![Household Debt](https://thewiretelugu.in/wp-content/uploads/2025/01/household-debt-1024x576.webp)
మరో రెండు నెళ్లకి దేశంలో కోవిడ్ కారణంగా లాక్డౌన్ విధించి నాలుగేళ్లు పూర్తి కానున్నాయి. 2017 నుండీ జారుడు బల్లపై ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ముందుచూపు లేని కోవిడ్ లాక్డౌన్తో మరింత పాతాళానికి జారిపోయింది. ఆర్థిక వ్యవస్థ కోలుకున్నదని చెప్పేందుకు ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నా వాస్తవాలు ఈ వాదనను సమర్ధించేవిగా లేవు. తాజాగా హౌ ఇండియా లివ్స్ వెబ్సైట్ సేకరించిన గణాంకాల ప్రకారం సాధారణ భారతీయుల రోజువారీ జీవితం అప్పుల సుడిగుండంలోకి మునిగిపోతోంది. వేర్వేరు స్వతంత్ర సంస్థలు వేర్వేరు కోణాల్లో ప్రస్తావించిన గణాంకాలను ఓ క్రమానుగతంగా అధ్యయనం చేస్తే భారత ఆర్థిక వ్యవస్థలోని సంక్షోభం లోతుపాతులు అర్థం చేసుకోవచ్చు.
దేశంలో వినియమ కంపెనీల ఉత్పత్తి, నిల్వలు, అమ్మకాలు, లాభాలు అన్నీ ప్రజల వినిమయ శక్తి, పొదుపు సామర్ధ్యంతో ముడి పడి ఉంటుంది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం పన్ను రాయితీలు, ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీలు, భూమి కేటాయింపుల్లో రాయితీలు ఇస్తున్నా ఉత్పత్తి కంపెనీలు విదేశీ వాణిజ్యంతో పోటీపడగల స్థాయిలో రాణించటం లేదు. దాంతో విదేశీ పోటీలో తట్టుకుని కంపెనీలు నిలవాంటే దేశీయ సరుకు ఉత్పత్తి ధర మరింత తక్కువగా ఉండాలని, అది సాధ్యం కావాలంటే కార్మికులు వారానికి 90 గంటలు పని చేసేందుకు సిద్ధమవ్వాలనీ ఎల్ అండ్ టి కంపెనీ చైర్మన్ సుబ్రమణ్యం వంటి వారు పిలుపునిస్తున్నారు. అంతకు ముందే కర్ణాటక ఎన్నికలు ముగియగానే ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయరణ మూర్తి ఇటువంటి వివాదానికి తెరతీశారు.
ఇన్ని రాయితీలు ఇస్తున్నా దేశీయ కంపెనీలు లాభాల బాట పట్టకపోవడానికి కారణం ఏమిటి? సాధారణ అవగాహలో తయారైన సరుకు మార్కెట్లోకి వెళ్లి వినియోగదారుడి చేతికి చేరితేనే ఆ సరుకు తయారీలో దాగి ఉన్న లాభం, అదనపు విలువ పెట్టుబడిదారుడికి దక్కుతుంది. కానీ గత నాలుగేళ్లుగా వినిమయదారుల నిజ ఆదాయాలు పడిపోవటంతో వినిమయ సరుకుల కొనుగోళ్లపట్ల ఆసక్తి చూపటం లేదని హౌ ఇండియా లివ్స్ వెబ్సైట్ సేకరించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వినిమయ సరుకుల కంపెనీలు తమ వార్షికాదాయాల్లో ఐదు శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించలేకపోతున్నాయి. సగటున దేశ ఆర్థిక వ్యవస్థ ఏడు నుండి ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ప్రభుత్వం భరోసా కల్పించేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా రంగాలవారీ వృద్ధిరేటు చూసినప్పుడు ఈ భరోసా నీటిరాతగానే మిగులుతుందన్న సందేహం తలెత్తుతోంది.
దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న కుటుంబ రుణభారం. 2020 జూలై నాటికి కుటుంబ రుణభారం 77 లక్షల కోట్లుగా ఉంటే 2024 మార్చి నాటికి 121 లక్షల కోట్లకు పెరగటం ఓ ముఖ్యమైన కారణం. 2007లో సబ్ ప్రైమ్ సంక్షోభం నేపథ్యంలో కూడా కుటుంబ రుణ భారం పెరిగింది కానీ ఆ పెరిగిన రుణ భారమే ఆ సమయంలో ఆర్థికాభివృద్ధి రేటును సాధించటంలో పునాదిగా నిలిచింది. కుటుంబ రుణ భారం రెండు రకాలు. వినిమయ సరుకులు కొనుగోలు చేయటానికి తీసుకునే రుణాలు ఓ రకం అయితే రోజువారీ కుటుంబ నిర్వహణ కోసం రుణం తీసుకోవటం రెండో రకం. యుపిఎ 1, యుపిఎ 2 ప్రభుత్వాల హయాంలో పెరిగిన రుణ భారం ఇటు వినిమయ సరుకుల కొనుగోలుకు మళ్లటంతో ఆయా కంపెనీల వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. అప్పటికే ఉపాధి హామీ చట్టం వంటి వేతన హమీ చట్టాలు, అటవీహక్కుల చట్టం వంటి ఉపాధి వనరులకల్పన చట్టాలు అమల్లోకి రావటంతో గ్రామీణ ప్రజల ఆదాయాలు మెరుగయ్యాయి. దాంతో మెరుగైన ఆదాయాల ప్రాతిపదికన చిట్ ఫండ్స్ మొదలుకుని జాతీయ బ్యాంకుల వరకూ వినిమయ అవసరాలు తీర్చుకోవడానికి రుణాలు ఇచ్చేందుకు మొగ్గు చూపాయి.
కానీ పదేళ్ల బిజెపి ఏలుబడిలో రెండో రకం రుణ భారం పెరుగుతోంది. మెజారిటీ ప్రజల జీవనోపాధి అవకాశాలు చిన్నాభిన్నం అయ్యాయి. కోవిడ్ విపత్తు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దాంతో ప్రజల కొనుగోలు శక్తి బాగా క్షీణించింది. ఈ క్షీణత ప్రభావం మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రైవేటు పరిశోధన సంస్థలు నిర్వహించిన పరిశోధన ఫలితాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మేనేజిమెంట్ పరిశోధన పత్రం ప్రకారం హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీ పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడిపైనా 2005 నాటికి 59 పైసల ఆదాయం సంపాదిస్తే 2014 నాటికి 1.15 రూపాయల ఆదాయం సంపాదించింది. మరో అధ్యయనం (అగ్రికల్చరల్ అసోసియేషన్ ఫర్ టెక్స్టైల్ కెమికల్ అండ్ క్రిటికల్ రివ్యూస్ జర్నల్ (2023)) ప్రకారం 2014లో 6.64 రెట్లు నిల్వలు పోగుపడి ఉంటే 2022 నాటికి 8.14 నిల్వలు పోగుపడి ఉన్నాయి. అంటే అమ్ముడుపోని సరుకుల నిల్వలు షుమారు రెండు రెట్లు పెరిగాయన్నమాట. అదేవిధంగా ఈ కంపెనీ 2014 నాటికి వార్షిక టర్నోవర్లో 2.26 శాతం పెట్టుబడులు పెడితే 2022 నాటి వార్షిక టర్నోవర్లో పెట్టిన పెట్టుబడులు 0.74 శాతం మాత్రమే. అంటే హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీ లిమిటెడ్ పదేళ్లలో కొత్త ఉత్పత్తి కోసం పెట్టే పెట్టుబడులు ఐదింట నాలుగువంతులు తగ్గించేసింది. అంటే కంపెనీకి లాభాల రేటు ఆ మేరకు పడిపోయిందని అర్థం చేసుకోవచ్చు.
