
Reading Time: 5 minutes
జీ7 దేశాల కూటమి సమావేశాలు మరో వారం రోజులుందనగా ప్రధానమంత్రి మోడీ తాను ఈ సమావేశాలకు హాజరు కావటం కోసం కెనడా వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాలకు హాజరు కావల్సిందిగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి ఆహ్వానం అందిందని ప్రధాని వెల్లడించారు. మరోవైపున రెండు దేశాల మధ్య భద్రతా సంబంధిత విషయాల్లో తలెత్తిన వివాదాలను సంప్రదింపులు ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రభుత్వం మరో ప్రకటనలో తెలిపింది.
జూన్ ఆరో తేదీ సాయంత్రం ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్టులో ప్రధాని మోడీ కెనడా ప్రధానితో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఈ ఆహ్వానం అందుకున్నామని వెల్లడించారు. మార్క్ కార్నీని ప్రధాని బాధ్యతలు చేపట్టినందుకు అభినందించినట్లు కూడా మోడీ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. పరిణతి పొందిన ప్రజాస్వామిక దేశాలు ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించేందుకు ప్రాధాన్యత ఇస్తాయనీ, పరస్పర ప్రయోజనాలు, ప్రాధాన్యతల ప్రాతిపదికన రెండు దేశాలు ఉమ్మడిగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నాయని కూడా ఆయన తన ప్రకటనలో తెలిపారు.
2015 తర్వాత కెనడాలో పర్యటించని మోడీ..
మోడీ ట్వీట్ చేసిన కొద్ది సేపటి తర్వాత కెనడా ప్రధాని కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల అయింది. అందులో కెనడా ప్రధాని కార్నీ, మోడీకి ఫోన్ చేసిన విషయాన్ని ధృవీకరించింది. కార్నీ తన ట్విట్టర్ పోస్టులో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ధృవీకరిస్తూనే జీ7 దేశాల కూటమి సమావేశానికి ఆహ్వానించటం గురించి ప్రస్థావించకపోవటం గమనార్హం.
‘‘రెండు దేశాల రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సంబంధిత విభాగాల మధ్య సంప్రదింపులు కొనసాగాలని నిర్ణయించటం ముఖ్యమైన విషయం’’ అని కార్నీ ప్రకటన వెల్లడించింది.
కార్నీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ ఆయనను అభినందించారు. గత నెల రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య నెకలకొన్న ప్రతిష్టంభనను తగ్గించటానికి కొంతమేరకు ఉపయోగపడ్డాయి.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీ8 దేశాలుగా ఉన్నప్పుడే కూటమి శిఖరాగ్ర సమేశాలకు ఐదుసార్లు హాజరయ్యారు. ప్రధాని మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్రాన్స్లో జరిగిన సమావేశాలకు తొలిసారిగా ఆహ్వానం అందుకున్నారు. అప్పటి నుండి నాలుగు సార్లు జీ7 సమావేశాలకు హాజరయ్యారు. 2020లో జరిగిన సమావేశం కోవిడ్ నియంత్రణల కారణంగా ఆన్లైన్లోనే జరిగింది.
కెనడా పౌరుడు హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనక భారతీయ భద్రతా ఏజెంట్ల పాత్ర ఉందని అప్పటి కెనడా ప్రధాని ట్రూడో 2023లో పార్లమెంట్కు నివేదించటంతో రెండు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తాజాగా మోడీకి కెనడా ప్రధాని కార్నీ ఫోన్ చేయటంతో కాస్తంత ఉపశమించినట్లయ్యింది.
ట్రూడో ఆరోపణలను ఖండించిన భారత్ కెనడాతో దౌత్య సంబంధాలను కుదించుకున్నది. రెండు దేశాల రాయబార కార్యాలయాలు హైకమిషనర్ లేకుండానే పరిమిత స్థాయి సిబ్బందితో పని చేస్తున్నాయి. గత సంవత్సరం కెనడాలో జరిగిన హింసలో భారతీయ నిఘా విభాగాల పాత్ర ఉందన్న సాక్ష్యాధారాలు లభించాయని కెనడియన్ అశ్వికదళం ప్రకటించటంతో రెండు దేశాల మధ్య సంబంధాల ప్రతిష్టంభన తీవ్రత పెరిగింది. ఈ ఆరోపణల తర్వాత భారత్లో కెనడా రాయబారిని భారతదేశం, కెనడాలో భారత రాయబారిని కెనడా బహిష్కరించాయి.
