
అందుబాటులో ఉన్న సమాచారం, పరిణామాలు పరిశీలిస్తే తాజాగా ముగిసిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారతదేశానికి సైనిక పరంగా దక్కిన ఆధిపత్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని స్పష్టం అవుతోంది.
ఆపరేషన్ సింధూర్ రూపంలో భారతదేశం పాకిస్తాన్పై సాయుధ అధిపత్యాన్ని సంపాదించినప్పటికీ మోడీ ప్రభుత్వం తదనంతర కాలంలో అంతర్జాతీయ వేదికలపై అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది.
పహల్గాం దాడి తర్వాత కాలంలో జరిగిన ముఖ్యమైన అంతర్జాతీయ పరిణామాలు మోడీ ప్రభుత్వం వ్యూహాత్మక వెనుకంజ వేసిందని, ఇది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానపు వైఫల్యమే అని, యుద్ధ తంత్రంలో సాధించిన ఆధిపత్యాన్ని అంతర్జాతీయ పలుకుబడిగా మార్చుకోవడంలో భారత ప్రభుత్వం విఫలమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సంక్షోభ కాలంలో మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని విశ్వ గురువుగాను విశ్వమిత్రుడిగాను చెప్పుకుంటున్న వాదనలు పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ఏర్పాటు చేసిన తాలిబాన్ కమిటీకి అధ్యక్షురాలిగా పాకిస్తాన్..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏర్పాటుచేసిన తాలిబాన్లపై ఆంక్షలు విధించే కమిటీకి అధ్యక్షతను, ఉగ్రవాద నిరోధక వ్యూహాలు రూపొందించే కమిటీకి ఉపాధ్యక్షతకు పాకిస్తాన్ నియమించబడటం భారతదేశానికి పెద్ద ఎదురు దెబ్బ. ఈ అంతర్జాతీయ హోదాతో పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి తనదైన వ్యాఖ్యానాన్ని ప్రపంచం ముందు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత ప్రభుత్వం దౌత్య రంగంలో తనదైన వాణిని వినిపించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. బహుళ పార్టీ ప్రతినిధి బృందాలను కూడా పంపించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్య దేశాలతో సంప్రదింపులు జరిపింది. అయినప్పటికీ చైనా మరికొన్ని దేశాల సహకారంతో పాకిస్తాన్ ఈ అంతర్జాతీయ వేదికలకు ఎంపిక అయింది. ఈ పరిణామం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలకు కేంద్రంగా ఉందని భారతదేశం చేస్తున్న ప్రచారానికి అవరోధం కలిగించడమే కాకుండా పాకిస్తాన్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యానాలు రూపొందించేందుకు ఈ అధికార హోదాలు ఉపయోగపడతాయి. ఈ పరిణామం అంతర్జాతీయ వేదికలపై మసకబారుతున్న భారత ప్రతిష్ట, పెరుగుతున్న చైనా పాక్ బంధాన్ని వెల్లడిస్తున్నాయి.
కాల్పుల విరమణకు ట్రంప్ మధ్యవర్తిత్వం – పుతిన్ ధ్రువీకరణ..
భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదర్చటంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ధృవీకరించారు. ఇప్పటివరకు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న వివాదాలను ద్వైపాక్షిక వివాదాలు గానే పరిణించాలని మూడవ పక్షం జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకూడదన్న అవగాహనకు ఇది పూర్తిగా భిన్నమైనది.
ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడం వల్లనే కాల్పులు వివరమణ జరిగిందని పుతిన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ ఒత్తిడికి, అమెరికా ఆదేశాలకు మోడీ ప్రభుత్వం తలొగ్గి కాల్పుల విరమణకు ఒప్పుకున్నది అన్న వాదనలకు పుతిన్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్లిష్ట సంక్షోభ సమయాలలో కీలకమైన భద్రత సంక్షోభాలలో భారతదేశం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పాటించగలదా అన్న ప్రశ్న ముందుకు వస్తోంది.
అంతర్జాతీయ రుణాలు పొందుతున్న పాకిస్థాన్..
ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఈ కాలంలో రుణాలు పొందింది. నివేదికలో భారతదేశం కూడా భాగస్వామిగా ఉన్నప్పటికీ భారత ప్రతినిధులు ఈ రుణాల మంజూరీకి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రుణాలు మంజూరు కావడం అంతర్జాతీయ ద్రవ్య సంస్థలలో భారతదేశం పెద్దగా ప్రభావం చూపగల శక్తిగా లేదని అర్థమవుతుంది. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్కు ఐఎమ్ఎఫ్ ఒక బిలియన్ డాలర్లు రుణం మంజూరు చేస్తే ప్రపంచ బ్యాంక్ 40 బిలియన్ డాలర్లు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఎనిమిది వందల మిలియన్ డాలర్లు రుణంగా మంజూరు చేసింది.
నిరంతరం పెరుగుతున్న రక్షణ వ్యయం కీలకమైన రంగాలలో సంస్కరణల వెనుకబాటు వంటి విషయాల నేపథ్యంలో పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ రుణం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని భారత ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఓవైపు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నప్పటికీ అంతర్జాతీయ వేదికలు పాకిస్తాన్కు అండగా నిలబడటం ఆయా వేదికల్లో మసకబారుతున్న భారత ప్రతిష్టకు నిదర్శనంగా భావిస్తున్నారు. అంతేకాక పాకిస్తాన్ను ఏకాకి చేయడంలో మోడీ ప్రభుత్వపు వైఫల్యానికి నిదర్శనం ఈ పరిణామాలు అని భావిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితిలో దౌత్య పరమైన వెనుకంజ..
