
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో రమేష్(పేరు మార్చాం) అనే విద్యార్థి ఓ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో చివరి సంవత్సరం పరీక్షలు రాసి సొంతూరు వెళ్ళటానికి బ్యాగులు సర్దుకుంటున్నాడు. ఆ సమయంలో తన కళాశాల యాజమాన్యం నుంచి ఆ విద్యార్థికి ఫోన్ వచ్చింది. అయితే, ఎవరో ఒక అగంతకుడు ఆ కళాశాలలో బోధిస్తున్న ఓ అధ్యాపకురాలికి అశ్లీల మెసేజ్లు పంపిస్తున్నాడు. ఆ అధ్యాపకురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాయ్పూర్ సైబర్ క్రైం పోలీసు విభాగం దర్యాప్తు చేశారు. దర్యాప్తులో అశ్లీల మెసేజ్లు పంపటానికి ఉపయోగించిన మొబైల్ సిం కార్డు ఈ విద్యార్థి ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉన్నట్లు తెలిసింది. దాంతో కళాశాల యాజమాన్యం, పోలీసులు ఆ విద్యార్థిని పిలిచి కాస్తంత తీవ్ర స్థాయిలోనే ఇంటరాగేట్ చేశారు. పిలిచినప్పుడు పోలీసు స్టేషన్కు వచ్చి హాజరు కావాలని షరతు విధించారు.
మరో ఘటన మరింత ఆసక్తికరమైనది. ఈ వార్త రాస్తున్న విలేఖరికి గత రెండు సంవత్సరాలుగా లండన్ హీత్రు విమానాశ్రయం ఆఫీస్ పేరుతోనో, దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతోనో, ఫెడెక్స్ కొరియర్ లండన్ కేంద్రం పేరుతోనో ఫోన్లు వచ్చేవి. అన్ని ఫోన్ పిలుపుల సారాంశం ఒక్కటే. ఈ విలేకరి పంపిన కొరియర్ విమానాశ్రయంలో పడివుందని, దాని గురించి వివరాలు తీలుసుకోవడానికి కాల్ చేస్తున్నామన్నది ఆ సారాంశం. మరికొన్ని సార్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ కేంద్రం నుంచి కూడా ఫోన్ వచ్చింది. “ఫలానా ఇన్స్పెక్టర్ను మాట్లాడుతున్నాను, మీరు అర్జంట్గా ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న కస్టమ్స్ ఆఫీసుకు రావాలి. మీ పేరుతో ఉన్న కొరియర్ ప్యాకెట్లో మాదకద్రవ్యాలు దొరికాయి. మీరు రాకపోతే అరెస్టు చేసుకుని తీసుకురావాల్సి ఉంటుంది” అని అన్నారు.
ఇలాంటి అనుభవాలు పాఠకుల్లో కూడా చాలా మందికి ఎదురై ఉంటాయి. గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఇలాంటి కాల్స్ వచ్చిన ముందు కానీ, తర్వాత కానీ టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక మెసేజ్ వస్తుంది. “రకరకాల పేర్లతో మిమ్మలను మోసం చేయటానికి డిజిటల్ రంగంలో అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఫోన్లకు స్పందించవద్దు. అంతర్జాతీయ కోడ్ నంబర్లతోనో మరో రకమైన ముసుగులోనో వచ్చే నంబర్లకు స్పందించవద్దు” అని ఆ కాల్ లేదా మేసేజ్ సారాంశంగా ఉంటుంది.
