
రెండు లక్షల మంది ఒక్కచోట గుమిగూడి, వేలమంది ఒక ఇంటి పైకప్పు ఎక్కితే, తొక్కిసలాట జరగక మరి ఇంకేం జరుగుతుంది? పెట్టుబడికి పుట్టిన ఈ దుష్టాశయ క్రీడాక్రమ రచ్చలో ప్రాణాలు పటపటా రాలిపోవా? ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ఒక టీం గెలుపు వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. దీనికి రక్షణాత్మక ఏర్పాట్లు చేయకపోవడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది సహజ మరణమా లేక కొందరి దాహానికి స్వాహా అయిన ప్రాణాలా? అనేది కీలకమైన ప్రశ్న.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా 2025లో బెంగళూరు జట్టు సాధించిన విజయాన్ని కర్ణాటకా ప్రభుత్వం రెండు లక్షలమందిని జమ చేసి సంబరాలు జరపింది. ఇది ఎవరి తృప్తి కోసం జరిగింది? ఏ పెట్టుబడిదారుల దాహాన్ని తీర్చి, ఎన్నికల నల్లధనాన్ని సేకరించేందుకు జరిగింది? ఒక టీం గెలుపును సంబరం చేసుకుంటూ ప్రాణాలు కోల్పోవడం అంటే అత్యంత దారుణమైన అంశం. ఈ ఘటనకు జవాబుదారీ ఎవరు? దీనిపై ప్రతిపక్ష జాతీయ పార్టీలు కూడా పెదవి విరుపు మాటలే మాట్లాడుతారు తప్ప చట్టపర చర్యలకు డిమాండ్ చేయలేరు. ఎందుకంటే వారి గుట్టు కూడా క్రికెట్ ఆటను తమ కనుసన్నల్లో పెట్టుకున్న పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంది.
బెంగుళూరు జట్టు గెలుపును కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, బీజేపీ పాలిత రాష్ట్రంపై సాధించిన విజయంగా చెబుతున్నారట! ఇది మరింత దారుణం. అది కేవలం ఒక ప్రైవేట్ ఈవెంట్ మాత్రమే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మొత్తం యాజమాన్యం కర్ణాటక ప్రభుత్వానిది కానీ లేదా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ది కానీ లేదా కర్ణాటక ప్రజలది కానీ కాదు.
ఆర్సీబీ టీం కోసం ఆటగాళ్లను వేలం పాటలో యాజమాన్యం కోట్లు వెచ్చించి కొనుక్కుంటుంది. వాళ్ళు ఆటగాళ్లుకారు కేవలం తమకు డబ్బులు చెల్లించి యజమాని కోసం తమ నైపుణ్యాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు మాత్రమే. వెచ్చించిన మొత్తాన్ని ప్రకటనల రూపంలో వివిధ కంపెనీల నుంచి సేకరించుకొని ఫ్రాంచైజీలు లాభాలను సొంతం చేసుకుంటాయి. వారి టీం గెలిచినా గెలవకపోయినా ఈ ప్రకటనల రూపంలో లాభాలు రావడం తథ్యం. ఇప్పుడు ఈ టైటిల్ సాధించిన తర్వాత జమయ్యే మొత్తం నగదు నుంచి ప్రభుత్వానికి, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కు కానీ ఎలాంటి వాటా ఉండదు.
ఆర్సీబీ మొత్తం టీం 25 మంది. ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే కర్ణాటకకు చెందినవారు. విచిత్రమేమంటే ఈ ఇద్దరూ ఏ రోజు కూడా మైదానంలోకి దిగిన 11 మందిలో లేరు. ఆడిన ప్రతి ఆటకు ఆటగాళ్లందరికీ లెక్కలేనంత పారితోషికం అందుతుంది. గెలిచిన అనంతరం కోట్ల రూపాయల ప్రైజ్మనీ, ఆ తర్వాత ఫ్రాంఛైజీ నుంచి తాయిలాలు, ఆ తర్వాత ఆటగాళ్ల స్వరాష్ట్రాల నుంచి విపరీతమైన నగదు ప్రోత్సహకాలు వారి అకౌంట్లలో చేరి పోతూనే ఉంటాయి. వీటిలో ఒక్క పైసా కూడా కర్ణాటక రాష్ట్రానికి లేదా కర్ణాటక క్రీడా విభాగాలకు రాదు. ఇవన్నీ తెలిసి కూడా ఆర్సీబీ గెలుపు కర్ణాటక రాష్ట్రానిదైనట్లు, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు గర్వకారణమైనట్లు, దానిని రెండు లక్షల మందితో సెలెబ్రేట్ చేసుకోవడం అంటే మూర్ఖత్వానికి పరాకాష్ట. దురదృష్టవశాత్తు అమాయక ప్రజానీకం కూడా ప్రభుత్వాల, పెట్టుబడిదారుల పన్నాగాలను అర్ధం చేసుకోకుండా బలైపోతున్నారు.
