
2023 ఏప్రిల్లో మెజారిటీలైన మెయితీలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే బీజేపీ ప్రభుత్వ డిమాండ్కు అనుకూలంగా మణిపూర్ హైకోర్టు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుతో తమకు అన్యాయం జరుగుతందని కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న కుకీ, తదితర గిరిజన జాతుల్లో భయం మొదలైంది. రాజ్యాంగపరంగా దక్కవలసిన రక్షణలను తాము కోల్పోతామనే భయాందోళనలకు గురయ్యారు. దీంతో మే నెల మూడు, నాలుగు తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మెయితీ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన వర్గానికి అనుకూలంగా ప్రవర్తించడంతో మణిపూర్లో అల్లర్లు ఎక్కువైయ్యాయి. మే 5న రాష్ట్ర బీరేన్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం “కనిపిస్తే కాల్చివేయాల్సింది”గా ఉత్తర్వులను ప్రకటించింది. మణిపూర్ను మొత్తం సైనిక దిగ్బంధంలోకి నెట్టివేసింది. శాంతియుతంగా ఆందోళన సాగిస్తున్న కుకీలపై మెయితీలు బాహాటంగా దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకొని కుకీలపై కాల్పులు జరిపారు. మెయితీల ఈ చర్యల వెనుక బీరేన్ సింగ్ ఉన్నట్టుగా లీకైన ఫోన్ ఆడియో టేప్ల వల్ల ఆ తర్వాత తెలిసింది. ఈ ఆడియో టేప్ల వల్ల మెయితీలు ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో ముఖ్యమంత్రి మద్దతు బాహాటంగా బయటపడింది. ఈ పాశవిక దాడులను బీజేపీకి చెందిన మెయితీ శాసనసభ్యులు కూడా ఖండించాల్సి వచ్చింది.
2017లో అధికారంలోకి వచ్చిన బీరేన్ సింగ్ డబుల్ ఇంజన్ ప్రభుత్వం మణిపూర్ ప్రజల శాంతి సామరస్యం కోసం కాక, మైనారిటీ కుకీ ఆదివాసీలపై విద్వేష రాజకీయాలు కొనసాగిస్తున్న ఫలితంగానే ఈ పరిణామాలు సంభవించాయి. మణిపూర్లో 90 శాతం భూభాగం కొండ ప్రాంతంలో ఉంటే కేవలం 10 శాతం భూభాగమే లోయ ప్రాంతంలో ఉంది. కానీ మొత్తం మణిపూర్లో ఉన్న 60 నియోజకవర్గాలలో 40 నియోజకవర్గాలు మెయితీలు నివసించే లోయ ప్రాంతంలోనే ఉన్నాయి. మొత్తం జనాభాలో సుమారు 50 శాతం పైగా మెయితీలు హిందూ మతానికి చెందినవారు. కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ, తదితర ఆదివాసీలు అత్యధికంగా క్రైస్తవ మత ప్రభావంలో ఉన్నవారు.
డబుల్ ఇంజన్ సర్కార్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మెయితీలకు ఎస్టీ హోదా సంపాదించింది. దీని ద్వారా కొండ ప్రాంతాల్లోని అన్ని సహజ వనరులపై ఆధిపత్యం సంపాదించటానికి బీరేన్ సింగ్ ప్రభుత్వం ఈ రావణ కాష్టాన్ని రగిలించింది. కుకీ, మిగతా ఆదివాసి వర్గాలు రాజ్యాంగపరంగా తమకు లభించిన ప్రాథమిక హక్కులను నిలబెట్టుకోవడం కోసం జీవన్మరణ పోరాటం సాగిస్తున్నారు.
