
“పోలవరం- సోమశిల పథకంగా చేపట్టి బొల్లాపల్లి రిజర్వాయరు మీదుగా ప్రకాశం జిల్లాలోని నాగార్జునసాగర్ రెండవ దశ ప్రతిపాదిత ఆయకట్టుకు, వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయరు నల్లమలసాగర్కు నీటిని అందిస్తూ, సోమశిలకు అనుసంధానించి, సోమశిల ఆయకట్టుకు, కండలేరు ద్వారా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని తెలుగు గంగ, గాలేరు – నగరి ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. తద్వారా క్రిష్ణా జలాలపై వత్తిడి తగ్గించవచ్చు, పెన్నా నీటిని ఆదా చేసి, రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని అందించవచ్చు. ఈ మా ఆలోచనలను మీతో పంచుకుంటున్నాము. మీరు సానుకూలంగా స్పందించి, లోతుగా పరిశీలించి, సముచితమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామ”ని పన్నెండు పాయింట్లతో విడుదలైన ప్రకటనలో ప్రతినిధి సభ్యులు కోరారు.
విజయవాడ: కృష్ణా – గోదావరి జలాల సమస్యలు, నిర్మాణంలోని రాష్ట్ర ప్రాజెక్టులు, గోదావరి – బనకచెర్ల ఎత్తిపోతల పథకంపై సీఎం చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ఆలోచనాపరుల వేదిక వినతిపత్రాన్ని పంపించింది. ఏబీ వెంకటేశ్వరరావు, టీ లక్ష్మీనారాయణ, కంభంపాటి పాపారావు, అక్కినేని భవానీ ప్రసాద్ ఈ వేదికకు ప్రతినిధులుగా ఉన్నారు. వీరు ఒక ప్రతినిధి బృందంగా ముఖ్యమంత్రిని కలిసి, రాష్ట్రానికి సంబంధించి కీలకాంశాల మీద వినతిపత్రం అందజేసి, తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకున్నారు. అయితే ప్రతినిధి బృందానికి అనుమతి లభించలేదు. దీంతో సీఎం చంద్రబాబుకు వినతిపత్రాన్ని స్పీడ్ పోస్ట్ చేసి, జూన్ 27న అదే వినతి పత్రాన్ని పత్రికా ప్రకటనగా విడుదల చేశారు.
కృష్ణా- గోదావరి నదీ జలాల హక్కుల కోసం రాజీలేని పోరాటం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసుకోవాల్సిన అవశ్యకత, గోదావరి- బనకచెర్ల ఎత్తిపోతల పథకంపై జరుగుతోన్న చర్చల నేపథ్యంలో తమ అభిప్రాయాలను సీఎంతో పాటు ప్రజల దృష్టికి ప్రతినిధులు తీసుకువచ్చారు.ఈ వినతిపత్రం ద్వారా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు.
అప్రజాస్వామిక చర్యలు..
ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పరిస్థితులనుద్దేశించి ప్రస్థావిస్తూ, “మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. ప్రతిపక్షం శాసన సభకు వెళ్లడం లేదు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఆయారంగాలకు చెందిన నిపుణులు, అధ్యయనకారులతో పోలవరం- బనకచెర్ల లాంటి అత్యంత కీలకమైన సమస్యలపై ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు. వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం లేద”ని ప్రతినిధి బృంద సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో 500 టీఎంసీలు, గోదావరి నదీ జలాల్లో 1000 టీఎంసీలు కేటాయించాలని టీజీ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీని మీద ప్రకటనలో స్పందిస్తూ ఆ డిమాండును నిర్ద్వందంగా తిరస్కరించి, ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.
బచావత్– 1973 తీర్పు..
“అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం- 1956 మేరకు ఏర్పాటు చేసిన మొదటి కృష్ణా జల వివాదాల(బచావత్) ట్రిబ్యునల్ 1973లో ఇచ్చిన తీర్పు ప్రకారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పునరుత్పాదక జలాలతో కలిపి 811 టీఎంసీలు కేటాయించబడ్డాయి. అందులో తెలంగాణ వాటా 278.96 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ వాటా 522 టీఎంసీలు. 75% ప్రామాణికంగా లభించే జలాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రెండవ కృష్ణాజల వివాదాల(బ్రజేష్ కుమార్) ట్రిబ్యునల్ తీర్పు 2013లో పునరుద్ఘాటించింది. ట్రిబ్యునల్ కల్పించిన వెసులుబాటును ఉపయోగించుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రిష్ణా డెల్టా ఆధునికీకరణ ద్వారా ఆదా అయ్యే నీటిలో 20 టీఎంసీలను భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించింది. ఈ ప్రాజెక్టును సీడబ్ల్యూసీ ఆమోదంతో నిర్మించారు. అలాగే, 11 టీఎంసీల పునరుత్పాదక జలాలు, కేసీ కెనాల్ ఆధునికీకరణ ద్వారా ఆదా అయిన 8 టీఎంసీ, మొత్తం 19 టీఎంసీలను శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు కేటాయించి, సీడబ్ల్యూసీ ఆమోదంతో, ప్రపంచ బ్యాంకు రుణంతో నిర్మించుకున్నాం. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సర్దుబాటులను పరిగణలోకి తీసుకున్న మీదట ఆంధ్రప్రదేశ్కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు లభించాయి. ప్రాజెక్టుల వారిగా కేటాయింపులున్న ఆ జాబితాను మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు(చంద్రబాబు), తెలంగాణ ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖరరావు ఆ సమావేశానికి హాజరైయ్యారు. ఆ నిర్ణయం బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా తీసుకున్న సహేతుకమైన నిర్ణయమ”ని ఈ వినతి పత్రంలో గుర్తు చేశారు.
అయితే, మొదటి అపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం తాత్కాలికమైనదని బీ(టీ)ఆర్ఎస్ వక్రీకరిస్తున్నదని ఈ ప్రకటనలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం- 1956 ప్రకారం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పెంచి, తెలంగాణ లేవనెత్తిన జల వివాదాలపై విచారణ జరపమని ఆదేశించిందని పేర్కొన్నారు.ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నదని మండిపడ్డారు.
ఈ వేదిక సభ్యులు“నదీ పరివాహక ప్రాంతం నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలంటూ బచావత్ ట్రిబ్యునల్ ముందు కర్నాటక ప్రభుత్వం వాదించింది. ఆ వాదనను బచావత్ ట్రిబ్యునల్ నిర్ద్వందంగా తిరస్కరించింది. కానీ, నేడు తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అదే వాదనను వినిపిస్తున్నది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును పొరపాటున బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తిరగదోడితే అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంద”ని హెచ్చరించారు.
“కర్ణాటక, మహారాష్ట్రలు ట్రిబ్యునల్ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయని గమనించాలి. పురాతనమైన కృష్ణా డెల్టా, కేసీ కెనాల్, కృష్ణా బేసిన్ పరిధిలోలేని నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు భాగాలకు, ఎస్సార్బీసీకి నికర జలాల కేటాయింపును రద్దుచేసి, ఆ నీటిని తెలంగాణకు కేటాయించాలని, తెలుగు గంగ, గాలేరు – నగరి, హంద్రీ – నీవా, వెలిగొండ ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లో లేవని, వాటికి నీటిని కేటాయించడానికి వీల్లేదని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించే 80 టీఎంసీలలో మహారాష్ట్ర, కర్ణాటక వాటా 35 టీఎంసీలు పోను, మిగిలిన 45 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలోనే కృష్ణా డెల్టా ఆధునికీకరణ పథకం ద్వారా ఆదా అవుతాయాని అంచనా వేసిన 20 టీఎంసీలను తెలంగాణలో నిర్మించబడిన భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించబడ్డాయి. క్రిష్ణా డెల్టా ఆధునికీకరణ పథకం ఇంకా పూర్తి కాలేదు. కానీ, భీమా పథకానికి సర్దుబాటు చేసిన నీటిని ఇప్పటికే తెలంగాణ వాడుకొంటున్నది. ఈ వాస్తవాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణ నేడు పెను సవాలుగా పరిణమించింది. ఈ విషయంలో రాజీలేని పోరాటం చేసి, కృష్ణా జలాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా సంక్రమించిన నీటి హక్కులను పరిరక్షించాల”ని ప్రతినిధి సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చట్టాలు– తీర్పులే శిరోధార్యం..