అలాని మనం రకరకాల కాల్ సెంటర్ల నుంచి వచ్చే ఫోన్లకు స్పందించకుండా ఉందామా అంటే అదీ కుదరదు. ఉదాహరణకు ఏదైనా బ్యాంక్ ద్వారా ఆన్లైన్ ఖాతా నుంచి గణనీయమైన మొత్తాన్ని మనమే మనకు తెలిసిన వాళ్లకు పంపితే, వెంటనే అలా పంపించినది మీరా కాదాని ధ్రువీకరించుకోవడానికి బ్యాంకులకు సంబంధించిన కాల్ సెంటర్ల నుంచి ఫోన్లు వస్తాయి. అవి కొత్త నంబర్లు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ వారి మాటలు నమ్మి మనం ఆ కాల్స్కు స్పందించకపోతే మనం చేసిన బ్యాంకు లావాదేవీలు వివాదస్పదంగా మారుతాయి. లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడతాయి. ఇకపోతే అలాంటి కాల్స్కు స్పందించడం మొదలు పెట్టామా, ఈ ఆన్లైన్ స్పామ్ ట్రోలింగ్కు భరించక తప్పదు.
ఇలా ఎందుకు జరుగుతుంది?
దీనికి సమాధానాలు తెలుసుకోవాలంటే కాస్తంత రోజు వారీ జీవితంలో మనం చేసే పనులు, మనం అలా చేయాల్సిన పరిస్థితులను కల్పించిన ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవాలి.
మనకు రోజువారీ వ్యవహారాల్లో ఎదురయ్యే కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. విమాన ప్రయాణం చేయాలంటే టిక్కెట్టు కొనేటపుడు ఆధార్ కార్డు ఇవ్వాలి. ఏదైనా ప్రభుత్వ శాఖలో పని కోసం వెళ్తే ఆధార్ కార్డు ఇవ్వాలి. కోర్టులో కేసు వేయాలంటే కక్షిదారులు తమ ఆధార్ కార్డులు కూడా జత చేయాలి. ఫోన్ కొనాలన్నా, ఆన్లైన్లో బిల్లు కట్టే పద్ధతిలో చేరాలన్నా, సిం కార్డు కొనాలన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డును జత చెయ్యాలి.
దేశంలో జరిగే ప్రతి పనికీ ఆధార్ కార్డు అనుసంధానం చేయాలన్న షరతును కేంద్ర ప్రభుత్వం విధించింది. అలాంటి పనికి ఆధార్ కార్డు వివరాలు అవసరమా లేదా అన్నదాంతో పని లేదు. కానీ చివరకు చచ్చిన మనిషి శవాన్ని కాల్చాలన్నా ఆధార్ కార్డుతోనే వైకుంఠ సేవలు బుక్ చేసుకోవాల్సి వస్తోంది. తాజా ఎన్నికల్లో ఉపయోగించే ఓటర్ గుర్తింపు కార్డును కూడా ఆధార్ కార్డుతో జత చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా రైల్వే టికెట్ల బుకింగ్కు కూడా ఆధార్ కార్డు అవసరం తప్పనిసరి చేయనున్నారు.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ధన్ యోజన పథకంలో భాగంగా ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ అనుసంధానం జరిగిపోయింది.
అవసరం లేకున్నా అనివార్యంగా వివరాల సేకరణ..
ఈ విధంగా అవసరం ఉన్నా లేకున్నా ఆధార్ కార్డు, మొబైల్ నంబర్లతో మనిషి జీవితం అనుసంధానించబడి ఉండటం, ప్రస్తుతం కోట్లాది సంఖ్యలో ప్రజల చేతుల్లో ఇంటర్నెట్ సౌలభ్యం ఉండటంతో కోట్ల మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, బంధు మిత్రులు, కుటుంబ సభ్యులతో ఉన్న సందర్భాలు, సెల్ఫీల రూపంలో తీసుకుని ఆండ్రాయిడ్ ఫోన్లలో భద్ర పర్చుకున్న ఫోటోలు, ఆండ్రాయిడ్ ఫోన్లు పట్టుకుని మనం తిరిగిన ప్రాంతాలు, ఫేస్బుక్లో మన చర్చలు, మిత్రులు, మనం చూసే వీడియోలు, వాటి స్వభావం వంటి అత్యంత సున్నితమైన వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వివరాలు అన్నీ రవీ, కవీ కాంచని చోటైన డిజిటల్ స్పేస్ వరకు చేరుతున్నాయి.
