
దేశంలో పెరుగుతోన్న అసహనాన్ని, మతతత్వ విద్వేషాన్ని తీవ్రంగా నిరసిస్తూ దేశంలోని పలుప్రాంతాల నుంచి దశాబ్దం క్రితమే నిరసనలు బలంగా వినిపించాయి. “వ్యక్తిగత- భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్రమైన ఆటంకం కలిగిస్తున్నందు వల్ల, ప్రజాస్వామ్య విలువలని కాలరాసి, దౌర్జన్యపూరితమైన వాతావరణం సృష్టిస్తున్నందు వల్ల మేం మా సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి పంపి మా వేదనని, బాధని, నిరసనని తెలియజేస్తున్నాం. ఆరు దశాబ్దాల కాలంలో దేశంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇంత విశృంఖలంగా, విచ్చలవిడిగా స్వేచ్ఛను అణగదొక్కడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. సాహిత్యకారులుగా సిగ్గుపడుతున్నాం” అని రచయిలంతా దేశవ్యాప్తంగా ఘోషించారు.
నరేంద్ర దబోల్కర్, పన్సారే, కల్బుర్గిలాంటి సామాజిక కార్యకర్తలు, హేతువాదులు, మానవతా మూర్తులు, రచయితల హత్యల పట్ల కలత చెంది నిరసనలు తెలియజేశారు. గుజరాత్ అల్లర్లను, మైనారిటీలపైన దాడులను గుర్తు చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రచయితలు హత్యగావించబడడాన్ని ఎత్తి చూపారు. ఎక్కడి వారక్కడ పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రకటనలను విడుదల చేశారు. కొందరు నేరుగా కేంద్ర సాహిత్య అకాడెమీకి ఉత్తరాలు రాశారు. సోషల్ మీడియాలోనూ వివిధ భాషా పత్రికల్లోనూ తమ అసంతృప్తిని వెల్లడించారు.
కేంద్ర సాహిత్య అకాడెమీని భారతీయ సాహిత్య ప్రపంచానికి ఒక మేరు పర్వతంలా భావిస్తారు. రచయితల హత్యపట్ల, భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం పట్ల అది సరిగా స్పందించలేదన్నిది వీరి బాధ. కేంద్రమంత్రిత్వశాఖ గానీ ప్రధాని గానీ తమ హక్కులకు భరోసా ఇవ్వలేదన్నది వీరి ఆవేదన!
2015 అక్టోబర్ 11న తన సాహిత్య అకాడమీ అవార్డు తిప్పి పంపుతున్నట్లు ప్రకటిస్తూ, “ఎంఎం కల్బుర్గి హత్య జరిగిన ఒక వారం తర్వాత నేను సాహిత్య అకాడమీ నిర్వహించిన సెమినార్కు వెళ్లాను. వెళ్లి, దిగ్భ్రాంతికి లోనయ్యాను. అకాడెమీ పురస్కారం పొంది హత్యకు గురైన కన్నడ రచయిత మాజీ వైస్ ఛాన్స్లర్ ఎంఎం కల్బుర్గి గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా సెమినార్ ముగించారు. పైగా అకాడెమీ న్యూఢిల్లీలోని రవీంద్రభవన్లో ఉంది. అది విశ్వకవి రవీంద్రుడి పేరు మీద ఉన్న భవనం. కనీసం వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్(ఎక్కడ మేధస్సు భయ రహితంగా ఉంటుందో) అని రాసిన రవీంద్రుడి కవితా చరణమైనా అకాడెమీ వారు గుర్తుతెచ్చుకోవాల్సింద”ని ఇండియన్ ఇంగ్లీష్ కవి ఎన్ గణేశ్ దివే అన్నారు. ఆయన చెప్పిన విషయం ఆలోచించదగ్గది. గణేష్ దివే బరోడా సాయాజీరావు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫేసర్గా సేవలందిస్తున్నారు. 1992లో “ఆఫ్టర్ అమ్నేసియా” అనే స్వీయ కవితా సంపుటికి అకాడమీ అవార్డు స్వీకరించారు. దేశవిదేశాల్లోని యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫేసర్గా నిరంతరం వెళ్తుంటారు.
