విక్రయాలు 346లక్షల కేసులకు పడిపోయాయి. 2018-19లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే దాదాపు 50లక్షల కేసుల లిక్కర్ అధికంగా అమ్ముడు పోయింది.
అయితే 2023-2024కల్లా తెలంగాణాలో అమ్ముడైన లిక్కర్ ఆంధ్రప్రదేశ్ కంటే 15లక్షల కేసులు అధికంగా ఉంది. అలాగే 2028-2019లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కంటే 200లక్షల కేసుల లిక్కర్ను అధికంగా అమ్మేది. 2023-2024కల్లా ఈ ఆధిక్యం 350లక్షల కేసులకు పెరిగింది. ఆంధ్రపదేశ్ సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా, చత్తీస్గడ్లకు సంబంధించిన లెక్కలు అందుబాటులోలేవు. ఈ సంఖ్యలకు అవికూడా వచ్చి చేరితే దృశ్యం మరింత స్పష్టం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు లోక్సభలో చేసిన ప్రసంగంలో చెప్పినట్టుగా, ఆ తరువాత తెలుగు మీడియాలో వస్తున్న సవివర రిపోర్ట్లను బట్టి తెలుస్తున్నదేమంటే జగన్ ఐదు సంవత్సరాల పాలనలో లిక్కర్ అమ్మకాలపై వచ్చిన 99,413 కోట్ల రెవెన్యూలో డిజిటల్ పేమెంట్ ద్వారా వచ్చింది కేవలం 615కోట్లు మాత్రమే. పది రూపాయలను కూడా డిజిటల్ గా బదిలీ చేస్తున్న కాలంలో దాదాపు లక్ష కోట్ల రూపాయలను నగదుగా తీసుకోవటంలోనే భారీ అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇన్ఫ్రా లావాదేవీల పేరుతో 2000 కోట్ల రూపాయలను ఎన్ సునీల్ రెడ్డి దుబాయ్కు పంపాడని శ్రీక్రుష్ణదేవరాయలు పేర్కొనటం జరిగింది. 2019-24 మధ్యకాలంలో ఇటువంటి మద్య విధానాన్ని అవలంబించిన కారణంగా ప్రభుత్వ ఖజానా 18,860 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన అన్నాడు.
ఈ వాస్తవాలన్నీ చంద్రబాబు నాయుడు 2024 జులైలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉన్నాయి. 2024 సెప్టెంబర్ నెలలో సిఐడి పోలీస్ స్టేషన్లో ఐపిసి 420(చీటింగ్), 409(క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 120-బి(క్రిమినల్ కాన్స్పిరసి) సెక్షన్ల కింద ప్రిన్సిపల్ సెక్రటరీ(రెవెన్యూ, విఐజి 4 డిపార్ట్మెంట్) ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా 2019-2024 మధ్యకాలంలో ఆంధ్రపదేశ్ రాష్ట్ర బివరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్లో జరిగిన అవినీతి, అక్రమాలపైన ఒక కేసును రిజిస్టర్ చేయటం జరిగింది. ఈ కేసును మరింత లోతుగా విచారించటానికి ఏపి పోలీస్ డిజి అభ్యర్థన మేరకు ఒక సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)ను ఏపి చీఫ్ సెక్రెటరీ 2025 ఫిబ్రవరిలో ప్రకటించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు నేత్రుత్వంలో ఈ సిట్ ఉంటుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ వివిధ రిమాండ్ రిపోర్ట్లలో పేర్కొన్నదాని ప్రకారం పెద్ద మొత్తంలో జరిగిన ఈ అవినీతివల్ల అందిన నగదును రాజ్ కేసిరెడ్డి మార్గదర్శకత్వంలో జగన్ సోదరుడు, వైఎస్ అనీల్ రెడ్డి(జగన్ పెద్దనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండవ కుమారుడు), భారతీ సిమెంట్స్లో పూర్తికాలపు డైరెక్టర్, శ్రీమతి భారతి ఆర్థిక వ్యవహారాలను చూసే గోవిందప్ప బాలాజీ, జగన్ ఆంతరంగికులైన ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు, జగన్ ప్రభుత్వంలో నంబర్ 2 అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, జగన్ పైగల అనేక అవినీతి కేసుల్లో నంబర్ 2గా వున్న విజయసాయి రెడ్డిల ద్వారా అధినాయకుడికి అందేవని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఏపిఎస్ బిసిల్ ఎండిగా బాధ్యతలు నిర్వహించిన (డెప్యుటేషన్ మీద వచ్చిన) ఐఆర్ఎస్ అధికారి, వాసుదేవ రెడ్డి, ప్రత్వేక అధికారి, సత్యప్రసాద్ కీలకంగా వ్యవహరించారు. అలాగే డిస్టిల్లరీలను లైన్లో పెట్టిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని, సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర కూడా ప్రముఖమైనదేనని సిట్ ఒక అంచనాకి వచ్చింది. జగన్ పదవీ కాలంలో(2019-2024) ఇలా సేకరించిన మొత్తం విలువ 3200కోట్లు ఉంటుందని సిఐడి కోర్టుకు నివేదించింది. ఇలా సెకరించిన వివిధ మొత్తాలను వందల కేజీల బంగారం కొనుగోలుకు, షెల్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, డిల్లీ, ముంబాయిలోగల హవాలా నెట్ వర్క్స్కి బదిలీ చేయటం జరిగింది. అలాగే సినిమా రంగంలో కూడా పెట్టుబడికి ఉపయోగించినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో పోల్చినప్పుడు..