ఈ వివరాలు అన్నీ భద్రంగా ఉంచాలని పదేపదే రోజుకు పది సార్లు ఫోన్లో మెసేజ్లు పంపే ప్రభుత్వాలు మాత్రం, కోటానుకోట్ల మంది ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా భద్రం చేయటం, దుర్వినియోగం కాకుండా చూడటంలో దారుణంగా విఫలమవుతున్నాయి.
ఉదాహరణకు మన బ్యాంకు ఖాతాలు- ఆధార్ నంబర్లు, ప్రపంచాన్ని పిడికిట్లో బంధించండనే రిలయన్స్ కంపెనీ నినాదంతో, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్న ఐడియా సెల్యులార్ సిం కార్డులతో, నిను వీడని నీడను నేనే అన్నట్టు కుక్కలా మన వెంట ఉండే హచ్ కంపెనీ సిం కార్డుల ద్వారా చేతుల్లోని ఆండ్రాయిడ్ ఫోన్లకు వచ్చి వాలాయి. దాంతో ఎవరి ఖాతాలో ఎక్కువ డబ్బులు ఉన్నాయని పసిగడుతున్న హ్యాకర్లు వాళ్లకు రకరకాల రూపాల్లో ఫోన్లు చేసి వాళ్లను కాల్లో నిలువరించి ఆ సమయంలో బ్యాంక్ ఖాతాల్లో ఉన్న సొమ్ము దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండంచెల, మూడంచెల పాస్వర్డ్లు వన్ టైమ్ వెరిఫికేషన్ పాస్వర్డ్లు ఎన్ని ఉన్నా, వినియోగదారుల వ్యక్తిగత గోప్యత హ్యాకర్ల చేతి వాటానికి బలి కాకుండా ఆపలేక పోతున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు అంతర్జాతీయ హ్యాకర్ల బారిన పడిందన్న వార్త మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది.
అతి పెద్ద డిజిటల్ చోరీ..
ప్రపంచ ఇంటర్నెట్ చరిత్రలో అతిపెద్ద డిజిటల్ చోరీ నమోదు అయినట్లు ఫోర్బ్స్ పత్రిక కథనం వెల్లడించింది. కీపర్ సెక్యూరిటీ నివేదికను ప్రస్తావిస్తూ ఫోర్బ్స్ 160 కోట్ల మందికి సంబంధించిన డిజిటల్ సెక్యూరిటీ వివరాలు- పాస్వర్డ్లు, లాగిన్ వివరాలు, పిన్ నంబర్లు, వన్ టైమ్ పాస్వర్డ్లు వంటి వివరాలు చోరీ అయ్యాయని ఈ పత్రిక కథనం వెల్లడించింది. యాపిల్, ఫేస్బుక్, గూగుల్, గిట్ హబ్, టెలిగ్రాం వంటి డిజిటల్ అప్లికేషన్స్తో పాటు వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఖాతాదారులు, వినియోగ దారుల వివరాలు చోరీ అయ్యాయి.
వివిధ డిజిటల్ సెక్యూరిటీ రంగ నిపుణులు, పరిశోధకులు చేపట్టిన పరిశోధన ప్రకారం కోటి నుంచి మూడున్నర కోట్ల మందికి చెందిన 30 డేటా సెట్లు చోరీకి గురి అయినవాటిలో ఉన్నాయని తేలింది.