ఈ పరిణామాలు జరిగిన రెండు వారాల తర్వాత కెనడా పార్లమెంటరీ స్థాయి సంఘం జరిపిన విచారణకు హాజరైన ఆ దేశపు ఉపవిదేశాంగ మంత్రి నిజ్జర్ హత్య వెనక భారత హోంమంత్రి అమిత్ షా పాత్ర ఉందన్న విషయాన్ని తాను అమెరికాకు చెందిన పత్రికకు వెల్లడించినట్లు తెలిపారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని మోడీ ప్రభుత్వం తిరస్కరించింది.కెనడాలో ఖలిస్తానీ గ్రూపులు రాజకీయ ప్రాపకం పొందటం గురించి మాత్రమే తాము ఆందోళన చెందుతున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సమాధానంగా హింసాత్మక చర్యలకు దారితీయనంత వరకూ రాజ్యాంగం ప్రసాదించిన వాక్స్వాతంత్రపు హక్కుకు భంగం కలిగించలేమని కెనడా ప్రకటించింది.
భద్రతా సంబంధిత ఆందోళనలు, విస్తృతి..
కార్నీ ఫోన్లో మాట్లాడిన తర్వాత జారీ చేసిన ప్రకటనలో భద్రతా సంబంధిత ఆందోళనల గురించి ప్రస్తావిస్తే ఫోన్లో మాట్లాడిన విషయాన్ని వెల్లడించిన ప్రధాని మోడీ ప్రకటనలో భద్రతా సంబంధిత ఆందోళనల గురించిన ప్రస్తావన లేదు. దీనికి సంబంధించిన భారత ప్రభుత్వం ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు. కార్నీ ప్రకటనను గమనిస్తే కెనడా ఆంతరింగిక వ్యవహారాల్లో భారతీయ నిఘా సంస్థల జోక్యం గురించి ముందు ముందు కూడా లేవనెత్తనున్నట్లు అర్థమవుతుంది.
జీ7 కూటమి సమావేశంలో పాల్గొనటానికి భారత దేశాన్ని ఆహ్వానించటంపై కెనడాలో మీడియా ఆ దేశ ప్రధానికి సంధించిన ప్రశ్నల పరంపర, దానికి ప్రభుత్వం ఇచ్చిన స్పందనల రూపంలో మరికొంత చర్చ జరిగింది. కెనడాలో జరిగిన అల్లర్లు, నిజ్జర్ హత్య వంటి విషయాలపై కెనడా ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధమని భారతదేశం ప్రకటించినట్లు కార్నీ తెలిపారు. ‘‘శాంతి భద్రతల విభాగాల మధ్య సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించటం ముఖ్యమైన పరిణామం. ఈ విషయంలో కొంత పురోగమనం ఉంది. జవాబుదారీతనం విషయం గురించి చర్చ జరిగింది.’’ అని కార్నీ వెల్లడించారు.
2023 జూన్లో నిజ్జర్ హత్య వెనక భారత ప్రధాని హస్తం ఉందా అన్న ప్రశ్నకు కెనడా ప్రధాని సూటిగా సమాధానం ఇవ్వలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నపుడు ఇటువంటి విషయాలపై వ్యాఖ్యానించటం సరికదాని కార్నీ దాటవేశారు. అదే సమయంలో కెనడియన్ అశ్వికదళ పోలీసులు సాగిస్తున్న దర్యాప్తులో ఎటువంటి మార్పూ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ‘‘శాసనాధారిత పాలన సాగించే దేశం మనది. కెనడాలో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఆ క్రమంలో జోక్యం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను అని స్పష్టం చేస్తున్నాను.’’ అని కార్నీ అన్నారు.
