
కాశ్మీర్లో విహార యాత్రకు వచ్చిన పర్యాటకులను మతం పేరు అడిగి మరీ కాల్చి చంపడం, దానికి స్పందనగా పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ మునీర్ ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తేవటంతో అప్పటికే సున్నితంగా ఉన్న కాశ్మీర్ లోయవాసుల పరిస్థితి మరింత సున్నితంగా మారింది.
ఈ మధ్యకాలంలో తొలిసారి కాశ్మీరీ ముస్లింలు శుక్రవారం ప్రార్ధనలు అయ్యాక వేలాదిగా వీధుల్లోకి వచ్చి పహల్గాం పాశవికత్వాన్ని ఖండించారు. ఈ నరహంతక ఒంటెత్తుపోకడలు కాశ్మీరియత్తో పొసగని వ్యవహారాలు. త్రివర్ణపతాకం పట్టుకుని పాకిస్తాన్ ముర్దాబాద్ అని గొంతెత్తి దిక్కులు పిక్కటిల్లేలా కాశ్మీరీలు నినాదాలు చేశారు.
ఈ నిరసనలకు శిఖరాయమానంగా శ్రీనగర్ ప్రధాన ముల్లా మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ జామా మసీదు నిలిస్తుంది. మసీదు నుంచి ఈ పాశవిక దాడులను ఖండిస్తూ నిరసనకారులు ప్రకటించారు. ఈ పరిణామాలు పహల్గాం ఘటన పట్ల కాశ్మీరీ ప్రజలు ఎంతగా అసంతృప్తికి, అసహనానికి, ఆందోళనకు గురవుతున్నారో తెలియచేస్తున్నాయి.
వైపరీత్యం జరిగిన ఐదు రోజులకే తిరిగి కాశ్మీర్ లోయలో పర్యటించేందుకు సిద్ధమైన పర్యాటకుల దేశ భక్తి, గౌరవం, అంకితభావం, లౌకిక స్పందనను మనం అభినందించక తప్పదు. కాశ్మీర్ లోయలో నివసిస్తున్న సాధారణ ముస్లింలు తమ ప్రాణాలు అడ్డుపెట్టి పర్యాటకులను కాపాడానికి చేసిన ప్రయత్నాలు కూడా విశేష మన్ననలు పొందుతున్నాయి.
పరిమళించిన మానవత్వం
ఈ దుర్ఘటన సమయంలో అక్కడున్న పర్యాటకులు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటున్నారు. ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కుని ఒక స్థానిక ముస్లిం విసిరేయటంతో తన ప్రాణాలు దక్కాయని ఒకరు చెప్తే, గాయపడిన మరొక పర్యాటకుడిని అక్కడికక్కడే భుజానికెత్తుని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి మోసేకెళ్లిన మరో ముస్లిం గురించి మరో పర్యాటకుడు చెప్పారు. అదేవిధంగా పర్యాటకులను ఉచితంగా వారివారి స్థావరాలకు చేర్చటానికి అక్కడున్న టాక్సీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, బరువులు మోసే ముఠాకూలీల సందర్భోచిత స్పందన గురించి ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇది అంతటి ప్రమాదాన్ని దగ్గర నుంచి చూసిన తర్వాత మనిషన్నవాడికి ఉండాల్సిన సహజ స్పందన.
పహల్గాం ప్రాంతంలో ఉండాల్సిన సైనిక శిబిరాలు, సైనికుల పహరా సరిగ్గా ఈ ఘటన జరుగుతున్న రోజున మాయం కావటం వెనుక కారణాలు ఏమిటో, ఆదేశాలు ఎవరివో అక్కడ డ్యూటీలో ఉన్న సైనిక సిబ్బందికి తెలియాలి. లేదా వారిని నియమించిన కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి. మరో మానవ మాత్రుడికి ఈ రహస్యం తెలిసే అవకాశం లేనేలేదు.
కుట్రపూరితమైన పాకిస్తాన్ సైన్యాధిపతి మాటలు..