మణిపూర్లో జరుగుతోన్న విధ్వంసానికి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్ల సంక్షోభానికి ఎన్నో విషాదకర సంఘటనలకు, మానవతా సంక్షోభానికి సాక్ష్యంగా నిలిచాయి. రెండు తెగల మధ్య అధికార పార్టీ వర్గీయుల ఆధిపత్యం కోసం సృష్టించిన విధ్వంసక క్రీడలో అమాయక ప్రజలు ఊచకోతకు గురైన మే 3 చరిత్రలో ఓ చేదు జ్ఞాపకంగా, మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ రాష్ట్రం ఇప్పుడు భయం, అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతోంది. తెగల మధ్య నెలకొన్న వైషమ్యాలతో ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోగా మరెన్నో జీవితాలు శాశ్వతంగా గాయపడ్డాయి. ఈ ఘర్షణ దాని సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసి, రాష్ట్రాన్ని దీర్ఘకాలిక మానవతా సంక్షోభంలోకి నెట్టివేసింది. మెయితీ, కుకీ తెగల మధ్య మొదలైన ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఇళ్లు, చర్చిలు, అస్తులు ధ్వంసమయ్యాయి.
మెయితీ వర్గీయులు ప్రభుత్వ అండ చూసుకుని స్త్రీలపై అత్యాచారాలు సాగించారు. మహిళలు, పిల్లలు సైతం హింసకు గురయ్యారు. 70 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులవ్వగా, 260 మందికి పైగా మరణించారు. వందలాది ఇళ్లు, గ్రామాలు బూడిదయ్యాయి. నిరాశ్రయులైన ప్రజలు ఇప్పటికీ కొండలు, లోయలలోని సహాయ శిబిరాల్లో మగ్గుతున్నారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అల్లర్లను నివారించడానికి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఒక తెగకు ప్రతినిధిగా వ్యవహరించారు. ఇంత విధ్వంసం జరిగినా ప్రధాని మోడీ ఆ రాష్ట్రం వైపు కన్నెతి చూడకపోవడం ఆయన నిర్లక్ష్య ధోరణికి అద్దంపడుతోంది. ప్రతిపక్ష పార్టీలు, మానవహక్కుల సంస్థలు, సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ శాంతిని నెలకొల్పడానికి కేంద్రప్రభుత్వం ఇప్పటికీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నది సుస్పష్టం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి స్థాపన, బాధితులకు న్యాయం చేకూర్చడం అత్యంత ఆవశ్యకం. నిష్పక్షపాతంగా విచారణ జరిపి, హింసకు కారకులైన వారిని శిక్షించాలి. నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం ఈ ఏడాది మార్చి 22న రాష్ట్రంలో పర్యటించారు. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఆరుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ప్రతినిధి బృందం మణిపూర్లోని సహాయ శిబిరాలను సందర్శించింది. తాత్కాలిక ఇల్లను నిర్మిస్తామని, శాంతి పునరుద్ధరణ తర్వాత సొంత గ్రామాలకు తరలిస్తామని 2023 జూన్లో మణిపూర్ ముఖ్యమంత్రి ఎస్ బీరెన్ సింగ్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. దాదాపు రెండేండ్లు గడిచినా హామీలు నెరవేరలేదు.