మోడీకి ఆహ్వానం పలికే ప్రశ్నకు వివరంగా స్పందిస్తూ ‘‘మొదటి విషయం ఏంటంటే కెనడా జీ7 కూటమి అధ్యక్ష బాధ్యతల్లో ఉంది. ఈ సమావేశంలో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, డిజిటల్ భవిష్యత్తు, కీలకమైన ఖనిజ వనరులు వంటి అనేక విషయాలపై చర్చించేందుకు సభ్యదేశాలు సిద్ధమయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో కావల్సిన మౌలిక వసతుల నిర్మాణానికి సంబంధించిన భాగస్వామ్యాలు సిద్ధమవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ ఎజెండాలో భాగస్వామి. ఇటువంటి కీలకమైన చర్చలు జరుగుతున్నప్పుడు కొన్ని దేశాలు ఈ చర్చల్లో పాలుపంచుకోవటం అనివార్యం. జీ7 అధ్యక్షుడిగా సభ్య దేశాలతో సంప్రదించిన తర్వాత పైన ప్రస్తావించిన అనేక విషయాలతో ముడిపడి ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానంలో ఉన్న జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారతదేశం కూడా ఈ చర్చల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించాము. ముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇరు దేశాల శాంతి భద్రతల సంరక్షణ సంస్థలు మధ్య సంప్రదింపులు కొనసాగుతూ ఉండాలని కూడా నిర్ణయించాము. ఈ కోణంలో కొంత పురోగతి ఉంది. జవాబుదారితనంతో ముడిపడి ఉన్న కొన్ని సమస్యలను గుర్తించాము. ఈ కోణంలోనే నేను ప్రధాని మోడీకి ఆహ్వానం పలికాను. ఆయన అంగీకరించారు.’’ అని తెలిపారు.
కీలకమైన భాగస్వామ్య దేశాలతో దౌత్య సంబంధాలు ధృడపర్చుకునేందుకు కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ సంప్రదింపులు జరిగాయి. గత కొన్ని వారాలుగా కెనడా భారతదేశంతో అనేక విషయాల్లో సంప్రదింపులు జరిపేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దేశీయంగా జరుగుతున్న దర్యాప్తు విషయంలో ఎటువంటి రాజీ లేకుండానే భారతదేశంతో స్నేహ సంబంధాలు కొనసాగించాలని కెనడా నిర్ణయించింది.
స్వయంప్రతిపత్తి కలిగిన అశ్వికదళం..
గత నెల ది గ్లోబ్ అండ్ మెయిల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ ‘‘దౌత్య సంబంధాలు ఒక్కో అడుగూ మరమ్మతు చేసుకుంటూ ముందుకెళ్తామ’’ని చెప్పారు. అదేసమయంలో శాసనాధారిత పరిపాలన విధానం విషయంలో రాజీపడేదే లేదని నిజ్జర్ కేసులో జరుగుతున్న దర్యాప్తును దృష్టిలో పెట్టుకుని ఆమె అన్నారు. రాయల్ కెనడియన్ అశ్వికదళం చేస్తున్న దర్యాప్తు పూర్తిగా స్వయంప్రతిపత్తి కలగినదని ఆమె అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దౌత్య సంబంధాలు పెట్టుకోవాలన్న లక్ష్యంలో భాగంగా భారతదేశంతో కూడా దౌత్య సంబంధాలు పెంపొందించుకోవాలని కెనడా ప్రభుత్వం ఆశిస్తోందని ఆమె తెలిపారు.
రక్షణ, ఆర్థిక సంబంధాల విషయంలో అమెరికాపై ఆధారపడలేము అన్నది ఏప్రిల్లో జరిగిన కార్నీ ఎన్నికల ప్రచారంలో కీలకాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మారుస్తామని, దిగుమతి సుంకాలు పెంచుతామని ప్రకటించటంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయి. ప్రధాని మోడీకి ఫోన్ చేయటానికి ముందు రోజు కెనడా ప్రధాని కార్నీ చైనా ప్రీమియర్ లీ క్వియాంగ్తో కూడా మాట్లాడారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పటిష్టపర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. ట్రంప్ పాలనలో ప్రపంచ వాణిజ్యంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో కెనడా చైనాతో సంబంధాలు పటిష్టం చేసుకోవాలని నిర్ణయించుకోవటం కీలకమైన పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజాగా పాకిస్తాన్తో జరిగిన సాయుధ ఘర్షణ నేపథ్యంలో దేశీయంగా విమర్శలు ఎదుర్కొంటున్న మోడీకి జీ7 ఆహ్వానం కాస్తంత ఊరట కల్పించే అంశంగా మారనుంది. శుక్రవారం నాటి వార్తలు వెలువడక ముందు జీ7 ఆహ్వానం దక్కకపోవటం గురించి మీడియా, ప్రతిపక్షం పలు ప్రశ్నలు లేవనెత్తాయి.
