
గత మూడు సంవత్సరాలుగా ధర లాభసాటిగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రైతులు బర్లీ పొగాకు ఉత్పత్తి వైపుకు మళ్లారు. గత సంవత్సరం మొదటిసారి వొలిచే ఆకు(అడుగు ఆకు) కూడా క్వింటాలు 10,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ సంవత్సరం అడుగు ఆకు నాలుగైదు వేల రూపాయలకు మించలేదు. కంపెనీలు బాండు ఇచ్చినా పొగాకు కొనటం మందంగా ఉంది. పొలం లేనటువంటి వారు 30- 40 వేల రూపాయలకు ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకొని, బర్లీ పొగాకు పంటను ప్రారంభించారు. ఏ పంట వేస్తే మంచి ధర పలుకుతుందో తెలియని పరిస్థితులలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా నష్టాలను చవిచుస్తున్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలలో పొగాకు పంటను చాలా ఎక్కువగా పండిస్తున్నారు. సిగరెట్లలో ఉపయోగించే పొగాకు వంద సంవత్సరాల ముందు నుంచే భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంది. విదేశీ మారక ద్రవ్య సంపాదనకు పొగాకు ఒక ముఖ్యమైన వనరుగా ఉన్నది.
మన దేశం నుంచి పొగాకు తీసుకుని వెళ్ళి, ప్రపంచ ప్రసిద్ధమైన సిగరెట్ బ్రాండ్లలో వాడుతున్నారు. 2023- 24 సంవత్సరంలో భారతదేశ పొగాకు ఎగుమతులు 12,006 కోట్లుగా ఉంది. ఫ్లూక్యూర్డ్ వర్జీనియా పొగాకుతో పాటు బర్లీ పొగాకు కూడా ఎగుమతి అవుతుంది. సిగరెట్ తయారీలో ముఖ్యంగా విదేశీ సిగరెట్లలో బర్లీ పొగాకును మంచి వాసన కోసం, ఘాటుగా వుండటం కోసం వాడతారు.
అయితే, పొగాకు మూలంగా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నందున పొగాకును నిషేధించాలని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన సాగుతోంది. 2022-23లో భారతదేశంలో పొగాకు అమ్మకాల ద్వారా వచ్చిన ఎక్సైజ్ ఆదాయం 72,788 కోట్లుగా ఉంది. స్థూల పన్ను ఆదాయంలో పొగాకు ఉత్పత్తుల నుంచి 2016-17లో 1.27 శాతం వసూలు చేయగా 2023- 24లో 2.2శాతం వసూలు చేశారు. ఫ్రభుత్వానికి పన్ను ఆదాయంతో పాటుగా ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్నందు వల్ల ప్రభుత్వం పొగాకు పంటను నిషేధించటం లేదు. పొగాకు పండిస్తున్న రైతులకు ఆశ- నిరాశలను చూపిస్తూ ప్రభుత్వం, కంపెనీలు రైతులతో ఆడుకుంటున్నాయి.
పొగాకు బోర్డు ఏర్పాటు..
రైతుల నిరంతర ఆందోళన తరువాత 1976 జనవరి 1న పొగాకు బోర్డు స్ధాపించబడింది. పొగాకు ఉత్పత్తిని నియంత్రించడానికి, విదేశాలలో పొగాకు మార్కెటింగ్ను ప్రోత్సహించడానికి, సరఫరా ఇంకా డిమాండ్లో అసమతుల్యతను నియంత్రించడానికి, పొగాకు అనుబంధ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, ఫ్లూక్యూర్డ్ వర్జినియా పొగాకును నియంత్రించడానికి 1975 టొబాకో చట్టం ద్వారా 1976 జనవరి 1న పొగాకు బోర్డు స్థాపించబడింది.
