
మార్చి 25న కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ రూల్స్కు అతి ప్రమాదకరమైన, తీవ్ర నష్టదాయకమైన సవరణలను లోక్ సభలో ఆర్థిక బిల్లులో భాగంగా ప్రవేశపెట్టి పాస్ చేయించుకుంది. “సిసిఎస్ (పెన్షన్) నిబంధనలు, భారతదేశ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి పెన్షన్ బాధ్యతలపై ఖర్చు కోసం సిసిఎస్(పెన్షన్) నియమాలు, సూత్రాల ధ్రువీకరణ” అనే చట్టాన్ని లోక్సభ ఆమోదించింది. ఇప్పుడు అది రాజ్యసభకు వెళ్ళనుంది.
ఇప్పటివరకు, పే కమీషన్ల సిఫార్సులన్నీ పెన్షనర్లకు ఒకే విధంగా వర్తించబడ్డాయి. కానీ, మొదటిసారిగా, మోడీ ప్రభుత్వం పెన్షనర్లలో వివక్ష చూపడానికి చట్టం ద్వారా ఏకపక్ష అధికారాలను తీసుకుంది. ఇది తిరోగమన దశ, పెన్షనర్లపై తీవ్రమైన దెబ్బ. రాజ్య సభలో కూడా పాసయితే అది చట్టమై, 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు నష్టకరం అవడమే గాక, కోట్లాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, బీమా, బ్యాంకు తదితర అన్ని రంగాల ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా ఉరి త్రాడు అవుతుంది. ఈ సవరణలు పెన్షన్ విధానంలో ముఖ్యమైన మార్పులకు దారి తీస్తున్నాయి.
ముఖ్యాంశాలు..
- పే కమిషన్ లాభాలు భవిష్యత్కు మాత్రమే అంటే పే కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తరువాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులకే వర్తించనున్నాయి. ఆ తేదీకి ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు పెరిగిన వేతన ప్రయోజనాలు వర్తించవు.
- పే కమిషన్ సిఫార్సులను ఎప్పుడు, ఎలా అమలు చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వం కలిగి ఉంటుంది. దీని ద్వారా పెన్షన్ హక్కులు ఎవరికి వర్తించాలో ప్రభుత్వం నిర్ణయించగలదు.
- విపక్షం నిరసన: ఈ సవరణలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు సభ నుంచి వాక్ఔట్ చేశాయి. ఈ చర్యను అవ్యవస్థితమైనదిగా, “బ్యాక్డోర్ చట్టం” ద్వారా మిలియన్ల మంది పెన్షనర్లను అన్యాయంగా దూరం పెట్టడమని వారు విమర్శించారు.
- న్యాయపరమైన నేపథ్యం: సుప్రీం కోర్టు గతంలో పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరుచేయడం అసమంజసమని తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును కాలరాస్తూ పెన్షన్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా నిర్ణయించడానికి అధికారం కల్పిస్తోంది.
అప్రజాస్వామిక దొంగ దెబ్బ..
ఈ పెన్షన్ సవరణ బిల్లును సరాసరి లోక్సభలో ప్రవేశ పెడితే తీవ్ర వ్యతిరేకతకు గురై అభాసుపాలు అయిపోతామన్న భయంతో దొంగ చాటుగా “ఆర్ధిక బిల్లులో” చొప్పించి ఆమోదింపచేసుకోవడంలోనే దీని దుర్నీతి అర్థమవుతుంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ అమలులోకి వచ్చిన 1972 జూన్ 1 నుండి, అంటే 53 ఏళ్ళ వెనుక నుండి దీనిని అమలు చేయడం ద్వారా చరిత్రను అర్థ శతాబ్దానికి పైగా వెనక్కి తిప్పే దారుణం ఇది.
ఈ బిల్లు రాజ్యసభలో కూడా పాసయి చట్టం అయితే భారతదేశంలోని సీనియర్ పెన్షనర్లు అందరూ రిటైర్ అయిననారు ఫిక్స్ అయిన పెన్షన్ తప్ప ఎటువంటి “అప్ డేషన్” లేక జీవితం గడపాల్సి ఉంటుంది.
