
తాజాగా భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన సైనిక ఘర్షణలో భారత వాయుసేన కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందని, అయితే తొందరగా గుణపాఠం నేర్చుకోవటం వల్ల తదుపరి నష్టాలు నివారించుకోగలిగామని భారత ఛీఫ్ ఆఫ్ స్టాఫ్స్ అనిల్ చౌహాన్ సింగపూర్లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సింగపూర్ ఇంటర్వ్యూ తర్వాత పూనేలో తొలిసారిగా ఆయన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
జూన్ మూడో తేదీన పూనేలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో “భవిష్యత్తులో యుద్ధాలు- యుద్ధ తంత్రం” అన్న అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్లో భారత ఛీఫ్ ఆఫ్ స్టాఫ్స్ అనిల్ చౌహాన్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో గమనించాల్సిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
తాజాగా పాకిస్తాన్తో జరిగిన సాయుధ ఘర్షణలో మన దేశానికి జరిగిన నష్టాల గురించి త్వరలో సవివరమైన నివేదికను బహిరంగపరుస్తాము. యుద్ధం ముగియగానే నష్టాలను అంచనా వేయటం సాధ్యం కాదు. కాస్త సమయం పడుతుంది. భారత్ స్వల్పకాలిక యుద్ధాలు కోరుకుంటోంది.
మెరుపు వేగంతో జరిగిన యుద్ధాల్లో ఇరుపక్షాలకు జరిగిన పూర్తి నష్టం ఎంత అన్నది తక్షణమే తేల్చగలిగిన అంశం కాదని అనిల్ చౌహాన్ అన్నారు. ఉపగ్రహాల ఛాయాచిత్రాలు, నిఘా వర్గాల సమాచారం వంటి భిన్న వనరుల ద్వారా సేకరించిన సమాచారాన్ని జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత మాత్రమే ఎవరికి ఎంత నష్టం జరిగిందన్నది చెప్పగలమని ఆయన వివరించారు. ఆధునిక యుద్ధ శైలిలో నష్టాలకు సంబంధించిన తక్షణ అంచనాలు సాధ్యం కావని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక యుద్ధాలంటే పెద్దఎత్తున ఆర్థిక వనరులు, మానవ వనరుల హననం జరుగుతుందని, కాబట్టి భారతదేశం స్వల్పకాలిక మెరుపు యుద్ధాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన వెల్లడించారు. తాజా సైనిక ఘర్షణలో జరిగని నష్టానికి సంబంధించి వివరమైన నివేదిక వెలువరించనున్న తరుణంలో ఆధునిక యుద్ధతంత్రంలో భిన్న మార్గాల ద్వారా సంపూర్ణ సమాచారాన్ని సేకరించకుండా జరిగిన నష్టాన్ని అంచనా వేయలేమని స్పష్టం చేశారు.
పాకిస్తాన్కు జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తాము: చౌహాన్
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్కు జరిగిన సాయుధ, ప్రాణ నష్టం గురించి పలు వార్తలు, అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థకు జరిగిన నష్టం, భారత్ దాడుల్లో కూలిన పాక్ యుద్ధ విమానాల గురించి ఉజ్జాయింపు అంచనాను త్వరలో విడుదల చేయనున్నట్లు అనిల్ చౌహాన్ చెప్పారు. సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో జరిగిన సెమినార్లో అనిల్ చౌహాన్ ప్రసంగం తర్వాత ప్రశ్నోత్తరాలకు జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక అంశాల ఆధారంగా యుద్ధ కాలానికి సంబంధించిన వివరాలు సేకరించి, విశ్లేషించిన తర్వాత మాత్రమే ఎన్ని యుద్ధ విమానాలను కూల్చాము, ఎన్ని రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేశామన్న విషయాలు చెప్పగలమని ఆయన అన్నారు. ఉజ్జాయింపు అంచనాను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు.
యుద్ధ నష్టాలను అంచనా వేయటానికి అనుసరించే పద్ధతుల గురించి వివరిస్తూ అనిల్ చౌహాన్
‘‘మన దేశానికి జరిగిన ఆయుధ నష్టం సైనిక నష్టం గురించి అడిగినప్పుడు అదేమంత పెద్ద ప్రాధాన్యత కలిగిన అంశం కాదని చెప్పాను. ఫలితాలు, మనం వ్యవహరించిన తీరే ప్రాధాన్యత కలిగినవి. నష్టాల గురించి మాట్లాడటం అంత సరైనది కాకపోవచ్చు. ఉదాహరణకు ఫుట్బాల్ ఆటలో మీరు మూడు గోల్స్ వేసి ఎదుటి టీం రెండు గోల్స్ వేస్తే గెలిచేది మీరే, అయినా అక్కడ మొత్తం పడిన గోల్స్ 4. అంటే ఇరు జట్లూ పోటాపోటీగా ఆడాయని అర్థం. అదేవిధంగా క్రికెట్లో మీ జట్టు ఒక ఇన్నింగ్ విజయాన్ని సాధిస్తే అప్పుడు ఎంత మంది ఔటయ్యారు, ఎన్ని ఓవర్లు ఆడారు వంటి వివరాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు.” వంటి ఉదాహరణలతో జరిగిన నష్టం గురించిన ఆందోళన తగ్గించటానికి అనిల్ చౌహాన్ ప్రయత్నం చేశారు.
దీర్ఘకాలిక యుద్ధాలు వద్దు..