నయనతార సెహెగల్((88) తన అవార్డు వెనక్కి పంపినప్పుడు సాహిత్య అకాడెమీ ఛైర్మన్ విశ్వనాథ్ ప్రసాద్ తివారి వ్యంగ్యంగా మాట్లాడారు. “ఈ అవార్డులన్నీ వారికి ఎప్పుడో ఇచ్చినవి. వారు అవి స్వీకరించడం వల్ల వారి పుస్తకాలు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. వారికి రావాల్సిన పేరు ప్రఖ్యాతలు, గుర్తింపులు వచ్చాయి. ఇప్పుడు వారు అవార్డులు తిప్పి పంపడం వల్ల లాభమేంటీ?” అన్నారు. ఈ మాటల మీద నయనతార సెహగల్ ఘూటుగానే స్పందించారు.
తనకు సాహిత్య అకాడెమీ అవార్డు పట్ల గౌరవముందని, అయితే అకాడెమీ అవార్డు రాకముందే తనకు తన పుస్తకాల ద్వారా మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు వచ్చాయని ఆమె అన్నారు.
అయితే, రచయితలకు సాహిత్య అకాడమీ ద్వారనే పేరు ప్రఖ్యాతలు వస్తాయనుకుంటే పొరపాటు. అకాడెమీ అవార్డులు రాని మహారచయితలు, మహానుభావులు భారతీయ భాషల్లో చాలా మందే ఉన్నారు. వారికా గౌరవం, విలువ రావడంలో అకాడెమీ పాత్ర ఏమీ లేదు. అయినా తమ రచనల ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్నవారినే అకాడెమీ గుర్తిస్తుంది. ఫైరవీలతో అకాడెమీ అవార్డు వచ్చినా, ప్రజలు గుర్తించని వారు కోకొల్లలుగా ఉన్నారు. మరి దాని సంగతేంటి?
అయినా ఎటువంటి వివాదాలకు తావులేకుండా అకాడెమీ ఒకప్పుడు తనకు బహుమతిగా ఇచ్చిన డబ్బు ఇరవై అయిదు వేలు. దాన్ని రెండింతలు చేస్తే యాభై వేలు. అయినా వాటిని నాలుగింతలు చేసి లక్షరూపాయల చెక్కు జత చేసి ఆమె అవార్డును తిప్పి పంపారు. “దీని వల్ల అకాడెమీ దాని పరిధి అది తెలుసుకుంటుందని, బాధ్యతగా వ్యవహరిస్తుందని, రచయితల పక్షాన ఎల్లవేళలా నిలబడుతుందని ఆశిస్తున్నాను” అని ఉత్తరం రాసి, అకాడెమీ ఛైర్మన్కు ధీటైన సమాధానమిచ్చారు. ఆత్మగౌరవం ఉన్న కవుల, రచయితల ఆలోచనలు ఇలా ఉంటాయి.
ఫైరవీలు చేసి అవార్డులు, పదవులు పొందినవారు ప్రతిదానికి, ప్రతిచోట రాజీపడి బతకాల్సిందే. నయనతార సెహెగల్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ చెల్లెలి కూతురు. అంటే నయనతార మేనమామే సాహిత్య అకాడెమీకి రూపకల్పన చేసింది. డెహ్రాడూన్లో తన తల్లి విజయలక్ష్మీ పండిట్ ఇంట్లో నివాసమున్న ఈమె, స్వతంత్ర భావాలు గల మహిళ. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధిస్తే వ్యతిరేకించారు. ఈ దేశాన్ని ఒక కుటుంబమే ఎందుకు పాలించాలని ప్రశ్నించి సంచలనం సృష్టించారు. రిచ్ లైక్ అస్(Rich Like Us) అనే ఇండియన్ ఇంగ్లీష్ నవలకు 1985లో సాహిత్య అకాడమీ అవార్డును స్వీకరించారు.