మణిపూర్లో కుకీ ఇతర ఆదివాసీ వర్గాలపై జరుగుతున్న హింసకాండను అదుపు చేయకపోగా ముఖ్యమంత్రి తన మెయితీ వర్గీయులను పూర్తిస్థాయిలో రెచ్చగొట్టి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అశాంతిని రగిలించారు. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే అత్యధిక బీజేపీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయక తప్పలేదు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో 2025 ఫిబ్రవరి 13న మోడీ ప్రభుత్వం మణిపూర్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నా రాష్ట్రపతి పరిపాలనను విధించక తప్పలేదు. దీనిని బట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రపతి పరిపాలన విధించిన తర్వాత కూడా మణిపూర్లో శాంతి నెలకొనక పోగా మరింతగా దిగజారింది. డబుల్ ఇంజన్ సర్కారున్న చోట్ల శాంతి భద్రతలు ఎంతగా దిగజారుతాయో మణిపూర్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
జాతుల మధ్య ఘర్షణలతో అగ్నిగుండాన్ని తలపించిన మణిపూర్ హింసకు మే 3వ తేదీతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మే 3న మణిపూర్ రాష్ట్రంలోని వివిధ ఆదివాసి సంఘాలు, విద్యార్థి సంఘాలు రాష్ట్రబంద్కు పిలుపునిచ్చాయి. పునరావాస కేంద్రాలలో మగ్గిపోతున్న ఆదివాసీ కుటుంబాలను తమ స్వస్థలాలకు క్షేమంగా పంపించాలని, ప్రజల్లో అశాంతిని పెంచుతున్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, మెయితీలకు అనుకూలంగా రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని, ఆదివాసీలపై జరిగిన హత్యలు, అత్యాచారాల ఘటనలపై పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర బంద్ ద్వారా ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
అయితే, మణిపూర్లో ఉన్న మెయితీ వర్గీయులు మణిపూర్లో అశాంతి పెరగటానికి కారణమైన రిజర్వేషన్ సమస్యల పరిష్కరించడానికి ముందుకు రాకపోగా, తమకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఎన్నికలు జరిపి పాపులర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాపై వివిధ రూపాలలో ఒత్తిడిలు తీసుకొస్తున్నారు. దీంట్లో భాగంగానే మే 20న నాగాలు ఎక్కువ సంఖ్యలో ఉండే ఉక్రుల్ జిల్లాలోని షిరుయ్ లిలీ పండుగ విశేషాలను కవర్ చేయటానికి మీడియా సిబ్బందిని తీసుకు వెళుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుపై ఉన్న పేరును సెక్యూరిటీ సిబ్బంది బస్సు వెళ్లే ప్రాంతం కుకీ జో తెగలు ఉండే ప్రాంతం కావటంతో, ప్రయాణం సాఫీగా సాగటానికి వేరే బ్యానర్తో మూసి వేశారు. ఈ ఘటనను సాకుగా తీసుకుని మెయితీ వర్గీయులు, మణిపూర్ పేరును గౌరవాన్ని గుర్తింపును ఎవరూ తగ్గించలేరని, రాష్ట్రాన్ని విడగొట్టలేరని, దీనిపై గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు మే 24న పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలు ఎంత తీవ్రస్థాయికి వెళ్ళాయంటే మే 26న రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా రాష్ట్ర రాజధాని ఇంఫాల్ ఎయిర్ పోర్టు నుంచి రాజ్ భవన్కు చేరుకోవటానికి ఆందోళనకారులు గవర్నర్ వెళ్లకుండా మానవహారం నిర్మించటంతో, ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజభవన్కు గవర్నర్ హెలికాప్టర్ మీద వెళ్లాల్సి వచ్చింది.
ఫిబ్రవరి నెల నుంచి కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనలో, రాష్ట్రపతి పాలనకు కారణమైన ముఖ్యమైన సమస్యను పరిష్కరించకుండా మోడీ ప్రభుత్వం తన మూర్తీభవించిన నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు మెయితీ వర్గీయులు తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందనే పేరుతో పాపులర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక పక్కన కోరుతూ, మరోవైపు గవర్నర్ని కూడా వెళ్ళనీయకుండా ఆందోళనల పేరుతో ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారు. తమ దేశంలోనే భయాందోళనలతో సహాయ శిబిరాల్లో దుర్భరంగా జీవిస్తున్న కుకీ జో ప్రజానీకానికి సాధారణ పరిస్థితులు కల్పించే విధంగా ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, మణిపూర్లో అశాంతి రగలటానికి కారణమైన ముఖ్యమైన రిజర్వేషన్ సమస్యను వివిధ గ్రూపుల తెగలతో పరస్పర చర్చల ద్వారా పరిష్కరించాలని, ప్రజలు- ప్రజాతంత్ర వాదులు గాఢంగా కోరుకుంటున్నారు.
ముప్పాళ్ళ భార్గవ శ్రీ
సీపీఐ ఎంఎల్, (క్లాస్ స్ట్రగుల్) నాయకులు
9848120105
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.