
1500 ఏళ్ల చారిత్రక చతుర్ముఖ నందీశ్వర లింగం హైదరాబాద్లోని చైతన్యపురిలో లభించింది. ఫణిగిరి కొసగుండ్ల నరసింహస్వామి ఆలయ వెనుక భాగంలోని శిథిలాలలో చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ లింగాన్ని గుర్తించారు.
హైదరాబాద్: సుమారు 1600 ఏళ్ల క్రితంనాటి గోవిందరాజ విహార అనే హీనయాన బౌద్ధ విహారాన్ని సూచించే శాసనంతో హైదరాబాద్లోని చైతన్యపురి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఆ విహారం స్థలాన్ని ఫణిగిరి కొసగుండ్ల నరసింహస్వామి ఆలయంగా పిలుస్తున్నారు. ఆ ఆలయ వెనుక భాగంలోని శిథిలాలలో చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ కొత్తగా ఒక చతుర్ముఖ నందీశ్వర లింగాన్ని గుర్తించారు.
దాదాపు 2 అడుగుల చదరపు గ్రానైట్ రాతి స్లాబ్పై, 4 దిక్కులలో ఒక్కొక్కటి 8 అంగుళాల పరిమాణంలో నందులను చెక్కారు. వాటి మధ్యలో శివలింగం, దాని చుట్టూ అభిషేకజలాన్ని బయటకు పంపే పానవట్టం చెక్కబడి ఉంది.
దేశంలోనే ప్రాచీనమైన శిల్పం..
ఈ అరుదైన చతుర్ముఖ నందీశ్వర లింగ శిల్పం తెలంగాణలోనే కాకుండా మొత్తం భారతదేశంలోనే ప్రాచీనమైనది.
క్రీపూ 2వ శతాబ్దం నుంచి క్రీశ 2వ శతాబ్దం మధ్య కాలానికి ఏకశిల శివలింగాలు చెందినవి. ఇవి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా గుడిమల్లం, అలాగే తెలంగాణలోని గద్వాల జిల్లా రంగాపురం, ఘూమకొండ ప్రాంతాలలో లభించాయి. అయినప్పటికీ, ఇప్పుడు వెలుగు చూసిన ఈ శివలింగం ప్రత్యేకమైనది. ఎందుకంటే, నాలుగు దిక్కులలో నందులను కలిగి ఉంది.
“సుమారు క్రీశ 400 ప్రాంతంలో విష్ణుకుండి రాజైన గోవిందరాజు బౌద్ధ క్షేత్రాన్ని నిర్మించారు. ఆ క్షేత్రంలో ఈ శిల్పం లభించడం వల్ల, ఆ తరువాతి పాలకులు బౌద్ధ స్థలాలను నిర్లక్ష్యం చేసి, వాటి శిథిలాలపై శైవ సంప్రదాయాన్ని ప్రోత్సహించారని అర్థమవుతోంది” అని ద్యావనపల్లి సత్యనారాయణ అన్నారు.
బౌద్ధ శిలాఫలకంపై శివలింగం..
“ఇదే విషయాన్ని సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో కూడా చూడవచ్చు. అక్కడ బౌద్ధ శిలాఫలకంపై శివలింగం చెక్కబడి ఉంది. ఈ ఆధారాలపై చరిత్రకారులు విష్ణుకుండుల తరువాతి పాలకులు బౌద్ధమతాన్ని విస్మరించి, శైవమతాన్ని ప్రోత్సహించారని నిర్ణయించారు. దీనికి మద్దతుగా క్రీశ 6వ శతాబ్దంలో విష్ణుకుండి పాలకులు ఇంద్రభట్టారక వర్మ, ఆయన కుమారుడు విక్రమేంద్ర వర్మ తమ బిరుదుల్లో “పరమమహేశ్వర” అనే పదాన్ని స్వీకరించారు. అంటే మహేశ్వర(శైవ) మతాన్ని పోషించారన్నమాట” అంటూ సత్యనారాయణ తెలియజేస్తారు.
చతుర్ముఖ నందీశ్వర లింగ సంప్రదాయం కొనసాగిన విధానాన్ని సత్యనారాయణ పేర్కొంటూ, “ఆ తర్వాత కాలంలో చతుర్ముఖ నందీశ్వర లింగ సంప్రదాయం కొనసాగిందని చెప్పడానికి నిదర్శనంగా నాగర్కర్నూలు జిల్లా మన్ననూరులో చతుర్ముఖ బసవేశ్వర లింగం బయటపడింది” అని గుర్తుచేస్తారు.
“దీనిని క్రీశ 13వ శతాబ్దంలో పాల్కురికి సోమన “పండితారాధ్య చరిత్ర”లో విపులంగా వర్ణించారు. ఆ సంప్రదాయం ఆలంపూర్, శ్రీశైలం, మరికొన్ని ఆలయాలలో నాలుగు దిక్కులలో నందులను శిల్పరూపంలో ఏర్పాటు చేసే విధానంగా అభివృద్ధి చెందింది” అని చెప్పుకొచ్చారు.
ఈ విశిష్టమైన చతుర్ముఖ నందీశ్వర లింగం ప్రాముఖ్యత దృష్ట్యా, ఆలయాధికారులు– రాష్ట్ర ప్రభుత్వం దాని సంరక్షణ చర్యలు చేపట్టవలసిందిగా సత్యనారాయణ కోరారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.