
న్యూఢిల్లీ: జూన్ 22 ఆదివారం తొలి ఘడియల్లో ఇరాన్కు చెందిన మూడు అణు ఇంధన పరిశోధన, అభివృద్ధి కేంద్రాలపై అమెరికా చేసిన దాడులను ఖండించటానికి భారత్ సిద్ధం కాలేదు. ప్రధాని మోదీ ఎక్స్లో పెట్టిన ఒక పోస్ట్ ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు మౌసూద్ పేజేస్కియన్తో ఫోన్లో మాట్లాడినట్లు, అమెరికా దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పరిస్థితి శ్రుతి మించకుండా చూడాలని దౌత్య మార్గాలు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించినట్లు వెల్లడించారు.
మోడీ పెట్టిన పోస్ట్ ప్రకారం ఇరాన్ అధ్యక్షుడే ప్రధాని మోదీకి కాల్ చేశారు.
వర్తమాన పరిణామాలపై ఇరువురు నేతలు కూలంకషంగా చర్చించినట్లు మోదీ ప్రస్తావించారు. పశ్చిమాసియా ప్రాంతంలో భద్రత, శాంతి సుస్థిరతలు నెలకొల్పడానికి సత్వర కృషి జరగాలని ఆశిస్తున్నట్టు తెలిపామని మోదీ తన ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు.
ఇరాన్ అణు ఇంధన పరిశోధన పరిజ్ఞాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా జరిపిన భారీ విధ్వంసక దాడుల తర్వాత భారతదేశం స్పందించటం ఇదే తొలిసారి. అమెరికా దాడుల ప్రకటిత లక్ష్యమే ఇరాన్ అభివృద్ధి చేసుకుంటున్న అణు ఇంధన పరిశోధన పరిజ్ఞానాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేయటం. అమెరికా మీడియాలో వెలువడిన కథనాల ప్రకారం ఫార్దో, నతాంజ్ అణు ఇంధన పరిశోధన పరిజ్ఞాన కేంద్రాలపై బంకర్లను పేల్చివేసే బాంబులు ప్రయోగించగా, జలాంతర్గముల నుంచి ప్రయోగించిన ఖండాంతర క్షిపణులు నతాంజ్, ఇస్ఫహాన్ కేంద్రాలను ధ్వంసం చేశాయి.
రెండు నెలల క్రితం పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి సందర్భంగా ప్రధానమంత్రి మోదీతో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షులు ఉగ్రవాద చర్యలను బేషరతుగా ఖండించారు.
భారత విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రకటన మేరకు తాజాగా ఇరాన్పై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశాధ్యక్షులే భారత ప్రధానికి ఫోన్ చేశారు. మరోవైపున ఇరాన్ అధ్యక్ష కార్యాలయం జారీ చేసిన ప్రకటన మేరకు ఈజిప్ట్, పాకిస్తాన్, ఫ్రాన్స్, భారత్లతో సహా పలు దేశాల అధినేతలతో ఇరాన్ అధ్యక్షులు సంప్రదింపులు జరుపుతున్నారు.
మోదీ జారీ చేసిన ప్రకటన మేరకు పశ్చిమాసియాలో తాజాగా పెచ్చరిల్లుతున్న ఉద్రిక్తతలపట్ల భారతదేశం ఆందోళన చెందుతోంది. అంటే అమెరికా దుందుడుకు చర్యలను ఖండించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నది స్పష్టం అవుతుంది. ఇరాన్పై జరుగుతున్న దాడుల గురించి గానీ ఇజ్రాయిల్పై జరుగుతున్న దాడుల గురించి గానీ పశ్చిమ ఆసియాలో తాజా ఉద్రిక్తతలకు ఎవరు కారణమనే విషయం గురించి గానీ, ఎవరు బాధ్యులు అనే విషయం గురించి గానీ మోదీ ప్రకటనలో స్పష్టత లేదు. కేవలం ప్రస్తుత పరిస్థితి, పెరుగుతున్న ఉద్రిక్తతలు అన్న పదాలను మాత్రమే ప్రస్తావించారు.
ఇరాన్ అభివృద్ధి చేసుకుంటున్న అణు ఇంధన పరిజ్ఞాన పరిశోధనా కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించడానికి ముందే ఇరాన్ యూరోపియన్ యూనియన్లోని పలు దేశాలతో సంప్రదింపుల్లో ఉన్నామని స్పష్టం చేస్తున్నప్పటికీ తాజా ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ ప్రభుత్వం సూచించింది. అమెరికా దాడికి సరిగ్గా ఒకరోజు ముందు యూరోపియన్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్న విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి వెల్లడించారు.