పొగాకు రైతులకు న్యాయమైన ఇంకా లాభదాయకమైన ధరలు లభించేలా చూడటం, ఎగుమతులను ప్రోత్సహించటం బోర్డు ప్రాథమిక కర్తవ్యంగా నిర్దేశించారు. టొబాకో బోర్డు ద్వారా పరిమితమైన సంఖ్యలో రైతుల బ్యారన్లకు పర్మిట్లను ఇస్తున్నారు. పరిమితంగా ఫ్లూక్యూర్డ్ వర్జీనియా పొగాకు(FCT/దొర పొగాకు/బ్యారన్ పొగాకు)ను పండించటానికి అనుమతులు ఇస్తున్నారు. పొగాకు బోర్డు వేలం కేంద్రాలను ఏర్పాటుచేసి వర్జీనియా పొగాకుకు కనీస మద్దతు ధర వచ్చేటట్టుగా, వ్యాపారులు కొన్న పొగాకుకు బ్యాంకు చెక్కుల ద్వారా రైతులకు డబ్బులు ఇచ్చేటట్టుగా టొబాకో బోర్డు చూస్తుంది. అయితే పొగాకు బోర్డు ఒక్క ఫ్లూక్యూర్డ్ వర్జీనియా పొగాకు(FCT) గురించి మాత్రమే పట్టించుకుంటుంది. బర్లీ పొగాకు, నాటుపొగాకు లాంటివి తమ పరిధిలో లేవని తప్పుకుంటుంది. తన పేరుకు తగ్గట్లుగా పొగాకు పండించే రైతులందరి ప్రయోజనాలను కాపాడవలసిన పొగాకు బోర్డు, బర్లీ పొగాకు తమ పరిధిలో లేదంటున్నది. బర్లీ పొగాకు పండించిన రైతులను కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు.
బర్లీ పొగాకు, వర్జీనియా పొగాకు ఒకటేనా?
బర్లీ పొగాకు, వర్జీనియా పొగాకు రెండు ఒకటి కాదు. వర్జీనియా పొగాకు సాగు చేయాలంటే బ్యారన్లు వుండాలి. పొగాకు బోర్డ్ పర్మిట్ వుండాలి. వర్జీనియా పొగాకును బ్యారన్లో కర్రలకు కట్టి వేలాడ తీస్తారు. బ్యారన్ పొయ్యిలో కట్టెలు మండించి వేడిగా వున్నగాలిని పైపుల ద్వారా బ్యారన్లో నుంచి బయటకు పదులుతారు. పైపులలోని వేడికి బ్యారన్లో ఉన్న పొగాకులోని తేమ(మాయిచ్చర్) తగ్గి క్యూరింగ్ జరుగుతుంది. బేళ్ళు కట్టి పొగాకు బోర్డు నిర్దేశించిన వేలంకేంద్రం వద్దకు తీసుకువెళ్ళి అమ్మకానికి పెడతారు. పొగాకు కంపెనీలు వారి ఏజెంట్ల ద్వారా వేలంలో పాల్గొని కొనుగోలు చేస్తారు. రైతుకు డబ్బులు బ్యాంకు అకౌంట్లో వేస్తారు. వర్జీనియా పొగాకు చాలా ఎక్కువ పరిమాణంలో అవసరం వుంటుంది. దేశ అవసరాలకు 100 మిలియన్లు, ఎగుమతుల కొరకు 200 మిలియన్ల పొగాకు అవసరపడుతోంది.
బర్లీ పొగాకుకు విదేశాలలో ఎక్కువ డిమాండ్ వుంది. అమెరికా, బ్రిటన్లో తయారయ్యే సిగరెట్లలో బర్లీ పొగాకు ప్రధానమైనటువంటి స్థానాన్ని పొందింది. సిగరెట్లో మంచి ఫ్లేవర్ కోసం, ఘాటుగా వుండటం కోసం బర్లీ పొగాకును సిగరెట్ తయారీలో తప్పనిసరిగా వాడతున్నారు. ఇదివరకు అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో బర్లీ పొగాకును ఎక్కువగా సాగుచేసేవారు. అక్కడ బర్లీ పొగాకు సాగు తగ్గింది. దేశ, విదేశీ అవసరాలకు 100 మిలియన్ కేజీల బర్లీ పొగాకు అవసరం వుంటుందని అంచనా.
బర్లీ పొగాకు ఆకులను తాళ్ళకు గుచ్చి గాలికి ఎండబెడతారు. కొన్నిచోట్ల పొగాకుకు ఎండ, మంచు తగలకుండా పందిరి వేస్తారు. గాలికి ఆకు ఎండిపోయి క్యూరింగ్ జరిగేటట్లు చూస్తారు. బేళ్ళు కట్టి ప్రైవేటు కంపెనీ నిర్దేశించిన కేంద్రం వద్దకు తీసుకువెళ్ళి అమ్మకానికి పెడతారు. బర్లీ పొగాకు తమ పరిధిలో లేదని బోర్డు అంటుంది. పొగాకు బోర్డు పర్యవేక్షణ ఏమీ లేనందున, పూర్తిగా ప్రైవేటు కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసివుంది.