1980 నుంచి అమల్లోకి వచ్చిన గోదావరి నదీ జల వివాదాల ట్రిబ్యునల్(బచావత్ ట్రిబ్యునల్) తీర్పు గురించి ప్రస్తావిస్తూ, దాని ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1172.78 టీఎంసీలు కేటాయింపు లభించిందని అన్నారు. నాటి మధ్యప్రదేశ్(ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్) రాష్ట్రం నిర్మించే భోపాల్ పట్నం జల విద్యుత్ కేంద్రం వినియోగం తర్వాత దిగువకు ప్రవహించే 192 టీఎంసీలు, 108.50 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో కలిపి మొత్తం 1473.28 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దక్కాయని పేర్కొన్నారు.
“గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారిగా కనబరిచిన కేటాయింపులు, చిన్ననీటి వనరుల వినియోగం పద్దు కింద చూపెట్టిన నీటిని కలిపితే కొంత అస్పష్టంగా ఉంది. అయిప్పటికీ తెలంగాణకు దాదాపు 800 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు దాదాపు 680 టీఎంసీలు ఉన్నట్లు లెక్క తేలుతున్నది. ఈ వాస్తవాలను మరుగుపరుస్తూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గోదావరి జలాల్లో 1000 టీఎంసీలు తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం చూస్తుంటే పురాతనమైన గోదావరి డెల్టాకు 300 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న పోలవరానికి 300 టీఎంసీల నికర జలాలు లాభిస్తాయా అన్న ప్రశ్న తలెత్తుతున్నద”ని ఆందోళనవ్యక్తం చేశారు.
అంతేకాకుండా, గోదావరి నదీ జలాల అంశం తీవ్రరూపం దాల్చుతున్నదనిపిస్తున్నదని ఈ క్రమంలో రాజ్యాంగం, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పులు, అత్యున్నత న్యాయస్థానం తీర్పులే శిరోధార్యమని అన్నారు. “తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదానికి ముగింపు పలకాలంటే తాము కోరుతున్నట్లు నీటిని కేటాయించాలని తెలంగాణ “బ్లాక్ మెయిల్” చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో చెల్లుబాటు కాదనే విషయాన్ని విస్పష్టంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నామ”ని తెలియజేశారు.
కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ట్రిబ్యునల్ తీర్పులను, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులను వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించడంలేదన్న సీఎం వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు.2021 అక్టోబరు 14 నుంచి అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను ప్రస్థావించారు. అందులో స్పష్టంగా అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాను వెల్లడించారని గుర్తుచేశారు. ఆ జాబితాలో పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా అదనంగా ఒక టీఎంసీ తరలింపు, వగైరా భారీ– మధ్య తరహా ప్రాజెక్టులున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ వీటన్నింటిని వ్యతిరేకించకపోతే ఆంధ్రప్రదేశ్కు శాశ్వతంగా తీవ్రనష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.
ప్రకటనలో ప్రతినిధులు తెలిపినదాని ప్రకారం, “29 టీఎంసీల కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా ఎన్టీఆర్ ప్రభుత్వం చేపట్టిన తెలుగు గంగ నిర్మాణం అత్యధిక భాగం పూర్తి కావడంతో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాలలో సగటు లభ్యతలో 25 టీఎంసీల జలాలను కేటాయించింది. 40 టీఎంసీల కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న హంద్రీ- నీవా సుజల స్రవంతి, 38 టీఎంసీల కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న గాలేరు- నగరి సుజల స్రవంతికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 రక్షణ కల్పించింది. చట్టంలో ప్రస్తావించిన తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.”
