
హైదరాబాద్: కేంద్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఛత్తీస్గడ్లో కొనసాగుతున్న ఎదురు కాల్పులకు సంబంధించి వామపక్ష పార్టీలు ప్రధాని మోడీకి లేఖ రాశాయి. ఎన్కౌంటర్ పేరుతో జరుగుతున్న హత్యలను వెంటనే ఆపాలని లేఖలో డిమాండ్ చేశాయి. కస్టడీలో ఉన్న సీనియర్ మావోయిస్టులను చట్ట ప్రకారం కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశాయి.

సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ ఎంఎ బేబీ, సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజ, సీపీఐ(ఎంఎల్)- లిబరేషన్ జనరల్ సెక్రకటరీ దీపాంకర్ భట్టాచార్య, ఆర్ఎస్పీ జనరల్ సెక్రటరీ మనోజ్ భట్టాచార్య, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ జనరల్ సెక్రటరీ జీ దేవరాజన్ సంయుక్తంగా రాసిన లేఖను విడుదల చేశారు.
“ఛత్తీస్గడ్ రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ పేరుతో చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. చట్టవిరుద్ధంగా హత్యలు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా కొనసాగుతోన్న ఈ హత్యలను వెంటనే ఆపాల్సిందిగా దేశంలోని ఐదు వామపక్ష పార్టీల తరఫున మేము లేఖను రాస్తున్నాము” అని లేఖలో తెలియజేశారు.
అంతేకాకుండా “కొందరు సీనియర్ మావోయిస్టు నాయకులు భద్రతాబలగాల కస్టడీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చట్టప్రకారం వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తున్నాము” అన్నారు.
తాము నివసించే ప్రాంతంలో సైనికీకరణ తమ సాధారణ జీవితానికి భంగం కలిగిస్తుందని ఆదివాసీలు చాలా సార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని వామపక్ష నేతలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆదివాసీల హక్కులను కాపాడే రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ వ్యూహాత్మకంగా ఉల్లంఘించబడుతోందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్గడ్లోని అడవి, అటవీ సంపద విచక్షణారహితంగా కార్పోరేట్ దోపిడికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వినాశకరమైన చర్యల వల్ల పర్యావరణ సమతౌల్యత, స్థానిక ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయని హెచ్చరించారు. ఆదివాసీలను శత్రువులుగా చూసే సైనికీకరణ విధానాన్ని ఆపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని వామపక్ష నాయకులు లేఖలో పేర్కొన్నారు.
చనిపోయిన తర్వాత కుటుంబాలకు మృతదేహాలను అందించడానికి ప్రభుత్వం నిరాకరించే చర్యలలో ఈ శత్రుత్వం కనబడుతోందని విమర్శించారు. గౌరవప్రదమైన అంతిమయాత్రను నిర్వహించుకునేందుకు వారి కుటుంబ సభ్యులకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు.
లేఖలో “చర్చలకు సంబంధించిన తమ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణించాలని మావోయిస్టులు తరచుగా అంటున్నారు. కానీ కేంద్ర- బీజేపీ నేతృత్వంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కారాన్ని కొనసాగించడానికి సిద్ధంగా లేదు. చర్చలకు భిన్నంగా అమానుషమైన, వినాశకరమైన చర్యలకు పాల్పడుతోంది” అని నిరసన వ్యక్తం చేశారు.
కేంద్రహోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలను లేఖలో గుర్తుచేశారు. కేంద్ర హోంమంత్రి, ఛత్తీస్గఢ్ సీఎం మాటలు-చర్యలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించకూడదనే వారి ఆలోచనను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. “ప్రభుత్వం మొండిగా ఉండకూడదు. రాజ్యంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య పాలన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మనుషుల ప్రాణాలను తీస్తూ సంబరాలు చేస్తున్నారు. మావోయిస్టుల ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటనకు ప్రభుత్వం స్పందించాలని భిన్నదృక్కోణాలు ఉన్నప్పటికీ చాలా మంది ఆందోళన చెందుతున్న పౌరులు, ఆయా రాజకీయ పార్టీల తరఫున కీలక నేతలు ఎప్పుడో విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా చర్చలు ద్వారా సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ విజ్ఞప్తిని మేము పునరుద్ఘాటిస్తున్నాము. చట్టవిరుద్ధ హత్యలను ఆపాల్సిందిగా కోరుతున్నాము. తక్షణమే హింసను ఆపి, నిష్పాక్షికమైన న్యాయవిచారణకు ఆదేశించాలి” అని లేఖలో వామపక్ష నేతలు కోరారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.