
(ఈ వ్యాసాన్ని అనువదిస్తున్న సమయంలోనే రెండు నాటకీయ పరిణామాలు జరిగాయి. ఇరాన్ తన అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా సోమవారంనాడు ఖతార్లో అమెరికా ప్రాంతీయ సైనిక కేంద్రంగావున్న అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఆ తరువాత ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ – ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత, మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఇజ్రాయెల్తో కాల్పుల విరమణను ప్రకటించింది. – అనువాదకుడు)
డొనాల్డ్ ట్రంప్ బుధవారంనాడు ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిలో భాగస్వామి అవటం గురించి మాట్లాడుతూ,”నేను చేయవచ్చేమో” లేదా “నేను చేయకపోవచ్చు.. నేను ఏమి చేయబోతున్నానో ఎవరికీ తెలియదు” అని అన్నారు. మరుసటి రోజు వైట్ హౌస్ అధికార ప్రతినిధి అమెరికా అధ్యక్షుడు రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. కానీ చివరికి, దాడి చేయాలనే నిర్ణయం శనివారంనాడు కేవలం మూడు రోజుల్లోనే వచ్చింది. ఈ కాలక్రమం, ఇందుకు సంబంధించిన ప్రకటనలు బహుశా మోసపూరిత ప్రణాళికలో భాగమనిపిస్తుంది.
నిజానికి ఇరాన్పై యుద్ధం ఎల్లప్పుడూ ఇజ్రాయెల్- అమెరిక ఉమ్మడి కార్యక్రమంగా ఉంటుందని నమ్మడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇరానియన్ క్షిపణుల నుంచి ఇజ్రాయెల్ను రక్షించడానికి అమెరికా క్షిపణి నిరోధక వ్యవస్థలను ప్రారంభం నుంచి ఉపయోగించారు. అమెరికన్ నిఘా వ్యవస్థ ఇరాన్పై దాడులను సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరించింది. ఇప్పుడు అమెరికా విమానాలు ఇజ్రాయెల్ ప్రారంభించిన పనిని “పూర్తి” చేయడానికి ఇరాన్ అణు స్థావరాలపై బాంబు దాడి చేశాయి.
సమస్య ఏమిటంటే “పనిని పూర్తి చేయడం” అనేది చాలా మంది ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టే ప్రక్రియ కావచ్చు. నిజానికి అమెరికన్ దాడి ఇరాన్ అణువ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని విడిచిపెట్టటానికి దారితీయవచ్చు. తద్వారా ఇరాన్ తన అణు సామర్థ్యంపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణ లేకుండా చేసుకునే అవకాశం ఉంది.
గత కొన్ని సంవత్సరాలుగా అణుశక్తి సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం ఇరాన్ అత్యంత సురక్షితమైన ప్రదేశాలను నిర్మించింది. ఇందులో భాగంగా తన అణు సామర్థ్యాన్ని వికేంద్రీకరించింది. 60% వరకు శుద్ది చేయబడిన 400 కిలోల యురేనియంను ఆ దేశం ఇప్పటివరకు కలిగివున్న రక్షిత పదార్థం. ఈ పదార్ధాన్ని డజనుకు పైగా చిన్నచిన్న యురేనియం శుద్ధి చేయగల నిర్మాణాలలో ఉంచటం ఏమంత కష్టమైన పని కాదు.
దీనిని ఎదుర్కోవడానికి ఇరాన్ పైన దండయాత్ర చేయాలి. అందుకోసం అమెరికన్లు సిద్దంగా లేరు. లేదా సదరు రహస్య ప్రదేశాలపై బాంబు దాడులు అవసరమవుతాయి. అది చివరికి ఇరాన్ అణ్వస్త్రాన్ని తయారు చేయడానికి దారితీయవచ్చు. అటువంటి స్థితి ఊహాతీత పరిణామాలకు దారితీయవచ్చు.
మరోవైపు, ఇరాన్ మళ్ళీ విషపు గుళికను మింగాలని నిర్ణయించుకుని శాంతిని కోరవచ్చు. దానితో ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికన్ యుద్ధం ముగియవచ్చు. అయితే మరింత లోతైన నష్టం జరగవచ్చు. ఇరానియన్లు తమపై దాడి చేసిన దేశాలను విశ్వసించరు.ప్రతిగా, ఇజ్రాయెల్ ఎక్కువగా చెక్కుచెదరకుండా ఉన్న దేశాన్ని విశ్వసించదు. ఇజ్రాయెల్ కోరుకునే శాంతికి ఇరాన్ను శాశ్వతంగా నిర్వీర్యం చేయడం అవసరం. ఇరానియన్ ప్రజలు దాని కోసం సిద్ధంగా ఉన్నారా లేదా అనేది వేరే విషయం. వాస్తవానికి, అమెరికా- ఇజ్రాయెల్లు ఆ పరిస్థితిని ఏర్పడేలా చేయగలరా అనేది కూడా ప్రశ్నార్థకం.