మరోవైపు ప్రభుత్వం కూడా దీని గురించి తమకు సంబంధం లేదంటుంది. ఈ రెండు రకాల పొగాకును సిగరెట్ తయారీలో వాడడం కోసం విదేశాలకు ఎగుమతి చేసేవే. రెండు రకాల పొగాకు సాగుకు మానవ శ్రమ ఎక్కువ కావాలి. రెండు రకాల పొగాకు సాగుకు, నిశిత పరిశీలన, పర్యవేక్షణ జాగ్రత్తతో వ్యవసాయం చేయాలి. ఇవి రెండూ లేబర్ ఇంటెన్సివ్ పంటలే.
పొగాకు పరిశోధనా సంస్ధ..
తూర్పుగోదావరి జిల్లాలో కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ CTRI 75 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో పనిచేస్తున్నది. దక్షిణ ప్రాంతపు తేలిక నేలలు ఉన్న ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలలో సాగు చేసే బర్లీ పొగాకు నూతన విత్తనాలను “విజేత” పేరున విడుదల చేశారు.
విదేశీ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువగా వాడేటటువంటి బర్లీ పొగాకు ఎగుమతి చేయటం వల్ల మనకు డాలర్లలో విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందన్నారు. “ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్” అయిన బర్లీ పొగాకుకు ఈ మధ్యకాలంలో విదేశాలలో ఎక్కువ డిమాండ్ పెరిగిందని అన్నారు. ఇదివరకు పదివేల మిలియన్ కేజీల ఎగుమతి ఉన్న బర్లీ పొగాకు ప్రస్తుతం 45 వేల మిలియన్ కేజీల ఎగుమతి అవుతుందని నిపుణులు అన్నారు. ఎగుమతుల వలన ఎక్కువ ఉత్పత్తి అవసరం ఉన్నటువంటి బర్లీ పొగాకుకు అనుకూలంగా ఉండే విత్తనాలను తయారుచేసి విడుదల చేస్తున్నామని, హెచ్ఎంటీవీ ఇంటర్వ్యూలో సీటీఐఆర్ సైంటిస్టు సంవత్సరం క్రితమే తెలియజేశారు.
పొగాకు ప్రాణానికే ప్రమాదం..
సిగరెట్లు, బీడీలు, చుట్టలు, ముక్కు పొడి , గుట్కా, జరదా, పాన్ మసాలా వీటన్నిటిలో రకరకాల పొగాకు వాడుతారు. ఈ పొగాకులో కొన్ని వందల రసాయనాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా నికోటిన్ వల్ల బీపీ, గుండె స్పందన రేటు పెరుగుతుంది. రక్తనాళాలు కుంచించుకు పోయి, గట్టిపడతాయి. ఫలితంగా గుండె జబ్బు తరచుగా వస్తుంటుంది. పొగ పీల్చినప్పుడు కార్బన్మోనాక్సైడ్ ఊపిరితిత్తులలోకి వెళ్లి రక్త కణాలు తీసుకెళ్ళే ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఈ చర్య కొలెస్ట్రాల్ను పెంచుతుంది.
అంతేకాకుండా లంగ్ క్యాన్సరు, బ్లాడర్ కాన్సరు, లుకీమియా, కిడ్నీ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సర్లకు కారణంగా సిగరెట్ పొగలోని ఆర్సినిక్ కాడ్మియం ఉత్పేరకంగా నిలుస్తుంది. ప్రజారోగ్యంపై పొగాకు కలిగిస్తున్న తీవ్ర దుష్ట పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు పంటను వేయవద్దని చెప్పింది. పొగాకు పంటను నిరుత్సాహ పరచాలన్నది. పొగాకు ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం, ఎక్సైజు పన్నుల వలన ఆదాయం లభిస్తున్నందువలన, పొగాకు పంటను ప్రభుత్వాలు నిషేధించటంలేదు. ప్రభుత్వాలను శాసించేటంత బలం కలిగిన బడా సిగరెట్ కంపెనీలైన ఫిలిప్ మోరిస్, బ్రిటిష్ అమెరికన్, ఐటీసీ కంపెనీలను కాదని పొగాకు సాగును నిషేధించే దమ్ము, ధైర్యం ఏ ప్రభుత్వానికీ లేదు.