దురదృష్టవశాత్తూ పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్ మాత్రం దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న హిందువుల పట్ల సహానుభూతి ప్రకటించటం వెగటుకలిగిస్తుంది. 1937లో హిందూ మహాసభ వార్షిక సమావేశాల్లో మాట్లాడుతూ భారతదేశం రెండు జాతులు కలిగిన దేశమనీ, ఒకటి హిందూ జాతి అయితే రెండోది ముస్లిం జాతి అనీ చెప్పిన విషయాలను మునీర్ మాటలు గుర్తుచేస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్ మాటలు ఎంత కుట్రపూరితమైనవో చూడండి.
పహల్గాం అనంతర పరిణామాలు కొన్ని రాష్ట్రాల్లో ముస్లింల దైనందిన జీవితాన్ని దుర్భరం చేయటం ఆందోళనకరం. కాశ్మీరీ ముస్లిం విద్యార్ధులపై దాడులు, దౌర్జన్యాలు, వెలివేతలు మొదలయ్యాయి. కొంతమంది బిజెపి నేతలు చేసిన ప్రకటనలు రాజ్యాంగం పట్ల వారు చేసిన ప్రమాణాలను బాహాటంగా ఉల్లంఘించేవిగా ఉన్నాయి. ఇటువంటి విషయాల్లో పదేపదే రాజ్యాంగ ప్రమాణాలు ఉల్లంఘిస్తున్న వారిలో ఒకరు నితీష్ రాణె. పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపేటప్పుడు కలిమా చదవమని బలవంతం చేసినందుకే దేశంలో ముస్లింలు హనుమాన్ చాలీసా చదివితేనే వారి దుకాణాల్లో హిందువులు వస్తువులు కొనాలని, లేకుంటే వెలివేయాలని పిలుపునిచ్చారు. భారతీయులు తాను వేసిన వలలో పడిపోతున్నారని గర్వంగా నవ్వుకోవడానికి జనరల్ మునీర్కు ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి?
మరోవైపు అదేరోజు శుక్రవారం ప్రార్థనలు అయ్యాక దేశవ్యాప్తంగా మసీదుల నుంచి వేలాదిమంది భారతీయుల్లో చీలికలు తెచ్చేందుకు మునీర్ విసురుతున్న పాచికలను ఛీత్కరిస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు.
ఇదంతా గమనిస్తే జనరల్ మునీర్ భారతదేశంలో మితవాద విద్వేషాలను పెంపొందించేందుకు వేసిన పాచికలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశమంతా ఏకతాటి మీద నడుస్తోందని, దేశాన్ని ప్రజల ఐక్యతను విఛ్చిన్నం చేసే కుట్రలను ధీటుగా ఐక్యంగా ఎదుర్కొంటుందని మరోసారి రుజువు చేయటానికి ఉపకరించింది.
ఈ స్పందన తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్లో తీవ్రవాదుల భరతం పట్టడానికి సిద్ధం కావటంతో పాటు మన దేశంలో మన చుట్టూ తిరుగుతున్న మతోన్మాద తీవ్రవాదుల భరతం పట్టేందుకు కూడా కంకణం కట్టుకుంటుందనీ, మతోన్మాదకావేషకావేశాలు రెచ్చగొట్టేందుకు దేశంలోనే జరుగుతున్న కుట్రలను భగ్నం చేసేందుకు కంకణధారులవుతుందనీ ఆశిద్దాం. ఈ విధంగా ఆశించేవారిని ప్రధాని నరేంద్ర మోడీ నిరాశపరుస్తారా?
బదరీ రైనా
అనువాదం: కొండూరి వీరయ్య
(రచయిత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బోధించారు. ఈ వ్యాఖ్య తొలిసారిగా ది వైర్ ఇంగ్లీషు, గెలిలియో ఐడియాస్లు సంయుక్తంగా నడుపుతున్న ప్రీమియం న్యూస్ లెటర్ ది ఇండియా కేబుల్లో ప్రచురితమైంది. ప్రీమియం న్యూస్ లెటర్ అంటే పాఠకులు చందాదారులైతేనే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.