తిరిగి చూసుకుంటే, టెహ్రాన్ యురేనియంను శుద్ధి చేసే హక్కును పూర్తిగా వదులుకోవాలనే గరిష్ట అమెరికన్ వైఖరిని ఇరాన్ అంగీకరించడానికి సిద్ధంగా లేదని స్పష్టమైన క్షణం నుంచి ఇజ్రాయెల్-అమెరికన్ ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఇంతకుముందు, ఇరాన్ యురేనియంను 3.67% వరకు మాత్రమే శుద్ది చేయడానికి అంగీకరించడంతో రాజీ సాధ్యమైందని అనిపించింది. ఇది పి5+1(P5+1 అంటే ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, ఇంగ్లాండ్తో పాటు జర్మనీ)తో 2015లో జరిగిన జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒప్పందం నిర్దేశించిన పరిమితి. 2018లో ట్రంప్ జేసీపీఓఏ నుంచి వైదొలిగే వరకు ఇరాన్ దానికి కట్టుబడి ఉండేది.
ఒకవైపు అమెరికా ఇరాన్తో యుద్ధం చేయాలని నిర్ణయించుకుని కూడా ఇరానియన్లతో చర్చలు కొనసాగిస్తామనే కపట నాటకాన్ని కొనసాగించింది. మే నెలాఖరులో, ఇరాన్ వెలుపల యురేనియంను శుద్ది చేసే ప్రాంతీయ కన్సార్టియంను సృష్టించే ప్రతిపాదనను వారు ఇరాన్కు ఇచ్చారు. ఈ ప్రతిపాదనకు టెహ్రాన్ అంగీకరించలేదు. కానీ జూన్ 13న అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవెన్ విట్కాఫ్తో అణు చర్చలలో ప్రధాన సంధానకర్త అయిన అలీ షంఖానీని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నదనే వాస్తవం అమెరికా నిజస్వరూపానికి సూచికగా ఉంది. అయినప్పటికీ, ఈ కుట్ర కొనసాగింది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత కూడా స్టీవెన్ విట్కాఫ్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో అనేక రౌండ్ల ఫోన్ సంభాషణలు జరిపారు.
ఇజ్రాయెల్ తన బాంబు దాడుల పరంపరను విరమించుకుంటే తాము తిరిగి చర్చలకు వస్తామని ఇరానియన్లు అమెరికాకు చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్, యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు శుక్రవారం జెనీవాలో ఇరాన్ విదేశాంగ మంత్రిని కలిసి వివాదం మరింత పెరగకుండా నిరోధించారు. ఇరాన్ దౌత్యపరమైన పరిష్కారాలను పరిగణనలోకి తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసింది. కానీ ఇరాన్ అమెరికాతో సంబంధాలు పెట్టుకోవాలని యూరోపియన్లు ఇరాన్కు సలహా ఇచ్చారు. అంటే ఈ విషయంలో యూరోపియన్లు చేయగలిగింది ఏమీలేదు.
ప్రస్తుతం, ఇరాన్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకోకపోతే అమెరికా శనివారం అణు సౌకర్యాలపై బాంబు దాడికి మించి ముందుకు సాగదని ఇరాన్కు తెలియజేయటం జరిగిందని అమెరికన్లు చెబుతున్నారు. వారు అలా చేయకపోతే, అమెరికా వెనక్కి తగ్గుతుంది. మరో మాటలో చెప్పాలంటే “ప్రభుత్వాన్ని మార్చాలనే ప్రయత్నం జరగదు”.
అమెరికా చర్యలు ఇరాన్ను నిర్వీర్యం చేయాలనే దీర్ఘకాలిక వ్యూహంలో భాగం. సాంప్రదాయకంగా, పరిణామాల భయాన్ని ప్రత్యర్థిలో కలిగించడం ద్వారా నిరోధించడం లేదా ప్రత్యర్థిని నిరుత్సాహపరచడం అనేది సైనిక వ్యూహంగా ఉంటుంది. కానీ అమెరికా కోరుతున్నది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మిత్రరాజ్యాలు జర్మనీకి వ్యతిరేకంగా కోరినట్టుగా, ఆ తరువాత జర్మనీలో జరిగినటువంటి మధ్యస్థ కాల పరిణామాలు ఇరాన్లో జరగవచ్చు.