ప్రజల అనారోగ్యాన్ని పెంచే పొగాకు పంటను నిరుత్సాహపరుస్తున్నామని ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్తుంది. కానీ రైతులను ఆర్ధికంగా నిలబెట్టే లాభదాయకమైన పంటలేవో చెప్పటంలేదు.
ప్రత్యామ్నాయ పంటలయిన మిర్చి, శనగ, మొక్కజొన్న, సుబాబుల్, జామాయిల్, పామాయిల్ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ ప్రత్యామ్నాయ పంటల ధరలకు గ్యారంటీ లేదు. కనీస మద్దతు ధరలు అమలు పరచే యంత్రాంగం లేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేదు. ఖచ్చితంగా కొంటారనే గ్యారంటీ లేదు. మార్కెట్ మాయాజాలంలో రైతు ఇరుక్కున్నాడు. వ్యవసాయం జూదమయింది. వ్యవసాయఖర్చులు వస్తాయనే గ్యారంటీ లేదు. ప్రత్యామ్నాయ పంటలు రైతును నిలువునా ముంచాయి. ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఏ పంట వేస్తే మంచి రేటు వస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది. ఎరువులు, పురుగు మందులు, కౌలు, కూలీ రేట్లయిన వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగాయి. ఇటువంటి పరిస్ధితులలో పొగాకు ధరలు గత రెండు సంవత్సరాలుగా ఆశాజనకంగా ఉన్నాయి. పొగాకు సాగును ఆపేసిన పాత గుంటూరు జిల్లా రైతులు పొగాకు పంట వైపు మళ్ళారు. పొగాకు సాగు గణనీయంగా పెరిగింది. రైతులు పోటీలు పడి కౌలు పొలాలు తీసుకున్నారు.
పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకు ఎందుకు లేదు?
ఇండియన్ టొబాకో కంపెనీ, గాడ్ ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, దక్కన్ టుబాకో, పోలిశెట్టి కంపెనీ, పీటీపీ, ఎంఎల్, అలియన్స్ వన్ కంపెనీలు బర్లీ పొగాకు సాగును ప్రోత్సహించాయి. కొందరు విత్తనాలిచ్చారు, కొందరు హామీలిచ్చారు, పొగాకు నారును సప్లై చేశారు. ఖచ్చితంగా కొంటామని కొన్నిచోట్ల బాండ్లు ఇచ్చారు. పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకు లేకపోవడంతో రైతులకు నష్టం జరుగుతుంది. బేరన్ పొగాకు/ వర్జీనియాపొగాకు సాగు చేస్తున్నటువంటి రైతులకు టొబాకో బోర్డు కొన్ని రక్షణలు కల్పిస్తున్నది. టొబాకో బోర్డు కల్పిస్తున్న రక్షణలు, ప్రయోజనాలు బర్లీ పొగాకు పండించే రైతులకు లేవు. గత సంవత్సరం ధరలు కూడా రావటం లేదు. గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఏ ప్రాంతంలో ఏరకమైన పొగాకు, ఎంత మొత్తంలో సాగు చేశారనేది ప్రభుత్వం దగ్గర అంచనాలు ఉన్నాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. పొగాకు మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరెవరు జోక్యం చేసుకుంటారు? పొగాకు బోర్డు తన పరిధిలో లేదంటుంటే ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు నిలువెత్తున మునిగిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా?
ఐటీసీ కంపెనీ ఎలా ప్రారంభమయింది ?