“శ్రీశైలం రిజర్వాయరుకు వరద ప్రవాహ రోజులు తగ్గిపోయిన నేపథ్యంలో హంద్రీ – నీవా ప్రధాన కాలువను 6100 క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరించడానికి మీరు(చంద్రబాబు) గతంలో పరిపాలనా అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ప్రధాన కాలువ విస్తరణ చేయకుండానే లైనింగ్ పనులు చేస్తున్నారు. లైనింగ్ పనులు చేయడం మంచిదే. కానీ, నిర్దేశిత లక్ష్యాలు నెరవేరవు. భవిష్యత్తులో విస్తరించాలంటే కనీసం ఒక వైపైనా కాలువ గట్టును, పలు నిర్మాణాలను పగలగొట్టాల్సి వస్తుంది. ప్రజాధనం వృథా అవుతుంద”ని చెప్పుకొచ్చారు.
పాత ప్రాజెక్టులపై ప్రత్యేకదృష్టి..
గాలేరు – నగరి రెండవ దశలో భాగమైన కడప – కోడూరు భాగం నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఇది అత్యంత దారుణం. అతి ముఖ్యమైన శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు గుండెకాయలాంటి గోరకల్లు నిర్మాణాన్ని అసంపూర్తిగా, నాసిరకంగా చేయడంతో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయలేని దుస్థితి నెలకొన్నది. ఆ రిజర్వాయరు ప్రమాదపుటంచున ఉన్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయ”ని పేర్కొన్నారు. అలాగే, వినియోగంలో ఉన్న పలు పాత ప్రాజెక్టులు మరమ్మత్తులకు కూడా నోచుకోలేదని గుర్తుచేశారు. ఈ అంశాలపైన చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, నిర్మాణంలో ఉన్న వంశధార ప్రాజెక్టులు, వంశధార – నాగావళి అనుసంధాన పథకం, తోటపల్లి బ్యారేజీ, తదితర ప్రాజెక్టుల నిర్మాణాలను సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వంశధార జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమల్లోకి రాకపోవడం పర్యవసానంగా నష్టం జరుగుతున్నదని తెలియజేశారు. నేడున్న సానుకూల రాజకీయ వాతావరణంలో ఆ సమస్యను సత్వరం పరిష్కరించుకోవడానికి చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికను సమర్పించిన గోదావరి- బనకచెర్ల పథకం కృష్ణా జలాల హక్కులకు ప్రమాదం తెచ్చిపెట్టేదిగా ఉన్నదని ప్రతినిధి సభ్యులు బలంగా భావించారు. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రస్తుతం పట్టిసీమ నుంచి 80 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి తరలించబడుతున్నాయని అన్నారు. అంతేకాకుండా, “భవిష్యత్తులో పోలవరం జలాశయం నుంచి అందించబడతాయి. క్రిష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు ఆ నీటితో పాటు పులిచింతల నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. ప్రతిపాదిత పథకం ప్రకారం మొదటి దశలో పోలవరం జలాశయం నుంచి +40 మీటర్ల ఎత్తు నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున తాడిపూడి ఎత్తిపోతల పథకం మీదుగా పోలవరం కుడి కాలువకు దిగువన సమాంతరంగా వరద కాలువను తవ్వి 200 టీఎంసీలను ప్రకాశం బ్యారేజీకి చేర్చుతామని ఆ నివేదికలో పేర్కొనబడింద”ని గుర్తు చేశారు.
అయితే, “గత ఏడాది బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా ప్రవహించిన బుడమేరు వరద నీరు, కృష్ణా నది ఉధృతంగా ప్రవహించడంతో, ప్రకాశం బ్యారేజీలోకి చేరలేక ఎగదన్ని కాలువకు భారీ గండ్లుపడి, విజయవాడను ముంచింది. మీ నాయకత్వంలో ఆ విపత్తు సహాయ కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టి, ప్రజలను ఆదుకున్నారు. అలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే గోదావరి వరద జలాలను ప్రకాశం బ్యారేజీ ద్వారా తరలించే పథకంపై పునరాలోచించుకోవాలని కోరుతున్నాము. పైపెచ్చు గోదావరి నీటిని, క్రిష్ణా నదిలో కలిపితే బచావత్ ట్రిబ్యునల్ తీర్పును వాడుకుని, వాటా అడిగే అవకాశాన్ని పై రాష్ట్రాలకు ఇచ్చినట్లు అవుతుంద”ని భావించారు
సముచితమైన నిర్ణయం తీసుకోవాలని వినతి..