ఈ గణాంకాలు అన్నీ హౌ ఇండియా లివ్స్ వెబ్ సైట్ నిర్ధారణలను సమర్ధించేవిగా ఉండటం గమనించాల్సిన విషయం. ముందుగానే చెప్పుకున్నట్లు బిజెపి ఏలుబడిలో సగటు కుటుంబ రుణ భారం 56 శాతం పెరిగింది. స్థూల జాతీయోత్పత్తిలో ఈ కుటుంబ రుణ భారం 41 శాతంగా ఉందంటే ఆర్థిక వ్యవస్థలో డొల్లతనం ఎంత ఉందో అర్థమవుతుంది. మరో మాటగా చెప్పాలంఏట ఆయా కుటుంబాలు సాధారణ స్థాయిలో వేతనాలు కూడా పొందలేని దుస్థితికి చేరాయి కాబట్టి కుటుంబ ఆర్థిక అవసరాల భారాన్ని లాగటానికి అప్పులపై ఆధారపడుతున్నాయని, అలాంటి కుటుంబాల మోతాదు గత పదేళ్ల కాలంలో 56 శాతం పెరిగిందని ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో గత పదేళ్లల్లో 25 కోట్ల మంది దారిద్య్రపు సంకెళ్లు తెంచుకుని మధ్యతరగతిలోకి చేరారన్న మార్చి 2024 నాటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటన లో వాస్తవం ఎంత అన్న సందేహం కలగటం తప్పుకాదు. కాబోదు.
రుణభారం పెరిగిందంటే వడ్డీ భారం పెరగకుండా ఉండదు. ఈ పదేళ్ల కాలంలో సగటు భారతీయ కుటుంబాలు గతం కంటే అదనంగా వడ్డీలు కట్టడం కూడా కొనుగోలు శక్తి లేకపోవడానికి ఓ కారణంగా ఉంది. మొత్తంగా ఆయా కుటుంబాలకున్న అప్పుల్లో 30 శాతం కేవలం ఆయా కుటుంబాలు తమ పోషణ కోసం తీసుకున్న అప్పులేనని నిర్ధారణ అవుతోంది. కార్లు, ఇళ్లు, ఇతర వినిమయ వస్తువులు సమకూర్చుకోవడానికి తీసుకున్న రుణాలు కేవలం పది శాతమే. అంటే స్థిర చరాస్థి సమకూర్చుకునే రుణాలు తగ్గిపోతున్నాయి. కుటుంబ పోషణ కోసం తీసుకునే రుణాలు పెరుగుతున్నాయి. దీన్ని మరోలా అర్థం చేసుకోవాలంటే దేశంలో పేదల కుటుంబ ఆదాయం, లేదా ఉపాధి సౌలభ్యం కోసం తీసుకునే రుణాలు తగ్గిపోతూ ఉన్నాయి. కేవలం తిండి తిప్పలు సమకూర్చుకోవడానికి తీసుకుంటున్న రుణాలు పెరిగిపోతున్నాయి.
ఈ వివరాలు పరిశీలించినప్పుడు దేశంలో పెరుగుతున్న కుటుంబ రుణభారం ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటును మరింత స్థబ్దతకు గురి చేస్తుందనీ, ఈ స్థబ్దతను అధిగమించటానికి కార్పొరేట్ వర్గానికి మరిన్ని రాయితీలు ఇవ్వటమే మార్గమని ప్రభుత్వాలు నిరంతరం ప్రతిపాదిస్తూ ఉంటాయనీ, దీనికోసం జాతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితే జాతి ఆర్థికంగా బలోపేతం అవుతుందనీ, జాతి ఆర్థికంగా బలోపేతం అయితే ప్రత్యర్ధులపై ఆర్థికంగా రాజకీయంగానూ పై చేయి సాధించటం వీలవుతుందనీ, తద్వారా దేశానికి అంతర్జాతీయ కీర్తిప్రతిష్టలు ఆర్జించవచ్చనీ ప్రభుత్వాలు, ప్రభుత్వ వాదనలకు బాకాలు ఊదే ‘స్వతంత్ర మాధ్యమాలు’ ‘స్వతంత్య్ర మేధావులు’ వాదిస్తారు.
పై వివరణ పరిశీలించినప్పుడు ఆర్థికంగా దేశానికి ప్రత్యేకించి రోజువారీ వేతనాలపై ఆధారపడే కుటుంబాలకు రానున్నది మరింత క్లిష్ట కాలం అన్నది స్పష్టమవుతుంది.