బ్రిటిష్ యాజమాన్యంతో ఇంపీరియల్ టుబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా 1910 ఆగస్టు 24న కలకత్తాలో ప్రారంభమయ్యింది. మొదటా కలకత్తలోని రాధాబజార్లో అద్దె భవనంలో ప్రారంభమై, 1928 సంవత్సరంలో స్వంత భవనం “వర్జీనియా హౌస్”ను నిర్మించుకున్నది. పొగాకు రంగంలో ఎక్కువ వ్యాపారం ఉండటం వలన పొగాకు ఎక్కువ పండిస్తున్నటువంటి గుంటూరు ప్రాంతానికి ఇంపీరియల్ కంపెనీ తరలి వచ్చింది. “ఇండియన్ లీఫ్ టుబాకో డెవలప్మెంట్ కంపెనీ”ని 1912లో గుంటూరులో ప్రారంభించింది. ఐయల్టీడీ కంపెనీగా ప్రాచుర్యం పొందింది. గుంటూరు, చిలకలూరిపేట, రాజమండ్రి, పర్చూరు, కొమ్మూరు, లాంటి చోట్ల కంపెనీ గ్రేడింగ్ సెంటర్లను పెట్టింది.
గ్రామీణ మహిళలు తక్కువ వేతనాలతో పొగాకు కార్మికులుగా పనిచేసి కంపెనీకి అంతులేని సంపదను సృష్టించారు. చీరాల ఐయల్టీడీ కంపెనీలో వేలాదిమంది కార్మికులు పనిచేసి కంపెనీ లాభాలను పెంచారు. ఐటీసీ, కార్పోరేట్ కంపెనీగా ఎదుగుదలకు రైతు కూలీలు తమ శక్తి సామర్థ్యాలను ధారపోశారు.
దేశంతో ఐటీసీ కంపెనీకి వంద సంవత్సరాలకు పైగా అనుబంధం ఉంది. పొగాకు పండించడానికి అనువైనటువంటి నల్లరేగడి భూములు పాత గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లాలలో ఉన్నాయి. దీంతో పొగాకు కంపెనీ ప్రారంభించిన ఇంపీరియల్ టొబాకో కంపెనీ, ఆంధ్ర ప్రదేశ్ నుంచే ఐటీసీ కంపెనీ ప్రారంభమయ్యింది.
1910లో ఇంపీరియల్ టొబాకో కంపెనీగా, 1970లో ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్గా, 1974లో ఐటీసీగా, 2001లో పేరు మధ్యలో వున్న ఫుల్ స్టాప్ చుక్కలను ఎత్తి వేసి “ఐటీసీ లిమిటెడ్”గా నామాంతరం చెందింది. వైవిధ్యమైన వ్యాపారాలతో ఒక మహా సామ్రాజ్యాన్ని స్ధాపించింది.
గుంటూరు ప్రాంత రైతు కూలీల శ్రమను పునాదిగా చేసుకుని అతి పెద్ద కార్పోరేట్ కంపెనీగా ఐటీసీ ఎదిగింది. భారత దేశంలో టొబాకో కంపెనీలలో మొదటి స్ధానంలో వుంది. ఇండియా కింగ్స్, గోల్డ్ఫ్లేక్, విల్స్, సిజర్స్, బర్కిలీ, లాంటి పాపులర్ బ్రాండ్స్తో ఐటీసీ కంపెనీ భారతీయ సిగరెట్ మార్కెట్ను శాసిస్తుంది. పొగాకు అనారోగ్యానికి కారణమని ప్రజలు చైతన్యమై సిగరెట్లు మానేస్తే కంపెనీ పరిస్ధితి ఏంటి? అనే ఆలోచనతో పొగాకు కంపెనీకి అనుబంధంగా వివిధ విభాగాలలోకి వ్యాపారాన్ని విస్తరింంచింది. (ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) వినియోగదారులు ఎక్కువగా వాడే వస్తువులైన గోధుమ పిండి- ఆశీర్వాద్ అట్టా, గుంటూరు కారం, మసాలాలు, సాంబార్ పొడి, మిల్లెట్స్, నూడుల్స్, సన్ ఫీస్ట్, డార్క్ ఫాంటసీ లాంటి బిస్కట్లు, జామాయిల్ తోటల గుజ్జు నుంచి పేపర్ బోర్డ్స్, క్లాస్ మేట్ నోటు పుస్తకాలు, అగ్రి బిజనెస్ నుంచి హోటల్ బిజినెస్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించింది.