“దేశంలో ఏదైతే జరుగుతుందో అది చాలా బాధాకరం” అని ఎంతో వేదనతో తన అవార్డు తిప్పి పంపుతున్నట్టు పంజాబీ నాటక రచయిత ఆత్మజిత్సింగ్ ప్రకటించారు. ఆయన నాటకరంగ రచయిత కాదు, దర్శకుడు కూడా. నాటకరంగం మీద పరిశోధనలు చేసి డాక్టరేట్ తీసుకున్నారు. వరుసగా రెండు సంవత్సరాల్లో రెండు సాహిత్య అకాడెమీ అవార్డు(2009), సంగీత నాటక అకాడెమీ అవార్డుల(2010)ను తీసుకున్న రచయిత– దర్శకుడు దేశంలో మరొకరు ఉండి ఉండరు.
“రచయితల, అభ్యుదయకాముకల స్వేచ్ఛాలోచనను చంపేస్తున్నారు. కాబట్టి సాహిత్యలోకం సమైక్యంగా నడుంబిగించాలి. తమ నిరసనలతో హోరెత్తించాలి. అకాడెమీ ఛైర్మన్ మౌనాన్ని, ఈ విషయం మీద ప్రధాని మౌనాన్ని బద్దలు కొట్టాలి. నిరసన తెలియజేస్తున్న సాహితీవేత్తలకు ప్రజలు వెన్నుదన్నుగా నిలబడాలి. అధికారం అండదండలతో జరుగుతోన్న దుశ్చర్యలన్నీ ఎండగట్టాల”ని పంజాబీ నాటక రచయిత అజ్మీర్ సింగ్ ఔలాఖ్ తన అవార్డు తిప్పిపంపుతూ పిలుపునిచ్చారు.
“రచయితలని, కళాకారులని, హేతువాదులని, సామాజిక కార్తకర్తలని, మైనారిటీ వర్గాలను అణగదొక్కడమే తమ ధ్యేయంగా చేసుకుని జరుగుతోన్న హత్యలు, దాడులు, ఒత్తిళ్లు తేలికగా తీసుకోరాదు అన్న భావనతో నేను నా అవార్డు తిప్పి పంపుతున్నాను” అని పంజాబీ కథా రచయిత గురుచరణ్ సింగ్ బుల్లార్ ప్రకటించారు.
ఇంకా మాట్లాడుతూ, “గతంలోని ప్రభుత్వాలు తప్పు చేయనివి, మరక అంటనివి ఏమీ కాదు. కానీ, అవి మరీ ఇంత నీచానికి దిగజారలేదు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు మాత్రం అనుకున్నది సాధించుకోడానికి వక్రమార్గాలని ఎంచుకున్నారన్నిది సుస్పష్టం” అని కూడా అన్నారు. గురుచరణ్కు తన కథా సంపుటి “అగ్ని కలశ్”కి 2005లో అకాడెమీ అవార్డు లభించింది.
సనాతన సంస్థ, దాని అనుబంధంగా పనిచేసే ఇతర సభ్యులు కలిసి హేతువాదులైన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కల్బుర్గిలను హత్య చేశారని, వారి చర్యల్ని నిరసిస్తూ గోవాలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలోనే కొంకణి కథా రచయిత ఎన్ శివదాస్ తన సాహిత్య అకాడెమీ అవార్డు తిప్పి పంపుతున్నట్లు ప్రకటించారు. వృత్తిరీత్యా ప్రొఫేసరైన శివదాస్ “బంగార్ సల్ల్” కథల సంపుటికి 2005లో అవార్డును స్వీకరించారు.
కన్నడ రచయిత కుమ్ వీరభద్రప్ప 2007లో తను తీసుకున్న అకాడెమీ అవార్డును తిప్పి పంపారు. హేతువాదుల హత్యలు, దాద్రి సంఘటన తనను కలచి వేసిందని, ఈ విషయం మీద అకాడెమీ మౌనం సహించరానిదని అన్నారు. ప్రసిద్ధ పంజాబీ రచయిత మేఘ్రాజ్ మిట్టర్ తన “శిరోమణి లేఖక్” పురస్కారాన్ని ప్రభుత్వానికి తిప్పి పంపారు. అది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రచయితలకిచ్చే అత్యున్నత పురస్కారం. ఇండియన్ ఇంగ్లీషు కవి ఆదిల్ జుస్సావాలా దేశంలోని సంక్షోభాలని, అస్థిరతను, అలసత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ దేశ ప్రధాని నిర్లిప్తతను వీడి మాట్లాడాలని, దేశంలో భావప్రకటన స్వేచ్ఛ కాపాడబడుతుందన్న భరోసా ఇవ్వాలని ఉత్తరం రాశారు.