పహల్గాంలో దాడి చేసిన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూప్ల చర్యలను ఖండిస్తూ ఐకరాజ్యసమితి ద్వారా ఒక తీర్మానం ఆమోదింపచేసుకోవడంలో భారతదేశం సఫలీకృతం కాలేకపోయింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం ప్రతిపాదించిన తీర్మానంలో సంబంధిత ఉగ్రవాద సంస్థల పేర్లు ప్రస్తావించనియ్యకుండా పాకిస్తాన్ చైనా మరికొన్ని దేశాల సహకారంతో అడ్డుకున్నది. దాంతో పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద శక్తులపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలన్న భారత వ్యూహం వెనుక పట్టు పట్టింది.
భారత ప్రభుత్వం దాదాపుగా 50 దేశాలలో ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు పార్లమెంటరీ ప్రతినిధి బృందాలను పంపించినప్పటికీ ఏ ఒక్క దేశము పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా గానీ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న దేశంగా గానీ ప్రకటించడానికి ముందుకు రాకపోవటం గమనార్హం. ఏ ఒక్క దేశము నిస్సందేహంగా భారతదేశం పక్షాన నిలబడలేదు. ఉగ్రవాద విషయంలో ప్రత్యేకించి సీమాంతర ఉగ్రవాదం విషయంలో భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం సాధించడానికి అవసరమైన మద్దతు సమీకరించడంలో మోడీ ప్రభుత్వం ఎదుర్కుంటున్న సవాళ్లను తాజా పరిణామాలు విదితం చేస్తున్నాయి.
బలోపేతమవుతున్న చైనా పాకిస్తాన్ మైత్రి..
ఆపరేషన్ సిందూర్ సమయంలోను అనంతర కాలంలోనూ పాకిస్తాన్కు చైనా అందించిన సహకారం ఆ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచింది. బలోపేతం చేసింది. చైనా పాకిస్తాన్కు సైనిక రంగంలోనూ దౌత్య రంగంలోనూ మద్దతుగా నిలిచింది. పాకిస్తాన్ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని బహిరంగంగా సమర్ధించింది. రక్షణ రంగంలో కీలకమైన సాయుధ సంపత్తిని సమకూర్చింది.
ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నిలువరించడంలో చైనా విజయవంతం అయింది. దాంతో ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయాలలో తాను ఒక శక్తిగా ఎదగాలన్న భారత దేశ ప్రయత్నాలకు గండిపడింది. చైనా పాకిస్తాన్ల మధ్య పెరుగుతున్న ఈ మైత్రి, రెండు దేశాలకు భారతదేశం పట్ల ఉన్న విముఖత దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశం సమీప భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్లను ముందుకు తెస్తుంది.
పాకిస్తాన్ చర్యలపై అంతర్జాతీయ ఖండన సాధించడంలో వైఫల్యం..
భారీ ఎత్తున ప్రయత్నించినప్పటికీ మోడీ ప్రభుత్వం పహాల్గాం, తదనంతర పరిణామాల్లోనూ పాకిస్తాన్ పోషించిన పాత్రను అంతర్జాతీయ సమాజం ఖండించేలా ఒక ప్రకటన జారీ చేయించలేకపోయింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదదాడిని అనేక దేశాలు ఖండించాయి. అయితే ఈ ఖండన ప్రకటనల్లో ఎక్కడ ఉగ్రవాద శక్తులకు పాకిస్తాన్ అందించిన సహకారం గురించి ప్రస్తావన లేదు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లాంటి వేదికలపై భారతదేశం ఇచ్చిన పిలుపును సభ్య దేశాలు స్వీకరించలేదు, అలానే పాకిస్తాన్ చర్యలను ఖండించలేదు. ఈ పరిస్థితులు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి ఉన్న పరిమితులను ముందుకు తెస్తున్నాయి.
ఈ పరిణామాలు, పర్యవసానాలు, స్పందనలను కలగలిపి చూస్తే భారతదేశం తాజా ఘర్షణలో సైనిక పరంగా పైచేయి సాధించినప్పటికీ దౌత్య రంగంలో పై చేయి సాధించడానికి ఉపయోగించుకోలేకపోయిందని అర్థం అవుతోంది. కీలకమైన సందర్భాలలో భారతదేశమే ఏకాకైనట్టుగా కనిపిస్తుంది. అంతర్జాతీయ వేదికలలో ఉన్న సభ్య దేశాలను తన వైఖరికి మద్దతు ఇచ్చేలా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అంతర్జాతీయ వేదికలపై పెరుగుతున్న ప్రత్యర్థుల పలుకుబడి, భారత్ ఒంటరి పాటు వంటి పరిస్థితులు వర్తమాన భౌగోళిక రాజకీయాలలో భారతదేశంలో ఉన్న సవాళ్ల గురించి హెచ్చరిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం వందిమాగదులు దేశీయంగా సాగిస్తున్న ప్రచారం వాగాడంబరం అంతర్జాతీయంగా మస్కబారుతున్న భారత ప్రతిష్టను వైపు దృష్టి మళ్లకుండా చేస్తోంది.
అనువాదం: వీరయ్య కొండూరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.