హక్కులు హరింపు..
గత 70 ఏళ్ల పాటు ఉద్యోగులు, పెన్షనర్లు పోరాడి పెన్షన్కు సంబంధించి కొన్ని హక్కులను సాధించుకున్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు అనేక సందర్భాల్లో పెన్షన్ మీద తీర్పులను వెలువరించాయి. అందులో “పెన్షన్ దయా- ధర్మ బిక్షం కాదు. ఉద్యోగుల హక్కు, తాము పనిచేసిన కాలంలో భవిష్యత్తు కోసం పొదుపు చేసుకున్న సొమ్ము” అని స్పష్టం చేశాయి. ఇలాంటి చక్కని తీర్పులను, హక్కులను ఒకే ఒక్క దెబ్బతో మోదీ ప్రభుత్వం బూడిదలో కలిపేస్తోంది.
వివక్షా పూరిత చర్య..
ఇప్పటివరకు, వేతన కమిషన్ల సిఫార్సులన్నీ పెన్షనర్లందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి. కానీ, మొదటిసారిగా మోదీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా ఏకపక్ష అధికారాలను చేపట్టింది. పెన్షనర్ల మధ్య వివక్ష చూపడానికిది తిరోగమన చర్య.
కేంద్ర వేతన సంఘం సిఫార్సులకు ముందు పదవీ విరమణ చేసిన పెన్షనర్లు, ఇకపై సవరించిన ప్రయోజనాలకు అర్హులు కారు. వేతన సంఘం నివేదిక తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే సవరించిన ప్రయోజనాలు లభిస్తాయి. సిఫార్సులను ఎప్పుడు అమలు చేయాలో నిర్ణయించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది.
భీమా, బ్యాంకు ఉద్యోగులు..
భీమా, బ్యాంకు ఉద్యోగులకు మొదట్లో ఎటువంటి పెన్షన్ లేదు. వీరంతా ఐక్యంగా పోరాడి 1995 నుండీ అమలయ్యేలా దీన్ని సాధించుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకున్న పెన్షన్ అప్గ్రడేషన్ సదుపాయం వీరికి లేకపోవడంతో, దీని సాధనకై నేడు పెద్ద పోరాటాలు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ ఈ చర్య వీరికి అశనిపాతంలా మారనుంది.
ప్రభుత్వ అడ్డగోలు సమర్థన..
పెన్షనర్లకు పే కమిషన్ ప్రయోజనాల పునరాలోచన వర్తింపు ఎల్లప్పుడూ చర్చనీయాంశమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంపై సుప్రీంకోర్టు భిన్నమైన అభిప్రాయాలను తీసుకుందని, తెలుపుతూ తన చర్యను
సమర్థించుకునేలా వితండ వాదనలు చేస్తోంది. దీనివల్ల ఏ రకమైన నష్టం ఉండదని బుకాయిస్తోంది.
ప్రభుత్వ విధానాల ఆంతర్యం..
వాస్తవంగా మోదీ ప్రభుత్వ విధానాలను లోతుగా అర్థం చేసుకున్న వారెవరికీ నేటి ఈ నిర్ణయమేమీ ఆశ్చర్యం కలిగించదు. ‘కాకులను కొట్టి గద్దలకు వేసే’ చందంగానే కోట్లాది మంది శ్రామికుల కష్టార్జితాన్ని కొద్ది మంది సంపన్నులకు దోచిపెట్టడమే మోదీ ప్రభుత్వ విధానం. ఇందులో భాగంగానే అనేక చర్యలను ప్రభుత్వం చేయబడుతోంది. కార్మికులు వేతనాలు పెంచడం లేదు. పోరాడి సాధించుకున్న సమ్మె హక్కుతో సహా అనేక హక్కులను సైతం కాలరాసేలా కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్లు తెచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు అమ్మేస్తోంది. సహజ వనరులను దోచి పెడుతోంది. వీటి ప్రభావంతో నేడు దేశంలో అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఆర్థిక అసమానతలు హెచ్చుగా ఉన్న దేశాల సరసన మన దేశం నిలిచింది. మోదీ మార్కు అభివృద్ధి అంటే ఇదే.