రచయిత(త్రు)ల నిరసనలు పెద్ద ఎత్తున పెల్లుబుకుతున్న సమయంలో 2015 అక్టోబర్ 12న ఢిల్లీలో నివాసమున్న నాటకరంగ కళాకారిణి మాయాక్రిష్ణా రావు తన సంగీత నాటక అకాడెమీ అవార్డును ప్రభుత్వానికి తిప్పి పంపారు. దాద్రి సంఘటనతో తన మనసు వికలమైందని, రచయితలని, హేతువాదులని, మానవవాదులని చంపుతూ ఉండడం వల్ల దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోయిందని, రంగస్థల నటిగా తన నిరసనను తెలియజేయడానికి మాత్రమే తను అవార్డు తిప్పి పంపుతుననట్లు ఆమె చెప్పారు.
ఒకప్పుడు కేంద్ర సాహిత్య అకాడెమీకి కార్యదర్శిగా పనిచేసి “ఇండియన్ లిటరేచర్” వంటి జర్నల్కు సంపాదకుడిగా ఉండి, వివిధ స్థాయిలలో అకాడెమీతో సుదీర్ఘమైన అనుబంధమున్న మళయాళ- ఇండియన్ ఇంగ్లీషు కవి కే సచ్చిదానందన్ అకాడెమీతో తెగతెంపులు చేసుకుని బయటపడ్డారు.
“అకాడెమీ ఉండాల్సిన రీతిలో లేదు. నడవాల్సిన పద్ధతిలో నడవట్లేదు” అని ఇంగ్లీషు రచయిత్రి శశీ దేశ్పాండే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అకాడెమీ జనరల్ కౌన్సిల్కు కన్నడ దళిత కవి అరవింద్ మలగట్టి రాజీనామా చేశారు.
అవార్డు తిప్పి పంపే ప్రక్రియ హిందీ కవి ఉదయ ప్రకాశ్తో మొదలైంది. ఆ తర్వాత లలిత కళా అకాడెమీకి ఛైర్మన్గా పని చేసిన అశోక్ వాజ్పాయ్తో కొనసాగింది. ఉర్దూ కవి రహమాన్ అబ్బాస్, హిందీ కవి రాజేశ్ జోషి, పంజాబీ కథకుడు వర్యమ్ సింగ్ సంధూలతో ముందుకు సాగుతోంది. మళయాళ రచయిత్రి సారా జోసెఫ్, హిందీకవి మంగ్లేష్ దర్వాల్, కన్నడ అనువాదకులు డీఎన్ శ్రీనాథ్ మాత్రమేకాక, ఇంకా నిరుపమ బొర్గొహై, హామెన్ బొర్గొహై(అస్సామి), రహమత్ తరికెరె(కన్నడ), గులాబ్ నబీ ఖయాల్(కశ్మీరి), ప్రధాన్ పవార్(మరాఠీ), అనువాదకులు చమన్లాల్ మొదలైన వారంతా తమతమ అకాడెమీ అవార్డులని తిప్పి పంపారు. పంజాబీ రచయిత్రి దలీప్ కౌర్ తివానా ఏకంగా తన పద్మశ్రీనే ప్రభుత్వానికి తిప్పి పంపి, నిరసన గళానికి మరింత బలాన్నిచ్చారు.
ఏదిఏమైనా కవుల, రచయితల, కళాకారుల సంఖ్య సమాజంలో చాలా తక్కువని చెప్పాలి. వీరి నిరసనల వల్ల ఓటు బ్యాంకుకు పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ, జరిగిన జరుగుతోన్న నిరసనల ప్రభావం సమాజం మీద ఏం ఉండదనుకోవడం పొరపాటే అవుతుంది. దేశ, రాష్ట్ర పరిపాలకుల దిగజారిన నైతికతకు అవి అద్దం పడుతున్నాయనడం వాస్తవం. ఆయా రచయితలు, కవులు తమ అవార్డుల వాపసీతో భావ ప్రకటనా స్వేచ్ఛ అవసరాన్ని దేశప్రజలకు తెలియజెప్పారు.
(వ్యాసరచయిత త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.