ఇజ్రాయెల్-అమెరికన్ సైనిక ప్రాబల్య ప్రదర్శన అంతిమ పరిణామాలు మధ్యప్రాచ్యంపై వారికి పూర్తి సైనిక నియంత్రణను అందించడంగా ఉంటుంది. దీనితో ఇజ్రాయెల్ మరింత సురక్షితంగా ఉంటుందనే భావన తప్పుడు భద్రతా భావాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తుందటంలో సందేహంలేదు. గత రెండు వారాలుగా జరిగిన సంఘటనలకు దూరంగావున్న రష్యా, చైనాలు ఈ దశలో అమెరికా ప్రాంతీయ ప్రాధాన్యతను దెబ్బతీసేందుకు ప్రతిస్పందించాల్సి ఉంటుందని భావించవచ్చు.
ప్రపంచంపై దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అన్నింటికంటే, రెండు అణ్వాయుధ దేశాలు అణ్వాయుధాలు లేని దేశంపై బాంబు దాడులు చేశాయి. అది కూడా దాడి చేయకుండానే. భద్రతకు నిజమైన హామీగా అణ్వాయుధాలను తయారు చేసుకోవడానికి మరిన్ని దేశాలు అవకాశాల కోసం చూస్తాయి. ఇజ్రాయెల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’, అమెరికా ‘‘మిడ్నైట్ హామర్’’కు ముందే ట్రంప్ విధానాలు ప్రస్తుతం అమెరికన్ అణ్వాయుధ గొడుగు కింద నివసిస్తున్న మిత్రదేశాలను భయపెట్టాయి. దశాబ్దం క్రితం ఇటువంటి ప్రశ్నలను ఎవ్వరూ ఊహించలేదు.
జరిగిన దానికి, దాని పరిణామాలకు పూర్తి బాధ్యత వహించవలసిన వ్యక్తి, డోనాల్డ్ ట్రంప్. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే విషయంపై ప్రపంచ సమాజం ఐక్యంగా ఉంది. అదే 2015 జేసీపీఓఏకి ఆధారం. ట్రంప్ ఆ పత్రాన్ని చింపిపడేసి, ఇరాన్పై “గరిష్ట ఒత్తిడి” విధానాన్ని ప్రారంభించటమే కాకుండా దాని కీలక జనరల్ ఖాసిం సోలైమానిని హత్య చేశారు. అనేక అణ్వాయుధాలను తయారు చేయడానికి తగినంత శుద్ది చేసిన యురేనియంను సేకరించే స్థాయికి ఇరాన్ ముందుకు సాగడానికి మరో దశాబ్దం సమయం ఉంది.
జేసీపీఓఏని పునరుద్ధరించడానికి ఉద్దేశింపబడిన చర్చలు విఫలం అవటానికి ట్రంప్ కూడా బాధ్యత వహించాలి. ప్రారంభంలో ఆయన “ఆయుధీకరణ వద్దు” అని స్పష్టంగా చెప్పారు. కానీ చర్చల మధ్యలో ఇజ్రాయెల్ ఒత్తిడి కారణంగా ఆయన “శుద్ధి వద్దు” అని మాట మార్చారు.
అమెరికా-ఇరాన్ అణు ఒప్పందాన్ని నిరోధించడానికి ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసిందని నమ్మడానికి కారణాలు ఉన్నాయి. శనివారం సాయంత్రం అమెరికన్ దాడులను ప్రకటించిన నెతన్యాహుకు ట్రంప్ చెప్పిన కృతజ్ఞతలు, అభినందనలు అసలు కథను చెప్పకనే చెబుతున్నాయి.
ప్రస్తుతానికి సంబంధించి, భవిష్యత్తు మనలని ఎక్కడికి నడిపిస్తుందో చెప్పలేము. దాని చరిత్ర దృష్ట్యా, ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడంపై ఆసక్తి లేదని అమెరికా మాటను అంగీకరించడం కష్టం. ఆ దిశగా చేసే ప్రయత్నాలు ఇరాన్లో అంతర్యుద్ధం, అరాచకత్వానికి దారితీయవచ్చు. దాని పర్యవసానాలు పొరుగు దేశాలపై తీవ్రంగా ఉంటాయి. మరోవైపు, ఇదే పాలన మనుగడ సాగిస్తే, అది నిర్ణయాత్మకంగా బలహీనుల ఆయుధమైన ఉగ్రవాదంగా మారవచ్చు.
ప్రపంచీకరణతో వాణిజ్యం, ప్రతిభ, ఆవిష్కరణలు దేశాలను క్రమంగా సుసంపన్నం చేసే ప్రపంచ క్రమానికి దారితీస్తుందని మనం ఒకప్పుడు ఆశించిన చోట, ఇప్పుడు మనం అనిశ్చిత ప్రపంచాన్ని ఎదుర్కొంటున్నాము. ఈ ప్రపంచంలో బలవంతుల మాటే చెల్లుతుంది. వారే నియమాలను రూపొందిస్తారు.
అనువాదం: నెల్లూరు నరసింహారావు
(వ్యాస రచయిత న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లో విశిష్ట సభ్యులుగా ఉన్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.