2024 ఆర్ధిక సంవత్సరంలో 20,751 కోట్ల రూపాయల నికర ఆదాయాన్ని గడించింది. 91,826 కోట్ల రూపాయల విలువ కలిగిన స్థిరాస్థులను సంపాదించిన బహుళజాతి సంస్ఘ ఐటీసీ కంపెనీ అగ్రిబిజినెస్ చేతిలో రైతులు చిక్కుకుపోయారు. కంపెనీ ఆర్ధికంగా నిలదొక్కుకుని ప్రపంచ ప్రసిధమైంది. కానీ కార్పోరేట్ కంపెనీ దెబ్బకు రైతుల స్ధాయి రోజురోజుకు దిగజారిపోతుంది. రైతే అంతమయ్యే పరిస్ధితి దాపురించింది.
విలాసవంతమైన హోటల్స్..
1912 సంవత్సరంలో గుంటూరులోని ఐఎల్టీడీగా ప్రారంభమైన పొగాకు కంపెనీ, 2024 సంవత్సరంలో గుంటూరులోనే అతి పెద్ద ఫైవ్స్టార్ వెల్కమ్ హోటల్ను రింగ్ రోడ్డులో ప్రారంభించింది. ఒక రోజు హోటల్ రూంలో వుండాలంటే రోజుకు 6,500 రూపాయలు కట్టాలి. చెన్నైలో గ్రాండ్ చోళా, న్యూఢిల్లీలో ఐటీసీ మౌర్య, బెంగుళూరులో విండ్సర్ మినార్, హైదరాబాద్లో హోటల్ బంజారా, ఐటీసీ రాజపుట్నా, ప్రెసిడెన్సియల్ సూట్స్, స్విమ్మింగ్ పూల్స్, బార్లతో సకల సదుపాయాలతో, రాజభోగాలను ధనవంతులకు అందిస్తున్నది.
దేశం మొత్తం మీద ఐటీసీ లగ్జరీ హోటల్స్ 140 ఉన్నాయి. 2030 సంవత్సరానికి 200 హోటళ్ళను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో కొలంబోలో “రత్నదీప హోటల్”ను ప్రారంభించి విదేశాలకు వాణిజ్య సామ్రజ్యవ్యాప్తిని ప్రారంభించింది.
ఎన్ని వ్యాపారాలు ఉన్నా, అవన్నీ పొగాకు లాభాలతో పెంచి పోషించినవే. ఇప్పటికీ వారి ఆదాయంలో 70 శాతం పొగాకు నుంచే వస్తుంది. కానీ తనను పెంచి పోషించుతున్న పొగాకు రైతు కూలీల శ్రమకు విలువ కట్టడంలేదు. శ్రమను గుర్తించకపోగా రైతులకు న్యాయమైన వాటాను కూడా నిరాకరిస్తుంది. కార్పోరేట్ కంపెనీల నిజమైన స్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. కిలో పొగాకు నుంచి 1250 సిగరెట్లు తయారవుతాయి. ఒక సిగరెట్లో 0.7 గ్రాము నుంచి ఒక గ్రాము పొగాకు వాడతారు.
1250x 10= 12500..
ఒక కేజీ పొగాకుతో 1250 సిగరెట్లు తయారవుతాయంటే కంపెనీకి ఎన్ని డబ్బులు వస్తాయి? ఒక పెట్టెలో 10 లేక 20 సిగరెట్లు ఉంటాయి. సిగరెట్ పెట్టె ఖరీదు ఎంత? ఒక్కొక్క సిగరెట్లో కొంచెం తక్కువగా ఒక గ్రాము పొగాకు వాడతారు. ఒక కిలో పొగాకుకు 1250 సిగరెట్లు వస్తాయి. వర్జీనియా పొగాకు కిలో ధర 300 పైగా ఉండవచ్చు. బర్లీ పొగాకు ధర ఒక కేజీ 150 రూపాయలు. ఉదాహరణకు ఒక గోల్డ్ఫ్లాక్ సిగరెట్ 10 రూపాయలకు అమ్ముతున్నారు. 300 రూపాయలు పెట్టి ఒక కిలో పొగాకు కొని 1250 సిగరెట్లు తయారుచేసి, పది రూపాయలకు అమ్మితే రూ 12,500 వస్తుంది. ఖర్చులు పోను కంపెనీకి రూ 12,200 మిగులుతుంది. ఇందులో ఖర్చులన్నీ పోను ఎంత మిగులుతుందో ఐటీసీ చెప్తుందా? కార్పోరేట్ సామ్రాజ్యపు స్ధిర చరాస్థులు, సామ్రాజ్యపు విస్తరణ పరిశీలిస్తే అర్ధమౌతుంది. లెక్కలేనన్ని లాభాలు సంపాదిస్తున్న కంపెనీ కోసం స్వేదం చిందించిన రైతు కూలీలను మరిచిన కార్పోరేట్ కంపెనీల ధ్యేయం డబ్బు సంపాదనే.