ఎంతమాత్రం ఆటగా లేని క్రికెట్.
క్రికెట్ ఒక భావోద్వేగానికి ప్రతీక కాదు. అది కేవలం ఆనందాన్ని, తాత్కాలిక ఉల్లాసాన్ని రేకెత్తించే ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అయితే క్రికెట్ ఆటను ఎంటర్టెన్మెంట్ ఈవెంట్గా మార్చి పెట్టుబడిదారులు కోట్లు దండుకుంటున్నారు. ఒక దేశానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ ప్రాతినిధ్యం వహించని జట్టులో భావోద్వేగాన్ని వెతకడం విచారకరం. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు ఆడుతున్న ఆటని మన రాష్ట్రానికి లభించిన విజయంగా భావించడమంటే అది అవివేకమే అవుతుంది.
ఐపీఎల్ నిబంధన ప్రకారం ప్రతి జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలి. దాని వల్ల విదేశీ ఆటగాళ్లకు కూడా కోట్ల రూపాయలు చేరుతున్నాయి. ఐపీఎల్ ఏర్పాటైన తర్వాత చాలా మంది వెస్టిండీస్ ఆటగాళ్లు మంచిగా రాణించి కోట్ల రూపాయలు అందుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఒకప్పుడు పులిలా గాండ్రించిన వెస్టిండీస్ క్రికెట్ టీం, ఇప్పుడు చతికిలబడి, ప్రపంచకప్కు అర్హత కూడా సాధించలేకపోతున్నది. అంటే ఈ ఐపీఎల్ ఒక దిగ్గజ టీంను, ఆ దేశంలో క్రికెట్నే లేకుండా చేసింది! ఇక మన దేశంలో క్రికెట్పై మోజు పెరిగిన తర్వాత మిగతా ఆటలన్నీ అధమస్థాయి ప్రాధాన్యతలో పడిపోయాయి. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ దేశంలో ఇతర ఆటలు ఉన్నాయన్న సంగతి కొత్త తరానికి తెలియకుండానే పోయింది.
క్రికెట్తో కాసుల వర్షం..
ఇక ఐపీఎల్ తిరగదోడిన మరో ప్రాణాంతకమైన పరిణామం క్రికెట్ బెట్టింగ్. దేశాలకు ప్రాతినిధ్యం వహించే జట్టులోని సభ్యులైన ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులే క్రికెట్ బెట్టింగ్కు పాల్పడి భంగపడ్డారు. ఎన్నోరకాల నియమ నిబంధనలు, పోలీసుల నిఘాలు ఉన్నప్పటికీ కూడా క్రికెట్ బెట్టింగ్ యథేచ్ఛగా సాగుతుంది. అనేక మంది ఈ బెట్టింగ్ ద్వారా నష్టపోయిన యువకులు తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. కుటుంబాలలో చిచ్చులు రేగుతున్నాయి. ప్రతి సీజన్లో వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది.
ఐపీఎల్ నిర్వహణను అధికారికంగా ముద్ర వేయడం ద్వారా బీసీసీఐ వేల కోట్ల రూపాయలను సొంతం చేసుకుంటుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన క్రీడాప్రాధికార సంస్థగా బీసీసీఐ అవతరించింది. ఇలాంటి బీసీసీఐ ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్నది. దానికి అధిపతిగా సాక్షాత్తు దేశ హోంమంత్రి కుమారుడికే పట్టంగట్టారు. దీన్ని బట్టి క్రీడకు, దానికి సంబంధించిన పాలనకు, రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి ఎంతటి అవినాభావ సంబంధాలున్నవో స్పష్టమవుతోంది. ఇలాంటి అవినీతి అక్రమాలు సక్రమంగా జరగాలంటే పెట్టుబడిదారుల చల్లని చూపులు కావాలి. వారి చేయి తడపడానికి ఎంతటి నైపుణ్యాన్నైనా తాకట్టు పెట్టకపోతే ఆ చల్లని చూపు కురవదు. అందుచేత బెంగుళూరు జట్టు సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో మనుషుల ప్రాణాలు పోయాయని చెప్పడాం తప్పు! రాజకీయ – పెట్టుబడిదారుల స్వార్థపూరిత ప్రయోగశాలలో ఇవన్నీ షరా మామూలే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.