ఆహ్వానం అందిన సమయం ప్రాధాన్యత..
సాధారణంగా చూసినప్పుడు ప్రపంచ గమనాన్ని శాసించే దేశాల శిఖరాగ్ర సమావేశం తేదీ దగ్గరపడే వరకూ ఆహ్వానాలు ఎవరికి పంపాలి, ఎవరికి పంపకూడదు అన్న విషయం నిర్ధారణ కాకుండా ఉండదు. కేవలం వారం రోజుల వ్యవధిలో వచ్చిన ఆహ్వానాన్ని మోడీ అంగీకరించి ఉండాల్సిందా లేదా, ఇలా అంగీకరించటం మన దేశం ఆహ్వానం కోసం అర్రులు చాస్తోందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుందా అన్న అంశంపై ది వైర్ పలువురు మాజీ దౌత్యవేత్తలను సంప్రదించింది.
మాజీ విదేశాంగ కార్యదర్శి ‘అయి ఉండొచ్చు. కానీ మనం వెళ్లకపోతే అలిగామన్న అభిప్రాయం కలుగుతుంది. మన సుప్రీం నేత సమావేశానికి హాజరైన తన గురించి ప్రపంచం ఏమనుకొంటోంది అన్న విషయాన్ని అంచనా వేసుకోవడానికి ఓ సందర్భం. గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మన దేశం గురించి ప్రపంచంలో ఎవరేమనుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది.’’ అన్నారు.
‘‘చివరి నిమిషంలో వచ్చిన ఆహ్వానాన్ని మన్నించటం సరికాదు. ఆహ్వానం ఉంది అన్నది మనకి అందరికీ రెండు వారాలుగా తెలుసు. అక్కడ జరగాల్సింది కార్నీ నుంచి మోడీకి ఫోన్ రావడమే. తథాస్తని అది కూడా వచ్చింది. ఇదంతా మీడియా మేనేజర్లకు నిద్ర లేకుండా చేసే వ్యవహారం తప్ప మరోటి కాదు’’ అన్నారు. అంతేకాకుండా, ‘‘అసలు మనకు ఆహ్వానమే అందకపోతే వచ్చే- పోయే పరువేంటి?’’ అని కూడా ఆ అధికారి ప్రశ్నించారు.
ఇటలీ జీ7 అధ్యక్షులుగా ఉన్నప్పుడు రెండు నెలల ముందే మనకు ఆహ్వానం అందింది. ఈ సారి కూడా మే మొదటి వారంలోనే ఈ ఆహ్వానాలు పంపే పని మే మొదటి వారంలోనే మొదలయ్యాయని మీడియా కథనాలు తెలియజేశాయి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బెనీస్ తనకు మే మొదటివారంలోనే ఆహ్వానం అందిందని ధృవీకరించారు. మెక్సికో అధ్యక్షులు క్లాడియా షెన్బీం తనకు మే 15వ తేదీన కెనడా ప్రధాని కార్నీ ఫోన్ చేసి ఆహ్వానించారని ప్రకటించారు. మే రెండో వారంలోనే బ్రెజిల్ అధ్యక్షుడు లూలాకు కూడా ఆహ్వానం అందింది. దక్షిణాఫ్రికాకు కూడా ఆహ్వానం అందిందని కెనడాలోని దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయం తెలిపింది. కార్నీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందు కార్నీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్కీకి ఫోన్ చేసి జీ7 సమావేశాలకు ఆహ్వానించారు.
కెనడా కేంద్రంలో పని చేస్తున్న పలు సిక్కు గ్రూపులు ప్రధాని మోడీని జీ7 సమావేశాలకు ఆహ్వానించకూడదని ప్రధాని కార్నీకి విజ్ఞప్తి చేశాయి. మోడీ పర్యటన సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఈ నిరసనలకు కెనడా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. జీ7 శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నప్పుడు పౌరసమాజం వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేయటం సాంప్రదాయంగా మారింది. జీ7 సమావేశాలు వ్యతిరేకించే వారు నగరంలో మూడు కేంద్రాల్లో నిరసనలు తెలపవచ్చని కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమావేశంలో పాల్గొనే దేశాధినేతలకు కూడా ఈ నిరసనలను లైవ్ స్ట్రీం ద్వారా చూపించటానికి కెనడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.