ఆంధ్రా లిక్కర్ విధానానికి భిన్నంగా ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ విధానం ప్రభుత్వ ఆధీనంలోని లిక్కర్ వ్యాపారాన్ని ప్రయివేటీకరించటం జరిగింది. 2021 నవంబర్ 17న ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం నుంచి నిష్క్రమించి, దానిని ప్రయివేటీకరించటానికి ఉద్దేశింపబడిన నూతన ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. ఢిల్లీలోని 32జోన్లలో 849 లిక్కర్ షాపులను తెరవనున్నట్టుగా ప్రకటించారు.
2022 జూన్ 2న లిక్కర్ లైసెన్స్ ల పంపిణీలో భారీ అవినీతి జరిగిందని, దానిపై విచారణ జరపాలని కాంగ్రేస్ పార్టీ ఢిల్లీ పోలీస్కు రాసింది. ఎక్సైజ్ విధానంలోని ప్రొసీజర్లో ఉన్నటువంటి లోపాల కారణంగా ప్రభుత్వ ఆదాయం 580 కోట్లు కోల్పోయిందని ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ నరేష్ కుమార్ జులై 8వన లెప్టెనెంట్ గవర్నర్కు ఒక నివేదికను సమర్పించటం జరిగింది. లిక్కర్ వ్యాపారంలో ఏర్పడిన కార్టెలైజేషన్, గుత్తాధిపత్యాలపైన ముందుగా ఢిల్లీ పోలీస్ను, ఆ తరువాత సిబిఐని ఈ కేసును విచారించటానికి ఆదేశించారు.
2022 ఆగస్టు 17న సిబిఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాతోపాటు మరో 14మంది పేర్లు ఉన్నాయి. ఆ తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్(ఇడి) మనీ లాండరింగ్ కేసును ఫైల్ చేసింది. ఆప్ ప్రభుత్వం లిక్కర్ హోల్ సేలర్ల లాభాలను 12%కి పెంచి, దానిలో నుంచి 6%ను లంచం(కిక్ బ్యాక్స్)గా తీసుకోవటంవల్ల ఢిల్లీ ప్రభుత్వం 2,873 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని ఇడి ఆరోపించింది. అలాగే ఆప్ పార్టీకి నిధులు నిరంతరం చేరడానికి రిటెయిల్ లిక్కర్ ధరలను 185% పెంచారు. ఆప్ మీడియాకు హెడ్గా వున్న విజయ్ నాయర్ పార్టీ తరపున ‘సౌత్ గ్రూప్’ నుంచి 100కోట్లు అడ్వాన్స్ లంచంగా తీసుకున్నాడని ఇడి ఆరోపించింది. ఈ ‘సౌత్ గ్రూపు’లో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రేస్ ఎంపి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు, రాఘవ రెడ్డి, అరొబిందో ఫార్మాకు చెందిన పి శరత్ చంద్రా రెడ్డి(ఈయన విజయసాయి రెడ్డి అల్లుడికి స్వయానా సోదరుడు), తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తనయ కె కవిత, హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్తలు, అరుణ్ పిళ్ళై, అభిషేక్ బోయినపల్లి, చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్ల ఉన్నారు.
ఈ సౌత్ గ్రూపుకు చెందిన భాగస్వాములకు ఢిల్లీలోని ప్రముఖ లిక్కర్ పంపిణీ సంస్థ ఇండో స్పిరిట్స్లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సమీర్ మహేందుతో కుమ్మక్కై 65% వాటాను ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీలోని 32 జోన్లలో 9జోన్లను ఈ సౌత్ గ్రూపుకు కేటాయించారు. ఈ నేరంలో 600కోట్లకు పైగా చేతులు మారాయని ఇడి కోర్టులో ఆరోపించింది. సౌత్ గ్రూపు ద్వారా వచ్చిన 45 కోట్ల రూపాయలను ఆప్ పార్టీ గోవా ఎన్నికల్లో ఉపయోగించిందని ఇడి పేర్కొంది.
