
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ను అభిశంశించాలని కోరుతూ 54 మంది రాజ్యసభ సభ్యులు రాజ్య సభ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదుపై సంతకాలు చేసిన వారిలో 50 మంది ఆ సంతకాలు తమవే అని ఖరారు చేశారు. దీంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం జస్టిస్ శేఖర్ యాదవ్ను అభిశంశించటానికి రంగం సిద్ధం అయ్యింది.
54 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసిన నోటీసును గత సంవత్సరం డిసెంబర్ 13న రాజ్యసభ సచివాలయానికి అందజేశారు. అయితే 9 మంది ఎంపీల సంతకాల విషయంలో రాజ్యసభ సచివాలయం సందేహాలు వ్యక్తం చేసింది. దీంతో ఆ సంతకాలు చేసిన ఎంపీలందరినీ సంప్రదించి ఆ సంతకాలు వారివేనా కాదాని ధృవీకరించుకునే కసరత్తు రాజ్యసభ సచివాలయం ప్రారంభించింది.
రాజ్యసభ అధికారులను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన కథనం ప్రకారం, ఇప్పటివరకు 44 మంది రాజ్యసభ సభ్యులు ఆ ఫిర్యాదుపై ఉన్న సంతకాలు తమవేనని ధ్రువీకరించారు.
ఇంకా సంతకాలను ధ్రువీకరించవలసిన ఎంపీలలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కపిల్ సిబల్, సుష్మిత దేవ్, సంజీవ్ అరోరా, జోస్ కే మణి, ఫయాజ్ అహ్మద్, వికాస్ రంజన్ బాటచార్య, జీసీ చంద్రశేఖర్, రాఘవ్ చడ్డ, ఎన్ఆర్ ఎలంగోలు ఉన్నారు. వీరిలో ఆరుగురు తాము అభిశంసన నోటీసుపై సంతకాలు చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్కు ధ్రువీకరించారు.
కపిల్ సిబల్ మాట్లాడుతూ తాను రాజ్యసభ చైర్మన్ను అనేకసార్లు కలిశానని అయినా ఈ సంతకాల విషయాన్ని ఆయన ప్రస్తావించలేదని తెలిపారు. నా సంతకం ధ్రువీకరణ కోసం ఏ ఈమెయిల్ ఐడికి సమాచారం పంపారో తనకు తెలియదని సిబల్ అన్నారు. నోటిఫై సంతకాలు చేసినవారిలో తాను కూడా ఒకరినని సిబల్ స్పష్టం చేశారు.
జీసీ చంద్రశేఖర్ తన ధ్రువీకరణను పూర్తి చేశానని చెప్పగా చిదంబరం మాత్రం సంతకాల ధ్రువీకరణ కోసం తనను ఎవరు సంప్రదించలేదని చెప్పారు.
జోస్ కే మణి, వికాస్ రంజన్ భట్టాచార్య త్వరలో తమ సంతకాలను ధ్రువీకరించనున్నట్లు తెలుపగా ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ ఆరోరా తాను లూథియాన ఉపఎన్నికలలో నిమగ్నమై ఉన్నానని తెలిపారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం రాఘవ్ చడ్డ ఈ విషయమే చర్చించడానికి రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్కాడ్ను సమయం కోరారు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ గత సంవత్సరం డిసెంబర్ 8న విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తూ ఈ దేశం హిందుస్థాన్ అని చెప్పటానికి నేనేమీ సందేహించడం లేదు. ఈ దేశంలో అత్యధిక సంఖ్యకులైన వారి మనోభావాలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని అన్నారు.
అంతేకాకుండా “ఉమ్మడి పౌరస్మృతి విషయంలో దేశంలో అనేక పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయి. ఇది మీ ఇస్లాం మతానికో ఖురాన్కు, షరియాకు వ్యతిరేకమనే అభిప్రాయం ఉన్నది. కానీ నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నాను. అది మీ పౌర స్మృతి కావచ్చు, మా హిందూ చట్టాలు కావచ్చు, మీ ఖురాన్ కావచ్చు లేదా మా గీత కావచ్చు. ఇంతకుముందే చెప్పినట్లు మన ఆచరణలో తప్పుడు అంశాలను సవరించేందుకే” అని అన్నారు.
“అంటరానితనం, సతీసహగమనం,భ్రూణ హత్యలు వంటి వాటన్నింటిని అధిగమించాము. అటువంటప్పుడు ఈ విషయాన్ని ఎందుకు అధిగమించలేకపోతున్నాము? మీ మొదటి భార్య ఉండగానే ఆమె అనుమతి లేకుండా మరో ముగ్గురు భార్యలను చేసుకోవడం ఎలా సరైన విషయం? ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించ రాని విషయం” అని ఆయన ఆ ఉపన్యాసంలో పేర్కొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.