“గోదావరి– పెన్నా అనుసంధానాన్ని, పోలవరం– సోమశిల అనుసంధాన పథకంగా పోలవరం కుడి కాలువకు ఎగువ భాగంలో చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టు, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీరందిస్తూ, వైకుంఠపురం వద్ద క్రిష్ణా నదిని, అటుపై నాగార్జునసాగర్ను అక్విడెక్ట్స్ ద్వారా దాటించి, నూతనంగా నిర్మించతలపెట్టిన బొల్లాపల్లి జలాశయానికి చేర్చడం ఎంతో ప్రయోజనకరమని భావిస్తున్నామ”ని పేర్కొన్నారు.
అంతేకాకుండా, “ఈ పథకం ద్వారా క్రిష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు స్థిరీకరణకు నీటిని అందించడం ద్వారా క్రిష్ణా జలాలను ఆదాచేసి, శ్రీశైలం జలాశయం మీద ఆధారపడి నిర్మించిన, నిర్మాణంలో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు గ్రావిటీ మీద అందించడానికి అవసరమైన మౌలికమైన ప్రధాన కాలువలు, రిజర్వాయర్లు నిర్మించబడి ఉన్నాయి. ఇంకా అవసరమైన మేరకు ప్రధాన కాలువల విస్తరణకు ప్రభుత్వం గతంలోనే పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చింది. ఆ పనులను సత్వరం పూర్తి చేయాలి” డిమాండ్ చేశారు.
టీజీ మాజీ సీఎం కేసీఆర్- ఏపీ మాజీ సీఎం జగన్- ఒక గుత్తేదారు సంస్థ అధినేత మధ్యవర్తిత్వంతో గోదావరి–బనకచెర్ల పథకం పుట్టుకొచ్చిందని ప్రస్తుత టీజీ సీఎం రేవంత్ ఆరోపించినట్టుగా ప్రకటనలో గుర్తుచేశారు.
అది వాస్తవమని చెప్తూ, “ఆ పథకంపై మీరు అడుగు ముందుకు వేస్తే మీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భావిస్తున్నాం. బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్తో ముడిపెట్టే ఈ పథకం కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులకు, మరీ ప్రత్యేకంగా కరువు పీడిత రాయలసీమ నీటి హక్కులకు ప్రమాదకారిగా పరిణమిస్తుంది. దాన్ని విరమించుకోవాల”ని విజ్ఞప్తి చేశారు.
“పోలవరం- సోమశిల పథకంగా చేపట్టి బొల్లాపల్లి రిజర్వాయరు మీదుగా ప్రకాశం జిల్లాలోని నాగార్జునసాగర్ రెండవ దశ ప్రతిపాదిత ఆయకట్టుకు, వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయరు నల్లమలసాగర్కు నీటిని అందిస్తూ, సోమశిలకు అనుసంధానించి, సోమశిల ఆయకట్టుకు, కండలేరు ద్వారా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని తెలుగు గంగ, గాలేరు – నగరి ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. తద్వారా క్రిష్ణా జలాలపై వత్తిడి తగ్గించవచ్చు, పెన్నా నీటిని ఆదా చేసి, రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని అందించవచ్చు. ఈ మా ఆలోచనలను మీతో పంచుకుంటున్నాము. మీరు సానుకూలంగా స్పందించి, లోతుగా పరిశీలించి, సముచితమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామ”ని పన్నెండు పాయింట్లతో విడుదలైన ప్రకటనలో ప్రతినిధి సభ్యులు కోరారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.