కేజ్రీవాల్, సిసోడియాలతో కలిపి ఆప్ నాయకులతో కవిత కుమ్మక్కై 100కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చి, అందుకు ప్రతిగా 2021-2022 ఢిల్లీ ఎక్సైజ్ విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించుకుని, అమలు చేయడంద్వారా లాభపడ్డారని ఇడి కోర్టుకు విన్నవించింది. నేరారోపణలను ఎదుర్కొంటున్న సౌత్ గ్రూపుకు చెందిన శరత్ రెడ్డి, రాఘవ రెడ్డి మాగుంట, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వంటి వారు అప్రూవర్లుగా మారారు. తాను కేజ్రీవాల్తో మాట్లాడానని, 50కోట్ల రూపాయలను ఆయనకు అందించమని కవిత తనతో మాట్లాడినట్లు మాగుంట శ్రీనివాస రెడ్డి ఇడితో చెప్పాడు. తను ఏర్పాటు చేసిన 50కోట్లే కాకుండా తన కుమారుడైన మాగుంట రాఘవ రెడ్డి కూడా 25 కోట్లు అందించాడని ఆయన ఇడికి చెప్పాడు. మొత్తంగా చూచినప్పుడు గోవా, పంజాబ్ ఎన్నికల కోసం కేజ్రీవాల్కు 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూపు ద్వారా అందాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బీజేపీ లాభపడిన విదంబు ఎట్టిదనిన…
అరొబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రా రెడ్డి 2022 నవంబర్లో అరెస్టు అయ్యాడు. ఆరోగ్యకారణాల రీత్యా బెయిల్ వచ్చాక ఆయన 2023 జూన్లో అప్రూవర్గా మారాడు. ఆయన బెయిల్ను ఇడి వ్యతిరేకించలేదు. డిల్లీ లిక్కర్ వ్యాపారంలో తాను పెట్టుబడి పెట్టదలిచానని, అందుకోసం అరుణ్ పిళ్ళైని కలువగా, ఆయన తనను గతంలో ఆప్ కమ్యూనికేషన్ ఇన్చార్జిగా వున్న, కేజ్రీవాల్కు సన్నిహితుడైన విజయ్ నాయర్ని కలువమన్నాడని చెప్పాడు. ఈ విజయ్ నాయర్ మధ్యవర్తిగా వివిధ వ్యక్తుల నుంచి కిక్ బ్యాక్స్ సేకరించి కేజ్రీవాలకు అందించాడని ఇడి పేర్కొంది.
ఎలక్టోరల్ బాండ్ల యూనిక్ నంబర్లను ఎన్నికల కమిషన్ విడుదల చేసినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) వాటి వివరాలను సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిన తరువాత గాని బయటపెట్టలేదు. ఢిల్లీ స్కాం నిందితుడైన శరత్ చంద్రా రెడ్డి కుటుంబ యాజమాన్యంలోని అరబిందో ఫార్మా 2022 నవంబర్లో 5కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను బీజేపీకి డొనేట్ చేసింది. ఇది ఆయన అరెస్టు అయిన తరువాత ఐదు రోజులకు జరిగింది. ఒక సంవత్సరం తరువాత 2023 నవంబర్ నెలలో అదే అరొబిందో ఫార్మా బీజేపికి 25కోట్లు డొనేట్ చేసింది. అంతేకాకుండా అరొబిందో ఫార్మాతో సంబంధంవున్న మరో రెండు కంపెనీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 10 కోట్ల రూపాయలు, 15కోట్ల రూపాయలను డొనేట్ చేయటం జరిగింది.
అలా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఆనాటి ముఖ్యమంత్రుల సన్నిహితులు, బంధువులు ఉండటం, వారి నుంచి బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బు గుంజటం బట్టబయలు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఎన్నోరెట్లు పెద్దదైన ఆంధ్రా లిక్కర్ స్కాంలో వందల కోట్లు హవాలా మార్గాలలో విదేశాలకు చేరినట్టు సిట్ సాక్ష్యాలను సేకరించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇడి విచారణకు అభ్యర్థిస్తున్నప్పటికీ, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ముఖ్యంగా లావు కృష్ణదేవరాయలు పార్లమెంటులో సుధీర్ఘ ప్రసంగం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఏమాత్ర చలనం లేదు. ఈ స్కాం కు సంబంధించిన విచారణ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆఫీస్(సిఎమ్ఓ)లోకి ప్రవేశించింది. ఇక మిగిలింది జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. దీని నుంచి కూడా ఢిల్లీ స్కాంలోవలే బీజేపీ ఏమైనా లాభం పొందివుంటుందా అనే అనుమానం ప్రజలలో వచ్చే అవకాశం లేకపోలేదు. ఇంత జరుగుతున్నా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇడి విచారణకు ఆదేశించలేదు. ఈ నేపథ్యంలో అత్యంత విస్తృతంగా, కనీవినీ ఎరుగని స్థాయిలోవున్న ఆంధ్రపదేశ్ లిక్కర్ స్కాం పట్ల బీజేపీ ప్రతిస్పందన ఎలా ఉండబోతోంది అనే విషయంపట్ల ప్రజలు ఆత్యంత ఆసక్తిని కనబరుస్తున్నారు.
(ఏపీ లిక్కర్ స్కాం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేతపత్రం ఆధారంగా)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.