గత కొన్ని రోజులుగా అనిల్ చౌహాన్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ, పూనే విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలోనూ భారతదేశం దీర్ఘకాలిక యుద్ధాలకు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. పూనేలో జరిగిన సెమినార్లో మాట్లాడిన తర్వాత సభికులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ‘‘భారతదేశం విషయానికి వస్తే దీర్ఘకాలం పాటు సాగించాల్సిన యుద్ధాలాకు మనం సిద్ధంగా లేము. అటువంటి ఘర్షణల జోలికి పోదల్చుకోలేదు. ఆపరేషన్ పరాక్రమ్లో మన అనుభవాలు చూశాము. ఆ యుద్ధంలో దాదాపు తొమ్మిది నెలలున్నాము. అంత దీర్ఘకాలం యుద్ధం చేయాలంటే చాలా వనరులు అవసరమవుతాయి. చాలా ఇబ్బందులు తలెత్తుతాయి’’ అన్నారు.
విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సెమినార్లో మాట్లాడుతూ ‘‘మన శతృవు అవగానహ కంటే(యుద్ధం పట్ల) మన అవగాహన భిన్నమైనది. మన అభివృద్ధికి యుద్ధాలు ఆటంకం కాకూడదు. స్వల్పకాలిక యుద్ధాల్లో మన శక్తి సామర్ద్యాలు చూపిస్తే సరిపోతుంది’’ అన్నారు. వారం క్రితం సింగపూర్లో యుద్ధ తంత్రం గురించి జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ ‘‘దీర్ఘకాలిక యుద్ధాలు జాతీయాభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మాకు అటువంటి యుద్ధాలు చేయాలన్న ఆసక్తి లేదు. శతృవులు మన జాతీయాభివృద్ధికి అవరోధాలు కలిగించాలని కోరుకుంటున్నారు. ఆర్థిక కోణంలో చూసినప్పుడు దీర్ఘకాలంగా సైన్యాన్ని సాయుధ సంపత్తిని సమీకరించి యుద్ధం చేయాలంటే ఆర్థిక వనరులు చాలా వెచ్చించాల్సి వస్తుంది. యుద్ధం చేయకుండానే భారతసైన్యం కొన్ని నెలలపాటు యుద్దానికి సన్నద్ధమై ఉన్నది. అలాగే నిరంతర సన్నద్ధతతో ఉండటం మన్నికైన యుద్ధ తంత్రం కాదు. అందుకే ఆపరేషన్ పూర్తి కాగానే యుద్ధ సన్నద్ధతకు విరామం ప్రకటించాము.(డిస్ ఎంగేజ్డ్)’’ పేర్కొన్నారు.
ఆపరేషన్ సాఫల్యత గురించి..
డైనమిక్ సైనిక చర్యల్లో సదరు ఆపరేషన్ ఏ మేరకు సఫలమైంది, అవతలి పక్షానికి ఎంత నష్టం జరిగింది, స్వపక్షానికి జరిగిన నష్టం ఏంటి అన్న వివరాలు వెంటనే తెలీవు యుద్ధకాలంలో వచ్చే సమాచారం కంటే ఉపగ్రహాలు అందించిన ఛాయా ఛిత్రాలు, పలురకాలైన ఇంటెలిజెన్స్ సమాచారాలను విశ్లేషించినప్పుడు మాత్రమే అసలు వివరాలు వెలుగులోకి వస్తాయి.
మే 9- 10 తేదీల్లో పాకిస్తాన్ వాయుసేన స్థావరాలపై చేసిన దాడి గురించి ప్రస్తావిస్తూ అనిల్ చౌహాన ‘‘డైనమిక్ యుద్ధంలో అసలేమి జరిగిందన్నది నిజంగా మనకు అప్పటికపుడు తెలీదు. సర్దోగా మీద ప్రభావం ఏంటి? మురిద్కె మీద ప్రభావం ఏంటి? బులారి మీద ప్రభావం ఏంటి? జకోబాబాద్ మీద ప్రభావం ఏంటి? ఇవన్నీ మనకు ఉపగ్రహ ఛాయాచిత్రాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. అంచనా వస్తుంది. అంటే మొదటి కొన్ని గంటల్లో ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎంత నష్టం ఎక్కడెక్కడ జరిగింది అన్న విషయాలు అస్పష్టంగా ఉంటాయి. ఈ విషయాల్లో మనకు పాకిస్తానీ మిత్రులే సహాయం చేస్తున్నారు. వారికి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టుచేస్తున్నారు. ఆ మేరకు మన ఆపరేషన్ ఫలప్రదం అయ్యిందని అర్థమవుతుంది. కానీ మరింత నిక్కచ్చి అయిన సమాచారం రావాలంటే కాస్తంత సమయం వేచి ఉండాలి. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ వంటి పలు సమాచారవనరుల నుంచి విషయ సేకరణ జరగాలి. ఎంత నష్టం అన్నది మనకీ స్పష్టంగా తెలీదు. వాళ్లకీ తెలీదు. మనకు కూడా అలాంటి నష్టం జరిగిందని వాళ్లు కూడా అనుకుంటున్నారు. కానీ రెండు మూడు రోజుల తర్వాత వారి ఆశలు అడియాశలయ్యాయని తేలింది. వాళ్లు మనకు జరిగిన నష్టాన్ని గుర్తించటానికి ఏ దేశం నుండి ఉపగ్రహ ఛాయా చిత్రాలు కొనుగోలు చేసినా ఎక్కడా ఏమీ కనపడలేదు. అప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది’’ అన్నారు.
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.