కంపెనీ వార్షిక నివేదిక 2024 ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ 25.18 కోట్ల వేతనాన్ని ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి అందుకున్నారు. ఇది గత 2022-23 సంవత్సరంలో ఆయన పొందిన రూ 16.31 కోట్ల మొత్తం వేతనం కంటే 54.38 శాతం ఎక్కువ.
ప్రతి సంవత్సరం రైతు ఆదాయం ఎంత శాతం పెరుగుతుంది?
నాబార్డ్ సర్వే ప్రకారం నెలకు రూ 13,661గా రైతు ఆదాయం నమోదు అయ్యింది. మరో వైపు పొగాకు రైతు కూలీల నుంచి, ప్రజల నుంచి లాభాలను పొందడానికి ప్రణాళికలు రచించిన సీఈఓ సంజీవ్ పూరీ వేతనం నెలకు రూ 2,09,83,333గా ఉంది. వ్యవసాయంలో అన్ని డబ్బులు కావాలని, మిగలాలని రైతులు అడగటంలేదు. తమ శ్రమ విలువకు తగిన ప్రతిఫలాన్ని రైతుల కోరుతున్నారు. వేతనాలలో తీవ్ర వ్యత్యాసం అసమానతలకు దారితీస్తుందని మేధావులందరూ చెప్తున్నదే.
ప్రజలందరికీ సిగరెట్ను అలవాటు చేసిన కంపెనీలు..
బ్రిటన్ దేశంలోని ఇంపీరియల్ టొబాకో కంపెనీ, అమెరికా దేశంలో అమెరికన్ టొబాకో కంపెనీతో విలీనమై బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీగా 1902లో రెండు బలమైన కంపెనీలు ఒకటయ్యాయి. ప్రపంచ ప్రజలందరికీ సిగరెట్లు అలవాటు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి సామ్రాజ్యాలను స్థాపించారు. ఈ రెండు కంపెనీల విలీనంతో పొగాకు పంట నుంచి సిగరెట్ల తయారీ వరకు ప్రపంచాన్ని శాసించారు. వ్యాపారంలో పోటీ లేకుండా ప్రాంతాలను పంచుకున్నారు.

న్యాయమైన ధరను సాధించుకునే శక్తి ప్రజలచేతులలోనే..
ప్రపంచంలోని పొగాకు ధరలు, సిగరెట్ల ధరలు, ఐటీసీ, బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ, ఫిలిప్ మోరిస్లాంటి బహుళజాతి సంస్ధల(ఎంఎన్సీ) చేతిలో ఉన్నాయి. వారి లాభాలకు అంతులేదు. వారి నుంచి పంటలకు న్యాయమైన ధరలను సాధించుకోగల శక్తి ప్రజలచేతులలోనే ఉంది. ప్రజా ఉద్యమాలతోనే తమ న్యాయమైన వాటాను సాధించకోగలరు. కార్పోరేట్ కంపెనీల చేతులలో కీలు బొమ్మలైన ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలను కాపాడలేవు. బహుళజాతి సంస్థలు రైతుల సంక్షేమం కోసం ఏర్పడలేదు. గిట్టుబాటు ధరలు కల్పిస్తే వారి లాభాలు తగ్గిపోతాయి.
నీతీనియమాలు లేని ఎంఎన్సీలు, వారితో పోషింపబడుతున్న ప్రభుత్వాధిపతులు రైతులను కాపాడుతారనుకుంటే, గొర్రె కసాయివాడిని నమ్మినట్లవుతుంది. లాభసాటి ధర కావాలంటే రైతులు నిలబడాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించి అమలుపరచమని పోరాడాలి.
డా కొల్లా రాజమోహన్
నల్లమడ రైతు సంఘం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.