
ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఒకే ఒక్క రోజులో 4,52,839 ఏజెంట్ల ద్వారా 5,88,107 పాలసీలతో 1000 కోట్ల ప్రీమియంను సేకరించి ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్లో చోటు సంపాదించింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మహంతికు అధికారికంగా ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. గడిచిన జనవరి 20న దేశవ్యాప్తంగా “మాడ్ మిలియన్స్ డే” పేరుమీద నూతన వ్యాపారాన్ని సేకరించే లక్ష్యంతో ఏజెంట్లందరినీ పురమాయించి, ఈ ఘనతను సాధించిన ఇన్సూరెన్స్ సంస్థగా ఎల్ఐసీ రికార్డు నెలకొల్పింది. రెట్టించిన నూతన వ్యాపారాన్ని సేకరించే పలురకాల పిలుపులో భాగంగా ఎల్ఐసీ చైర్మన్ జనవరి 20న మెడ్ మిలియన్ డేగా పిలుపునిస్తూ అందరిని పురమాయించారు. దీంతో ఉద్యోగులు, మార్కెటింగ్ సిబ్బంది కలిసి చరిత్ర సృష్టించారు.
పాలసీదారుల సేవలో అప్రతిహత ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రజలు ఎల్ఐసీ పిలుపుకు తమ స్పందనను పునరుద్ఘాటించారు. అయితే, సంస్థ పిలుపును మొక్కవోని దీక్షతో, సర్వ శక్తులూ ఒడ్డి దిగ్విజయ పరిచినందుకు ఏజెంట్లు, మార్కెటింగ్ అధికారులు, ఉద్యోగులకు చాలా మంది అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని రికార్డులను నెలకొల్పే అవకాశం ఉన్నదని దీనిద్వారా ప్రస్ఫుటమవుతుంది.
గడిచిన సంవత్సరం ఏకపక్షంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఎఐ) ద్వారా అమలుపరిచింది. దీని ద్వారా ఏజెంట్ల కమిషన్ తదితర మార్పుల కారణంగా సంస్థలో కొంత నిస్పృహ వాతావరణం నెలకొన్నది. అయిన్నప్పటికీ ఈ ఘనత సాధించబడింది. దీనికి తోడు ఇన్సూరెన్స్ చట్టాల్లో పెను మార్పులు తీసుకువచ్చి, విదేశీ పెట్టుబడికి అనుకూలంగా భారత ఇన్సూరెన్స్ రంగాన్ని మార్చబోయే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది. ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని తగ్గించబోతున్నారనే వార్తలు ఎప్పటికప్పుడు వెలువడుతూ, తాత్సారం జరిగింది.
ఎల్ఐసీలో అవసరం లేకున్నా, జరిపిన వాటాల ఉపసంహరణ(ఐపీఓ) అనంతరం ఎల్ఐసీ వాటా ధర పెద్దగా పరుగులు పెట్టక పోవడము కూడా ఉంది. ఈ ప్రతికూల పరిస్థితులన్నింటిని అధిగమించి ఒక్క రోజులోనే మహత్తర రికార్డును నెలకొల్పడం అంటే నెహ్రూ స్థాపించిన ఈ ఆధునిక దేవాలయపు అస్తిత్వమూ అంత గొప్పది అన్నమాట. ఎల్ఐసీలోని మెజారిటీ కార్మిక సంఘం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం జనవరి 19న ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజేషన్ దినోత్సవంగా జరిపుతోంది. ఇందులో బాగంగా, నూతన వ్యాపారానికై అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సంవత్సరం చైర్మన్ పిలుపు మేరకు దినోత్సవాన్ని జనవరి 20న జరపాలని సభ్యులందరిని పురమాయించింది. ఈ మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది.
ఎంతో అనుభవం, పాలసీదారులకు ప్రతిఫలాత్మక ఫలితాలను ఇవ్వడంలో ఎల్ఐసీ సంస్థ ముందంజలో ఉంది. ఇటువంటి సంస్థలో కొత్తతరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. రానున్న పదేళ్ల కాలంలో ఏర్పడే విపరీతమైన ఖాళీలను యువతతో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో తలెత్తుతున్న కొత్తకొత్త అంచనాలను ఎదుర్కోవడం చాలా సులభం అవుతుంది. కానీ అలాంటి ప్రయత్నాలకు కేంద్రం సహకరించకపోవడం దురదృష్టకరం. ఎల్ఐసీ, ఐపీఓ అనంతరం కొన్నిరకాల నిర్బంధాలు కంపెనీల చట్టం ప్రకారం ఉన్నప్పటికీ కేంద్రం ప్రభుత్వరంగాలకి కొన్ని వెసులుబాట్లను కల్పించే అవకాశం ఉంది. దీంతో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు, కొత్త నియామకాలను చేపట్టేందుకు, ప్రతిభావంతులైన ప్రస్తుత సిబ్బందిని మరింత కార్యోన్ముఖులను చేసేందుకు, ఎల్ఐసీ ఆఫ్ ఇండియాకు స్వయంప్రతిపత్తి కల్పించడం ఎంతో అవసరం. ఇది దేశ ఆర్థిక స్వావలంబనను పరిపుష్టం చేసే అంశం.
భారతదేశంలో ఎల్ఐసీతో పాటు మరో 26 కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఎల్ఐసీ సాధించిన ఈ ఒక్కరోజు ఘనతను సంవత్సరం పాటు కూడా నెరవేర్చలేకపోతున్నాయి. ప్రైవేట్ కంపెనీల వ్యాపారాలలో 50% మేరకు తప్పుదోవలో అమ్మకాలు జరుగుతున్నట్లు పార్లమెంట్ సాక్షిగా ఆర్థిక సర్వే తమ నివేదికలో పేర్కొన్నది. అంతే కాకుండా ప్రైవేట్ కంపెనీలలోని మార్కెటింగ్ సిబ్బంది తొలగివేత నిష్పత్తి అత్యధిక శాతంగా ఉన్నది. ఇప్పటికి కూడా కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్న ప్రైవేట్ కంపెనీలు ఇన్సూరెన్స్ విస్తరణలో విఫలమవుతున్నాయి. కానీ ఎల్ఐసీ మాత్రం తన లక్ష్యాన్ని ఏనాడు మర్చిపోకుండా తక్కువ ప్రీమియంతో ఎక్కువ మంది ప్రజలకు ఇన్సూరెన్స్ కవరేజీని అందించే బాధ్యతను నెరవేరుస్తూనే ఉన్నది. అంచేత కేంద్రం ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేసే ఇన్షూరెన్స్ చట్ట సవరణలను ఉపసంహరించుకుని ఎల్ఐసీని బలపరచగల విధానాలకు అవకాశం ఇవ్వడమే దేశ భవిష్యత్తుకు అవసరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.