ఇరాన్ అధ్యక్ష భవనం ఫార్సీ భాషలో వెల్లడించిన ప్రకటనలో కూడా ఈ విషయాలను ప్రస్తావించారు. అమెరికా దాడికి సిద్ధమవుతున్న తరుణంలో సైతం ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు అమెరికా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారన్న విషయాన్ని కూడా అధ్యక్ష కార్యాలయం గుర్తు చేసింది. తాజా పరిణామాలు పరిశీలిస్తే చర్చల ద్వారా సంప్రదింపులు అన్న సూత్రానికి అమెరికా ఇచ్చే విలువ ఏ పార్టీలో తేటతెల్లమవుతుందని ఇరాన్ అధ్యక్షుడు ఆ ప్రకటనలో ఆవేదన చెందారు.
“ప్రస్తుతం ప్రపంచం ముందుకు వస్తున్న ధోరణులు ఆందోళనకరం మాత్రమే కాదు అంగీకరించలేనివి కూడా. అంతర్జాతీయ సంస్థల మార్గదర్శకాలు ప్రత్యేకించి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో పనిచేస్తున్న ఒక దేశంపై యూదఉన్మాద దేశంతో అమెరికా జతక కలిసి బరితెగించి బాహాటంగా దాడికి దిగింది. శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ విధి విధానాలకు తలొగ్గి వ్యవహరించటం వంటి వాటి గురించి ఆయా దేశాలు చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లు మాత్రమేనని, ప్రజాభిప్రాయాన్ని మళ్ళించడానికి మాత్రమేనని ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయి” అని అధ్యక్ష భవనం ప్రకటన స్పష్టం చేసింది.
అమెరికాతో పాటు కొన్ని ఐరోపా దేశాలు కూడా ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను సమర్థించాయని ఇరాన్ అధ్యక్షుడు బహిరంగంగానే ఆరోపించారు. దాడులు మొదలైనాక జూన్ 13న భారత ప్రధాని మోడీతో ఫోన్లో సంభాషించిన ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితిలో నెలకొల్పాలన్న భారతదేశపు ఆందోళనతో ఏకీభవిస్తున్నట్టు నెతన్యాహు తెలిపారు.
ఇరాన్ అణ్వాయుధాలు తయారీ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్న అమెరికా- ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ అధ్యక్షుడు చారిత్రక అసత్యంగా అభివర్ణించారు.
“ధార్మిక నేత జారీ చేసిన ఫత్వా ఆదేశాల ప్రకారం అణ్వాయుధాలు తయారీ మతపరంగానూ, నైతికంగాను నిషేధించబడిన చర్యలు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనుసరించే రక్షణ వ్యూహంలో అణ్వస్త్రాలకు తావు లేదు. ప్రపంచ వేదికలమీద ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలన్నీ ఫక్తు అబద్ధాలు” అని అధ్యక్ష భవనం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇరాన్కు ఉన్న చట్టబద్ధ హక్కులు అనుభవించకుండా అడ్డుపడే ప్రయత్నాలను ఇరాన్ ఎన్నటికీ అంగీకరించదని అధ్యక్షుడు హెచ్చరించారు. “మా దేశాన్ని మా దేశ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు మాకుంది” అన్నారు.
ఈ పరిణామాలపై ఇరాన్ ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా శనివారం నాడు ఇస్తాంబుల్లో మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గి “అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి” అని సమాధానం ఇచ్చారు. చర్చలు-సంప్రదింపులకు తలుపులు ఎల్లపుడూ తెరిచే ఉంచాలి. అయితే ఇరాన్ ఎదుర్కొంటున్నది అసాధారణ పరిస్థితి. దాడులు, దురాక్రమణన ముప్పును మా దేశం ఎదుర్కొంటోంది. ఆత్మ రక్షణ కోసం మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి” అన్నారు.
భారత విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం ఇరాన్లో చిక్కుల్లో ఉన్న భారతీయులను క్షేమంగా తరలించేందుకు ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు ఉమ్మడి ప్రయోజనాలకోసం కట్టుబడి ఉంటాయని, వాణిజ్యం, శాస్త్ర విజ్ఞానం, సాకెంతిక పరిజ్ఞానం, పౌర సంబంధాల విషయాల్లో పరస్పర సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు ఈ ప్రకటన తెలిపింది.
జూన్ 13న ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యే నాటికి ఇరాన్లో దాదాపు పదివేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇందులో విద్యార్థులు, వ్యాపారులు, నావికులు, వృత్తి నిపుణులు వంటివారున్నారు. దాడులు మొదలయ్యాక ఇప్పటివరకు 1428 మంది ఇరాన్ను వదిలి భారతీయులు స్వదేశం చేరుకున్నారు. ఇరాన్ గగనతలం మూసివేయటంతో ఆ దేశానికి ఉత్తర భాగంలో ఉన్న మాషాద్ పట్టణం నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులకు తరలించారు. మరికొంత మంది కాలిబాటన ఆర్మేనియా, తుర్కిమెనిస్తాన్లకు చేరుకొని అక్కడ నుంచి విమానాల్లో భారత్ చేరారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.