ఈ విధంగా చోరీ అయిన వివరాలు ఏ రూపంలో దుర్వినియోగం అవుతాయన్న విషయంలో ఎవరూ భరోసా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. హ్యాకర్ల బారిన పడిన ఈ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయాలు, వివరాలు సాధారణంగా బిగ్ డేటా అనలిటిక్స్ రంగంలో పని చేసే వారికి, వారి పరిశోధనలకు ముడి సరుకుగా ఉపయోగపడతాయి. ఇలా సేకరించిన డాటా ఆధారంగానే 2014లో మోడీ, 2016లో ట్రంప్ వంటి రాజకీయ నాయకులు ఓటర్లను ప్రభావితం చేసే వ్యూహాలు రూపొందించుకోవడానికి వాడుకున్నారు.
మరో కోణంలో ఈ విధంగా గుత్తగా(గుట్టగా) సేకరించిన కోటానుకోట్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాల ఆధారంగానే అంతర్జాతీయంగా సరుకులు అమ్ముకునే కంపెనీలు- మొబైల్ కంపెనీలు, ఐకీయా వంటి ఫర్నిచర్ దుకాణాలు, ఇతర వినియోగ సరుకులు ఉత్పత్తి చేసే కంపెనీలు తమతమ సరుకులు అమ్ముకోవడానికి వినియోగదారుల అభిరుచుల గురించిన విశ్లేషణలు చేస్తాయి. అటువంటి అధ్యయనాల ఆధారంగా కష్టమైజ్ చేసిన మెసేజ్లు పంపుతూ ఉంటాయి.
అంతటితో ఆగితే ఓ మేరకు హమ్మయ్య అనుకోవచ్చు. కానీ ఇలా హ్యాకర్ల ద్వారా గుట్టలు గుట్టలుగా సేకరించిన ఫోన్ నంబరులు, ఈమెయిల్ వివరాలుకు స్పామ్( ఎందుకూ పనికిరాని) మేసేజ్లను ఏదో ముఖ్యమైన మెసేజులుగా పంపి వాటిని తెరవడానికి ప్రయత్నం చేసిన వెంటనే మన కంప్యూటర్లు మొబైల్ ఫోన్లకు వైరస్ను జత చేస్తాయి. ఆ తర్వాత మన చేతుల్లో ఇళ్ళల్లో ఉన్న ఇంటర్నెట్ ఆధారిత సాధనాల మీద మన నియంత్రణ లేకుండా పోతుంది. కార్పొరేట్ వైరుధ్యంలో హాగంగా పోటీ కంపెనీలు తమతమ కార్యాలయాల్లో ఉపయోగించే కంప్యూటర్లు, వర్క్ ఫ్రం హోం స్కీంలో భాగంగా గ్రామాల వద్ద పనిచేసే సిబ్బందికి ఇచ్చిన కంప్యూటర్లను పనిరాకుండా చేయగలవు. ఈ మధ్యనే అమెరికాకు చెందిన ఓ కంపెనీ డాటా బేస్ మీద హ్యాకర్లు దాడి చేశారు. దీంతో అంతర్జాతీయంగా సేవలు అందించే ఆ కంపెనీ దాదాపు రెండువారాలకు పైగా తమ కస్టమర్లకు సేవలు అందించలేక పోయింది.
వారం రోజుల క్రితం ఇరాన్పై దాడులు మొదలు పెట్టిన ఇజ్రాయెల్ తన దాడులను కేవలం సాయుధ సైనిక చర్యలకు మాత్రమే పరిమితం చేయలేదు. ఇరాన్ వద్ద భద్రపరచిన కోట్ల విలువైన డిజిటల్ కరెన్సీ(క్రిప్టో కరెన్సీ)ని కూడా దొంగిలించిందని స్వయంగా ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు పౌరుల వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి, అంతర్జాతీయంగా జరుగుతున్న అంతర్జాల చోరీలను నిలువరించడానికి, పెరుగుతున్న సైబర్ నేరాలను కట్టడి చేయటానికి సమగ్ర రక్షణ వ్యవస్థలు రూపొందించాల్సిన విషయాన్ని తాజా 140 కోట్లమందికి సంబంధించిన వివరాలు చోరీ అయిన ఉదంతం ముందుకు తెస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.