పెన్షన్ల మోసాలు..
దేశంలో అత్యధిక మందికి వర్తించే ‘ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం 1995’లో నేడు పెన్షన్ అత్యంత తక్కువగా ఉంది. మూడు దశాబ్దాలకు పైగా సర్వీసు చేసిన ఒక ప్రభుత్వ రంగ కార్మికునికి మూడు వేల రూపాయల పెన్షన్ రావడం నేడు గగనంగా మారింది. కనీస పెన్షన్ 9 వేల రూపాయలకు పెంచాలని, దానిపై కరవు భత్యం చెల్లించాలనే పెన్షనర్ల డిమాండుకు మోదీ ప్రభుత్వం ససేమిరా నిరాకరిస్తోంది. ఇదే ఎన్డీయే ప్రభుత్వం వాజపాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి వరకు ఉద్యోగులకున్న పాత పెన్షన్ స్కీం( ఓపీస్)ను రద్దు చేసి, 2004 జనవరి తరువాత కేంద్ర సర్వీసుల్లో చేరిన వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్( ఎన్పీఎస్) అనే పథకాన్ని ఇలాగే ఏకపక్షంగా ప్రవేశ పెట్టింది. పెన్షన్ ఎంత వస్తుందో కూడా తెలియని ముద నష్టపు పథకం ఇది. దీన్ని రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలనేది ఉద్యోగుల డిమాండు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తూ, దాని కంటే ఘోరంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్) అనే పొదుపు సొమ్మును హరించే మరో నష్టకర పథకాన్ని ఏప్రిల్ 1 నుండి అమలయ్యేలా ప్రవేశ పెట్టింది. దీనిని కూడా ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాస్తవంగా ఈ పెన్షన్ పథకాలన్నీ, వాటి నిధులతో షేర్ మార్కెట్లో జూడమాడడం ద్వారా కార్పొరేట్లకు సిరులు కురిపించేవే. అందుకే ఇవన్నీ పేరులోనే ఉద్యోగుల పెన్షన్ తప్ప ఆచరణలో కార్పొరేట్ సంక్షేమ పథకాలే.
‘ఉన్ని బట్టలు ఇమ్మంటే ఉన్న బట్టలే పీకేసినట్లు’, నేడు మోదీ ప్రభుత్వం ఉద్యోగుల సమంజస డిమాండ్లనింటినీ బేఖాతరు చేస్తూ, ఓపీస్ పెన్షన్ దారుల హక్కులను కూడా హరించే వేస్తూ ఈ చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది.
ఇది ఏ రకంగానూ సమర్ధనీయం కాదు. ఆ దారిలోనే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పయనిస్తాయండంలో సందేహం లేదు. ఒక వేళ అవి చేయకపోయినా, వాటితో ఆ పని చేయించే కళ కూడా మోదీ ప్రభుత్వం వద్ద ఎలాగూ ఉండనే ఉంది. అందువల్ల మోదీ ప్రభుత్వ ఈ చట్టం దేశంలోని పెన్షన్ దారులందరికీ ఉరితాడే అనడంలో సందేహం లేదు. ఉద్యోగులు, పెన్షనర్లలందరూ సమైక్యంగా ఉద్యమించి, ఓపీస్ సాధన, ఇటువంటి తిరోగమన చర్యలను తిప్పి కొట్టడమే ఏకైక మార్గం. అదే సందర్భంలో ఇటువంటి పచ్చి ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వ కపటత్వాన్ని కూడా చైతన్యంతో ఎదుర్కోవడమే పరిష్కారం.
ఎ అజ శర్మ,
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.